ప్రపంచ సంస్కృత పుస్తక ప్రదర్శనశాల – చందమామ
సంస్కృత భాషాభిమానులకు, పాఠకులకు, విద్యార్థులకు, పరిశోధకులకు మంచి వార్త. ప్రపంచంలోనే మొట్టమొదటి సంస్కృత పుస్తక ప్రదర్శన 2011 జనవరి 7-10 మధ్య బెంగళూరులో బసవనగుడి నేషనల్ కాలేజీ గ్రౌండ్లో జరుగుతోంది. ప్రపంచ స్థాయిలో జరుగుతున్న ఈ విశిష్ట కార్యక్రమంలో సంస్కృత చందమామ కూడా తన స్టాల్ని ప్రదర్శిస్తోంది. (స్టాల్ నంబర్ 132)
బెంగళూరులోని బసవనగుడి నేషనల్ కాలేజీలో నిర్వహిస్తున్న ఈ తొలి ప్రపంచ స్థాయి సంస్కృత బుక్ పెయిర్లో దాదాపు 500 కొత్త సంస్కృత పుస్తకాలను విడుదల చేయనున్నారు. వందమంది సంస్కృత భాషా ప్రచురణ కర్తలు ఈ పుస్తక ప్రదర్శనలో పాలు పంచుకోనున్నారు. అరుదైన ఈ పుస్తక ప్రదర్శనకు ప్రవేశ రుసుములేదు. అందరూ ఆహ్వానితులే. సంస్కృత భాషతో కాస్త పరిచయం ఉన్న, లేని అన్ని వయస్సుల వారికీ ఈ పుస్తక ప్రదర్శన ఉచితం.
భారతీయ సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టే ఈ బుక్ ఫెయిర్ జనవరి 7 నుంచి 10 దాకా నాలుగురోజుల పాటు జరుగనుంది. 500 కొత్త సంస్కృత పుస్తకాల ఆవిష్కరణతోపాటు సులభ సంస్కృతంలో కాన్సర్టులు, నాటికలు, పప్పెట్ షోలు, మోడల్ హోమ్స్, మార్కెట్ ప్లేస్లు వంటి ప్రదర్శనలు జరుగుతాయి.
ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న సంస్కృతంలో జరుగుతున్న ఈ పుస్తక ప్రదర్శనను చూడండి, విశ్వసించండి, హత్తుకోండి అంటూ నిర్వాహకులు పిలుపునిచ్చారు.
లక్ష్యాలు
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సంస్కృత సంబంధిత ప్రముఖ సంస్థలన్నీ కలిసి సంస్కృతాన్ని, దాని సుసంపన్నమయిన భాషా పునాదిని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ఈ పుస్తక ప్రదర్శనను తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆధునిక సంస్కృత పరిశోధన, సాహిత్యాన్ని కొత్తమలుపుకు తీసుకుపోవడం, సంస్కృతభాషలో నూతన సృజనలు చేసి ప్రచురించేలా సంస్కృత పరిశోధకులను ప్రోత్సహించడం, సంస్కృత ప్రచురణలకు మార్కెట్ని కల్పించడం. సంస్కృతాన్ని భవిష్యత్ కెరీర్ మార్గంగా ఎంచుకునే విషయమై సంస్కృత విద్యార్థులలో ఆత్మవిశ్వాసం ప్రోది చేయడం ఈ పుస్తక ప్రదర్శన లక్ష్యాలు.
సంస్కృత భాషతో పరిచయం ఉన్న, లేని ప్రజలందరికీ ఈ పుస్తక ప్రదర్శన ఉచిత సందర్శనను అనుమతిస్తున్న్టట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొంటున్న వలంటీర్లందరూ సరళ సంస్కృతంలో మాట్లాడుతూ ప్రాంగణం మొత్తాన్ని సంస్కృత వాతావరణంతో గుబాళింపజేస్తారని, వీరి సరళ సంస్కృత సంభాషణలను అన్ని వయస్కుల వారు సులభంగా అర్థం చేసుకుని ఆస్వాదిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు.
పుస్తక ప్రదర్శన నిర్వాహకులు
రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్
కర్నాటక ప్రభుత్వం
దేశంలోని అన్ని సంస్కృత విశ్వవిద్యాలయాలు, అకాడమీలు
ప్రాచ్య పరిశోధనా సంస్థలు
సంస్కృత పోస్ట్ గ్రాడ్యుయేట్ శాఖలు
నేషనల్ మాన్యుస్కిప్ర్ట్ మిషన్,
సంస్కృత్ ప్రమోషన్ ఫౌండేషన్
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సంస్కృత్ స్టడీస్, పారిస్
సంస్కృత భారతి
కార్యక్రమ విశేషాలు
సంస్కృతంపై వివిధ స్థాయిల్లో అవగాహన ఉన్న దాదాపు లక్ష మంది దేశ విదేశాలనుండి ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొననున్నారు.
ఇక్కడ నిర్వహించనున్న కాన్పరెన్స్లో పదివేల మంది సంస్కృత పరిశోధకులు ప్రతినిధులుగా రానున్నారు. భారతదేశం వెలుపల ఉన్న 24 సంస్కృత సంస్థల ప్రతినిధులు ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొంటున్నారు.
బెంగళూరు నగరంలోనే, 1008 సంస్కృత సంభాషణా శిబిరాలను ఈ ప్రదర్శన శాల ప్రారంభానికి రెండు నెలల ముందునుంచే అంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించారు.వీటి ద్వారా కనీసం 30 వేలమంది కొత్తగా సంస్కృతాన్ని మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. వీరంతా తమ మిత్రులు, బంధువులతో కలిసి పుస్తక ప్రదర్శనకు రానున్నారు.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బెంగళూరు నగరంలో ఈ శుక్రవారం నుంచి సోమవారం దాకా -జనవరి 7-10- నిర్వహిస్తున్నారు.
మరిన్ని వివరాలకు కింది వెబ్సైట్ చూడండి
http://www.samskritbookfair.org/
వివిధ సుప్రసిద్ధ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బృహత్ పుస్తక ప్రదర్శనశాలలో చందమామ పత్రిక 132వ స్టాల్లో చందమామ ప్రత్యేకించి, సంస్కృత చందమామలను ప్రమోషన్ కోసం ఉంచుతోంది. ఆసక్తి కలిగి ప్రదర్శనశాలకు వెళ్లేవారు చందమామ స్టాల్ని కూడా తప్పక సందర్శించగలరు
వేదిక: బెంగళూరులోని బసవనగుడి నేషనల్ కాలేజీ గ్రౌండ్
గమనిక: దాదాపు సంవత్సరం తర్వాత ప్రాంతీయ చందమామ జనవరి సంచికలు జనవరి తొలి వారంలోనే మార్కెట్లోకి వెళ్లాయని వార్త. శ్రీనివాస కల్యాణం సీరియల్తో సహా 14 కొత్త కథలతో – ఈ 20 ఏళ్లలో ఇదే మొదటిసారి- పత్రిక మునుపటి సైజులో -పాత చందమామ కంటే కొంచెం చిన్నసైజుతో- మార్కెట్లోకి వచ్చింది.
test Filed under ప్రపంచ సంస్కృత పుస్తక ప్రదర్శన | Comment (0)Leave a Reply







