పేరంటం – చిన్న నాటి ఙాపకం
శ్రావణ మాసం వచ్చేసింది. చిన్నప్పటి నుండీ ఈ మాసం అంటే భలే సరదా. పేరంటాల హడావిడి, కొత్త బట్టలు వేసుకోవడం, అందరి ఇళ్ళకు వెళ్ళడం, అందరూ మన ఇంటికి రావడం, అందరి ముందరా మనకి వచ్చిన పాటలు పాడి టేలంట్ షో చేసేసి తెగ ఫీలయిపోవడం, అమ్మతో పాటు పోటిగా అందరికీ పసుపు కుంకం ఇవ్వడం…. ఓహ్ ఒకటేమిటి ఇలా మాసమంతా సందడే సందడి నిండిన తీపి గుర్తులు.
అన్నిటికన్నా అందరికన్నా నాకు బాగా గుర్తుకు వచ్చేది మా తాతయ్య. నేను అమ్మతో పోటీ పడేదాన్ని అమ్మ కన్నా నేనే ఎక్కువ మందికి పసుపు కుంకం ఇవ్వాలి అని. ఇప్పుడు తలుచుకుంటే ఏమిటా వెర్రి అనిపిస్తుంది కాని అప్పుడు మాత్రం అది మనకి లైఫ్ అండ్ డెత్ సమస్య. మన కోసం ఎక్కువ పేరంటాళ్ళు మాత్రం ఎక్కడ నుండి వస్తారు? నేను అమ్మా సరి సమానము అని తేలి నేను బుంగ మూతి పెడితే మా తాతయ్య ఎందుకమ్మా నాకు కూడా పెట్టు అని చక్కగా బొట్టు పెట్టించుకుని, కాళ్ళకు పసుపు రాయించుకునే వారు. అదీ అందరి ముందరా. పోనీ నేను ఒక్క దాన్నే ఆయనకు మనవరాలిని కాదు, మొదటి దాన్నీ కాదు ముద్దు ఎక్కువ అనుకునేందుకు. వారాలు చేసుకుంటూ చదివి, గొప్ప శాస్త్రవేత్తగా పని చేసి, ఒక డిగ్రీ కాలేజీ ప్రింసిపాలు గా రిటైరు అయిన మనిషి, దేశ విదేశాలు తిరిగిన మనిషి తన కూతురి కూతురి ముచ్చట తీరాలి అని ఎంతో నిరాడంబరముగా అందరి ముందరా అలా చేసారు అని తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళు పులకరిస్తుంది. నా కోసమే తాతయ్య అలా చేసారు అని అనుకున్నప్పుడు కించిత్ గర్వముగా కూడా ఉంటుంది.
పిల్లలకు నచ్చిన రీతిలోనే మన సాంప్రదాయపు విలువలని వాళ్ళకి తెలియ జేయాలి అని ఆచరణలో ఆయన చూపించారు అని ఇప్పుడు నాకూ కూతురు పుట్టాక అది కూడా నాతో పోటీ పడుతుంటే అర్థం అవుతోంది. అందుకే క్రమము తప్పకుండా నేనూ ప్రతి ఏడాది పేరంటం చేసి ఆయనను తలుచుకుని మురిసిపోతూ ఉంటాను. నా పిల్లలకు కూడా ఈ మాసం తీపి గుర్తులను ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటాను.