విక్రమార్కుడు, బేతాళుడు, శంకర్….
హిందూ పత్రిక మెట్రోప్లస్ విభాగంలో ఈరోజు చందమామ సీనియర్ చిత్రకారులు శంకర్ గారిపై Vikram, Vetala and Sankar పేరిట ఒక పెద్ద ఇంటర్వ్యూ వచ్చింది. చేసినది విశ్వనాధ్ ఘోష్. రెండేళ్ల క్రితం ఈయన టైమ్స్ ఆఫ్ ఇండియా లో పనిచేస్తున్నప్పుడు కూడా శంకర్ గారిపై ఒక ఇంటర్యూ ప్రచురించారు. హిందూ పత్రికలో చందమామ శంకర్ గారి గురించి అరపేజీ పైగా కథనం ప్రచురించడం ఇదే తొలిసారి అనుకుంటాను.
దీన్ని హిందూ ఆన్లైన్లో కూడా ఇవ్వాళే హోమ్ పేజీ దిగువన ప్రచురించారు. దాని లింకుకోసం ఇక్కడ చూడండి.
http://www.thehindu.com/life-and-style/metroplus/article2611627.ece?homepage=true
Filed under చందమామ శంకర్ | Comment (0)
వెరీ కైండ్ ఆఫ్ యు సర్…!
శంకర్ గారితో చందమామ పనిమీద ఫోన్లో మాట్లాడిన ప్రతిసారీ ఆయన నాతో చివర్లో చెప్పే మాట “వెరీ కైండ్ ఆప్ యు సర్”
అక్టోబర్ నెల బేతాళ కథకు మరి కొన్ని కథలకు చిత్ర వివరణ -ఇమేజ్ డిస్క్ర్రిప్షన్- పంపుతున్నట్లు చెప్పినప్పుడు, ఆయన యోగ క్షేమాలు విచారించినప్పుడు, ఆయనకు నెలవారీ జీతం చెక్, చందమామ పుస్తకాలు అందాయో లేదో వాకబు చేసినప్పుడు, చందమామతో, చందమామ పనితో ఆయన అనుభవాలను తనతో పంచుకున్నప్పుడు హృదయ పూర్వకమైన అభిమానంతో ఆయన అనే చివరిమాట ఇది. ‘వెరీ కైండ్ ఆఫ్ యు సర్’.
ఎప్పుడు ఆయనకు పోన్ చేసినా సరే బిజనెస్ లైక్గా నాలుగు ముక్కలు మాట్లాడి ఫోన్ పెట్టేయడం అసాధ్యం. పైగా చందమామ చరిత్రపై మమకారం, చందమామపై పాతతరం సిబ్బందిపై అబిమానం చూపిస్తున్నందుకు, మా ఇద్దరి మధ్య ఎప్పుడు సంభాషణ జరిగినా తన సుదీర్గ అనుభవ సారాన్ని పంచుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టం.
88 ఏళ్ళ వయస్సు నిండిన పండు ముదుసలి. దాదాపుగా కుమారులు, కుమార్తెలు మంచి పొజిషన్లో ఉంటున్నప్పటికీ దేశదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలస పోయినందువల్ల, ఇంట్లో ముసలి దంపతులు మాత్రమే ఉంటుండటం వల్ల మనుషులు కలవడానికి వచ్చినా, ఫోన్ ద్వారా మాట్లాడినా వారితో తన అనుభవాలు పంచుకోవడం అంటే ఆయనకు ఎంత సంతోషమో…
చిత్ర వివరణలకు తగినట్లుగా కథలకు బొమ్మలు వేసినప్పుడు, వాటని నీట్గా ప్యాక్ చేసి చందమామ తెలుగు ఎడిటోరియల్ అని పేరు రాసి మరీ దాన్ని భద్రంగా అందజేసినప్పుడు గడచిన ఆరు దశాబ్దాలుగా చందమామ పని పట్ల ఆయన ప్రదర్శిస్తూ వచ్చిన అకుంఠిత దీక్ష, పరిపూర్ణ నిబద్దత ఆ ప్యాకెట్పై అక్షరాలలో కనిపించేవి.
దాదాపు 90 సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో జీవితంలో అన్ని పనులూ మానుకుని విశ్రాంతితో కాలం గడిపే అవకాశం అందరికీ వస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. కానీ జీవితం చివరి వరకు చందమామ బొమ్మలు గీస్తూ ఉండాలని, తన కష్టార్జితంతోనే తాను జీవించాలని రెండు చిరకాల ఆకాంక్షలతో ఆయన బతుకుతున్నారు.
గతంలోలాగా ఎక్కువ కథలకు బొమ్మలు గీయడం కష్టం అని తెలుసు. ఏకాగ్రతతో బొమ్మలు గీయటం సాధ్యం కాని శారీరక అశక్తత తనలో పెరుగుతున్నట్లు తెలుసు. గంట రెండు గంటలు కూర్చుని విరామం లేకుండా ఇంట్లో కూర్చుని బొమ్మలు గీస్తున్నా సరే, వెన్నెముకలో బాగా నొప్పిరావడం, అలసి పోవడం. ఇది మొత్తంగా తన ఏకాగ్రతపై ప్రభావితం చూపటం అనుభవంలోకి వస్తూనే ఉంటుందాయనకు.
కానీ ఈ అన్ని భౌతికపరమైన సమస్యలనూ ఆయన ఒకే ఒక ఆసరాతో, ఆలంబనతో అధిగమిస్తూ తన శరీరంలోని ప్రతి శక్తికణాన్ని తన లక్ష్యం కోసమే కేటాయిస్తూ జీవిస్తున్నారు. చందమామలో చేరడం, చందమామలో ఇన్నాళ్లుగా బొమ్మలు వేయడం -పౌరాణిక, జానపద, బేతాళ తదితర ఏ ఇతివృత్తమైనా సరే- దైవాజ్ఞ ప్రకారమే తన జీవితంలో జరుగుతూ వస్తోందని, ఈ ప్రపంచంలో, ఒక సంస్థ 60 ఏళ్లపాటు తనను ఉద్యోగిగా కొనసాగిస్తూ జీవితాన్ని ఇస్తోందంటే అది మానవేతర కారణం వల్లే జరిగిందని ఆయన ప్రగాఢ విశ్వాసం.
‘ఒరే శంకరా నువ్వు చందమామలో చేరి బొమ్మలు గీస్తూ ఉండరా!’ అని ఏనాడో దేవుడు ఆజ్ఞాపించాడని, ఆయన ఆదేశాన్ని ఈనాటికీ పాటిస్తూ వచ్చానని చెబుతారు. అందుకే ఈనాటికీ బొమ్మలు వేయాలంటే స్నానం చేసి పూజ ముగించిన తర్వాతే పనిలోకి దిగటం ఆయన అలవాటుగా మారింది. కుంచె పట్టుకుంటే తనకు ప్రపంచంలో ఇక ఏదీ కనిపించదని, వినిపించదని ఏ అశరీరవాణో తనకు సూచిస్తుంటే తన కుంచె కదులుతుంటోందనిపిస్తుంటుందని ఆయన పదే పదే చెబుతారు.
చందమామలో 55 ఏళ్లు పనిచేసినప్పటికీ తనజీతం మూడేళ్లకు ముందు కూడా పదివేలకు దాటలేదని తెలిస్తే దిగ్భ్రాంతి కలగకమానదు. ఈ ఆరు దశాబ్దాల కాలంలో ఎంతమంది, ఎన్ని బయటి సంస్థలు ఆయనకు అవకాశాలు ప్రతిపాదించారో, తమ వద్దకు రమ్మని ఆహ్వానించారో ఆయనకు లెక్క తెలీదు. జీవితం అవసరం రీత్యా కూడా తనకు అవకాశాలు కల్పించినా వేటివైపూ ఆయన కన్నెత్తి చూడలేదు.
చందమామకు బొమ్మలు వేయడం… తన జీవితానికి ఇది చాలు అనుకున్నారాయన. దశాబ్దాలు పనిచేస్తున్నప్పుడు సిబ్బంది అడగక ముందే వారి ఆవసరాలను యాజమాన్యం చూడాలని, వారిని మరికొంచెం మిన్నగా పట్టించుకోవాలని ఆయనకు అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. కాని చేసేది దైవకార్యం అనుకుంటున్నప్పుడు, దైవాజ్ఞను మీరకూడదని ప్రతి క్షణం తన మనస్సు గుర్తు చేస్తున్నప్పడు ఆయన 55 ఏళ్ల అసంతృప్తులను అన్నిటినీ తనలోనే దాచేసుకున్నారు.
నారు పోసినవాడు నీరుపోయడా అనే సామెత ఆయనకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కన్నతల్లి ద్వారా నేర్చుకున్న తెలుగును ఆయన మర్చిపోలేదు. నాగిరెడ్డి గారు స్వయంగా పిలిచారు. చందమామలో ఉద్యోగ నియామకపత్రం ఇచ్చారు. 1952లో చందమామలో చేరినప్పుడు తనకు ఇచ్చిన నియామకపత్రాన్ని ఈనాటికీ ఆయన భద్రంగా పదిలపర్చుకుంటూ వస్తున్నారు.
‘ఇప్పుడు నీడనిచ్చిన చందమామ భవంతి లేదు. ఆహ్వానంపలికి ఆదరించిన నాగిరెడ్డి గారు లేరు. తెలుగువారి చందమామలో తెలుగు యాజమాన్యమే లేకుండా పోయింది. కాని శంకర్ నేటికీ చందమామలోనే ఉంటున్నాడ’ని ఆయన ఆవేదనతో చెబుతున్నప్పుడు దశాబ్దాల ఆత్మయబంధం ఏదో తనలోంచి తెగిపోయినంత భాధానుబూతి ఆయనలో కలుగుతుంటుంది.
లేబర్ సమస్య అని మరొకటి అనీ లక్ష కారణాలు చెప్పినా, నిర్వహణలో వైఫల్యమే చందమామ పరుల పాలు కావడానికి ప్రధాన కారణమని శంకర్ గారి బలమైన అభిప్రాయం. చక్రపాణి, నాగిరెడ్డి గారు ఉన్నంతవరకూ దేదీప్యమానంగా వెలిగిన చందమామ తర్వాత తన ప్రాభవాన్ని కోల్పోవడానికి ఇతరేతర కారణాలకంటే వ్యక్తులే కారణమని ఆయన చెబుతారు. తాము చూస్తూ ఉండగా పెరిగి పెద్దదయిన వటవృక్షం తమముందే నేలకొరగడం ఆయనకు శరాఘాతం.
70లు, 80ల వరకు లక్షలాది మందిని తన వద్దకు రప్పించుకున్న చందమామ భవంతి ఈరోజు ఉనికిలో లేకుండా నేలమట్టమైపోయిన ఘటనను తల్చుకుంటేనే భరింపరాని బాధ ఆయనకు. అలా జరుగుతుందని ఊహించడానికి కూడా కష్టమయ్యేదాయనకు.
అన్నిటికంటే మహాశ్చర్యం ఏమంటే, కథాచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా చందమామ బొమ్మలు చందమామ కథలకు మించిన ఆసక్తిని దశాబ్దాలుగా పాఠకుల, అభిమానులలో కలిగిస్తూ వస్తున్నప్పటికీ, ఈ చిత్రమాంత్రికుడు చందమామ కథకే తొలి ప్రాదాన్యం ఇస్తారు. ఎప్పుడైనా ఎక్కడైనా సరే పత్రికకు కథే ప్రాణమని, మంచి కథలు ఉంటేనే మంచి బొమ్మలు వేయడానికి ప్రేరణ కలుగుతుందని. కథను బట్టే మంచి బొమ్మలు చిత్రకారులు గీయడానికి వీలవుతుందని ఆయన బలంగా నమ్ముతారు.
అందుకే ఈ మధ్యకాలంలో చందమామలో కథల నాణ్యత పెరుగుతూ వస్తోందని. పంపిన కథలకు బొమ్మలు వేస్తూంటేనే మనసుకు హాయి గొల్పుతున్నట్లు ఉంటోందని ఆయన చెబుతూ వస్తున్నారు. ఈ మధ్యే అచ్చయిన శివనాగేశ్వరరావు గారి ‘బంగారు నెమలి’ కథకు బొమ్మలు గీస్తున్నప్పుడు ఆయన ఎంత సంతోషపడ్డారో. కథ ముందు పెట్టుకుని చదివి బొమ్మ గీస్తున్నప్పుడో లేదా పూర్తి చేసినప్పుడో తన అనుభూతిని మాతో పంచుకుంటారాయన.
గత సంవత్సరం మే నెల చందమామలో వచ్చిన కప్పగంతు శివరాం ప్రసాద్ -చందమామ వీరాభిమాని- గారి ‘నిజమైన చదువు’ బేతాళ కథకు నాలుగు నెలల క్రితమే జనవరిలో శంకర్ గారు బొమ్మలువేశారు. జనవరి చివరలో శివరాంగారు ఆయనను కలుసుకోవాలని వచ్చినప్పుడు తన బేతాళ కథకే శంకర్ గారు బొమ్మలు గీయడం ముగించారు. ఓ సాయంత్రం ఆయన ఇంటికి పోయినప్పుడు సాదరంగా ఆహ్వానిస్తూ, ‘మీ బేతాళ కథకే బొమ్మలు వేస్తున్నాను. బాగున్నాయా చూసి చెప్పండి’ అన్నప్పుడు శివరాం గారు పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది.
జీవితంలో శివరాం గారు శంకర్ గారిని కలిసింది అదే మొదటిసారి. తాను చందమామకు కథ రాసి పంపడం అదే మొదటిసారి. తన కథకు శంకర్ గారు బొమ్మలు వేస్తున్నప్పుడు ఆయనను కలిసిన అనుభవం కూడా ఏ కథకుడికైనా బహుశా అదే మొదటిసారి. కథకు సరిగ్గా సరిపోయిన బొమ్మలు వేయడంతో మహదానందంతో శివరాంగారు శంకర్ గారి పాదాలకు నమస్కరించి ఆశీర్వదించమని కోరారు.
ఈ అరుదైన ఘటనను శివరాం గారు ఎలా మర్చిపోలేకున్నారో శంకర్ గారు కూడా అదే విధంగా గుర్తు పెట్టుకున్నారు. ఇప్పటికీ సందర్భం వస్తే చాలు.. ‘ప్రసాద్ గారు బాగున్నారా’ అంటూ పరామర్శించే ఈ నవ వృద్ధ యువకుడిలో ఆత్మీయత రంగరించుకున్న మెత్తటి తడి… బెంగళూరు నుంచి వచ్చి కలుసుకుని నాలుగు మంచి మాటలు తనగురించి బ్లాగులో రాసి ప్రచురించిన శివరాం గారి పట్ల ఆయనకు ఎంత సాదర భావమో..
కథకులకు, రచయితలకు ప్రోత్సాహమిస్తే, వారితో నిత్య సంబంధంలో ఉంటే వారు మంచి కథలు పంపడానికి ప్రేరణగా ఉంటుందని, చందమామలో ప్రస్తుతం సగం పాత కథలు, సగం కొత్త కథలు వస్తున్నాయంటే కథకులు ప్రేరణ పొందుతున్నారని, మంచి కథలు పంపడానికి ఉత్సాహం చూపుతున్నారని అర్థం అని ఆయన అంటారు.
పనిపాటలతో అలసే పాటకజనానికి చందమామ కథలు తొలినుంచి కాస్త సేద తీర్చాయని, చందమామలో సరదా కధలను చదువుతూ జనం జీవితంలో పడుతున్న శ్రమను కాస్సేవు మర్చిపోయేవారని, చింత చెట్టు దయ్యాలు, రాక్షసుల కథలు చందమామలో అంత విజయం పొందాయంటే అదే కారణమని ఈయన అభిప్రాయం. మనుషులకు మంచి చేసే దయ్యాలు, రాక్షసులు మంచివైపు నిలబడే దయ్యాలు చందమామలో కాక ఇంకే పత్రికలో కనిపిస్తాయని ఆయన ధీమాగా చెబుతారు.
రెండేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చి శంకర్ గారిని కలిసిన అన్వర్ -సాక్షి చిత్రకారులు- గారు ఆయనను కలిశాక ఒకే ఒక మాటన్నారు. ‘జీవితంపట్ల ఆయన పరిపూర్ణమైన సంతృప్తితో ఉంటున్నారు. ఇది లేదు, ఇది రాలేదు అనే కొరతకు సంబంధించిన మాట ఆయన నోట్లోంచి రావటంలేదు. మనిషిలో బాధ ఉంటే కదా అసంతృప్తి చెందడానికి.”
మనిషి జీవితంలో అత్యంత విలువైన 60 సంవత్సరాలు. ఒకే పత్రిక, ఒకే పని, ఒకే ఆశయం. ఇది తప్ప నాకింకేమీ వద్దు అనే పరమ సంతుష్టికరమైన జీవితాచరణ. వీటన్నింటి ప్రతిరూపం. చందమామ శంకర్.
వ్యక్తిగత జీవితంలో ఆయనకు నిజమైన తోడూ నీడా ఆయన జీవన సహచరి షణ్ముఖవల్లి గారు. ఆమె లేకుంటే ఆయన లేరన్నది ఉబుసుపోక మాట కాదు. అక్షరసత్యం. నీడలా అంటిపెట్టుకునే ఆమె ఏదైనా పనిమీద బయటకు వెళ్లవలసివచ్చి రాత్రివరకు రాలేకపోతే 88 ఏళ్ల వయసులో కూడా శంకర్ గారు అన్నం స్వయంగా తానే వండుకుని తింటారు. ఈనాటికీ ఇదే తంతు..
నేర్చుకోవాలంటే, ఆచరించాలంటే కళ్లముందు జీవితంలో ఎన్ని ఉదాహరణలు లేవు మనకు…
శంకర్ గారూ, మీతో కలిసి పని చేసే మహద్భాగ్యం అనుకోకుండా దక్కినందుకు..
మీ మాట మీకే అప్పగిస్తున్నానండీ..
వెరీ కైండ్ ఆఫ్ యు సర్…!
Filed under చందమామ శంకర్ | Comment (1)దైవం జంతువు రూపంలో…
ఇంటి పిల్లీ, ఇంటి కుక్కా దైవానికి మారు రూపాలు అని చందమామ చిత్రకారులు శంకర్ గారు చెబుతున్నారు. చందమామ కథకు బొమ్మ రూపంలో ప్రాణప్రతిష్ఠ పోస్తూ, గత 55 సంవత్సరాలకు పైగా బేతాళ కథలకు వన్నెలద్దుతున్న ఈ చిత్ర బ్రహ్మ… ఇంటి పిల్లీ, ఇంటి కుక్కలో కనిపించే దైవాంశను గురించి ఇవ్వాళే ఫోన్లో పంచుకున్నారు.
చందమామ ఈ సంవత్సరం మొదటినుంచి సకాలంలో అంటే నెల మొదట్ల్లోనే మార్కెట్లోకి వస్తూండటం తెలిసిందే. దీంట్లో భాగంగా పత్రిక కంటెంట్ కూడా రెండు మూడు నెలలకు ముందే సిద్ధమవుతూ కాస్త వేగం పుంజుకొంది. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన ఇంటివద్దే ఉండి చందమామకు బొమ్మలు వేసి పంపుతుంటారు. ఆగస్టు నెల పత్రిక బేతాళ కథ -ధర్మయ్య తీర్పు-కు బొమ్మ వేయడం ఇవాళ్టితో పూర్తవుతుందని సాయంత్రం 3 గంటల తర్వాత ఇంటికి వచ్చి తీసుకెళ్లవలసిందిగా ఆయన ఈ ఉదయం ఫోన్లో చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన తన బంధువలమ్మాయిని తోడు తీసుకుని ఈ శుక్రవారం వేరే ఊరికి వ్యక్తిగతపని మీద వెళుతున్నానని, ఈలోగానే బేతాళ కథకు బొమ్మలు వేయడం పూర్తవడం సంతోషంగా ఉందని, మీకూ, నాకూ కూడా బొమ్మల గురించి ఇక టెన్షన్ ఉండదు కనుక ఇక నిశ్చింతగా ఆ కార్యక్రమానికి వెళ్లివస్తానని చెబుతూ మాటల సందర్భంలో జంతువుల్లో దివ్యత్వం గురించి కొన్ని ఘటనలు పంచుకున్నారు.
చెన్నయ్ నగరంలో పోరూరులో ఉన్న ఆ బంధువుల అమ్మాయి ఇంటికి మాష్టారు దంపతులు ఎప్పుడు వెళ్లినా సరే ఆ ఇంటిలో ఉన్న ఒక పెద్ద కుక్క వారిని ఆప్తబంధువులుగా భావించి వదలదట. పోలీసు లేబర్ డాగ్లాంటి ఆ కుక్క సింహంలా ఇంట్లో తిరుగాడుతూ, మన భాషలో మనం మాట్లాడితే దాని భాషలో అది అర్థం చేసుకుని చెప్పింది తుచ తప్పకుండా చేస్తూంటుందని ఆయన చెప్పారు.
అలాగే తన అవసరాలను అది సైలెంటుగానే ఇంటివారికి గుర్తు చేస్తూంటుందట. పొరపాటున కూడా అది కాలకృత్యాదులను ఇంటి ఆవరణలో తీర్చుకోదట. దాని అవసరం పడగానే అది యజమానికి గుర్తు చేస్తుందట. ఎలాగంటే దాన్ని పగటిపూట ఇంటి ఆవరణలో కట్టేయకుండా వదిలేస్తారట. సాయంత్రం కాగానే దాన్ని బయటకు తీసుకెళతారు.
ఏరోజైన సకాలంలో అలా ఇంటి బయటకు తీసుకుపోనట్లయితే, ఇది సరికొత్త రూపంలో తను బయటకు పోవాలనే విషయం గుర్తుచేస్తుంది. ఎక్కడో ఓ మూల పడి ఉండే గొలుసును తీసుకువచ్చి ఇంటి యజమానికి ఇస్తుందట. దీన్ని నా మెడకు బిగించి బయటకు తీసుకుపో.. ఎందుకింత లేటు అని ఎగాదిగా చూస్తుందట. మరి దాని అవసరం దానిది. మనుషులు గుర్తించకపోతే ఎలా అని శంకర్ గారి చెణుకు. ఎక్కడో ఉన్న గొలుసును తీసుకొచ్చి అది యజమానికి ఇస్తూంటే వీరికి ఒకే ఆశ్చర్యం. బయటకు తీసుకుపోతే గొలుసు తగిలిస్తారనే రోజువారీ అంశాన్నిఅది అలా స్టిమ్యులేట్ చేసుకుని ఇంటివారికి గుర్తుచేస్తుంది.
ఆ ఇంటివారు తమిళంలోనో, ఇంగ్లీషులోనూ ఏదైనా చెబితే అది వెంటనే అర్థం చేసుకుని తుచ తప్పకుండా దాన్ని పాటిస్తుందట. మాట్లాడే మనిషి భాషను మాట్లాడలేని కుక్క గ్రహించి ఆవిధంగా నడుచుకోవడం చూసి కదిలిపోతుంటారు వీళ్లు. బయటికి వెళ్లి దానికి తినడానికి ఏవైనా బిస్కెట్లవంటివి తెచ్చి కూడా సంచిలోంచి తీసి ఇవ్వకపోతే కాస్సేపు చూస్తుందట. తర్వాత చిన్న చిన్న మూలుగులతో శబ్దం చేసి మరీ ఆ బిస్కెట్లను బయటకు తీయించి తీరిగ్గా తిన్న తర్వాత తిరిగి తన స్థానంలోకి వెళ్లిపోతుందట.
వీళ్లు నావాళ్లు, బయటకు వెళితే తప్పకుండా ఏదైనా తీసుకువస్తారు అనే జ్ఞానాన్ని అది ఎంతగా గుర్తుపెట్టుకుంటుందో మరి. చిన్న పిల్లలకు, ఇంటి జంతువులకు తేడా లేదనే కదా ఇది చెప్పేది. చెప్పిన మాట ఎన్నడయినా వినకపోతే, గోల చేస్తే, ఇంటివాళ్లు బయటకు వెళ్లిపో అని కేక వేస్తారట. అది ఎలా అర్థం చేసుకుంటుందో కాని బుద్దిగా తన స్థానంలోకి వెళ్లి కిముక్కుమనకుండా కూర్చుంటుందట.
మనిషి భాషను అది ఎంత గొ్ప్పగా అర్థం చేసుకుంటుందో తెలిపే మరో విశేషం. ఆ ఇంటిలో వారు పనిమీద రెండు మూడు గంటలు బయటకు వెళితే దాన్ని ఆవరణలోంచి ఇంటిలోపల టీవీ ముందు కూర్చుండబెట్టి ఏదో ఒక జంతువుల ఛానెల్ పెట్టి చూస్తుండమని చెప్పి వెళతారట. పాపం అది బుద్ధిగా ఆ టీవీలో బొమ్మలను చూస్తూ వాళ్లు కూర్చుండబెట్టిన చోటునుంచి కదలకుండా అలాగే చూస్తూ ఉంటుందట. వాళ్లు తిరిగి వచ్చేంతవరకు అలాగే ఉంటుందట.
ఇంటి జంతువు ఇంటి మనిషి కంటే ఎక్కువగా చెప్పిన మాటకు కట్టుబడి అలాగే ఉండటం ఎలా సాధ్యం అంటూ మాస్టారు గారు ఆశ్చర్యపోయారు. ఇంటివారి కోపాన్ని, సంతోషాన్ని, సరదాను, విషాదాన్ని అర్థం చేసుకుని మెలిగే పెంపుడు జంతువు ఇంటి మనుషుల కిందే లెక్క అని ఈయన అభిప్రాయం.
అన్నిటికంటే మించి వీళ్లు ఆ ఇంటిలోకి వెళ్లడం వరకే వీరి పని. తర్వాత వీరు బయలు దేరి వస్తూ ఉంటే మాత్రం ఒప్పుకోదట. చేతిలో సంచీ చూసిందంటే వీళ్లిక వెళ్లిపోతారు అని భావించి సంచీని నోటితో పట్టుకుని వదలదట. చుట్టాలను, అతిథులను అంత త్వరగా బయటకు పంపేయకూడదు అనే మానవ అనుభవజ్ఞాన సంస్కారాన్ని అదెంత బాగా అలవర్చుకున్నదో అని వీరికి విస్మయం కలుగుతూంటుంది. వీళ్లు వెళ్లటం తప్పనిసరి అయితే దాన్ని ఎలాగోలా మరిపించి ఆవరణలోంచి పక్కకు తీసుకెళ్లి ఏమారుస్తారట. అక్కడికీ వీళ్ళు గేటు దాటి నడవటం గాని చూసిందంటే అంతెత్తు ప్రహరీ గోడ దూకి బయటకు రావాలని గింజుకుంటుందట.
అలాగే తాను 30 లేదా 40 ఏళ్ల క్రితం మద్రాసులోని పేరుంగుడి ప్రాంతంలోని ఇంటిలో ఉన్నప్పుడు పిల్లితో తమ అనుబంధం గురించి కూడా ఈ సందర్బంగా శంకర్ గారు పంచుకున్నారు. ఇంటి చుట్టూ కొబ్బరిచెట్లు, మామిడి చెట్లు ఉండగా పరిసరాలలో తిరుగుతూండే ఈ పిల్ల అడివిపిల్లిలా భీకరంగా కనిపించేదట. నల్లపిల్లి. భారీ ఆకారం. వీరి అలవాట్లను అది ఎంతగా స్వతం చేసుకుందంటే. పొరపాటున కూడా చల్లని పదార్థాలు ముట్టేది కాదట. వేడిగా వండిన అన్నాన్ని తీసి మజ్జిగ వంటివి కలిపి పెడితే తింటుంది కాని చల్లబడితే వెంటనే అలిగి అక్కణ్ణించి వెళ్లిపోతుందట. రోజు వేడి అన్నం పెట్టేవారు ఈరోజేమయింది మీకు అంటూ తూష్ణీభావం ప్రదర్సిస్తూ అక్కడినుంచి వెళ్లిపోతుందట. ఏదో ఒకటి వేడిగా చేసి మళ్లీ పిలిస్తే కాని దగ్గరికి రాదట.
ఇక ఆ ఇంటి పిల్లలతో దాని అనుబంధం చెప్పాలి. వాళ్లు ఎక్కడ పడుకుంటే ఇది అక్కడికే పోయి పడుకునేదట. వారి బాధలను, విషాదాన్ని కూడా అది అలాగే పట్టేస్తుందట. పెద్దవాళ్లు ఎప్పుడయినా అరిచిన సందర్బాల్లో పిల్లలు ముసుగు కప్పుకుని ఏడుస్తుంటే ఈ పిల్లికి అస్సలు సహించేది కాదట. వెంటనే పోయి దుప్పటి లాగి వాళ్ల ముఖంలోకి చూస్తూ ఉంటుందట. ఆ పిల్లలు మళ్లీ దుప్పటి లాక్కుని కప్పుకుంటే మల్లీ లాగేసేదట. పిల్లలు ఏడిస్తే, కన్నీరు పెడితే అంత పిల్లికి కూడా ఇష్టముండదు మరి. సైలెంటుగా పోయి వారివద్ద కూర్చుని ఏడవవద్దు అంటూ ఓదార్చే ఈ మార్జాల మహత్వాన్ని ఏమని వర్ణించాలి అంటారీయన.
మన ఇంటిలో మనతోపాటే పెరుగుతూ, మన మనోభావాలను పరికిస్తూ, వాటికనుగుణంగా తమకు తాము మెలుగుతూ మన సంతోషాన్ని, విషాదాన్ని కూడా తమవిగా చేసుకుని మన వెన్నంటి ఉండే పెంపుడు జంతువులు దైవాంశ ప్రతిరూపాలు అంటారు శంకర్ గారు. నన్ను వదిలి పెట్టి పోవద్దు అనే అర్థం వచ్చేలా చేతిలోని సంచిని గట్టిగా పట్టుకుని నిలేసే కుక్క సంస్కారానికి మనం నిండు నమస్కారాలు చేయాలంటారీయన.
అసలు పెంపుడు జంతువులు మనుషుల పట్ల ప్రదర్సించే ఆ కరుణామయ దృశ్యాలను కథలుగా రాయాలంటారీయన. జంతువుల కథలు సాహిత్యంలో ఎన్నటికీ చెరిగిపోవని, మనుషులకు పాఠాలు నేర్పే కథలుగా జంతుకథలు సాహిత్యంలో కలకాలం నిలిచిపోతాయని శంకర్ గారు నొక్కి చెప్పారు.
జీవితపు తొలి నాళ్లు పల్లెలో ఉన్నప్పుడు మా ఇంటలోనూ పిల్లీ, కుక్కా ఉండేవి. సంవత్సరాలపాటు అవి మా బాల్యాన్ని పంచుకునేవి. చేతిలో చేయి వేస్తూ, అలాగే కళ్లలోకి చూస్తూ, పిల్లీ, కుక్క మాకు ఆనందాన్ని పంచిపెట్టిన, మా కష్టాల్లో పాలుపంచుకున్న ఒకనాటి మా పల్లెజీవితాన్ని తల్చుకుంటేనే కన్నీరు చిప్పిల్లుతుంది.
జీవితం తన్నిన తాపుకు పల్లెలకు దూరమై అమాంతంగా ఇలా పట్నాలకు, మహానగరాలకు వచ్చి అద్దె ఇళ్లలో పడ్డాం కాని, లేకుంటే మా పల్లె మాకు బతుకు నిచ్చి ఉంటే, అక్కడ అవకాశాలు లేవని, వ్యవసాయం ఇక గిట్టబాటు కాదని, బతకలేమని నిర్ణయించుకుని పట్నం దారి పట్టి ఉండకపోతే ఇప్పుడు కూడా మాకూ ఒక కుక్కా, పిల్లీ తోడుగా ఉండేవి కదా..
అసలే పిల్లలు లేనివాళ్లం. ఉద్యమాల బాట పట్టి పిల్లలు వద్దనుకున్నవాళ్లం. ఇప్పుడు ఆ ఉద్యమాలూ లేక, పిల్లలూ లేక, పిల్లులూ కుక్కలూ లేక జానా బెత్తెడు ఇరుకు గదుల్లో మా పనులు మేము చేసుకుంటూ.. మా బతుకు మేము గడిపేస్తూ…
పిల్లలూ, జంతువుల రూపంలో లేలేత జీవిత మాధుర్యాన్ని కోల్పోయి ఇలా ఒంటరిగా బతకడం ఏంటో..
అడవి పిలిచింది మళ్లీ నాకు గుర్తుకొస్తోంది. విశ్వ విఖ్యాత రచయిత జాక్ లండన్ తానొక కుక్క అవతారమెత్తిన చందంగా, కుక్కతనాన్ని నిలువునా జీర్ణం చేసుకుని పలవరించిన చందంగా తీర్చిదిద్దిన మహా నవల అడవి పిలిచింది మళ్లీ గుర్తుకొస్తోంది.
పీకాక్ క్లాసిక్స్ వారు ప్రచురించిన ఈ నవలను 2005లో తొలిసారిగా చదివింది మొదలుకుని దాన్ని మర్చిపోవడం చేతకావడం లేదు.మానవుడితో కుక్క అనుబంధాన్ని.. కాదు కాదు.. కుక్కతో మానవానుబంధాన్ని మహిమాన్వితంగా అక్షరీకరించిన ఈ ప్రామాణిక రచనను రాత్రికి వీలైతే మళ్లీ ఒకసారి చదవాలనిపిస్తోంది.
జంతువుల కథలు మళ్లీ చందమామలో అగ్రస్థానం పొందితే, ఎక్కువగా ప్రచురించబడితే ఎంత బాగుంటుందో.. అనిపిస్తోంది..
దైవం మానవరూపంలో అని ఈమధ్యే సాయి నిర్యాణం సందర్బంగా ఒక కమ్మటి ఆస్తిక గీతాన్ని టీవీలలో విన్నాను. దైవం జంతువు రూపంలో అని మార్చుకుంటే కూడా బాగుంటుందేమో…
శంకర్ గారూ, లేస్తూనే ఇవ్వాళ మళ్లీ కమ్మటి మాటలతో కంట తడి పెట్టించారు. కుక్కా పిల్లీ దైవత్వ ప్రతిరూపాలు.. జంతు అనుబంధాన్ని కోల్పోయిన వాళ్లం…జీవితంలో ఎలా మర్చిపోగలం ఈ మాటల్ని… నిండు నూరేళ్లూ చల్లగా ఉండండి మాష్టారూ..
Filed under చందమామ శంకర్ | Comment (0)











