చందమామ చదవకుంటే?
చందమామ చదవకుంటే?
కోకిలమ్మ పాడకుంటే..
నెమలిఈక చూడకుంటే..
నేతిగారె తినకుంటే…
నీతికధలు వినకుంటే..
ఏం జరుగుతుంది?
పక్షులకు, పశువులకు, మృగాలకు లేని ఒక ప్రత్యేకత మానవునికి ఉంది. అదే విచక్షణ. ఇంగ్లీషులో “డిస్క్రిమినేషన్’. ఏది మంచి? ఏది చెడు? అని చెప్పగలిగిన శక్తి ఒక్కమనిషికే ఉన్నది. తతిమ్మా జాతులంతా స్వాభావికంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. మానవుడికి కావలసింది ప్రధానంగా దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి. మానవుడు సంఘజీవి. తోటివారిపట్ల ఎలా నడచుకోవాలి? ఇతరులు ఏవిధంగా ఉంటే మనకు సంతోషం? అనేవి నర్పేవే నీతికధలు.
పరవస్తు చిన్నయసూరిగారి “నీతిచంద్రిక’లో కధలన్నీ, రాజుగారి సోమరిపోతు పుత్రులు విని, ఉత్తములైనారు. కధలు ఎటువంటివారినైనా ఆకర్షిస్తాయి. మంచిమార్గాన్ని చూపిస్తూ దుర్మార్గులు, దుష్ట స్వభావులు, ధర్మ భ్రష్టులు, ఏవిధంగా అపకీర్తి పొందారో భారత, రామాయణాలు చెప్తాయి. విష్ణుశర్మ చెప్పిన కధల్లో పక్షులు, పశువులు నిజంగా మాట్లాడతాయా లేదా అనేది ప్రశ్న కాదు, వాటి సంభాషణ ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనేదే ప్రశ్న. విదురనీతి, సుమతీ శతకాలు నీతులు నేర్పేవేకదా! ఆకోవకు చెందినదే మన “అందాల చందమామ.”
గోరుముద్దలు పెడుతూ మంచి బుధ్ధులు నేర్పుతుంది అమ్మ. పసిపిల్లలకు మంచి చెడులు నేర్పుతూ నీతిముద్దలు పెడుతుంది “చందమామ’. నింగిలోని చందమామలో కూడా కొంతమచ్చ కనిపిస్తుంది. మన ప్రియతమ పత్రికలో ఏదైనా మచ్చ చూపించగలమా!? అందుకనే ఆబాల గోపాలమూ మెచ్చేపత్రిక ముఖ్యంగా పిల్లలకు నచ్చేపత్రిక. వెలసులభము. ఫలమధికము. ఇలా ఎంతైనా వ్రాయవచ్చు. అతిశయోక్తికానేకాదు.
చదివితే కధలెంత మధురమో, చిత్రాలు చూస్తే కళ్ళకు, మనస్సుకు అంత ఆనందం. చందమామ పత్రికను చూడగానే కొనని వారుండరు. అది అందించే పటిక బెల్లాన్ని తినని వారుండరు.
మా అబ్బాయి, అమ్మాయి, పసివాళ్ళుగ ఉన్నపుడు “శిళ్ళంగేరి’ గ్రామంలో, అని మొదలయ్యే చందమామ కధలు చదువుతూ, రాత్రి నిద్రించేవారు. (ఇవి చందమామ సీనియర్ కథకులు శ్రీ కోలార్ కృష్ణ అయ్యర్ గారు రాసే కథలు)
ఇపుడు అమ్మాయికి 37 ఏళ్ళు, అబ్బాయికి 35 ఏళ్ళూ, ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, ఐనా ఈనాటికీ చందమామ చదవాల్సిందే!
అమెరికా చికాగోలో ఉంటున్న మా అబ్బాయి సైతం మొన్న బెంగుళూర్ వచ్చినపుడు ‘శిళ్ళంగేరి’ రచయిత, కోలార్ కృష్ణయ్యర్ గారి కధల గురించీ, మాట్లాడుకున్నాం.
నేను ముఖస్తుతికి ఈమాటలు అనడంలేదు. ఆ అమృతాన్ని గ్రోలుతూ , అనుభవిస్తూ, వ్రాస్తున్న మాటలివి. చిన్నపిల్లలతోపాటుగా పెద్దలకూ మానవత్వపు విలువలను, మంచితనాన్నీ, సద్గుణాలనూ గుర్తుచేసే పత్రిక చందమామ.
అప్పటినుండీ (1947) ఇప్పటివరకూ నిరాటంకంగా, నిర్విరామంగా, పత్రికకై చేస్తున్న కృషికి, సంపాదక వర్గానికీ, సహకరించే సిబ్బందికీ సవినయంగా నమస్సుమాంజలులు సమర్పిస్తున్నాను.
చంద్రుని కాంతి లోకానికి అందినంతకాలం’ చందమామ పత్రిక నిలవాలని, నిత్యం వెలగాలనీ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను.
ఆదూరి శ్రీనివాసరావు,
లెక్చరర్, సత్యసాయి ఇనిస్టిట్యూట్
బెంగళూరు
(చందమామ చదవకుంటే కోకిలమ్మ పాడకుంటే, నెమలి ఈక చూడకుంటే.. అంటూ చందమామను శిఖరస్థాయిలో నిలిపి ఉంచిన ఈ మామంచి మాష్టారు గారు కావలి జవహర్ భారతి కాలేజీలో కామర్స్ పాఠాలు చెప్పారు. తర్వాత పుట్టపర్తి సాయి ప్రభావంతో బెంగళూరు వైట్ఫీల్డ్ ఆధ్వర్యంలోని సాయి కళాశాలలో ఉచితంగా విద్యార్థులకు బోధిస్తున్నారు. ఆధ్యాత్మికతను నిలువెల్లా పుణికిపుచ్చుకున్న మాష్టారుగారు భారత రామాయణాలు, నీతి శతకాలు, చందమామ కథలు మానవ నీతినియమాలకు పట్టం కట్టే సంస్కృతీ వారసత్వ చిహ్నాలుగా కొనియాడతారు.
‘పాతికేళ్ల క్రితం మీ కావలి కళాశాలలో నేనూ తెలుగు అధ్యాపకుడిగా అతి తక్కువకాలం పనిచేశాన’ని చెబితే ఎంత సంతోషపడ్డారో. ఈ దంపతులిరువురు -ఆదూరి హైమవతి, మాస్టారు- అమెరికాకు పిల్లలవద్దకు వెళ్లినప్పుడే సాయి అస్తమించడం వారికి శరాఘాతమైంది.
ఆధ్యాత్మికతను, ఆస్తికత్వాన్ని పక్కన బెట్టి చూస్తే సాయి బోధించిన ప్రేమ తత్వాన్ని పాటించడంలో నిస్వార్థంగా పిల్లలకు సేవలందించడంలో ఈ ఉపాధ్యాయ దంపతులు తమకు తామే సాటి. ప్రజలను సేవించటం అనే గొప్ప భావనను సమస్త వ్యవస్థలూ వదిలివేస్తున్న పాడుకాలంలో సాయి సంస్థల రూపంలో వ్యక్తులు ప్రదర్శిస్తున్న పరమ సేవాతత్వానికి అచ్చమైన ప్రతీకలు వీరు.)
శ్రీ శ్రీనివాసరావు మాస్టారు గారికి,
కోరగానే మీరు తక్షణం స్పందించి పంపిన చందమామ జ్ఞాపకాలను మెయిల్ ద్వారా అందుకున్నాము. చందమామనే చదవకుండా ఉంటే… అంటూ ఆ రోజు మీరు ఫోన్లో మాట్లాడిన మాటలను మళ్లీ అవే అక్షరాలలో పెట్టి మీరు పంపిన ఈ జ్ఞాపకం హృద్యంగా ఉంది.
మీకు, మీ కుటుంబానికి ఒక మంచి వార్త. మీ దంపతులూ, మీ అబ్బాయి, అమ్మాయి ఏ శిళ్లంగేరి కథల రచయిత గురించి మీ జ్ఞాపకాల్లో దశాబ్దాలుగా భద్రపర్చుకుంటూ వస్తున్నారో, ఆ చందమామ రచయిత శ్రీ కోలార్ కృష్ణ అయ్యర్ గారి చిరునామా ఇక్కడఇస్తున్నాము.
ఆయనకు ఇప్పడు 85 ఏళ్లు. ఈరోజుకీ పిల్లల సాహిత్యంపట్ల అపారమైన మక్కువతో ఆయన కథా సంపుటాలు ప్రచురిస్తూనే ఉన్నారు. ఆంగ్లంలో ఇంతవరకు 40పైగా బాల సాహిత్య సంకలనాలు తీసుకువచ్చారు. ఇంకా 60 పుస్తకాలకు పథకం రచించి పెట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన చందమామతో సంబంధం లేరు. గత సంవత్సర కాలంగా మాత్రమే ఆయనతో పరిచయమై కొనసాగుతోంది. ఆయన కొత్త కథలు కూడా వరుసగా నాలుగైదు ఈ మధ్యే ఎంపికయ్యాయి.
మీ జ్ఞాపకాల్లో చిరస్మరణీయంగా ఉంటున్న ఈ కథల మహర్షి చిరునామా కింద ఇస్తున్నాను. తప్పకుండా ఆయనతో నేరుగా ఫోన్లో మాట్లాడి ఆ మధుర క్షణాలను ఆస్వాదించండి.
ఎంత మంచి పాఠకులను, ఎంత మంచి కథకుడిని కలుపుబోతున్నామో తల్చుకుంటే మనసు పరవశిస్తోంది.
Sri Kolar Krishna Iyer
18-1-416,
Bhavani Nagar
Tirupathi-517501
Chittor (Dist)
Ap
Land line : 0877-2251715
(ఇటీవలే ఆయన తాత్కాలికంగా బెంగళూరుకు నివాసం మార్చినట్లున్నారు. తిరుపతి చిరునామా కొనసాగుతుంది.
3 Responses to “చందమామ చదవకుంటే?”
Leave a Reply








కృష్ణ అయ్యర్ గారు రాసిన శిళ్ళంగేరి అనే గ్రామం ఎక్కడ ఉందా అని చిన్నప్పుడు చాలా రోజులు వెతికాను..
ఇప్పుడు మీ వ్యాసం చదువుతుంటే ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి.. ఎన్నో నెనర్లు..
కార్తీక్ గారూ, శిళ్లంగేరి గ్రామం చివరకు కనుగొన్నారా లేదా.. వీలైతే మీరు తిరుపతిలో ఉన్న రచయిత ల్యాండ్ లైన్కి ఫోన్ చేసి కనుక్కోగలరు. అబినందనలు.
శ్రీనివాసరావు గారి జీవన సహచరి ఆదూరి హైమవతి గారు ఆయన చందమామ జ్ఞాపకాలు ఈ పోస్టులో చూసి పంపిన మెయిల్ భాగాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాము. ఆమె విశ్వాసాలను గౌరవిస్తూనే, చివరి శ్వాసవరకూ చందమామతో సత్సంబంధం నిలవాలనుకుంటన్న వారి ఆకాంక్షలు ఫలించాలని మనసారా కోరుకుంటున్నాము.
“మాదైవమైన బాబా మాకు మంచిగుణాలునేర్పి స్వార్ధ పరులం కాకుండా సమాజసేవే సాయిసేవ అనీ,work is worship అనీ నేర్పడం వలన కనీసం మానవులమని చెప్పుకునే స్థాయిలో ఉన్నాం. అలాంటి మాదైవం మమ్ము వీడివెళ్ళడం నిజంగా మాకు విచారకరం. సమయానికి మేము ఇండియాలో లేకపోడమూ బాధే. ఏది ఏమైనా వారు నేర్పిన మానవతావిలువలు, మంచిమాటలు., సద్గుణాలు చందమమ ద్వారా పిల్లలతోనూ, పాఠకులతోనూ పంచుకునే అవకాశాన్ని మీ రూపంలో స్వామే మాకు చూపారని నిండుగా విశ్వసిస్తున్నాను. మాకు స్వామివారు నేర్పిన అంశాలను పంచుకునే చక్కని రాజ బాట ‘చందమామగా’ నమ్ముతూ నా చివరి శ్వాసవరకూ చందమామతో సత్సంబంధం నిలవాలనీ, మాదైవం మమ్ము అలా ఆశీర్వదించాలనీ కోరుకుంటూ..”
చిరకాల చందమామ చదువరి,
ఆదూరి.హైమవతి.
351-RaymondnRd,
Bafelo grove,
chicago,
USA.