అంపశయ్య మీద ఉన్న బాలసాహిత్యాన్ని రక్షించుకుందామా!!!
ప్రియ మిత్రులకు అభివందనాలు,
మీకు భుజాన భేతాళుడిని చురకత్తిలాంటి చూపులతో మెలితిరిగిన కోరమీసంతో గంభీరంగా స్మశానంలోనుండి నడిచివెళ్తున్న విక్రమార్కుడు గుర్తున్నాడా?
మీకు ఒంటికన్ను రాక్షసుడు, అతనితో సాహసోపేతంగా యుద్ధం చేసి రాజకుమారిని ఆమె రాజ్యానికి తీసుకుని వస్తున్న సాహస వీరుడు గుర్తున్నాడా?
పోనీ మీకు మెలితిరిగిన తోకతో చూడగానే భయపెట్టేలా కాక ముద్దుగ అనిపిస్తూ, చెడ్డ అత్తగారి భరతం పట్టి మంచి కోడలికి సహాయం చేసిన అందమైన దెయ్యాలు గుర్తున్నాయా?
వీటిలో ఏ ఒక్కటి గుర్తున్నా మీరు చిన్నప్పుడు నాలాగనే ఖచ్చితంగా ఏ చందమామనో, బొమ్మరిల్లునో పదిలంగా దాచుకుని చదివిన అదృష్టవంతులు అయ్యి ఉంటారు. మరి మన ముందు తరం సంగతో ఇప్పటి పిల్లలకు బాల సాహిత్యం అంటే హ్యారీ పాటర్, టింటిన్, సిండ్రెల్లా మరోటో మరోటో మనది కాని సాహిత్యమే కానీ మనము గ్రోలిన రుచులు వారికేవి?
మంచి దెయ్యాల గురించి, సాహస వీరుల గురించి, భేతాళుడి గురించి వారికి తెలిసే అవకాశం ఎంత ఉంది, ఆ అవకాశం వారికి మనం ఎంతవరకూ ఇస్తున్నాము ఇంగ్లీషులో చదివితే గ్లోబల్ మార్కెట్ లో విలువ పెరుగుతుంది, నిజమే కానీ తెలుగులో అదీ వారి మాతృభాషలో అందమైన కథలున్నాయి, వాటిలో నీతితో పాటు బ్రతుకు మార్గాలు ఉంటాయని కానీ అసలు తెలుగులో కథలు ఇంత బాగుంటాయి అన్న అనుభవం కానీ వారికి మిగులుస్తున్నామా?
నా దృష్టిలో ఈ తరం పిల్లలు అత్యంత దురదృష్టవంతులు, మాతృ భాషలో మాట్లడటమే మహాపరాధంగా భావించే తల్లితండ్రులు, బడి యాజమాన్యాలు ఒకవైపైతే, మనసుని కట్టిపడేసే బాల సాహిత్యం అందుబాటులో లేకపోవటం మరొకవైపు. ఇప్పటి తరానికి ఆ లోటు ని పూడ్చటానికీ, ఆనాటి రుచులని అందించటానికి మొక్కవోని దీక్షతో నడుము కట్టారు రచన పత్రిక నిర్వాహకులు శాయి గారు.
ఈ బృహత్కార్యంలో భాగంగా ఆయన దాసరి సుబ్రమణ్యంగారు ఒకప్పుడు యువ, బొమ్మరిల్లు పత్రికలకోసం రచించిన అగ్ని మాల, మృత్యులోయ సీరియల్స్ను విడి సంపుటాలుగా ఈ యేడాది మొదట్లో మన ముందుకు తెచ్చారు. ఈ సారి అప్పట్లో ప్రమోద పిల్లల కథలో వచ్చిన కపాల దుర్గం సీరియల్ వచ్చే జనవరి నాటికి ప్రచురించబోతున్నారు. అలాగే దాసరిగారు చందమామకు కాకుండా ఇతర పత్రికలలో రాసిన మరొక ఇరవై సీరియల్స్ ను లభ్యత మేరకు మన ముందుకు తెచ్చే మెగా ప్రాజెక్టు కు సిద్ధ పడ్డారు.
ఈ బృహత్కార్యం లో ఆయనకు తెలుగు భాష మీద బాల సాహిత్యం మీద మక్కువ ఉన్న అభిమానుల అండదండల అవసరం చాలా ఉంది. మనం చేసే ఏ చిన్న సహాయమైనా చాలా విలువైనదే.
మీకు వీలున్నంత వరకూ ఎంత చిన్న ఆర్ధిక సహయమైనా సరే అది మనం ఒక రోజు ఆటో ఎక్కితే ఖర్చయ్యేంత చిన్నదైనా, ఒక రోజు ఏ పిజా హట్ కో వెళ్ళి సంబరాలు జరుపుకున్నంత పెద్దదైనా, మీకు తోచిన సహాయం అందించి ఈ కార్యాన్ని విజయవంతం చేయండి. బాల సాహిత్యాన్ని బ్రతికించండి.
ఈ లేఖని చదివి చెత్త బుట్ట లో కి నెట్టివేయకుండా మీకు తెలిసిన నలుగురు మిత్రులకి పంపండి. మనం నిత్యం ఎన్నో స్పాం లేఖలని పేరు పేరునా ఎందరో మితృలకి పంపుతాము, దానివల్ల ప్రయోజనం ఉన్నా లేకపోయినా. ఈ లేఖ చదివి ఏ కొంతమంది స్పందించినా మన భావి తరానికి చక్కటి సాహిత్యాన్ని వారు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా బహుమతిగా అందించిన వారము అవుతాము. ఆసక్తి ఉన్నవారు వాహిని బుక్ ట్రస్ట్ (vahini book trust)పేరిట చెక్ పంపించగలరు
స్పందించిన ప్రతివారికీ ముందస్తుగానే కృతజ్ఞతలు తెలుపుతూ
మీ నేస్తం
సాయి లక్ష్మి కోరాడ.
నేనెవరు
నేను వృత్తిరీత్యా సాంకేతిక నిపుణురాలిని, ప్రవృత్తి రీత్యా పుస్తకాభిమానిని, స్వస్థలం భాగ్యనగరం. నాతరం పిల్లలు చాలా మందిలాగానే తెలుగులో పుట్టి, పదవ తరగతి వరకూ తెలుగు మాధ్యమంలో చదివి, ఆ తెలుగు తీయతనానికి ముగ్ధురాలినై తెలుగు సాహిత్యం మీద మక్కువ పెంచుకున్న సామాన్యురాలిని. తెలుగులో ఉత్తమ సాహిత్యం కరువైపోతోంది అని బాధపడుతూ కూర్చోకుండా నాకు చేతనైనంతలో ఏదైనా చేయాలి అని తాపత్రయ పడుతున్న పాఠకురాలిని, అంతే.
(“నాతరం పిల్లలు చాలా మందిలాగానే తెలుగులో పుట్టి, పదవ తరగతి వరకూ తెలుగు మాధ్యమంలో చదివి, ఆ తెలుగు తీయతనానికి ముగ్ధురాలినై తెలుగు సాహిత్యం మీద మక్కువ పెంచుకున్న సామాన్యురాలిని.”
సాయి లక్ష్మి గారూ,
తెలుగును, బాలసాహిత్యాన్ని కలకాలం బతికించే చిన్ని మాటలండీ ఇవి.
చందమామ పట్ల, ఉత్తమ సాహిత్యం పట్ల మీ అభిమానం, ఆదరణ కొనసాగుతుందని, ఇలాగే కొనసాగాలని మనసారా కాంక్షిస్తూ..
మీకూ, మిత్రులకూ హృదయపూర్వక కృతజ్ఞతలు.
రాజు)
రచన శాయి గారి చిరునామా, ఈమెయిల్, ఫోన్
Y.V.S.R.N. Talpa Sai
Rachana magazine
1-9-286/2/p
yadlapati vari illu
vidyanagar,
near to Ramnagar Gundu
hyderabad – 500044
040-27071500
040-27077599
99485 77517
Emails
rachanapatrika@gmail.com
rachanapatrika@hotmail.com
www.rachana.net
Vahini book trust, 1-9-286/3, Vidya Nagar, Hyderabad -500044
NB: ఈ కథనం ఈ బ్లాగులో ప్రచురించడానికి వెనుక నేపథ్యం గురించి కామెంట్ విభాగంలో చూడగలరు.
పెద్ద గమనిక: ఈ ఏడాది జనవరిలో దాసరి సుబ్రహ్మణ్యం గారి మృత్యులోయ, అగ్నిమాల, దాసరి గారి కథల సంపుటికి స్వచ్చందంగా ఆయన ఆభిమానులు తమ శక్తి మేరకు తోడ్పాటు నందించారు. ఈ ప్రకటన వీరికి సంబంధించినది కాదు. గతంలో తోడ్పాటు నందించిన వారిపై మళ్లీ భారం పెట్టడం తగదని శాయిగారి దృఢాభిప్రాయం. వారు మినహా ఇతర బాల సాహిత్య అభిమానులకు మాత్రమే ఈ ప్రకటన వర్తిస్తుందని తెలియపరుస్తున్నాము.
రచనపై, శాయిగారిపై పడుతున్న అదనపు బారాన్ని కొంచెం తగ్గించినా చాలు అన్నదే ఈ ప్రకటన ఉద్దేశం.
Filed under దాసరి సుబ్రహ్మణ్యం | Comments (3)







