వికీ యొక్క శక్తికి ఉదాహరణగా ఈ వ్యాసాన్ని చూడండి.
సుమారుగా ఇరవై మంది రెండు సంవత్సరాల నుండి వ్రాసి ఎంగా చక్కగా తీసుకొని వచ్చినారో!
తిరుమల
వికీపీడియా నుండి

వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాన్డే నాస్తికించన !
వేంకటేశ సమం దేవో నభూతో నభవిష్యతి !!
తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగం లొ దర్శన ప్రార్ధనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలలో ఆనంద నిలయంలొ అవతరించాడు. తిరుమల ఆలయాన్ని ఆనంద నిలయాన్ని తోండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తోండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.
దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాభ్దానికి చెందిన పల్లవులు, 10 వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి.
విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతుడైన శ్రీ కృష్ణదేవ రాయలు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.
శ్రీవారి పాదముల నుండి తిరుమల దృశ్యమువిషయ సూచిక [hide]
1 స్థల పురాణం
2 చరిత్ర
2.1 కొండ మీద ఊరు
2.2 ఘాట్రోడ్డు నిర్మాణం
3 స్వామి వారి పూజలు
3.1 రోజువారీ సేవలు
3.2 ప్రత్యేక సేవలు
4 చేరుకునే విధం
4.1 కాలి నడకన
4.2 రోడ్డు మార్గం
4.3 రైలు మార్గం
4.4 విమాన మార్గం
5 చూడవలసిన ప్రదేశాలు
6 బయటి లింకులు
[మార్చు] 1 స్థల పురాణం
ద్వాపర యుగం లొ శ్రీమహావిష్ణువు దర్శనార్ధనం వాయు దేవుడు ,వైకుంఠం కు వస్తే ఆదిశేషువు వాయుడేవుడిని అడ్డగించి, మహావిష్ణువు మహాలక్ష్మి తో పాటు శయనించి ఉన్నాడు చెప్తాడు . అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళవాళ్ళ గొప్పతనం చెప్పుకొంటారు. మహావిష్ణువు వారికి పరిక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలొ ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకొమని చెప్పి, వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరిక్షపెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం అవుతుండగా చతుర్ముఖబ్రహ్మ ,ఇంద్రాది దేవతల కోరికమేరపు ఆదిశేషువు ఆనందపర్వతం మీద తన పట్టు సడలించి పరీక్షనుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడనుండి వెళ్ళి స్వర్ణ ముఖీ నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధ పడుతాడు. ఆ విషాయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వేంకటాద్రితో విలీనం చేస్తాను అక్కడ మహావిష్ణువు వెలస్తాడు అని చెబుతాడు. అదిశేషువు వేంకటాద్రి పర్వతంలొ విలీనం అయి ఆదిశేషువు పడగ భాగంలొ (శేషాద్రి) శ్రీమహావిష్ణువు వెలశారు, శేషువు మధ్య భాగంలో అహోబిలం లొ శ్రీ నారసింహమూర్తి , తోక భాగం లొ శ్రీశైల క్షేత్రము లొ మల్లికార్జునస్వామిగా వెలశారు.
[మార్చు] 2 చరిత్ర
19 వ శతాబ్దాంతానికి… కొండపైన శ్రీవారి ఆలయం, హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అర్చకులు సైతం కొండ కింద ఉన్న కొత్తూరులోనే ఉండేవాళ్లు. తెల్లవారుజామునే లేచి సప్తగిరులూ ఎక్కి ఉదయం ఏడు గంటలకు స్వామికి మేలుకొలుపులు పాడేవారు. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. రాళ్లూరప్పలూ నిండిన దారిలో కొంతసేపు వెళుతూ మధ్యలో వంటావార్పు కోసం ఆగుతూ… మొత్తానికి పైకి చేరుకునేసరికి దాదాపు రెండురోజులు పట్టేదట. వారు మధ్యలో ఆగేందుకు మూడుచోట్ల దిగుడుబావులూ విశ్రాంతి మండపాలూ ఉండేవి. వాటిని ఠాణాలు అనేవారు. వయసు మళ్లినవారినీ అంగవికలురనూ పిల్లలనూ పైకి తీసుకువెళ్లేందుకు డోలీ కూలీలు ఉండేవారు. కావడి బద్దకు కుర్చీలు అమర్చి నడవలేనివారిని వాటి మీద కూచోబెట్టుకుని వారు పైకి మోసుకెళ్లేవారు. అందుకు పది అణాలు రుసుము వసూలు చేసేవారు. సామాన్యులకు ఆ మాత్రం స్థోమత కూడా ఉండేది కాదు. తిరుమల రాగిచెట్టు (ఇప్పుడు కల్యాణకట్ట ఉన్న ప్రదేశం) దగ్గర డోలీలు నిలుపుకోవడానికి ఒక ప్రత్యేక మండపం ఉండేది. అక్కడిదాకానే ఈ డోలీలను అనుమతించేవారు. ఆ స్టాండును డోలీమండపం బ్లాక్ అనేవారు. (ఇప్పుడా రోడ్డునే డి.ఎం.బి. రోడ్డుగా వ్యవహరిస్తున్నారు.) అక్కణ్నుంచి సన్నిధి వీధి మీదుగా గుడికి చేరుకుని నేరుగా మహాద్వారం గుండా లోపలికి ప్రవేశించి భక్తులు స్వామి దర్శనం చేసుకొనేవారు. 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడిన తితిదేబోర్డు రూ.26వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. ఐదుపదుల ఏళ్లనాటి దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున ఏడున్నరకు సుప్రభాత సేవ, రాత్రి పదిన్నరకు ఏకాంతసేవ జరిగేవి. ఇప్పుడు రాత్రి రెండున్నరకు ఆలయం మూసివేసి సరిగ్గా అరగంటలోనే మళ్లీ సుప్రభాతంతో మేల్కొలుపులు మొదలుపెడుతున్నారు.
[మార్చు] 2.1 కొండ మీద ఊరు
తిరుమల నిర్వహణ హథీరాంజీ మఠం ఆధ్వర్యంలో ఉన్నప్పుడు యాత్రికులకు సౌకర్యాలు ఏర్పరచాలంటే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. తిరుమలలోనే ఉందామంటే విపరీతమైన చలి. దానికి తోడు ఆ ప్రాంతమంతా అడవిలా ఉండేది. జంతువుల భయం సరేసరి. కొండమీద ఒక ఊరు తయారైతే ఈ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చన్న ఆలోచనతో 1910-20 కాలం నాటికి జనావాసాలను ఏర్పరచేందుకు ప్రయత్నించారు. వారికి ఆవాసం కల్పించేందుకు హథీరాంజీ మఠం భూములు లీజుకు ఇచ్చింది. నెమ్మదిగా ఆలయం చుట్టూ నాలుగు వీధులతో ఒక ఊరు తయారైంది. మొదట్లో అక్కడి జనాభా 200 నుంచి 300 మంది మాత్రమే. స్వామిని చూడవచ్చే భక్తులకు ఈ కుటుంబాలే మొదట్లో అన్ని సౌకర్యాలూ కల్పించేవి. క్రమేణా తిరుమలలో ఉండే వారి సంఖ్య 25వేలకు పెరిగింది. 30 ఏళ్ల క్రితం వరకూ కూడా వారంతా రోజూ సరాసరి మహాద్వారం గుండానే గుడిలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తమ పనులు చేసుకొనేవారు. కానీ యాత్రికుల సంఖ్య పెరుగుతుండటంతో తితిదే వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి తిరుపతికి తరలించింది.
[మార్చు] 2.2 ఘాట్రోడ్డు నిర్మాణం
1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండమీదకు రోడ్డుమార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్రోడ్డు నిర్మాణం పూర్తయింది. అదేనెల పదోతేదీన మద్రాసు రాష్ట్ర గవర్నర్ ఆర్ధర్హోప్ రోడ్డుమార్గాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎద్దులబళ్లు, గుర్రపుబళ్లు తిరిగేవి. దీంతో భక్తుల పని సులువైంది. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల-తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది. ఆ సర్వీసులు తిరుపతిలోని మొదటిసత్రం నుంచి రోజుకు మూడుసార్లు ఉండేవి. తిరుమల నుంచి రాత్రి ఏడు దాటితే బస్సులే ఉండేవి కావు. 1955-56లో రైల్వేస్టేషన్ సమీపాన శ్రీనివాస బస్టాండు ఏర్పడే నాటికి భక్తుల సంఖ్య రోజుకు 500 నుంచి 600 వరకు ఉండేది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. దీంతో రెండో ఘాట్రోడ్డు గురించి ఆలోచించాల్సి వచ్చింది. 1974 నాటికి అదీ పూర్తయింది.
[మార్చు] 3 స్వామి వారి పూజలు
[మార్చు] 3.1 రోజువారీ సేవలు
వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. అవి… ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూషపూజలకు నాంది.
సుప్రభాతం: నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. అంతకు ముందే… ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు (సన్నిధిగొల్ల) దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు వెళుతుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచెకోలను, తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి ఆలయద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే అధ్యాపకులు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబురా పట్టుకుని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు. బంగారువాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు. వెంటనే అర్చకులు కౌసల్యా సుప్రజారామ… అంటూ సుప్రభాతం పఠిస్తారు. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ, గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేల్కొలుపుతుంటాడు. అర్చక స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని మేల్కొలుపుతారు. పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు. ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూరహారతి ఇచ్చి భక్తులను లోనికి అనుమతిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు.
శుద్ధి: సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు. స్వామివారికి సమర్పించిన పువ్వులను ఆ తర్వాత ఎవరూ ఉపయోగించకుండా ఉండేందుకే ఇలా చేస్తారు. దీనిని నిర్మాల్య శోధన అంటారు.
అర్చన: శ్రీవారికి ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది) నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు, గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు. చివరగా పుష్పాంజలి. అనంతరం భోగ మూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూలవిగ్రహానికీ భోగమూర్తికీ స్వర్ణసూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధృవబేరం నుంచి భోగశ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక. ఆ తరువాత మూలవిగ్రహానికి పుష్పన్యాసం చేసి, అలంకారాసనం సమర్పిస్తారు. అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి నుదుటి మీద ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. తరువాత శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి) స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు.
తోమాలసేవ: తమిళంలో ‘తోడుత్తమాలై’ అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. బహుశా ఈ మాటే కాలక్రమేణా మార్పులకు లోనై ‘తోమాల’… తోమాలసేవ అయి ఉండవచ్చు. దీన్నే భగవతీ ఆరాధన అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత తోమాలసేవ చేస్తారు.
కొలువు: తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్ జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహసంచార క్రమాన్ని, ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు. ముందురోజు హుండీ ఆదాయం వివరాలను ఏయే నోట్లు ఎన్ని వచ్చిందీ, నాణాలు సహా (డినామినేషన్ ప్రకారం) మొత్తం విలువ తెలియజేస్తారు. అనంతరం నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు.
సహస్రనామార్చన: ఉదయం 4.45 నుంచి 5.30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి వేయినామాలనూ స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసిదళాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో మిరాశీదారు వరాహ పురాణం లోని లక్ష్మీసహస్రనామాలను పఠిస్తారు. తరువాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు.
మొదటిగంట, నైవేద్యం: మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత స్వామివారికది నైవేద్యసమయం. నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి, బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మంటపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి (అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు (పిండివంటలు) కులశేఖరపడి (పడికావలి)కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.
అష్టోత్తర శతనామార్చన: ఈ అర్చనతో మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి. వరాహపురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు. అష్టోత్తర శతనామావళి పూర్తికాగానే శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన జరుపుతారు.
రెండో గంట, నైవేద్యం: అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట మోగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు.
రాత్రి కైంకర్యాలు: ఉదయం జరిగే తోమాలసేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. అనంతరం హారతి, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ అన్నీ జరుగుతాయి. ఈ సమయంలో మూడో గంట మోగుతుంది. దీని తర్వాత మళ్లీ సర్వదర్శనం.
ఏకాంతసేవ: రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు. ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగశ్రీనివాసమూర్తిని శయనింపజేసి పాలు, పళ్లు, బాదంపప్పులు నైవేద్యంగా పెడతారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండిగిన్నెలలో ఉంచుతారు. ఏడుకొండలవాడిని నిదురపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళ్లపాక వారి లాలి అంటారు. (ఏకాంతసేవ ఏడాదిలో 11 నెలల పాటు భోగశ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది.) దీంతో ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.
గుడిమూసే ప్రక్రియ: రాత్రి రెండుగంటలకు గుడిమూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా మూడో ద్వారాన్ని, ఆ తర్వాత బంగారువాకిలిని మూసేసి లోపలి గడియలు బిగిస్తారు. అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు.
[మార్చు] 3.2 ప్రత్యేక సేవలు
రోజువారీ అర్చనలు, ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమలవాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, గురువారం సడలింపు, పూలంగిసేవ, తిరుప్పావడ, శుక్రవారం అభిషేకం. స్వామికి రోజూ కల్యాణోత్సవం జరిపిస్తారు. డోలోత్సవం, సహస్రదీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఉత్సవమూర్తులకు జరిగేవి.
సడలింపు: గురువారం ప్రాతఃకాల పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి ఆభరణాలను తీసేస్తారు. కర్పూర నామాన్ని తగ్గిస్తారు. దీంతో శ్రీనివాసుడి కమలాల కన్నులు భక్తులకు కనిపిస్తాయి. అనంతరం శ్రీవారికి 24మూరల పట్టు అంచు ధోవతి, 12 మూరల ఉత్తరీయాన్నీ కడతారు. సువర్ణపాదాలు, హస్తాలు, శంఖచక్రాలు, కర్ణాభరణాలు, స్వర్ణసాలగ్రామహారాలు సమర్పించి తలుపులు తెరుస్తారు. దీన్నే సడలింపు అంటారు.
పూలంగిసేవ: ఆపాదమస్తకం స్వామివారిని పుష్పమాలాలంకృతుల్ని చేయడమే పూలంగి సేవ. తనువెల్లా పూలమాలలతో అలంకరించిన శ్రీవారి దివ్యమనోహర విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది.
తిరుప్పావడ: భారీసంభారాలతో స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది. అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు, వడ, దోసె, పాయసం, జిలేబి తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు.
అభిషేకం: శ్రీవారి ఆలయంలో శ్రీనివాసునికి జరిగే సేవలన్నింటిలోకి విశిష్టమైంది ప్రతిశుక్రవారం ఉదయం జరిగే అభిషేకం. ఈ సేవ ప్రాశస్త్యం ఏమిటంటే అభిషేక సమయంలో నిత్య కల్యాణశోభితుడైన స్వామివారి నిజరూప దర్శనభాగ్యం భక్తులకు లభిస్తుంది. గురువారం రాత్రి పూలంగి సేవ తరువాత దర్శనంలోనూ, శుక్రవారం ఉదయం అభిషేక సమయంలోనూ, అభిషేకానంతర దర్శనకాలంలో తప్ప మిగతా అన్ని రోజులూ స్వామి వెడల్పాటి తెల్లని కర్పూరనామంతో దర్శనమిస్తాడు. ఈ మూడు సందర్భాల్లో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది. దీన్నే నేత్రదర్శనం, నిజపాద దర్శనం అంటారు.
[మార్చు] 4 చేరుకునే విధం
[మార్చు] 4.1 కాలి నడకన
తిరుమల గుడికున్న ఓ ప్రాముఖ్యత “కాలినడక”! తిరుపతి నుండి పైన కొండలమీద ఉన్న తిరుమల పట్టణానికి చేరడానికి కొండపైన కాలినడక కోసం మెట్లదారి ఉంది, భక్తులు ఈ దారిగుండా వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడం ఒక మ్రొక్కుగా భావిస్తారు. తిరుమలకి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కాలిబాటలు ఉన్నాయని పెద్దలు చెపుతూ ఉంటారు। ప్రస్తుతం మాత్రం రెండు ఎక్కువ వినియోగంలో ఉన్నాయి. మూడవది, కడప జిల్లా నుండి ఉన్నది కూడా వినియోగంలో ఉందని విన్నాము కానీ వివరాలు పెద్దగా తెలియదు
అలిపిరి కాలిబాట: ఇది ఎక్కువ ప్రఖ్యాతిగాంచిన కాలిబాట. దానికి కారణం ఇది తిరుపతి పట్టణం నుండి ఉండటం, తిరుమల తిరుపతి దేవస్థానముల వారు దీన్ని బాగా అభివృద్ధి చేయటం అయి ఉండవచ్చు. బస్సు ద్వారా గాని, రైలు ద్వారా గాని తిరుపతి చేరుకున్న తరువాత మీరు అక్కడి నుండి తిరుమల తిరుపతి దేవస్థానములు వారు నడుపుతున్న ఉచిత బస్సు ద్వారా, లేదా ఆటో ద్వారా (ప్రస్తుతం ౨౦ రూపాయలు), లేదా ప్రయివేటు బస్సు ద్వారా (౪ రూపాయలు ప్రస్తుత చార్జీ), లేదా టాక్సీ/జీపు ద్వారా గాని ఈ కాలిబాట దగ్గరకు చేరుకోవచ్చు. అక్కడ సాధారణంగా కర్పూరాలు కొని (ఏడు కొండలకు ఏడు అని అమ్ముతుంటారు), దారి మొదట్లో ఉన్న వేంకటేశ్వరుని పాదాల గుడి దర్శనం చేసుకుని నడక కొనసాగిస్తూ దారిలో ఉన్న ఆంజనేయస్వామి చిన్న చిన్న మందిరాలు దర్శిస్తూ నడుస్తారు. మీరు మంచి శరీర దారుఢ్యం గలవారైతే రెండుగంటలు లేదా అంతకు తక్కువ, ఓ మాదిరిగా అయితే మూడుగంటలు, మరీ చిన్నగా నడుస్తూ ప్రతి పదిమెట్లకీ ఆగుతూ ఉంటే ఐదు గంటలు పడుతుంది, కొండ చేరుకోవడానికి. ఈ మెట్లదారి సుమారుగా తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది. మొదటిసారి నడవాలి అని అనుకునేవారికి కొన్ని సలహాలు:
నెమ్మదిగా నడవండి, పరుగెత్తవద్దు, పరుగెత్తితే తొందరగా అలసిపోతారు.
సాధ్యమైనంతవరకూ మొదటి గంట ఎక్కడా కూర్చోవద్దు, కూర్చోకుండా నెమ్మదిగా నడిస్తే మొదటి గంటలో మెట్లన్నీ అయిపోయి మామూలు రోడ్డులాంటి దారికి వెళ్తారు, ఇక అక్కడి నుండి మోకాళ్ళ మంటపము వరకూ మెట్లు ఉండవు, ఉన్నా ఒకటీ అరా ఉంటాయి.
మెట్లకి ఇరువైపులా ఉన్న అంగళ్లలో పానీయాలు, తినుబండారాలు తక్కువ తీసుకోండి. సాధ్యమైనంతవరకు గ్లూకోను డీ, నీళ్లు – వీటిపై ఆధారపడండి, ముఖ్యంగా కూల్ డ్రింకులు ఏ విధంగానూ మన నడకకు సహకరించవు.
లగేజీలో విలువైన వస్తువులు లేకుండా చూసుకోండి, లగేజిని కింద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానముల ఉచిత సేవలో పైకి పంపించండి.
శ్రీవారి మెట్టు కాలిబాట: తిరుమల చేరుకోవడానికి ఇది రెండవ ప్రఖ్యాతి వహించిన కాలిబాట. తిరుమల పట్టణానికి కళ్యాణీ డ్యాము నీటి సరఫరాకి ఈ మార్గం నుండి పైపులైను వేసిన తరువాత నుండి ఈ దారి కొంత అభివృద్ధి చెందింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానములువారు ఈ కాలిబాటను కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారు. దీనికీ, అలిపిరి కాలిబాటకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా ౯ కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అయితే ఈ కాలిబాటతో సమస్య ఏమిటంటే దీనికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు ఎక్కువగా లేవు. ఈ దారిగుండానే వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలలు కాలురు అగస్త్యేశ్వర స్వామి సన్నిధిలో గడిపి తరువాత తిరుమల చేరుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు ఇక్కడికి తిరుపతి నుండి, చంద్రగిరి, శ్రీనివాస మంగాపురం ల మీదుగా ఒక బస్సు నడుపుతున్నారు. లేదా మీరు శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుండి ఆటో లో వెళ్లవచ్చు. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారుగా ౬ కిలోమీటర్లు ఉంటాయి. లేదా మీకు ఓపిక ఉంటే శ్రీనివాస మంగాపురం నుండే నడిచి వెళ్ళవచ్చు. ఈ దారి ద్వారా మొదటిసారి వెళ్లేవారికి కొన్ని సూచనలు:
ఇక్కడ ఎటువంటి దుకాణాలూ ఉండవు, కనుక మంచినీళ్లు తీసుకొని వెళ్లడం మాత్రం మర్చిపోవద్దు.
ఎక్కువ జనసంచారం ఉండదు, కనుక గుంపులుగా వెళ్లండి.
[మార్చు] 4.2 రోడ్డు మార్గం
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బస్సుల కోసం తిరుపతిలో నాలుగు బస్టాండ్లు ఉన్నాయి. మొదటిది స్టేషన్ ఎదురుగా ఉండే శ్రీ వేంకటేశ్వర బస్స్టేషన్. రైళ్లు వచ్చే సమయానికి అక్కణ్నుంచి తిరుమలకు వెళ్లే బస్సులు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంటాయి. బెంగుళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అలిపిరి టోల్గేటు వద్ద ఉండే బాలాజీ లింక్ బస్స్టేషన్కు వస్తాయి. టూరిస్టు వాహనాలు నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రదేశం ఉంది. చెన్నై, హైదరాబాదు, విజయవాడ నగరాల నుంచి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్స్టేషన్ (పెద్ద బస్టాండ్)కు చేరుకుంటాయి. బృందాలుగా ప్రైవేటు వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసం రైల్వేస్టేషన్ వెనకవైపు శ్రీ పద్మావతీ బస్స్టేషన్ ఉంది. వీటిలో ఎక్కడ దిగినా సమీపంలోనే సుదర్శనం కౌంటర్లు ఉంటాయి.
[మార్చు] 4.3 రైలు మార్గం
తిరుమలకు దగ్గరి లోని రైల్వే స్టేషను తిరుపతి. తిరుపతి స్టేషనుకు దేశం లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తాయి. రైల్వేస్టేషన్ నుంచి కొండమీదకు ఆర్టీసీ దాదాపు నిమిషానికో బస్సు నడుపుతోంది. ముందుగానే దర్శన టిక్కెట్లు, కాటేజీ వసతి రిజర్వు చేయించుకుంటే అంతగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి సరాసరి కొండమీదకు వెళ్లిపోవచ్చు.
[మార్చు] 4.4 విమాన మార్గం
తిరుపతికి సమీపాన ఉన్న రేణిగుంట, తిరుమలకు అతి దగ్గరి విమానాశ్రయం. ఇక్కడికి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు నుండి నేరుగా విమాన సేవలు ఉన్నాయి.
[మార్చు] 5 చూడవలసిన ప్రదేశాలు
బంగారు వాకిలి(గ్రాఫికల్ చిత్రం)తిరుమల ముఖ్యాలయం:
గర్భగుడి: ధ్వజ స్తంభం నుండి శ్రీవారిని దర్శించుకోవడానికి వెండి వాకిలి దాటి బంగారు వాకిలి లోకి ప్రవేశించాలి. బంగారు వాకిలి గోపురాన్ని విమానం అంటారు. శ్రీనివాసుడు ఉండే నిలయాన్ని ఆనందనిలయం అంటారు.
వరదరాజస్వామి గుడి
రంగనాథ మండపము
కళ్యాణ మండపము
విమాన వెంకటేశ్వరస్వామి: విమాన వేంకటేశ్వరస్వామిని శ్రీవారి దర్శనం చేసుకున్నాక ప్రదక్షిణం చేశాక గర్భ గుడి ఉత్తర మాడా వీధి నుండి విమానం పైన దర్శన మిస్తాడు. శ్రీవారి గోపురాన్ని విమానం అంటారు.
హుండీ
యోగ నరసింహస్వామి గుడి
అన్నమయ్య భాండాగారము: అన్నమయ్య భాంఢాగారం లో రాగి మీద చెక్కిన అన్నమయ్య పాటలను దాచి ఉంచారు.
వరాహ స్వామి దేవాలయం
బేడి ఆంజనేయస్వామి దేవాలయము
ముఖ్య మైన ప్రదేశాలు
కల్యాణకట్ట: భక్తులు మొక్కుగా తలనీలాలు సమర్పిన్ఛు స్థలము.
తిరుమల ఆస్థాన మండపం
శ్రీవారి ఆన్నదాన నిలయం
తిరుమల కొండలు:
కపిలతీర్థం
తుంబురు తీర్థము
రామకృష్ణ తీర్థము
పాండవ తీర్థం
దేవతీర్థం
కుమారధారాతీర్థం
కాయరసాయన తీర్థము
జాబాలి తీర్థము
శేష తీర్థము
పసుపుధారా కుమారధారా తీర్థము
చక్రతీర్థం
పంచాయుధతీర్థం
బ్రహ్మతీర్థం
అగ్నికుండతీర్థం
సప్తర్షితీర్థం
విష్వక్సేన సరస్సు
పాప వినాశనము
ఆకాశ గంగ
గోగర్భం డ్యాము
స్వామి పుష్కరణి
శ్రీవారి పాదాలు
శిలాతోరణం
వైకుంఠ తీర్ధం
ఇంకా దర్శించవలసిన ప్రదేశాలు
మ్యూజియం
శిలా తోరణము
ధ్యాన మందిరం
[మార్చు] 6 బయటి లింకులు
తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెబ్సైటు
భక్తుల ద్వారా నిర్వహించబడుతున్న సైటు
రాష్ట్ర ప్రభుత్వం సైటు
భక్తుల మరొక సైటు
మరొకటి
Retrieved from “http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%AE%E0%B0%B2″
వర్గాలు: ఆంధ్ర ప్రదేశ్ దర్శనీయ స్థలాలు | ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు | తిరుమల
Viewsవ్యాసము చర్చ మార్చు చరితం కాపాడు తుడిచివేయి తరలించు వీక్షించ వద్దు వ్యక్తిగత పరికరాలుChavakiran నా గురించి చర్చ నా అభిరుచులు నా వీక్షణ జాబితా నా మార్పులు-చేర్పులు నిష్క్రమణ మార్గదర్శకము
మొదటి పేజీ
సముదాయ పందిరి
ప్రస్తుత ఘటనలు
ఇటీవలి మార్పులు
యాదృచ్ఛిక పేజీ
సహాయము
రచ్చబండ
విరాళములు
వెతుకు
పరికరాల పెట్టె
ఇక్కడికి లింకున్న పేజీలు
సంబంధిత మార్పులు
ఫైలు లోడింగ్
ప్రత్యేక పేజీలు
ముద్రణా వెర్షన్
శాశ్వత లింకు
Cite this article
ఈ పేజీకి 02:59, 29 మే 2007న చివరి మార్పు జరిగినది. విషయ సంగ్రహం GNU Free Documentation License కి లోబడి లభ్యం.
గోప్యతా విధానం
వికీపీడియా గురించి
అస్వీకారములు