విజిటింగ్ కార్డుతోనూ ప్రమాదమే…

August 4th, 2011

అదొక పెట్రోల్ పంపు. తన కారులో పెట్రోల్ పోయించుకుంటున్న మహిళవద్దకు ఒకతను వచ్చి తానొక పెయింటర్ నని చెప్పుకున్నాడు. తన సేవలు అవసరమైతే పిలువమంటూ తన విజిటింగ్ కార్డును ఆమె చేతిలో పెట్టి వెళ్ళాడు. ఆమె మారుమాటాడకుండా తల ఊపి ఆ కార్డును తీసుకుని కారులో కూర్చుంది. ఆ వ్యక్తి కూడా మరొక వ్యక్తి కారులో కూర్చున్నాడు.

పెట్రోల్ పంపు వద్దనుంచి బయటపడ్డ ఆమెకు, అదే సమయంలో తనను ఆ వ్యక్తులిద్దరూ వెంబడిస్తున్నట్లు అర్థమైంది. మరుక్షణంలోనే ఆమెకు కళ్లు తిరిగినట్లయింది. శ్వాస పీల్చడం కూడా ఆమెకు కష్టమైపోయింది. కారు తలుపు తీయడానికి ప్రయత్నించింది. ఇంతలో తన చేతినుంచి ఏదో వాసన వస్తున్నట్లనిపించిందామెకు. పెట్రోల్ బంక్ వద్ద ఆ వ్యక్తి వద్దనుంచి కార్డు తీసుకున్నచేతి నుండే ఆ వాసన వస్తోంది.

ఇంతలో ఆ ఇద్దరు వ్యక్తులూ తనకు అతి సమీపంలోకి వచ్చినట్లు ఆమె గమనించింది. ఏదో ఒకటి తక్షణమే చేయాలని అర్థమై, దారి మలుపులోకి కారును మళ్లించి సహాయం చేయమంటూ అదే పనిగా హారన్ మోగించడం మొదలుపెట్టింది. దీంతో ఆ వ్యక్తులు అక్కడినుంచి వెళ్ళిపోయారు. తర్వాత కూడా ఆమె చాలాసేపు అక్కడే ఇబ్బందిపడుతూ ఉండిపోయింది. చివరకు ఆమె శ్వాస పీల్చుకోసాగింది.

దీనంతటికీ కారణం ఆమె ఆ వ్యక్తినుంచి తీసుకున్న కార్డే. ఆ కార్డుపై పూయబడిన పదార్థం ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.

ఆ మందు పేరు బురుండంగ -Burundanga- దీనిగురించి ప్రజలకు పెద్దగా తెలీదు కాని అంతర్జాలంలో దీనిపై చాలా సమాచారమే పొందుపర్చబడి ఉంది. వ్యక్తులకు ఊపిరాడకుండా  నిర్వీర్యులను చేసి వారినుండి ఏదైనా తస్కరించడానికి ఈ డ్రగ్‌ని ఉపయోగిస్తున్నారట. ఇది ‘డేట్ రేప్ డ్రగ్’ కంటే నాలుగింతల ప్రమాదకరంగా ఉంటుందని వార్తలు.

మహిళలపై అత్యాచారం చేయడానికి చాలాకాలంగా ‘మృగాళ్లు’ ఉపయోగిస్తున్న డ్రగ్ ముద్దు పేరు ‘డేట్ రేప్ డ్రగ్’ దీన్ని ఆహారంలో, పానీయంలో కూడా కలిపి ప్రయోగిస్తుంటారు.

‘బురుండంగా’ అని పైన ప్రస్తావించిన మందు సాధారణమైన కార్డు లేదా కాగితంపై కూడా పూసి తీసుకుపోవడానికి వీలుగా ఉంటోందట.

కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా వీధుల్లో వెళుతున్నప్పుడు పొరపాటుగా కూడా విజిటింగ్ కార్డులు, పత్రాలు వంటివాటిని ఎవరైనా ఇస్తే తీసుకోకూడదని విజ్ఞుల హెచ్చరిక.

మన ఇంటి ముంగిటకు వచ్చి తలుపు తట్టి, ఫలానా సేవలందిస్తామంటూ ఏదో ఒక కార్డు ముక్క చేతుల్లో పెట్టే సందర్బాలకు కూడా ఈ హెచ్చరిక వర్తిస్తుందట.

ఇది ముంబై పోలీస్ బలగాలకు చెందిన ఒక వ్యక్తి ఇటీవల పంపిన ఈమెయిల్ అట.

మీ భార్య, సోదరిలు, కుమార్తెలు, మనవరాళ్ళు, అమ్మలు, స్నేహితురాళ్ళు, సహచరులు -విమెన్ కొల్లీగ్స్- అందరికీ ఈ సందేశాన్ని పంపించవలసిందని ఈ ఈమెయిల్ అభ్యర్థన.

మందుబాబుల పిల్లలపై మన సమాజంలో పడుతున్న తీవ్రమైన దుష్ప్రభావాల గురించి ‘ఆల్కహాలిక్ పిల్లలు‘, ‘బుజ్జి’ అనే రెండు అతి మంచి పుస్తకాలను ఇటీవలే ప్రచురించి ఉచితంగా పంపిణీ చేస్తున్న శ్రీదేవీ మురళీధర్ గారు ఇవ్వాళ ఇంగ్లీషులో పంపిన హెచ్చరిక సందేశానికి తెలుగు సేత ఇది. దీంట్లోని అక్షరాక్షరం వాస్తవమే.

కాని. ఒక్కమాట మాత్రం చెప్పితీరాలి. 20 ఏళ్లకు పైగా పల్లెటూళ్లలో జీవితం గడిపినంత కాలం మా ఊళ్ల ఆడపడుచులకు ఇలాంటి భయాలు ఒక్కటంటే ఒక్కటీ కూడా ఉండేవి కావు. కాస్త ఏమారితే జీవితాలనే మార్చేసే ఇలాంటి భయంకరమైన మందుల గురించీ, మాదక ద్రవ్యాల గురించి, విషపుటాలోచనల ప్రతిబింబాల గురించీ మా ఊహల్లోకూడా అనుభవంలోకి వచ్చేవి కావు.

ఇతరులకు సహాయం చేయి, చెడు సహవాసం చేయకు.. అనే బోధలు మాత్రమే మా ఊళ్లలో వినిపించేవి. కానీ. మనిషి కాదు కదా. వాడిచ్చే కార్డు ముక్కను కూడా నమ్మవద్దని పై సందేశం ఆకాశంలో సగాన్ని హెచ్చరిస్తోంది. పక్క ప్రయాణీకుడిచ్చే బిస్కట్ ముక్క కూడా ముట్టరాదన్న ప్రచారం మన రైళ్లలో ఎప్పుడో మొదలైపోయింది.

అసత్యములాడరాదు, పెద్దలను గౌరవించవలెను అంటూ తరతరాలుగా నీతిబోధలు చేస్తూ వస్తున్న సమాజంలో ఆధునిక నీతి బోధలు ఇలాంటి రూపంలోకి మారుతున్నాయి.

బిస్కట్టును నమ్మవద్దు… కార్డును నమ్మవద్దు.. మనిషిని నమ్మరాదు. మగాడిని, మృగాడిని నమ్మరాదు. మనందరం గర్వంగా చెప్పుకుంటున్న, పిలుచుకుంటున్న ఆధునిక జీవితం మన కళ్లముందే ఎంత పలుచనవుతుందో కదా…!!!

మనుషులను మనుషులే నమ్మడానికి వీల్లేకుండా పోతున్న సమాజ వాస్తవికతను ఇంత నగ్నంగా ఎత్తి చూపే ఈమెయిల్‌ని పంపిన శ్రీదేవి గారూ…

మీకు కృతజ్ఞతలు చెప్పాలా వద్దా అని తటపటాయిస్తున్నానండీ..

RTS Perm Link

చిన్ని చిన్ని అపార్థాలు

July 21st, 2011

ఇది ఇద్దరు అన్నాచెల్లెళ్ల మధ్య నడిచిన ఎస్ఎమ్ఎస్ సంభాషణ.

ఆరోజు అన్న పుట్టినరోజు. ఆ అమ్మాయి తన 18వ పుట్టిన రోజు జరుపుకున్న అయిదు రోజుల తర్వాత అతడి పుట్టినరోజు వచ్చింది. కాని అతడు ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోయాడు. అప్పుడు చెల్లెలు అతడికి ఇలా సందేశం పెట్టంది.

“అన్నా! నీకో కథ  చెబుతాను వినాలి మరి. ఒక అమ్మాయి తన 18వ పుట్టిన రోజున తన సోదరుడు తనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతాడని ఆరోజు రాత్రి 11. 59 నిమిషాల వరకు ఎదురుచూసింది. కానీ, ఆమె శుభాకాంక్షలను అందుకోనేలేదు. తర్వాత అయిదురోజుల పాటు ఆమె ఆగ్రహంతో, ఆశాభంగంతో గడిపింది. చివరికి అతడి జన్మదినం రానే వచ్చింది. ఆమె మనస్సులో, హృదయంలో పెద్ద పోరాటం. ఆమె హృదయం చెప్పింది. “అతడికి శుభాకాంక్షలు చెప్పు” కానీ ఆమె మనస్సు తిరగబడింది. అప్పుడామెలో పెద్ద డైలమా. అప్పుడు ఆ సోదరుడు ఏం చేసి ఉంటాడో నాకు చెప్పు. ఆమె డైలమా ఎలా తొలిగిపోయి ఉంటుంది?”

అప్పుడామె తిరుగు సందేశంలో అందుకున్న సమాధానం:

“అన్న ఆమెతో ఇలా చెప్పి ఉంటాడు.” ‘జూన్ 23వ తేదీని నేనెలా మర్చిపోయాను? ఆఫీసులో కాస్త పని ఒత్తిడిలో ఉండి ఉన్నప్పటికీ ఆ విషయం మర్చిపోయి ఉండకూడదు. జరిగిన పొరపాటుకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తున్నా..

…కాని.. ఒకటి మాత్రం నిజం..ఆ చెల్లెలు పది కిలోల బరువున్నప్పుడు నేను ఎత్తుకుని పెంచిన చెల్లెలే అనడంలో సందేహం లేదు. సరైన సందర్భంలో, సకాలంలో అతడి నోటినుంచి ఎలాంటి  మాటలూ రానప్పటికీ, అన్న మనసులో ఏముంటుందో తనకు తెలుసు. ఆమెకు తెలియదా? తను ఇప్పుడు ఎదుర్కొంటున్న డైలమ్మా వెనుక ఆమె మనసులో ఏం దాగి ఉందో నాకు తెలీదా మరి!”

అన్న పంపిన సందేశం చివరి వాక్యం చదివీ చదవక ముందే ఆమె కళ్లలో ధారలుగా కన్నీళ్లు… గొంతు పెగల్లేదామెకు. నోట మాట లేదు. స్థాణువైపోయింది. పై ఎస్ఎమ్ఎస్ చదువుతున్నప్పుడు ఆమె కాలేజీ బస్సుకోసం వేచి ఉంటోంది. అందరూ తననే చూస్తున్నారని గ్రహించడానికి ఆమెకు కాసింత సమయం పట్టింది. అప్పుడామె కళ్లలో పడిన దుమ్మును తుడుచుకుంటున్నట్లు నటించింది. తను ఏడవడానికి కారణం కంట్లో దుమ్మే అని ఆమె భ్రమింపజేసి ఉండవచ్చు.

కానీ…. వాస్తవానికి తన సోదరుడికి తనపట్ల ఉన్న ప్రేమ గురించి తన మనసులో ఏర్పడిన సందేహాలను తుడుచుకోవడానికి ఆమె అలా వ్యవహరించి ఉండవచ్చు…

ఆ చెల్లెలు ఎవరో కాదు… నేనే.. లవ్ యు బ్రదర్….”

శ్రుతి మురళి, బీడీఎస్ ప్రధమ సంవత్సరం, శ్రీవేంకటేశ్వర డెంటల్ కాలేజ్, తలంబూర్, తమిళనాడు

హిందూ పత్రిక చెన్నయ్ టాబ్లాయిడ్‌లో ఇవ్వాళ -21-07-2011-న వచ్చిన “Little misunderstandings” పేరిట వచ్చిన  కథనాని‌కి ఇది తెలుగు పరిచయం.

(నిన్న గాక మొన్న దారుణంగా కనుమరుగైపోయిన గీతా ప్రియదర్శిని జ్ఞాపకాలకోసం ఈ పోస్ట్…)

2.  ఆదిరెడ్డి దాకా…..

ఈ రోజే ఢిల్లీలో ఆదిరెడ్డి ఆత్మహత్య… తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంకోసం జరుగుతున్న ఆత్మబలిదానాల్లో ఇది తాజా దుర్ఘటన… శవానికి కూడా ఎపీ భవన్‌లో చోటు లోని ఘోరం.  కొన్ని నెలల మౌనం తర్వాత మళ్లీ కొన్ని సందేహాలు….

అన్నెం పున్నెం ఎరుగని పసిబిడ్డలు వందలమంది భావోద్రేకం సాక్షిగా శలభాల్లా మాడిపోతున్నారు. చివరికి ఎవరి ప్రయోజనాల కొమ్ముగాయడానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పసిపిల్లలు ఇలా మృత్యుధిక్కారాన్ని ప్రకటిస్తున్నారో బోధపడటం లేదు. గత సంవత్సర కాలం పైగా 600కు పైబడిన మరణాలు. భావోద్వేగంతో చెప్పాలంటే అమరత్వాలు….

నిర్భీతిగా ఒక విషయాన్ని అడగాలని ఉంది.. ఆంధ్ర రాష్ట్రంలో ఈ కొసనా, ఆ కోసనా  ఏ ఒక్క రాజకీయ నేత సంతానం, ఒక్క ప్రజాప్రతినిధి సంతానం కూడా ప్రాణత్యాగం చేసిన ఘటన లేదు. ఒక్క ప్రముఖ నేత కుమారుడు లేదా కుమార్తె జైలు పాలయిన చరిత్రలేదు. వీరి లక్ష్యసాధనలో ఒక్కడంటే ఒక్క నేత కొడుకు కూడా బలయిన చరిత్ర భూతద్దంలో గాలించినా కానరావడం లేదు. వీళ్లంతా ఉన్నత విద్యల కోసం అటు అమెరికా బాట లేదా ఇటు కోస్తా బాట పట్టారేమో తెలీదు.

వీళ్ల తండ్రులు మాత్రం ఉద్యమం పేరిట తోటి ప్రజాప్రతినిధులను, దళిత అధికారులను చావగొడుతూ, స్వచర్మ రక్షణకోసం బలవంతపు క్షమాపణలు ప్రకటిస్తూ చరిత్ర క్రమంలో బతికేస్తుంటారు.

కాని బలిదానాల చరిత్రలో కూడా ఈ అన్యాయ పరంపర కొనసాగుతున్న దారుణం మాటేమిటి?

ఇంత పెద్ద అపార్ధాలు చోటు చేసుకున్నాక, పెంచి పోషించబడుతున్న విద్వేషాగ్ని ఇంత ఉచ్ఛనీచాలెరుగని భాషాప్రయోగాలతో దాడికి దిగటం మొదలయ్యాక….

నూనూగు మీసాల నవయువకుల్లారా? మీ బలిదానాల చరిత్ర మన జాతికి మంచి చేయాలని మాత్రమే కోరుకుంటున్నాను. కడుపుమంటలోంచి, అరవై ఏళ్ల అవమానాల  సుదీర్ఘ చరిత్ర నుంచి పుట్టుకొస్తున్న మీ త్యాగం అంతిమంగా పరాన్నభుక్కుల పాలబడరాదని మాత్రమే మనసా వాచా కోరుకుంటున్నాం.

విలువైన జీవితాలను తృణప్రాయంగా ధారపోస్తున్న మీ అమరత్వానికి మకిలి అంటకూడదని, మీ నిస్వార్థం నిర్మలంగా నిలిచిపోవాలని ఆశిస్తున్నాం.

ప్రత్యేక రాష్ట్రం కనుచూపు మేరలో కనబడటం లేదని స్పష్టమవుతున్న వేళ…

తెలంగాణా “ప్రజల” న్యాయమైన ఆకాంక్ష ఫలించాలని మనసారా కోరుకుంటూ..
ఆదిరెడ్డికి, ఆరువందలమంది ప్రాణ త్యాగులకు కన్నీటి నివాళులతో…

RTS Perm Link

ప్రపంచ సంస్కృత పుస్తక ప్రదర్శనశాల – చందమామ

January 7th, 2011

సంస్కృత భాషాభిమానులకు, పాఠకులకు, విద్యార్థులకు, పరిశోధకులకు మంచి వార్త. ప్రపంచంలోనే మొట్టమొదటి సంస్కృత పుస్తక ప్రదర్శన 2011 జనవరి 7-10 మధ్య బెంగళూరులో బసవనగుడి నేషనల్ కాలేజీ గ్రౌండ్‌లో జరుగుతోంది. ప్రపంచ స్థాయిలో జరుగుతున్న ఈ విశిష్ట కార్యక్రమంలో సంస్కృత చందమామ కూడా తన స్టాల్‌ని ప్రదర్శిస్తోంది. (స్టాల్ నంబర్ 132)

బెంగళూరులోని బసవనగుడి నేషనల్ కాలేజీలో నిర్వహిస్తున్న ఈ తొలి ప్రపంచ స్థాయి సంస్కృత బుక్ పెయిర్‌లో దాదాపు 500 కొత్త సంస్కృత పుస్తకాలను విడుదల చేయనున్నారు. వందమంది సంస్కృత భాషా ప్రచురణ కర్తలు ఈ పుస్తక ప్రదర్శనలో పాలు పంచుకోనున్నారు. అరుదైన ఈ పుస్తక ప్రదర్శనకు ప్రవేశ రుసుములేదు. అందరూ ఆహ్వానితులే.  సంస్కృత భాషతో కాస్త పరిచయం ఉన్న, లేని  అన్ని వయస్సుల వారికీ ఈ పుస్తక ప్రదర్శన ఉచితం.

భారతీయ సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టే ఈ బుక్ ఫెయిర్ జనవరి 7 నుంచి 10 దాకా నాలుగురోజుల పాటు జరుగనుంది. 500 కొత్త సంస్కృత పుస్తకాల ఆవిష్కరణతోపాటు సులభ సంస్కృతంలో కాన్సర్టులు, నాటికలు, పప్పెట్ షోలు, మోడల్ హోమ్స్, మార్కెట్ ప్లేస్‌లు వంటి ప్రదర్శనలు జరుగుతాయి.

ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న సంస్కృతంలో జరుగుతున్న ఈ పుస్తక ప్రదర్శనను చూడండి, విశ్వసించండి, హత్తుకోండి అంటూ నిర్వాహకులు పిలుపునిచ్చారు.

లక్ష్యాలు
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సంస్కృత సంబంధిత ప్రముఖ సంస్థలన్నీ కలిసి సంస్కృతాన్ని, దాని సుసంపన్నమయిన భాషా పునాదిని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ఈ పుస్తక ప్రదర్శనను తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఆధునిక సంస్కృత పరిశోధన, సాహిత్యాన్ని కొత్తమలుపుకు తీసుకుపోవడం, సంస్కృతభాషలో నూతన సృజనలు చేసి ప్రచురించేలా సంస్కృత పరిశోధకులను ప్రోత్సహించడం, సంస్కృత ప్రచురణలకు మార్కెట్‌ని కల్పించడం. సంస్కృతాన్ని భవిష్యత్ కెరీర్ మార్గంగా ఎంచుకునే విషయమై సంస్కృత విద్యార్థులలో ఆత్మవిశ్వాసం ప్రోది చేయడం ఈ పుస్తక ప్రదర్శన లక్ష్యాలు.

సంస్కృత భాషతో పరిచయం ఉన్న, లేని ప్రజలందరికీ ఈ పుస్తక ప్రదర్శన ఉచిత సందర్శనను అనుమతిస్తున్న్టట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొంటున్న వలంటీర్లందరూ సరళ సంస్కృతంలో మాట్లాడుతూ ప్రాంగణం మొత్తాన్ని సంస్కృత వాతావరణంతో గుబాళింపజేస్తారని, వీరి సరళ సంస్కృత సంభాషణలను అన్ని వయస్కుల వారు సులభంగా అర్థం చేసుకుని ఆస్వాదిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు.

పుస్తక ప్రదర్శన నిర్వాహకులు
రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్
కర్నాటక ప్రభుత్వం
దేశంలోని అన్ని సంస్కృత విశ్వవిద్యాలయాలు, అకాడమీలు
ప్రాచ్య పరిశోధనా సంస్థలు
సంస్కృత పోస్ట్ గ్రాడ్యుయేట్ శాఖలు
నేషనల్ మాన్యుస్కిప్ర్ట్ మిషన్,
సంస్కృత్ ప్రమోషన్ ఫౌండేషన్
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సంస్కృత్ స్టడీస్, పారిస్
సంస్కృత భారతి

కార్యక్రమ విశేషాలు
సంస్కృతంపై వివిధ స్థాయిల్లో అవగాహన ఉన్న దాదాపు లక్ష మంది దేశ విదేశాలనుండి ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొననున్నారు.
ఇక్కడ నిర్వహించనున్న కాన్పరెన్స్‌లో పదివేల మంది సంస్కృత పరిశోధకులు ప్రతినిధులుగా రానున్నారు. భారతదేశం వెలుపల ఉన్న 24 సంస్కృత సంస్థల ప్రతినిధులు ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొంటున్నారు.

బెంగళూరు నగరంలోనే, 1008 సంస్కృత సంభాషణా శిబిరాలను  ఈ ప్రదర్శన శాల ప్రారంభానికి రెండు నెలల ముందునుంచే అంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించారు.వీటి ద్వారా కనీసం 30 వేలమంది కొత్తగా సంస్కృతాన్ని మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. వీరంతా తమ మిత్రులు, బంధువులతో కలిసి పుస్తక ప్రదర్శనకు రానున్నారు.

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బెంగళూరు నగరంలో ఈ శుక్రవారం నుంచి సోమవారం దాకా -జనవరి 7-10- నిర్వహిస్తున్నారు.

మరిన్ని వివరాలకు కింది వెబ్‌సైట్ చూడండి

http://www.samskritbookfair.org/

వివిధ సుప్రసిద్ధ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బృహత్ పుస్తక ప్రదర్శనశాలలో చందమామ పత్రిక 132వ స్టాల్‌లో చందమామ ప్రత్యేకించి, సంస్కృత చందమామలను ప్రమోషన్ కోసం ఉంచుతోంది. ఆసక్తి కలిగి ప్రదర్శనశాలకు వెళ్లేవారు చందమామ స్టాల్‌ని కూడా తప్పక సందర్శించగలరు

వేదిక: బెంగళూరులోని బసవనగుడి నేషనల్ కాలేజీ గ్రౌండ్

గమనిక: దాదాపు సంవత్సరం తర్వాత ప్రాంతీయ చందమామ జనవరి సంచికలు జనవరి తొలి వారంలోనే మార్కెట్‌లోకి వెళ్లాయని వార్త. శ్రీనివాస కల్యాణం సీరియల్‌తో సహా 14 కొత్త కథలతో – ఈ 20 ఏళ్లలో ఇదే మొదటిసారి- పత్రిక మునుపటి సైజులో -పాత చందమామ కంటే కొంచెం చిన్నసైజుతో- మార్కెట్లోకి వచ్చింది.

RTS Perm Link