చందమామ తీపి జ్ఞాపకాలు
“చందమామ నా ప్రాణనేస్తం. అమ్మ తన చిన్నప్పుడు చందమామ, తోకచుక్క, పాతాళదుర్గం, చదువుతూ పెరిగింది. నేను అక్క, అన్న, చందమామ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూసేవాళ్లం. నేను సంస్కృతం నేర్చుకోవడం మొదలు పెట్టిన తరువాత సంస్కృతంలో చందమామ చదివేదాన్ని.
పెళ్లయి అమెరికా వెళ్లిన తరవాత అక్కడికి కూడా ప్రతినెలా, నాకోసం చందమామ వచ్చేది. నా స్నేహితులు, బంధువులు కూడా అంత క్రమంగా నాకు ఉత్తరాలు రాసేవారు కాదేమో! కాని, ప్రతినెలా క్రమం తప్పకుండా అనేక కథలు, కబుర్లు పట్టుకుని నాకోసం వచ్చేది చందమామ.
నేను 2000 సంవత్సరం ఆంగ్ల చందమామ ఫోటో కేఫ్షన్లో బహుమతి గెలుచుకున్నాను. అంబరమంత సంబరం వేసింది నాకు. ఇందులో పాతికేళ్ల నాటి కథలు ఎంత బాగుంటాయో! తరతరాలను ప్రభావితం చేస్తోంది చందమామ. మా అమ్మవాళ్ల తరం, మా తరం, ఇప్పుడు నా కూతురు,అందరూ చందమామ అభిమానులే!
మంచి అలవాట్లు, నీతి, నిజాయితీ, స్నేహం, విశ్వాసం నేర్పుతూనే పిల్లలకు పుస్తకాలు చదవటం నేర్పుతోంది చందమామ. టీవీ, కేబుల్తో ఇప్పుడు జనం పుస్తకాలను చదవడం తగ్గించేశారు. చిన్నపిల్లలు చందమామ చదివితే, సద్గుణాలన్నింటితోపాటు పుస్తకాలు క్రమంగా చదవడం నేర్చుకుంటారు. ఎలాగూ ఇందులో పౌరాణికాలు, రామాయణం, భారత, భాగవతాదులు వస్తాయి కాబట్టి చిన్నప్పుడే మన సంస్కృతిని పిల్లలు నేర్చుకుంటారు.”
–శ్రీలేఖ కొచ్చెర్లకోట
(శ్రీలేఖ గారు సుప్రసిద్ధ చారిత్రక నవలా రచయిత శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారి కుమార్తె. పెళ్లయి అమెరికా వెళ్లిన తర్వాత కూడా దాదాపు పదిహేను సంవత్సరాల పాటు చందమామను తెప్పించుకుని చదివారు. ఇటీవలే స్వదేశం తిరిగొచ్చాక హైదరాబాద్లో జర్నలిస్టుగా పనిచే్స్తూ దాదాపు 50 పైగా పిల్లల కథలను రాశారు. ముఖ్యంగా రోజూ తమ బాబుకు పడుకునే ముందు కథ చెబుతూ నిద్రపుచ్చే అలవాటు. ఆ అలవాటునుంచే పిల్లలకు ఏ కథలు చెబితే ఆసక్తికరంగా ఉంటుందో అనుభవ పూర్వకంగా తెలుసుకున్న ఈమె అలాంటి కథలనే ఎంచుకుని రాస్తున్నట్లు చెప్పారు.
అలా ఈ వారం “Mayank and Magic seed” అనే కథ ఇంగ్లీషులో రాసి పంపారు. చదువుపై శ్రద్ధలేకుండా, మాట వినకుండా అల్లరి చిల్లరగా మెలిగే కొడుకుకు ఓ సన్యాసి ద్వారా మహిమాన్విత మామిడి విత్తనాన్ని ఇప్పించిన అమ్మ తనలో ఎలా మార్పు తీసుకువచ్చిందో చెప్పే కథ. మామిడి వనాన్ని రూపొందించడంలో సహాయం చేసి కొడుకు జీవితాన్ని మార్చిన ఇతివృత్తంతో కూడిన కథ. పేరుకు చిన్న కథే అయినా మహిమగల మామిడి విత్తనం పేరుతో పిల్లవాడిలో పరివర్తన తీసుకువచ్చిన చక్కటి కథ.
చూడగానే దీన్ని తెలుగుతో సహా ప్రాంతీయ భాషల చందమామలకు వేసుకుంటామని చెప్పడం జరిగింది. ఆమె ఇంగ్లీష్ చందమామ కోసం పంపిన కథను ఇలా హైజాక్ చేసి ప్రాంతీయ భాషలకోసం ఎంచుకున్నాము. ఆమె కోరిక మేరకు దీన్ని ఇంగ్లీష్ చందమామ పరిశీలనకు కూడా పంపిస్తామని చెప్పడమైంది. మామిడివిత్తనంలో మహత్తు మాటేమిటో గాని, సన్యాసి మాటలపై గురితో చదువుపై దృష్టి పెట్టిన మాయాంక్ రోజూ మామిడి చెట్టుకు నీళ్లు పోయడం ద్వారా పెద్ద చేసి దాని విత్తనాలను కూడా నాటి బీడుభూమిలో మామిడి చెట్ల వనాన్నే సృష్టించిన అపురూపమైన కథ ఇది.
కథ పంపినందుకు ఆమెకు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెబుతూ చందమామ జ్ఞాపకాలు కూడా రాసి పంపమని చెబితే ఆ రోజే తన జ్ఞాపకాలను రాసి పంపారు. పాతకథలను తీసివేయడం ద్వారా ఇంగ్లీష్ చందమామ క్వాలిటీ పడిపోయిందన్న బాధను కూడా నిష్కర్షగానే చెప్పారు.
శ్రీలేఖ గారూ, చందమామకు కథ, జ్ఞాపకాలు, ఫీడ్బ్యాక్ కూడా ఒకే రోజులోనే పంపినందుకు ధన్యవాదాలు. పిల్లలకు కథలు చెప్పడంలో చక్కటి అనుభవం సాధించిన మీరు ఇలాంటి కథలను మళ్లీ మళ్లీ చందమామకు పంపగలరని ఆశిస్తున్నాము.
మీకు మన:పూర్వక కృతజ్ఞతలు.
చందమామ
మీ చందమామ జ్ఞాపకాలను కూడా రాసి కింది లింకుకు పంపగలరు. ఈ మెయిల్ సౌకర్యం లేనివారు పోస్ట్ ద్వారా కూడా ఇంగ్లీషు లేదా తెలుగులో మీ జ్ఞాపకాలను చందమామ చెన్నయ్ చిరునామాకు పంపగలరు.
abhiprayama@chandamama.com
తెలుగు చందమామ వెబ్సైట్లో చందమామ జ్ఞాపకాలు విభాగంలో కథనాలకోసం కింది లింకులో చూడండి
http://www.chandamama.com/lang/story/storyIndex.php?lng=TEL&mId=12&cId=49
చందమామ – పంచతంత్ర కథలు
ప్రపంచ సాహిత్యానికి భారత దేశం అందించిన గొప్ప రచనలలో ఎన్నదగినది పంచతంత్రం . క్రీ. శ. 5 వ శతాబ్దంలో విష్ణుశర్మ అనే గురువర్యుడు సంస్కృత భాషలో రచించిన ఈ గ్రంధం ఎన్నో ప్రపంచ భాషలలోకి అనువదింపబడి, ఎంతో ప్రాచుర్యం పొందింది. తన వద్ద నేర్చుకోదలచిన విద్యార్ధులకు పాఠ్యగ్రంధంగా ఈ పుస్తకాన్ని ఆయన రచించాడు.
ఐదు భాగాలుగా విభజించిన ఈ పుస్తకం అనేక చిన్నచిన్న కథల సమాహారం. మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను, నీతి సూత్రాలను చక్కటి కథల రూపంలో, ఆసక్తికరమైన కథనంతో విష్ణుశర్మ బోధించాడు.
పంచతంత్ర నేపథ్యం
దక్షిణ భారతాన మిహిలారోప్యము అనే రాజ్యానికి అమరశక్తి రాజు. ఆతనికి బహుశక్తి, ఉగ్రశక్తి, అనంతశక్తి అని ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు చదువుసంధ్యలు లేక మూర్ఖుల వలె తయారయ్యారు. ఎంత ప్రయత్నించినప్పటికీ వారికి చదువుపై శ్రద్ధ కలుగలేదు. మనోవేదన చెందిన రాజు తన బాధను మంత్రుల వద్ద వ్యక్తపరచి తరుణోపాయం సూచింపుమన్నాడు. ఒక మంత్రి విష్ణుశర్మ అనే గురువు గురించి చెప్పి అతనికి రాకుమారులను అప్పగింపుమని సలహా ఇచ్చాడు.
రాజు విష్ణుశర్మను పిలిపించి, రాకుమారుల చదువు విషయమై తన వేదనను వివరించి, ‘నా బిడ్డలకు విద్యా బుద్ధులు నేర్పండి, మీకు తగిన పారితోషికం ఇస్తాను’ అని అన్నాడు. విష్ణుశర్మ బదులిస్తూ ‘నేను విద్యను అమ్ముకోను, నీ బిడ్డలను నీతిశాస్త్ర కోవిదులను చేస్తాను, నాకే విధమైన పారితోషికం అవసరం లేదు’ అని చెప్పి రాకుమారులను తీసుకొని వెళ్ళాడు.
వారికి బోధించదలచిన పాఠ్య ప్రణాళిక ప్రకారం కొన్ని కథలను స్వయంగా రచించి, బృహత్కథ నుండి కొన్ని కథలను గ్రహించి, పంచతంత్రమును రచించాడు. ఆ కథలను వారికి చెప్పి, నీతిని బోధించి ఆరు నెలలలో వారిని నీతిశాస్త్ర కోవిదులను చేసి, రాజుకిచ్చిన మాటను చెల్లించుకున్నాడు.
విశిష్టత
విషయ పరిజ్ఞానం, బోధనా సామర్థ్యం, చక్కని పాఠ్య ప్రణాళిక ఉంటే, చదువంటే ఇష్టము, ఆసక్తి లేని వారికి కూడా బోధించి విద్యావంతులను చెయ్యవచ్చని 5 వ శతాబ్దం లోనే విష్ణుశర్మ నిరూపించాడు. 1500 సంవత్సరాల నాటి ఈ రచన ఈనాటికీ ప్రతి సమాజానికీ అనుసరణీయమే, ఆమోదయోగ్యమే! అదే పంచతంత్రం యొక్క విశిష్టత.
పంచతంత్రం 5 విభాగాల, 69 కథల సంపుటి. కథలలోని పాత్రలు ఎక్కువగా జంతువులే. పాత్రల పేర్లు వాటి మనస్తత్వాన్ని, సహజ ప్రవృత్తినీ, నడతను సూచిస్తూ ఉంటాయి. కథనం సరళంగా ఉంటూ, సామెతలు, ఉపమానాలను గుప్పిస్తూ, ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. సమాజం గురించి, వ్యవస్థ, మనుష్య ధర్మం గురించిన ఎన్నో విషయాలు కథలలో మిళితమై వస్తాయి. పంచతంత్రం ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితం కాని, చిరస్థాయిగా నిలిచిపోయే సార్వత్రిక విజ్ఞానం.
ఈరోజుకి మనకి తెలిసినంతవరకు, క్రీ.శ. ఆరవ శతాబ్దం నుంచి మొదలుపెట్టి మన పంచతంత్రం కనీసం యాభై ప్రపంచ భాషల్లోకి అనువదించబడిందట. పంచతంత్ర కథలు అనేక దేశాల సంస్కృతుల్లోనూ, కథా సాహిత్యంలోనూ కలిసిపోయి, ఆయా దేశాల సామాన్య ప్రజల నోళ్ళలో నాని, వాళ్ళ ప్రాంతీయమైన రంగు, రూపు, వాసనల్ని పొంది, చివరికి ఆ ప్రాంతాల కథలుగానే ఇప్పటికీ చెలామణీ అవుతున్నాయట. పాశ్చాత్య కథా సాహిత్యం మీద పంచతంత్రం ప్రభావం అపారమని చాలామంది పండితులు అభిప్రాయపడుతుంటారు.
పంచతంత్రం క్రీ.శ. ఆరవ శతాబ్దంలో పహ్లవీ (పర్షియా) భాషలోకి అనువదించబడిందనీ, అదే తర్వాత సిరియన్ భాషలోకి, సిరియన్ అనువాదం ఖలీల్ వదిమ్న అన్న పేరుతో అరబ్బీ భాషలోకి అనువదించబడిందని తెలుస్తోంది. అరబిక్ పంచతంత్రం తర్వాత శతాబ్దాల్లో గ్రీకు, లాటిన్, హిబ్రూ ల్లోకి అనువాదం చెయ్యబడింది. ఆ తర్వాత క్రమంగా అనేక యూరోపియన్ భాషల్లోకి కూడా అనువాదాలు వచ్చాయట. ఏషియా, యూరోపు, ఆఫ్రికాలో కూడా పంచతంత్ర కథలు వ్యాపించాయని ప్రతీతి.
గ్రీకుభాషలోని ఈసప్ కథల్లోనూ, అరేబియన్ నైట్సులోనూ కూడా పంచతంత్ర కథలు కలిసిపోయాయని రచయితలు అభిప్రాయపడ్డారు. అయితే పంచతంత్ర కథలకి మూలం గ్రీకు కథలని కూడా వాదాలు ఉన్నాయి. భారత, గ్రీకు సంస్కృతుల మధ్య జరిగిన ఆదాన, ప్రదానాల్లో ఇక్కడి కథలు అక్కడికీ, అక్కడి కథలు ఇక్కడికీ వెళ్ళి ఉండచ్చని కూడా ఒక ఊహ.
(ఈ పంచతంత్ర కథల పరిచయానికి పూర్తిగా తెవికీ, నాగమురళి గారి బ్లాగ్లోని వ్యాస భాగాలే ఆధారం.)
పంచతంత్రం ధారావాహికగా తెలుగులో ప్రచురించిన ఘనత చందమామ పత్రికకు దక్కింది. సరళమైన తెలుగులో, ఆకర్షణీయమైన బొమ్మలతో కొన్ని సంవత్సరాల పాటు, పంచతంత్రం ధారావాహికగా ప్రచురించారు.
కొన్ని దశాబ్దాల క్రితం చందమామలో వచ్చిన ఈ పంచతంత్ర కథలను పాఠకుల కోరిక మేరకు ఈ డిసెంబర్ నుంచి చందమామ మళ్లీ ప్రచురిస్తోంది. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు కొనసాగే పంచతంత్ర కథలను చందమామ నూతన సంవత్సర కానుకగా తన పాఠకులకు తిరిగి అందిస్తోంది.
ప్యాకింగ్కు తయారవుతున్న డిసెంబర్ చందమామ ముఖచిత్రాన్ని సోమవారం ఉదయం ఆఫీసులో దూరంనుంచి చూడగానే కళ్లముందు ఓ మెరుపు మెరిసినట్లయింది. రాజకుమారులకు కథలు చెబుతున్న విష్ణుశర్మను ముఖచిత్రంగా చూడగానే మళ్లీ ఓ నాలుగు దశాబ్దాలకు ముందునాటి చందమామ ముఖచిత్రాన్ని చూసిన అనుభూతి.
చందమామను చదవండి. వీలైతే చందా కట్టండి అని ధైర్యంగా మిత్రులకు సిఫార్సు చేయడానికి ఇప్పుడు ఏ సందేహాలూ లేవు. ఒక పంచతంత్రం కథలు, బేతాళ కథలు, దాసరి సుబ్రహ్మణ్యం గారి పాతాళదుర్గం సీరియల్, రామాయణం, 25 ఏళ్ల నాటి చందమామ కథ, జానపద కథ ఇవి చాలు…. చందమామను చూడండి, చదవండి, తీసుకోండి అని రెకమెండ్ చేయడానికి…
అందుకే గతంలో లేని ధైర్యంతో ఇప్పుడు మిత్ర బృందానికి, బంధువులకు, తెలిసిన వారికి చందమామను చూడమని ఫోన్లు చేయడం. ఇప్పుడీ బ్లాగులో కూడా చందమామ అభిమానులకు తెలియజేయడం.
ఇంతకు ముందే ప్రస్తావించినట్లుగా… ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితం కాని, చిరస్థాయిగా నిలిచిపోయే సార్వత్రిక విజ్ఞానం పంచతంత్ర కథలు.. ఈ డిసెంబర్ నుంచి మళ్లీ మీ ముందుకు ప్రింట్ రూపంలో వస్తోంది. వడ్డాది పాపయ్య గారి ముఖచిత్రంతో జిగేలుమంటున్న డిసెంబర్ చందమామ ఈ వారం మొదట్లోనే మార్కెట్లోకి రావచ్చు. తీసుకుని చదువుతారు కదూ..
ఆద్యంతం జంతువుల పాత్రలతో సమాజం గురించి, వ్యవస్థ, మనుష్య ధర్మం గురించిన ఎన్నో విషయాలను మానవజాతికి సుబోధకం చేసిన ఇప్పటికీ చేస్తున్న అపూర్వ కథా సాగరం పంచతంత్ర కథలు.
తల్లిదండ్రులారా! అలనాటి చందమామ పాఠకాభిమానులారా! ఈ డిసెంబర్ నుంచి చందమామను మీ పిల్లలకు తప్పక పరిచయం చేయండి. ఓ అరగంటైనా వారితో కూర్చుని పంచతంత్ర కథలను చదివించండి.. చదివి వినిపించండి.
Filed under ఆన్లైన్ చందమామ రచనలు | Tags: కథలసమాహారం., చందమామ, పంచతంత్రకథలు, పాతాళదుర్గం., ప్రపంచభాషలు, బేతాళకథలు, విష్ణుశర్మ, సంస్కృతం | Comments (2)![Chandamama Collection Edition art2[6]_400-500](http://blaagu.com/chandamamalu/files/2010/03/Chandamama-Collection-Edition-art26_400-500.jpg)







