కథల మాంత్రికుడు దాసరి గారి సంస్మరణ

దాసరి సంస్మరణ
(ఇటీవల కన్ను మూసిన చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ మంగళవారం హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సభకు హాజరైన వేణుగారు చందమామ కోసం కోరగానే సభ వివరాల నివేదికను శ్రమకోర్చి పంపారు. వేణుగారికి కృతజ్ఞతలు. “కథల మాంత్రికుణ్ణి స్మరించుకున్నాం!” అనే పేరిట ఆయన తన బ్లాగులో కూడా ఈ సంస్మరణ సభపై మంచి కథనం పోస్ట్ చేశారు.
వేణుగారు పంపిన ఈ సమావేశ వివరాలను యధాతథంగా ఇక్కడ పొందుపరుస్తున్నాము. చిత్రకారులు అన్వర్ గారు కూడా ఈ సభకు హాజరై విశేషాలను ఫోన్ ద్వారా పంచుకున్నారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు. ఈ కథనం కోసం వేణు గారి బ్లాగులో పోస్ట్ చేసిన ఫోటోలు, రచన శాయి గారు పంపిన పోటో కూడా ఉపయోగించుకుంటున్నాం. వారికి ధన్యవాదాలు.)

నిన్న 16-02-2010- హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరంలో దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ జరిగింది. బాలసాహిత్య పరిషత్ ఈ సభను నిర్వహించింది. సభకు రామవరపు గణేశ్వరరావు అధ్యక్షత వహించారు.
వాసిరెడ్డి నారాయణ రావు: దాసరి గారు అంతర్ముఖుడు. అయితే తెలిసినవాళ్ళ దగ్గర అలా ఉండేవారు కాదు. తన ఇబ్బందులను ఇతరులకు ఏమీ తెలియనీయకుండా జాగ్రత్తపడే ఆత్మగౌరవం ఆయనది. పరిణామ క్రమంలో మనిషి రెక్కలు పోగొట్టుకున్నాడంటూ కథల్లో రెక్కల మనుషులను సృష్టించారు. మరో ప్రపంచంలోకి పాఠకులను తీసుకువెళ్ళిన రచయిత.

అట్లూరి అనిల్ : దాసరి సుబ్రహ్మణ్యం గారు చాలా నిరాడంబరంగా ఉండేవారు. చూపు నిశితంగా ఉండేది.సాహిత్య సభలకు వచ్చేవారు కాదు.కానీ వాటి విశేషాలు అడిగి తెలుసుకునేవారు. నేనంటే ఆయనకు చాలా ప్రేమాభిమానాలుండేవి. మదరాసులో ఉన్నపుడు తన కంటే ఎంతో చిన్నవాణ్నిఅయినా నాకోసం వెతుక్కుంటూ వచ్చేవారు.
రచన శాయి: దాసరి గారితో నాకు పరిచయం లేదు. అయితే ఆయన రచనలంటే అభిమానం, ప్రేమ. అందుకే ‘రచన’ఏప్రిల్ సంచికను ఆయన ప్రత్యేక సంచికగా తీసుకువస్తున్నాం. ఆయన చిన్నపిల్లల కథలే కాకుండా పెద్దవాళ్ళ కథలు కూడా రాశారు. శ్రీకాకుళం కథా నిలయంలో ఆయనవి 25 కథలు దొరికాయి. దాసరి సుబ్రహ్మణ్యం గారి పేరిట చందమామ తరహా కథను ‘రచన’లో ప్రతినెలా వెయ్యాలనే సంకల్పం ఉంది. చందమామ బొమ్మల్లాగే వేసే ఆర్టిస్టు చేత అలాగే బొమ్మలు వేయించాలని అనుకుంటున్నాం.
దాసరి వెంకటరమణ: దాసరి సుబ్రహ్మణ్యం గారిని మద్రాసులో ఒకసారీ,విజయవాడకు వచ్చాక 2008లో ఒకసారీ కలిశాను. ఇంటిపేరు ఒకటే తప్ప వారితో బంధుత్వమేదీ నాకు లేదు. చందమామకు నేను పంపిన రచనలను ఆయన ఇష్టపడేవారు. అంతటి గొప్ప రచయిత నా రచనలు బావున్నాయంటే ఆ అనుభూతి ఎంత గొప్పదో చెప్పటం కష్టం.
ఆయన మనసు సున్నితం. గట్టివాడు, మొండివాడు. జనాలతో ఎవరితోనూ కలవడు.

తోకచుక్క అరిష్టం అనే భావన మూఢనమ్మకమనే అంతర్లీన సందేశాన్ని ఆ సీరియల్లో అందించారు. ఆసక్తికరంగా, రోమాలు నిక్కబొడుచుకునేలా, ఒళ్ళు గగుర్పొడిచేలా ఆయన రాసేవారు. ఆయన కథనంలో చదివించే గుణం ఎక్కువ.
చొక్కాపు వెంకటరమణ, గీతా సుబ్బారావు , మరికొందరు దాసరి గారి గురించి తమ ప్రసంగాల్లో స్మరించుకున్నారు. ఆయన రచనలను పాఠకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.
…. వేణు.
వేణుగారి కథనాన్ని తన స్వంత బ్లాగులోనూ, మనతెలుగుచందమామ బ్లాగులో ఆడియోరూపంలో కూడా కిందిలింకులలో చూడవచ్చు.
కథల మాంత్రికుణ్ని స్మరించుకున్నాం!
http://venuvu.blogspot.com/2010/02/blog-post.html
ఇదే కథనాన్ని ఈ కింద ఇచ్చిన బ్లాగులో కూడ చూడవచ్చు. అక్కడ వ్యాసాన్ని ఆడియోలో కూడ వినవచ్చు.
http://manateluguchandamama.blogspot.com/
Leave a Reply







