చందమామ గుండె పగిలిన వేళ…!

శిధిలాలయం - చిత్రా
ఆయన… భారతదేశంలోని పిల్లలందరి ముఖాలూ వికసించడానికి చందమామలో ‘చిత్ర’జ్యోతులు వెలిగించిన ఓ మహనీయుడు. 1950, 60, 70ల కాలంలో విశేష ప్రాచుర్యం పొందిన చందమామ కార్యాలయాన్ని సందర్శించిన వేలాది దక్షిణ భారత ప్రజలు, ఉత్తరాది వారు కూడా ప్రత్యేకించి ఈ మేటి చిత్రకారుడి చూడటానికి ఆసక్తి, ఆత్రుత ప్రదర్శించేవారు.
దీన్ని బట్టే ఓ మూడు దశాబ్దాల చందమామ పాఠకులపై ఆయన వేసిన ప్రభావం ఏమిటో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. చిత్రలేఖనంలో ఎటువంటి శిక్షణ పొందకున్నప్పటికీ, స్వయం కృషితో అభ్యాసం చేసి, చిత్రకళలో నైపుణ్యం సంపాయించి, దేశవ్యాప్తంగా ఆబాలగోపాలాన్ని దశాబ్దాల పాటు అలరిస్తూ వచ్చిన సాటిలేని హస్త నైపుణ్యం ఆయన సొత్తు.
కథల పత్రికలో బొమ్మలు వేయడానికి సంబంధించి చక్రపాణి గారి మనో ప్రపంచంలో రూపొందిన శైలిని తన చిత్రకళా నైపుణ్యంతో ఒక వరవడిగా తీర్చిదిద్దిన ఘనత ఈ మహనీయ చిత్రకారుడిదే. కథ లేదా ధారావాహికకు సంబంధించి మొదటినుంచి చివరివరకూ ఒకేలాగ ఉండేలా పాత్రలకు ఆయన గీసిన బొమ్మలు అటు పిల్లలను ఇటు పెద్దలను కూడా అబ్బురపరచేవి.
చందమామ కథలతో పాటు చందమామ ధారావాహికలకు నభూతో నభవిష్యతి లాగా ఆయన వేసిన బొమ్మలు చందమామ పాఠకుల జ్ఞాపకాలలో దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా, చిరస్థాయిగా నిలిచిపోయాయి. కథ గొప్పా, కథకు గీసిన బొమ్మ గొప్పా అని పరీక్ష పెడితే రెండూ సమానంగా నిలిచేంత చరిత్రకు కారణభూతమైన చిత్రకళానైపుణ్యం ఆయన స్వంతం.
చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యంగారి అపూర్వ సృష్టిగా నిలిచిపోయిన రాకాసి లోయ, ముగ్గురు మాంత్రికులు, శిధిలాలయం, రాతి రథం మొదలైన చందమామ ధారావాహికలకు ఆయన గీసిన బొమ్మలు, ఎంతగానో పాఠకుల మెప్పు పొందటానికి, చందమామ ప్రాచుర్యం పెరగటానికి తోడ్పడినాయి.
ఆయనే చందమామ అద్భుత చిత్రకారుడు చిత్రా గారు. చందమామలో వస్తున్న చిత్రాల శిల్పం సృష్టించిన వారు చిత్రా. ఆయన చిత్రాలు చందమామలో సుమారు పదివేలు వెలువడ్డాయి. తెలుగులో పిల్లల పత్రికలన్నీ కూడ, చందమామ పత్రిక ఏర్పరిచిన ఆనాటి చిత్రకథా పంథానే ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నాయి.
ప్రారంభించినది మొదలుగా చందమామ ప్రధాన చిత్రకారుడిగా ఉండి, బారతదేశమంతటా అనేక లక్షలమందికి అభిమానపాత్రుడైన గొప్ప చిత్రకారులు ’చిత్రా’ గారు. ఆయన 1947నుంచి మూడు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా చందమామలో పనిచేస్తూ 1978 మే 6న కన్నుమూశారు.
చిత్రా వెలిగించిన జ్యోతి ఎన్నటికీ ఆరదు
‘భారతదేశంలోని పిల్లలందరి ముఖాలూ వికసించడానికి చిత్రా వెలిగించిన జ్యోతి ఎన్నటికీ ఆరదు’ అని 1978 జూన్ చందమామ సంచికలో చిత్రాగారిపై శ్రద్ధాంజలిని ప్రచురించారు. చక్రపాణి గారి అస్తమయం తర్వాత ‘చిత్రా’ అస్తమయం చందమామకు తీరని లోటని ఈ శ్రద్ధాంజలి పేర్కొంది.
అది చందమామ గుండె పగిలిన సందర్భం. నిజంగానే చందమామ చిత్రాలకు తీరని లోటుగా మిగిలిన దుర్ఘటన. చందమామ తదుపరి భవిష్యత్తునే యాదృచ్చికంగా ఊహించిన అరుదైన ఈ శ్రద్ధాంజలిని చందమామ పాఠకులకోసం అందిస్తున్నాం.
చిత్రా గారి అస్తమయం వార్తను చందమామలో రాసినవారు కొడవటిగంటి కుటుంబరావు గారు.
ఈ శ్రద్ధాంజలి పూర్తి పాఠం కోసం కింది లింకుపై క్లిక్ చేయండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2277
మీ స్పందనను abhiprayam@chandamama.com కు పంపండి.
గమనిక: చిత్రాగారి అరుదైన జీవిత వివరాలకు త్వరలో ఇక్కడే చూడగలరు.
Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Comments (2)2 Responses to “చందమామ గుండె పగిలిన వేళ…!”
Leave a Reply






‘చిత్రా’ గారి బొమ్మలను అమితంగా అభిమానించేవాళ్ళలో నేనూ ఒకణ్ణి. ఆయన గీసిన బొమ్మల గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. ఆయన అరుదైన జీవిత వివరాల కోసం ఎదురుచూస్తుంటాను.
వేణుగారూ చిత్రాగారి జీవిత వివరాల వరకు మాత్రమే లభ్యమైన మేరకు పొందుపర్చటం జరుగుతుంది. పోతే చిత్రా, వపా, శంకర్, ఆచార్య గార్లు తదితర చిత్రకారుల చిత్రాల విశేషాలను మీ వంటి వారే రాస్తే మంచిది. మీరు చిత్రాగారి బొమ్మల గురించి వివరంగా పెద్ద వ్యాసమే రాస్తానని చెప్పారు. ఎదురుచూస్తున్నాము. జీవితవివరాలు అవసరమనుకుంటే మీరు ఆన్లైన్ చందమామలో, ఈ బ్లాగులో పొందుపర్చే వివరాలు ఉపయోగించుకోవచ్చు.