సైన్స్ రచనల్లో సరికొత్త ఒరవడి: కొడవటిగంటి రోహిణీ ప్రసాద్
అంతర్జాలంలో, ప్రత్యామ్నాయ పత్రికల్లో, దినపత్రికల్లో పాపులర్ సైన్స్ రచయితగా ఒక మెరుపులా మెరిసి అర్థాంతరంగా మననుంచి వెళ్లిపోయిన మంచి రచయిత కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు. ఒక మిత్రురాలు అన్నట్లుగా…. మనకి అభివృద్ధితో కూడిన ఆధునిక జీవనాన్ని అందించిన పాత తరం క్రమేపీ కనుమరుగయిపోతోంది.. ఆ జాబితాలో రోహిణి ప్రసాద్ గారి పేరు కూడా చేరింది. ‘నాకైతే కుటుంబరావుగారే మరో సారి కన్ను మూసినట్టు అనిపించింది’ అన్నారామె.
తనకు పట్టున్న విషయాలను అందరికీ పంచిపెట్టడంలో అసాధారణ నైపుణ్యం చూపడమే కాదు. భావప్రచారం కోసం ఇంటర్నెట్ను, ప్రింట్ మీడియాను ఇంత విస్తృతంగా ఉపయోగించుకున్న రచయిత ఇటీవలి కాలంలో లేరని చెప్పాలి. సంవత్సరాలుగా వెంటాడుతున్న మధుమేహాన్ని కూడా ధిక్కరించి ఇంత తీవ్రాభినివేశంతో రచనలు చేసిన మరొక రచయితను ఈ మధ్య కాలంలో మనం చూసి ఉండం. మానవ సమిష్టి శ్రమ ఫలితమైన సాంకేతిక ఆవిష్కరణలను ఉపయోగించుకోవడంలో షరా మామూలుగానే వెనుకబడుతున్న ప్రగతిశీల సంస్థలను, పత్రికా నిర్వహణకర్తలపై ఆయన ఎన్ని మొట్టికాయలు వేశారో మరి.
తను కొన్న పుస్తకాన్ని, తన వద్దకు వచ్చిన పుస్తకాన్ని వెంటనే చదవటం, దానిపై పది ముక్కలు రాసి పంపటంలో అసాధారణ వేగాన్ని చూపిన తండ్రి కొడవటిగంటి కుటుంబరావు గారి సాహిత్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారీయన.
జీవిత విశేషాలు
అణుభౌతిక శాస్త్రవేత్త, పాపులర్ సైన్స్ రచయిత, సంగీతకారుడు, వక్త కొడవటిగంటి రోహిణీప్రసాద్ గత ఐదు సంవత్సరాలలో ఏడు పాపులర్ సైన్స్ పుస్తకాలు ప్రచురించి దాదాపు పది పత్రికలలో శాస్త్రవిజ్ఞాన విషయాలను సుబోధకంగా విరివిగా రాస్తున్న రచయితగా, ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్ర విజ్ఞాన విషయాలపై ప్రసంగాలు చేస్తున్న వక్తగా తెలుగు సమాజంలో సుప్రసిద్ధులయ్యారు.
సుప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు – వరూధిని దంపతుల కొడుకుగా రోహిణీప్రసాద్ డిగ్రీ వరకు మద్రాసులో చదువుకున్నారు. చిన్ననాటి నుంచి శాస్త్రీయ సంగీతం మీద చాలా ఆసక్తి కనబరిచి సితార్ వాదన అభ్యసించారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అణు భౌతిక శాస్త్రంలో ఎంఎస్సీ చేసి, ట్రాంబేలోని భాభా అణు పరిశోధనా కేంద్రం (బార్క్)లో శాస్త్రవేత్తగా చేరారు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి అణుధార్మికత అన్వేషణ సాధనాల గురించి పరిశోధనా పత్రానికి పి.హెచ్.డి పొందారు. మూడు దశాబ్దాలుగా బొంబాయిలోనే ఉద్యోగం చేసిన రోహిణీప్రసాద్, ఉద్యోగ విరమణ తర్వాత అమెరికాలోని అట్లాంటాలో కొంతకాలం కన్సల్టెంట్గా పనిచేశారు. ఇటీవల ఇసిఐఎల్లో కన్సల్టెంట్గా పనిచేయడానికి హైదరాబాద్ వచ్చారు.
బొంబాయి రోజుల నుంచే రోహిణీప్రసాద్లో సంగీత, సాహిత్య అభిరుచులు ఎంతగానో విస్తరించాయి. పాపులర్ సైన్స్ రచనలు చేయడం ప్రారంభించారు. పదవీ విరమణ అనంతరం ఆయన సాహిత్య సృష్టి మరింతగా విస్తరించింది. సైన్స్ వ్యాసాల తొలి సంపుటం ‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’ 2008లో వెలువడింది. అప్పటి నుంచీ ఆయన తెలుగులో ప్రధాన స్రవంతి పత్రికలలోనూ, ప్రత్యామ్నాయ పత్రికలలోనూ పాపులర్ సైన్స్ వ్యాసాలు రాస్తూ వచ్చారు. మధుమేహం కారణంగా తీవ్ర అస్వస్థతతో ముంబై జస్లోక్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 8న కన్నుమూశారు. తన శరీరాన్ని మట్టిలో కలపడం కాకుండా, వైద్యపరిశోధనల కోసం ఆసుపత్రికి ఇవ్వాలన్న ఆయన కోరికను కుటుంబం నెరవేర్చింది.
విస్తృతస్థాయి రచనలు
ప్రజాసాహితి, వీక్షణం, అరుణతార, విశాలాంధ్ర, ఆంధ్రభూమి, ది హాన్స్ ఇండియా వంటి పత్రికలు… ఈమాట.కామ్, ఎపివీక్లీ.కామ్, పొద్దు.నెట్, ప్రజాకళ. ఒఆర్జి, ప్రాణహిత.ఒఆర్జి వంటి వెబ్సైట్లలో సైన్స్, సంగీతం, భాష, సాహిత్యం, విశిష్టవ్యక్తులతో జ్ఞాపకాలు,.. ఇలా గత పన్నెండేళ్లుగా ఎంతో వైవిధ్యపూరిమైన రచనలను శరవేగంగా విస్తృత స్థాయిలో అందించిన ప్రజా రచయిత రోహిణీ ప్రసాద్.
తండ్రి కొ.కు. మార్క్సిస్ట్ పదజాలాన్ని వాడకుండా, సామాజిక, ఆర్థిక పరిణామాలను ప్రగతిశీల కోణం నుంచి విశ్లేషిస్తూ కల్పనాసాహిత్యంలో కొత్త పుంతలు తొక్కి చరిత్ర సృష్టిస్తే,, తనయుడు కమ్యూనిజం పేరెత్తకుండా శాస్త్రీయతకు, అశాస్త్రీయతకు మధ్య ఉన్న తేడాను ఎవరినీ నొప్పించకుండా వీలైనంత సయమనంతో, అందరినీ ఆలోచింపజేసేలా రాయడంలో నిష్ణాతుడయ్యారు.
ఆయన గడిపిన చివరి సంవత్సరాలు వ్యక్తిగా తనను తీవ్రమైన అధ్యయనానికి, విస్తృతమైన రచనావ్యాసంగానికి అంకితం చేసి ఉండవచ్చు. అదే సమయంలో పాపులర్ సైన్స్ రచనా ప్రక్రియ తన ద్వారా ఒక కొత్త ఒరవడిని అందుకుంది. ఎక్కడా సిద్ధాంతం పేరెత్తకున్నప్పటికీ, సైన్స్ ఆవిష్కరణల పరిణామాన్ని హేతుపూర్వకంగా వివరించడంలో విశ్లేషించడంలో, సూటిగా విషయాన్ని అన్ని వర్గాల పాఠకులకు అందించి అర్థం చేయించడంలో అసాధారణ నైపుణ్యం చూపిన ప్రజ్ఞాశాలి ఈయన.
సైన్స్ పరిశోధనలు ఆవిష్కరిస్తున్న తాజా పరిణామాలను ఎంత సులభ శైలిలో ఆయన పేర్కొంటారో, ఆ పరిణామాలను వివరిస్తున్నప్పుడు చిన్న చిన్న పదబంధాలతో ఆయన చేసే వ్యాఖ్యలు ఎన్నో మెరుపు వాక్యాలను సృష్టించాయి. తన ప్రధాన రచన కంటే తను చేసిన వ్యాఖ్యలు మళ్లీ మళ్లీ చదువుకోవాలనిపించేంత ఆసక్తి కలిగిస్తాయి. అలాగని మూల పాఠాన్ని తేలికపరుస్తున్నట్లు కాదు.
వెంట్రుకవాసిలో ర్యాంకును, సీటును లేకుండా చేసే పోటీ ప్రపంచపు పరుగుపందెంలో, సాఫ్ట్వేర్ మాయాజాలంలో పడి పుస్తక అధ్యయనం అంటే ఏమిటో తెలియనంతగా కొట్టుకుపోతున్న యువతరం కూడా ఆయన రచనలను విశేషంగా చదవటం ప్రారంభించిందని తెలిసినప్పుడు ఆయన నూటికి నూరుపాళ్లూ తన లక్ష్య సాధనలో విజయం సాధించినట్లే లెక్క. ఒకే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పవలసి వచ్చినప్పుడు అనివార్యంగా కనిపించే పునరావృత్తి లోపం కూడా గమనించనంతగా తన రచనలు మనల్ని ముందుకు నడిపిస్తాయి.
‘జీవశాస్త్ర విజ్ఞానం సమాజం’ అనే పుస్తకం ప్రజాసాహితి ప్రచురించిన ఆయన తొలి పుస్తకాల్లో ఒకటి. వృత్తిరీత్యా పరమాణు శాస్త్రవేత్తే అయినప్పటికీ, జీవపరిణామ శాస్త్రంలో జరుగుతున్న విప్లవాత్మమైన ఆవిష్కరణలను విభ్రమంగా పరిశీలిస్తూ తన దృష్టికి వచ్చిన ప్రతి కొత్త భావనను తెలుగు మాత్రమే తెలిసిన పాఠకులకు వివరించాలనే అభిప్రాయంలో రచయిత రాసి ప్రచురించిన విలువైన వ్యాస సంపుటి ఇది. ఇవి కేవలం శుద్ధ సైన్స్ వ్యాసాలే అయితే వాటికి ఇంత ప్రాచుర్యం లభించేది కాదేమో.
ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపై గతితార్కిక దృక్పథం నుండి చేసిన వ్యాఖ్యలు, వ్యంగ్యోక్తులు, చురకలు, నిక్కచ్చి విమర్శలతో కూడుకోవటంతో రచయిత సైన్స్ వ్యాసాలకు విశిష్ట ప్రాముఖ్యత లభించింది. ఈ వ్యాసాలు చదువుతున్నప్పుడు ఎంగెల్స్ 130 సంవత్సరాల క్రితం అప్పటి సైన్స్ పరిణామ గతిపై రచించిన ప్రామాణిక పుస్తకం ‘డయలెక్టిక్స్ ఆఫ్ నేచుర్’ గుర్తొచ్చిందంటూ ఈ పుస్తకం పరిచయకర్త అతిశయ రహితంగానే చెప్పారు.
దైవశక్తి కాదు… భౌతిక శక్తి…
“దేవుడున్నాడని వాదించేవారితో లేడని చెప్పడంతో ఊరుకోకుండా జరుగుతున్న సంఘటనల వెనక ఎటువంటి భౌతిక శక్తులు పనిచేస్తాయో హేతువాదులు వివరించగలగాలి. అని “భౌతిక వాద దృక్పధం ఆవశ్యకత’ అనే వ్యాసంలో సూచించిన రచయిత మూఢవిశ్వాసాలకు కొత్తరంగులు పులుముకుంటూ, వాటిని బలపరచడం తమ జన్మహక్కయినట్లు ప్రవర్తించే ఆధునిక ఆటవికులపై అనేక వ్యాసాల్లో వ్యంగ్యవిమర్శలు చేశారు.
‘ఈరోజు మనమనుకున్నది రేపు తప్పు కావచ్చు’ అనే ఏకవాక్యం ద్వారా శాస్త్రీయ ఆలోచనలు నిత్య ప్రయోగాలతో ఎలా మారుతూ వచ్చాయో అత్యంత స్పష్టంగా వివరించారు. 19వ శతాబ్దంలో సమాజంలో ఉనికిలో ఉన్న అనేక సత్యాలు 20వ శతాబ్దపు నూతన ఆవిష్కరణల వెలుగులో పాక్షిక సత్యాలుగా, అసత్యాలుగా తేలిపోయాయని, యావత్తు మానవ, సమాజ పరిణామాల విజ్ఞానం ఇలా సత్యాసత్యాల నిర్దిష్ట ప్రయోగ ప్రక్రియల్లోంచే నిగ్గుదేలుతూ వస్తోందని, స్తంభించిన ఆలోచనలకు, అజ్ఞానానికి సంబంధించిన మతభావనలకు, ప్రకృతిలోని రహస్యాలను నిరంతరం వెదుకుతూ, పాతభావనలను సరిదిద్దుతూ, తిరస్కరిస్తూ కొత్త భావనలను ఊహించే శాస్త్ర భావనలకు ఏరకంగానూ పొత్తు కుదరదని తేల్చిచెప్పారు.
అదే సమయంలో ప్రాచీన కాలపు ప్రజల విశ్వాసాలు అప్పటి పరిమితమైన సైన్స్లో భాగమేనని చెప్పడంలో రచయిత ఏమాత్రం వెనుకాడలేదు. సంతానోత్పత్తి సామర్థ్యానికి ప్రతీకలైన అమ్మతల్లి బొమ్మలు, లింగరూపాలు వంటివి తమ మనుగడకు మేలు జరుగుతుందని నమ్మిన ప్రజలు చేస్తూవస్తున్న తంతులేనని, ఇవి అప్పటి సమాజ శ్రేయస్సు కోసం జరిపిన తంతులే తప్ప, మతం పేరుతో అల్పసంఖ్యాకులు ఇతరులను మభ్యపెట్టే దశ అప్పటికింకా ప్రారంభం కాలేదని చెబుతారు. ప్రాచీనుల సామూహిక జీవిత అవసరాల్లో భాగంగా ఏర్పడిన ఈ రకమైన తంతులను వివరించే కృషి కూడా సైన్స్లో భాగమేనంటారు.
ప్రకృతిలోని ప్రతి పరిణామాన్ని సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తూ వచ్చిన ప్రాచీన మానవులు, గుహల్లో మారుమోగే చప్పుళ్లకు, ప్రతిధ్వనులకు కూడా అతీత శక్తులను ఆపాదించి ఉంటారని, ప్రపంచమంతటా ప్రాచీన ఆరాధనా స్థలాలలో పుట్టిన మంత్రోచ్చాటనలకు శక్తిని ఆపాదించడం వెనుక ఇదే దాగి ఉందని రచయిత వ్యాఖ్యానిస్తారు. మంత్రాల ఉచ్చారణకు ఇప్పటికీ మన దేశంలో ఎంతో శక్తిని ఆపాదించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తారు.
‘అమరమైనది’ ఆత్మకాదు. ‘జన్యుపదార్థం’
చావుపుటకలు అనే వ్యాసంలో ‘ఆత్మకు చావు లేదు’ అనే సాంప్రదాయ భావనకు వ్యతిరేకంగా సైన్స్ పరంగా అద్భుత వ్యాఖ్య చేశారీయన. మనవాళ్లు అనుకుంటున్నట్లుగా మనలో ‘అమరమైనది’ -శాశ్వతమైనది- ఆత్మకాదు. ‘జన్యుపదార్థం’ అని తేల్చి చెబుతూ షాక్ కలిగిస్తారు. ఎన్నో సంవత్సరాలు బతికి, ఆలోచించి, నవ్వి, ఏడ్చి, ఏదో ఒకనాడు శ్వాస పీల్చడం మానేసిన మనిషి ఉనికికి చావు అనేది శాశ్వతమైన అంతం అని అంగీకరించడానికి ‘మనసొప్పదు’. కానీ జీవపరిణామానికి మరణం అనేది తప్పనిసరి అవసరం అంటూ రిచర్డ్ డాకిన్స్ -’Selfish Gene,’ ‘The Blind watchmaker’ గ్రంథాల రచయిత- భావనను పరమ తార్కికంగా వ్యాఖ్యానిస్తారు రచయిత.
చచ్చిన తర్వాత మనలో ‘నశించనిది’ ఏదీ ఉండదని, మనిషి శరీరం యంత్రపరంగా నూట యాభై ఏళ్లకు మించి ‘నడవద’ని, అది అరిగి, తరిగి, శిథిలమవుతుందని, అందుకే నూట ఇరవై దాటిన ‘శతాధిక’ వృద్ధులెవరూ ప్రపంచంలో ఉండరంటూ సంభ్రమం గొలిపించే వ్యాఖ్య చేస్తారు. మొత్తం మీద జీవపరిణామంలో చావు అనేది ప్రకృతి పరంగా చూస్తే లాభదాయకం -cost effective-. నానాటికీ అరిగిపోయే ప్రతి ప్రాణి శరీరాన్ని బాగుచేస్తూ కలకాలం మన్నేట్టు చెయ్యడం కంటే ఆ శరీరంలో పనికొచ్చే పదార్థాన్ని కొత్త శరీరంలో ప్రవేశపెట్టి ముసలి శరీరాన్ని అవతలికి నెట్టడమే ప్రకృతికి సులభం అవుతుంది. కాబట్టి పనికొచ్చే పదార్థం అంటే మనలో జన్యుపదార్థమేనని పేర్కొంటూ ఆత్మల శాశ్వతత్వాన్ని, అమరత్వాన్ని చావు దెబ్బ కొడతారు.
అన్నిటినీ ఆడించే శక్తి, అన్నిటిని సృష్టించిన సృష్టికర్త అనే ఆటవిక దశలోని మానవుల మానసిక భావనలను ఆధునిక సైన్స్ పూర్వ పక్షం చేస్తోందని, ప్రాణులు పుట్టడం, పెరుగుదల, వాటిలో కలిగే శారీరక మార్పులు వంటి వాటన్నింటినీ నియంత్రించడం సాధ్యమేనని విజ్ఞానశాస్త్రం నిరూపిస్తోందని, మనిషే సృష్టికర్త అవుతున్న ప్రస్తుత కాలంలో ‘విశ్వామిత్ర సృష్టి’ని ఎవరైనా చేయవచ్చని సవాలు చేస్తున్నారు రోహిణీ ప్రసాద్.
“జీవరాశి చరిత్ర యావత్తూ డిఎన్ఎ తదితర జన్యుపదార్థాలన్నీ తమను తాము పునసృష్టి చేసుకునే కార్యక్రమం మాత్రమే. ప్రాణులన్నీ ఇందుకు తల ఒగ్గవలసిందే. ఇందులో వివేకమూ, వివేచనా మొదలైనవాటికి స్థానం ఉన్నట్లు కనబడదు” అని వ్యాఖ్యానించడం ద్వారా దైవ సృష్టి భావనను ఎదుర్కొన్నారీయన.
అలాగే మనుషులందరూ సమానం కాదనే విషయం జన్యు స్థాయిలో కూడా సరైనదే అని తేలుతోందని, కాని ఈ విషయం సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి మనని ప్రేరేపించాలి. బలహీనులను గాలికి వదిలేయకుండా కాపాడుకుని, జంతువులకు, మనకు భేదం ఉందనేని నిరూపించాలి అని వ్యాఖ్యానించడం ద్వారా జన్యుపరమైన అసమానతలను సమాజంలోని అసమానతలతో సరిచేసి పోల్చరాదని సూచిస్తారు.
‘జీవశాస్త్ర విజ్ఞానం సమాజం’ అనే పుస్తకం పొడవునా రోహిణీ ప్రసాద్ గారు గుప్పించిన స్పూర్తిదాయకమైన వాక్యాలూ, వ్యాఖ్యలను మనం ఇక్కడ చూడవచ్చు.
“దీర్ఘాయుస్సు కలిగించే ప్రత్యేక జన్యువు ఏదీ లేదు కానీ మనకు మంచి ఆరోగ్యాన్ని, పటుత్వాన్ని ఇవ్వగలిగిన జన్యువులు చాలానే ఉన్నాయి.
చావు అనేది జన్యువుల అంతిమ వైఫల్యం అనుకోవచ్చు. అలాగే ముసలితనం కూడా క్రమంగా జరిగిన, జరుగుతున్న జన్యుపరమైన క్షీణత అని భావించవచ్చు.
‘అమరత్వం’ సిద్ధించకపోయినా ఆయుర్దాయం పెరుగుతుంది.”
–చావు గురించి వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న జడాత్మక తాత్విక భావనల స్థానంలో ‘జన్యువుల అంతిమ వైఫల్యమే చావు’ అనే భావనను మనకాలపు సైంటిస్టు మాత్రమే ప్రతిపాదించగలడు.
“కష్టాల్లో ఉన్నవాళ్లు దేవుణ్ణి తలుచుకున్నట్లుగా, ప్రపంచవ్యాప్తంగా అంటురోగాలు లేదా వాటి గురించిన భయం పెరిగినప్పుడల్లా ప్రజల్లో సైన్స్ విషయాల పట్ల కాస్త ఆసక్తి పెరుగుతుంది.
ఇప్పుడు మనకున్న స్వాతంత్ర్యమల్లా టీవీలు చూస్తూ ఇండియన్ ఐడల్ గురించి ఎస్ఎమ్ఎస్లు పంపటమే.
పక్కవాడికేసి చూడకుండా బస్సుల్లో కూర్చున్నప్పుడు కూడా చెపుల్లో పెట్టుకు వినడానికి సీడి ప్లేయర్లూ, కేసెట్ ప్లేయర్లూ ఉన్నాయి. మరీ గుబులు పుడితే మొక్కుకోవడానికి దేవుళ్లూ, బాబాలూ, జైలుకెళ్లని స్వాములార్లూ ఉండనే ఉన్నారు.
పొట్టకోసం చదివే చదువులూ, సైన్సూ ఒంటబట్టే అవకాశం ఎలాగూ లేదు కనక అదంతా మర్చిపోయిన ‘విద్యాధికులు’ అన్నిటినీ ఆడించే పవరు గురించి ఊహలల్లుకుంటూ ఉంటారు.
అన్నిటికీ అతీతంగా ‘జన్మరాహిత్యం’ సాధించడమే గొప్ప అని ప్రతిపాదించబడింది. ప్రాణమూ, స్పృహా అన్నీ త్యజించాక ‘గొప్ప’ అనే భావన ఎలా కలుగుతుందీ ఎవరికీ తెలీదు.”
‘నొసటి రాత’ నొసటి మీద కాక అతి సూక్ష్మ జీవకణాల్లో నిక్షిప్తమై ఉందనడంలో సందేహం లేదు.
–పైవాటిలో ఏ వాక్యం చూసినా, సమాజ నడకపై, అవాంఛనీయ విశ్వాసాలపై తీవ్రమైన సెటైరే కనబడుతుంది మనకు.
“క్షణాల్లో రోగాలు నయం చేసెయ్యగలమని మందుల కంపెనీలు కేకలు పెట్టడంతో మామూలు ప్రజలు ప్రతిదానికీ ఇటువంటివి వాడటం మొదలుపెడితే జబ్బుకన్నా చికిత్సే ప్రమాదకరం అవుతుంది.”
–రోగనిరోధానికి అవసరమైన మందులు మాత్రమే ఇవ్వకుండా ఎంత చిన్న పెద్ద డాక్టరైనా సరే విటమిన్ టాబ్లెట్లు ఇస్తున్నాడంటే అతడు పూర్తిగా మందుల కంపెనీలకు అమ్ముడుపోయినట్లే లెక్క. నూటికి 75 శాతం వ్యాధులు కేవలం ఆహారం తీసుకోవడం ద్వారానే తగ్గిపోతాయని డాక్టర్ సమరం గారు పాతికేళ్లుగా మొత్తుకుని చెబుతున్నా మనం వినం. మన దగ్గరి సందులోని డాక్టర్ మాటంటే అంత గురి మనకు. సూదిమంది పొడిస్తేనే వాడు సరైన డాక్టర్ అనే ఒకప్పటి పల్లెజనం నమ్మకం ఎంతమంది డాక్టర్లకు బతుకునిచ్చిందో మరి.
జన్యుప్రయోగాల్లో… మూడుకాళ్ల కోడిపిల్లలనూ, ఆవులంత పాలివ్వగలిగిన ఎలుకలనూ శాస్త్రవేత్తలూ కృత్రిమంగా సృష్టించగలుగుతున్నారంటే ప్రాణుల ఎదుగుదలను నియంత్రించే ప్రక్రియలను అర్థం చేసుకున్నారని తెలుస్తోంది.
పాశ్చాత్య దేశాల్లో పనిచేసే చాలామంది శాస్త్రవేత్తలు దైవసృష్టిని ఏ మాత్రమూ నమ్మనివారే. ఎటొచ్చీ వాళ్లు మన భౌతికవాదుల్లాగా మార్క్సిస్టులై ఉండకపోవచ్చు. మార్కిజానికి వ్యతిరేకులైనా కావచ్చు. వారి ప్రయోగాలు మాత్రం హేతువాదానికి బలం చేకూర్చుతాయి. ఆ వివరాలు కొన్నయినా తెలుసుకోవడం భౌతికవాదులకు అవసరం.”
–సిద్ధాంతంపై అతిప్రేమ, సిద్ధాంత వ్యతిరేకులపై గుడ్డి వ్యతిరేకత ఏ సమాజానికైనా మంచిది కాదు. మార్క్సిస్టు వ్యతిరేకుల ప్రయోగాలు కూడా హేతువాదానికి బలం చేకూర్చుతాయనడంలో రచయిత జీవిత కాలసాధన ద్వారా పొందిన అనుభవమే కనబడుతుంది మనకు.
“పునరుత్పత్తికి జీవకణాలు ప్రస్తుతపు ఆత్మహత్య పద్ధతిని ‘ఎన్నుకున్నాయంటే’ జీవపరిణామ క్రమంలో తక్కిన పద్ధతుల కన్నా ఇదే బలంగా నిలవగలిగిందని ఊహించాలి. ఇది ప్రకృతి సిద్ధంగా ‘అతీత శక్తుల’ ప్రమేయమేమీ లేకుండా జరిగిన పరిణామం.”
–జీవరాసుల చావు పుట్టుకల ప్రక్రియలో దాగిన ‘ప్రకృతి ఎంపిక’ను ఎంత ప్రభావవంతంగా రచయిత ఇక్కడ చెప్పారో చూడండి మరి. అందుకే ముసలితనం, చావు అనేవి ప్రకృతిపరంగా ‘విధివిధానం’ అనిపిస్తాయంటారీయన. 300 కోట్ల సంవత్సరాలనుంచి జీవకణాలు తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు తట్టుకుంటూ తమ మనుగడనీ, సంతానోత్పత్తిని కొనసాగించడానికి విజయవంతంగా ప్రయత్నించిన ఈ కణాల ఫార్ములాయే ‘చావుపుట్టుకలు’ అంటూ జీవన్మరణ రహస్యాన్ని సైన్స్ పరిభాషలో నిర్వచిస్తారు రచయిత.
“డైనోసార్ల పుట్టుక, ఎదుగుదల ప్రక్రియ భూమ్మీద 16 కోట్ల సంవత్సరాలు కొనసాగిందంటే ఇది ఎంత విజయవంతమైన జీవపరిణామమో ఊహించుకోవచ్చు… మనవాళ్లకు డైనోసార్ల సంగతి తెలిసి ఉంటే దాన్ని కూడా విష్ణువు అవతారంగా అభివర్ణించేవారేమో కాని, ఈ భయంకర ప్రాణులను ఏ దేవుడు ఏ ఉద్దేశంతో అన్ని కోట్ల ఏళ్లు ఉండేట్టు సృష్టించాడో, అవి ఎందుకు అంతరించాల్సి వచ్చిందో పురాణాలు చెప్పవు. సైన్స్ మాత్రం అతి సామాన్యమైన కారణాలతో వివరణలిస్తుంది.”
“వ్యక్తుల బలహీనతల్ని ఉపయోగించుకునే దొంగస్వాములూ, నిజాయితీగానే తప్పుడు నమ్మకాలను ప్రచారం చేసే మహనీయులూ తెలిసి కొందరూ, తెలియక కొందరూ అనేకమందిని తప్పుదారి పట్టిస్తున్నారు. జలుబును ఏమాత్రం నయం చెయ్యని ఇన్హేలర్లలాగా మూఢనమ్మకాల, తప్పుడు వేదాంతమూ చాలామందికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తున్నాయనేది నిజమే. అయినా యధార్థమేమిటో తెలుసుకోవడం ఆధునిక మానవుడికి జన్మహక్కు వంటిది. అది విప్లవానికి ఆయుధం కూడా.”
పరమాణువు నుంచి జీవ పరిణామం వరకు…
పతాక స్థాయికి చేరిన రచయితలోని ఈ భావ స్పష్టత వృత్తి జీవితం నుంచే తనకు అలవడినట్లుంది. పరమాణు భౌతికశాస్త్రంలో 70 పరిశోధనా పత్రాలు, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, భౌతికవాదంలో మరో 300 వ్యాసాలు రాసిన ఈ ఘనాపాఠి… బాబా అణు పరిశోధన కేంద్రంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ‘You shape the work. Work shapes you.’ అనే భావనను నమ్ముకున్నారట. “ఏ పనినీ వద్దనే ప్రసక్తేలేదు. అలా ఏ పనినైనా దిగ్విజయంగా చేసే స్థాయికి వెళ్ళాను. చేసే ప్రతిపనినీ, అంతర్జాతీయ సదస్సులకు పంపే ప్రతి పేపర్ను ఇతరుల దృక్కోణం నుంచి చూడటం, విస్పష్టంగా, ఎటువంటి సందేహాలకూ తావులేకుండా రాయడం, చెప్పాలనుకన్న విషయాన్ని సూటిగానూ, అర్ధమయ్యేరీతిలో కమ్యునికేట్ చేయడం వీటిపైనే నా దృష్టి అంతా వుండేది. బహుశా ఈ స్కిల్ నేను పెరిగిన వాతావరణం, నేను చదివిన పుస్తకాలే నాకు ఇచ్చాయి. తెలుగులోకి అనువాదమైన రష్యన్ సాహిత్యం, సైన్స్ పుస్తకాలు, నాన్న రచనలు నేను మొదటిగా చదివిన పుస్తకాలు. చిన్నతనంలో మా నాన్న ఏర్పరచిన వాతావరణమే దీనికి కారణం.”
“పరమాణు శాస్త్రవేత్తనైన నేను జీవశాస్త్రం వ్యాసాలు రాయాలనుకోవడం మరో మలుపు. అదీ ఆసక్తి వున్న సాధారణ మనిషికి బోధపడే రీతిలో రాయాలనుకోవడం … సాహసమే. అయితే నేను దానిలో విజయం సాధించాననే అనుకుంటాను. గతితార్కిక భౌతికవాదాన్ని నమ్మడంతో, ప్రజలందరూ బహుముఖ పార్శ్వాలను కలిగివుండే సమాజం సాధ్యమేనని నమ్మడంతో ఇప్పుడు మన పని ముగిసిపోవడంలేదు. దానిని ఆచరిస్తూ, పదిమందికీ చెప్పడమనే అవసరం రోజురోజుకూ మరింత విస్పష్టంగా కళ్ళముందు గోచరిస్తోంది. నా దారి నాకు స్పష్టంగా కనబడుతూనే వుంది.’’ (అరుణపప్పు గారి బ్లాగ్ నుంచి)
ప్రపంచంలోనే అతి కష్టమైన పని ఏదో చెప్పండిరా చూద్దాం అంటూ చిన్నప్పుడు స్కూల్లో మా తెలుగు మాస్టారు ప్రశ్నించేవారు. కొండలెక్కడం, బరువుమోయడం అంటూ మా అనుభవంలో మాకు తెలిసినదల్లా జవాబే అనుకుని చెప్పేవాళ్లం. అన్నిటినీ ఖండించి మా మాస్టారు ఒక చిన్నమాటతో తేల్చేసేవారు.
ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని ఏమిటంటే ‘సులభంగా రాయడమేరా’ అనేవారాయన.
రోహిణీ ప్రసాద్ గారు అలా సులభంగా రాయడాన్ని సాధించారు. అది శాస్త్రం కావచ్చు, శాస్త్రీయ సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరినీ చదివించే సరళశైలి రచనలను ఆయన తెలుగు సమాజానికి అందించారు.
సైన్సుకు సంబంధించిన పుస్తకాలతోపాటు ఆయన అంతర్జాలంలో సరళమైన రీతిలో తెలుగులోవ్యాసాలు రాసారు. వాటిలో ప్రతి ఒక్కటీ విలువైనదే. పరిచయమున్న వారందరికీ షాక్ కలిగిస్తూ ఆయన ఇంత అర్థాంతరంగా పోవడం వారి కుటుంబానికి, మిత్రులకూ ఎంత నష్టమో, తెలుగు పాపులర్ సైన్స్ రచనా ప్రక్రియకు అంతకంటే అధిక నష్టం.
గత నాలుగేళ్లలో ఆయన రాసిన ‘జీవ శాస్త్ర విజ్ఞానం-సమాజం’, ‘మానవ పరిణామం’, ‘విశ్వాంతరాళం’, ‘జీవకణాలు-నాడీకణాలు’, ‘ప్రకృతి-పర్యావరణం’, ‘మనుషులు చేసిన దేవుళ్లు’, ‘అణువులు’ వంటి సైన్స్ పుస్తకాలు పాఠకులను ఆలోచింపజేయడమే కాకుండా సైన్స్ విషయాల్లోని సంక్లిష్టతను తొలగించాయని ప్రతీతి పొందాయి.
ప్రతి హేతువాదీ, భౌతికవాదీ, సామాజిక కార్యకర్తా రోహిణీ ప్రసాద్ గారి సైన్స్ రచనలను స్వంతం చేసుకోవాలి, నిబద్ధతతో అధ్యయనం చేయాలి.
ఆయన వదిలివెళ్లిన రచనలు చదివే బాధ్యత మనపై ఉంది. వినమ్రంగా ఆయనకు మనం ఇవ్వగలిగే నివాళి ఇదొక్కటే మరి.
(This full length article was edited and published in Prajasakthi daily paper and website on 16-09-2012 by same heading. Now i am posting this full article for broder purpose. My heartious thanks to Prajasakthi and perticularly its Rajamundry edition chief Mr. Satya ji for his friendly support. I couldn’t type this in telugu as i am not having unicode font in my hand now.)
K.Raja Sekhara Raju
07305018409
Hyderabad
Filed under Kodavatiganti Rohiniprasad | Comment (0)
రోహిణీ ప్రసాద్ సంస్మరణ సభ
అణుభౌతిక శాస్త్రవేత్త, పాపులర్ సైన్స్ రచయిత, సంగీతకారుడు, వక్త కొడవటిగంటి రోహిణీప్రసాద్ సంస్మరణ సభ సెప్టెంబర్ 15 (శనివారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో జరుగుతుంది. ఎన్. వేణుగోపాల్ సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. దివికుమార్, గీతా రామస్వామి, కాకరాల, బాబు గోగినేని, వరవరరావు తదితరులు వక్తలుగా పాల్గొని ప్రసంగిస్తారు. గత ఐదు సంవత్సరాలలో ఏడు పాపులర్ సైన్స్ పుస్తకాలు ప్రచురించి దాదాపు పది పత్రికలలో శాస్త్రవిజ్ఞాన విషయాలను సుబోధకంగా విరివిగా రాస్తున్న రచయితగా, ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్ర విజ్ఞాన విషయాలపై ప్రసంగాలు చేస్తున్న వక్తగా రోహిణీప్రసాద్ తెలుగు సమాజంలో సుప్రసిద్ధులయ్యారు.
సుప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు – వరూధిని దంపతుల కొడుకుగా రోహిణీప్రసాద్ డిగ్రీ వరకు మద్రాసులో చదువుకున్నారు. చిన్ననాటి నుంచి శాస్త్రీయ సంగీతం మీద చాలా ఆసక్తి కనబరిచి సితార్ వాదన అభ్యసించారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అణు భౌతిక శాస్త్రంలో ఎంఎస్సీ చేసి, ట్రాంబేలోని భాభా అణు పరిశోధనా కేంద్రం (బార్క్)లో శాస్త్రవేత్తగా చేరారు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి అణుధార్మికత అన్వేషణ సాధనాల గురించి పరిశోధనా పత్రానికి పి.హెచ్.డి పొందారు. మూడు దశాబ్దాలుగా బొంబాయిలోనే ఉద్యోగం చేసిన రోహిణీప్రసాద్, ఉద్యోగ విరమణ తర్వాత అమెరికాలోని అట్లాంటాలో కొంతకాలం కన్సల్టెంట్గా పనిచేశారు. ఇటీవల ఇసిఐఎల్లో కన్సల్టెంట్గా పనిచేయడానికి హైదరాబాద్ వచ్చారు.
బొంబాయి రోజుల నుంచే రోహిణీప్రసాద్లో సంగీత, సాహిత్య అభిరుచులు ఎంతగానో విస్తరించాయి. పాపులర్ సైన్స్ రచనలు చేయడం ప్రారంభించారు. బొంబాయిలోని కాలనిర్ణయ్ పంచాంగంక్యాలెండర్లో తెలుగు సాహిత్యాన్ని చేర్చడంలో సహాయం చేశారు. పదవీ విరమణ అనంతరం ఆయన సాహిత్య సృష్టి మరింతగా విస్తరించింది. సైన్స్ వ్యాసాల తొలి సంపుటం ‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’ 2007లో వెలువడింది. అప్పటి నుంచీ ఆయన తెలుగులో ప్రధాన స్రవంతి పత్రికలలోనూ, ప్రత్యామ్నాయ పత్రికలలోనూ పాపులర్ సైన్స్ వ్యాసాలు రాస్తూ వచ్చారు. సమాజంలో శాస్త్రీయ దృష్టిని పెంపొందించడానికి విద్యార్థుల స్థాయి నుంచే పాపులర్ సైన్స్ ఉపన్యాసాలు ఏర్పాటు చేయాలనీ, తాను ఎక్కడికైనా వచ్చి ఉపన్యాసం ఇస్తాననీ చెపుతూ ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద చోట్ల ఉపన్యసించారు.
- కొడవటిగంటి రోహిణీప్రసాద్ మిత్రులు
(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)
http://andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/sep/14/edit/14edit6&more=2012/sep/14/edit/editpagemain1&date=9/14/2012
Filed under Kodavatiganti Rohiniprasad | Comment (1)
సంగీత, సాహిత్య, శాస్త్రాల మేలుకలయిక: కె. రోహిణీ ప్రసాద్
మనిషి సాధించవలసిన జ్ఞానార్జన స్పెషలైజేషన్ పేరిట ముక్కలుగా విభజించబడుతున్న కాలంలో మనముంటున్నాం. ఫలితంగా ఒక కోర్సును మాత్రమే మనం చదవగలం. జీవితమంతా ఒక వృత్తిలోనే మనం ఉండగలం. ఒక మనిషి రెండు, మూడు రంగాల్లో ప్రవేశించటం సాధ్యమేమో కాని అన్నింటిలో నిష్ణాతుడు కావడం మన కాలంలో కష్టసాధ్యం.
సమాజం ఏర్పర్చిన ఈ రకం జ్ఞాన విభజననుంచి బయటపడిన అరుదైన వ్యక్తి కొడవటివటిగంటి రోహిణీప్రసాద్. అరవైమూడేళ్ల వయస్సులో గత శనివారం అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారీయన. సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత అయిన రోహిణీప్రసాద్ పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశారు.
మనిషి సజీవంగా ఉండాలంటే బహుముఖంగానే ఉండాలన్నది కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి నమ్మిక. ఈ విశ్వాసమే జీవితాంతం ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. ఈ విషయంలో కొడవటిగంటి కుటుంబరావు గారి కౌటుంబిక, సాహిత్య, సాంస్కృతిక, శాస్త్రీయ వారసత్వానికి ఈయన ప్రతిరూపం.
తదనంతర జీవితంలో మూడున్నర దశాబ్దాలపాటు భాభా అణు పరిశోధనా కేంద్రం -బార్క్-లో రేడియేషన్ సెంటర్లో హెడ్గా పనిచేసిన ఈయనకు జీవితం చివరివరకూ సంగీతంపై వ్యామోహం పోలేదు. సంగీతం, సాహిత్యం, శాస్త్రం మూడింటిలో అభిరుచి, ఆసక్తులను చివరివరకూ కొనసాగించడం మన సమాజంలో అరుదైన ఘటన. ఒక వ్యక్తి ఇన్ని రంగాల్లో ప్రావీణ్యత చూపడం, తుదివరకు వాటిపై తన ముద్ర వేయడం కూడా ఆయనకు కుటుంబ నేపధ్యంలోంచే సాధ్యమైంది.
ఇంట్లో సాహిత్య వాతావరణం, తండ్రివల్ల ప్రజాస్వామిక, శాస్త్రీయ దృక్పధం తోడుగా ఈయన చిన్నప్పటినుంచే వివిధ జ్ఞాన రూపాలపై ఆసక్తి పెంచుకున్నారు. చిన్నప్పుడు అక్క, తమ్ముడితో చదువుల పోటీలో సున్నా మార్కులే వస్తుంటే తండ్రి కుటుంబరావుగారు అన్న ఒక్క ముక్క ఆయన జీవితాన్ని నిప్పుకణంలా వెలిగించింది. “చదువుకోకపోతే ఎవరికి నష్టం? వాళ్లే మట్టికొట్టుకుపోతారు” అంటూ కొ.కు. చేసిన ఒకే ఒక వ్యాఖ్య ఈయన జీవితమంతటినీ అలర్ట్ చేసింది. ‘సంగీతజ్ఞానం తప్ప వీడికి చదువురాదు’ అని కుటుంబం నిశ్చితాభిప్రాయానికి వచ్చేసినప్పటికీ కొ.కు. గారి ఆ వ్యాఖ్యే తన భావిజీవితాన్ని అణుపరిశోధనల వరకు నడిపించిందంటారీయన.
చదువులో సున్నలు వచ్చినా సంగీతం అంటే చిన్నప్పటినుంచే చెవికోసుకునేవారు. తండ్రి కొ.కు. అద్భుతంగా వాయించే హార్మోనియం పెట్టెపైనే తను కూడా వాయిస్తూ పొల్లుపోకుండా రాగాలు నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే పద్యాలు, పాటలు రాయడం, వాటికి రాగాలు కట్టడం, నృత్యరూపకాల్ని రూపొందించడం అలవడింది. ఉన్నత విద్య చదువుకుంటున్న విశాఖపట్నంలో సితార్నూ వదలలేదు. ఉద్యోగ రీత్యా బొంబాయి వచ్చిన తర్వాత సంగీత సాధన కొనసాగిస్తున్న క్రమంలో అక్కడి తెలుగువారితో కలిసి తెలుగు సాహిత్య సమితిని ప్రారంభించి కుమార సంభవం బాలేకు 55 రాగాలతో సంగీత రూపకల్పన చేశారు. కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడస్సీ నృత్యాలను కలబోసి కృష్ణపారిజాతం బ్యాలే రూపొందించారు.
ఇవి బాగా పేరుకెక్కడంతో సంగీతం తన జీవితంలో భాగమైపోయింది. కర్నాటక సంగీతం, హిందూస్తానీ సంగీతంలో నిష్ణాతులైన గాయకులు అప్పట్లో తరచుగా కొకు గారి ఇంటికి వస్తుండంతో వారి మాటలను వినడం ద్వారానే ఆయన సంగీతంపై తీవ్ర వ్యామోహం పెంచుకున్నారు. ముంబైలో సంగీత కచ్చేరీలు ఇవ్వడం సరేసరి. క్రమంగా సితార్ తన జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. ప్రముఖ సితార్ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ శిష్యరికం సితార్ వాయిద్యంపై నైపుణ్యాన్ని పెంచింది. 1986లో యునెస్కో ఆధ్వర్యంలో నిర్వహించిన 40వ వార్షికోత్సవంలో సితార్ విద్వాంసుడిగా రోహిణీప్రసాద్ పలు ప్రశంసలు అందుకున్నారు. హిందూస్థానీ, కర్నాటక జుగల్బందీలో నిష్ణాతుడయ్యాక 90లలో అమెరికాలోని పలు నగరాలలో సంగీత కళా ప్రదర్శనలు ఇచ్చారు కూడా. ఈ అణుభౌతిక శాస్త్రవేత్త, శాస్త్రీయ సంగీతానికి కూడా సమస్థాయిని ఇచ్చి గౌరవించడం మరీ విశేషం.
ముంబైలో జరిగే సంగీత కచ్చేరీల గురించి, అక్కడి సుప్రసిద్ద సవాయీ గంధర్వ ఉత్సవ విశేషాల గురించి ఆయన ఒక ఇమెయిల్లో ఇచ్చిన వివరణ ఎంతో ఆసక్తి గొలుపుతుంది. దశాబ్దాల క్రితం తను చూసిన, పాల్గొన్న అంశాలను కూడా నిన్న మొన్న జరిగినట్లుగా వివరించడం ఆయన అసాధారణ జ్ఞాపకశక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. మచ్చుకు ఒకటి.
“మూడు దశాబ్దాలకు పైగా ముంబయిలో ఉన్నప్పటికీ నేను ఒక్కసారి మాత్రమే (1971లో) సవాయీ గంధర్వ ఉత్సవానికి హాజరయాను. ఎందుకంటే అక్కడికి వచ్చే కళాకారులందరూ ముంబయిలో తరుచుగా కచేరీలు చేసేవారు. కిరానా సంప్రదాయానికి చెందిన భీంసేన్ జోషీ తన గురువు పేరిట జరిపే ఈ 3 రోజుల సంగీతోత్సవం చలికాలంలో జరిగినప్పటికీ అప్పట్లో అయిదారు వేలమంది ప్రేక్షకులను ఆకర్షించేది. రాత్రి 8 ప్రాంతాల మొదలైన కచేరీలు పొద్దున్న 6 దాకా ఎడతెగక సాగేవి. చివరిరోజున మాత్రం మధ్యాహ్నం 12 దాకా జరిగేది. అందరికన్నా తరవాత భీంసేన్ కచేరీ జరిగేది. ముగింపు కోసం పాడే (సింధు) భైరవి రాగం మాత్రం సవాయీ గంధర్వ రికార్డు మోగించి వినిపించేవారు. 1971లో జరిగిన ఉత్సవంలో మా గురువు ఇమ్రత్ ఖాన్గారి సితార్ కచేరీ, బిర్జూ మహారాజ్ కథక్ నృత్యానికి శాంతాప్రసాద్ తబలా సహకారం, కిరానా గాయని హీరాబాయీ బడోదేకర్కు సన్మానం వగైరాలన్నీ జరిగాయి.”
పరమాణు భౌతికశాస్త్రంలో 70 పరిశోధనా పత్రాలు, జీవశాస్త్రం భౌతిక శాస్త్రం భౌతికవాదంలో మరో మూడొందల పైగా వ్యాసాలు రాసిన ఘనుడు రోహిణీ ప్రసాద్. ఇవన్నీ ఒక ఎత్తైతే భారతీయ సంగీతకారులపై, సంగీతవాయిద్యాలపై రోహిణీప్రసాద్ ఇచ్చిన చరిత్ర డాక్యుమెంటేషన్ ఒకెత్తు. 2000 సంవత్సరం నుండి 2012 జనవరి వరకూ హిందూస్తానీ, కర్నాటక సంగీతంలో ఘనాపాఠీలుగా తాననుకున్న విశిష్టవ్యక్తుల జీవిత విశేషాలను, భారతీయ సంగీత రాగాలను వరుసగా ఈమాట.కామ్ వెబ్ పత్రికలో వ్యాసరూపంలో పొందుపర్చారు.
“సంగీతం, సాహిత్యం, బొంబాయిలో ప్రవాసాంధ్ర జీవితం గురించి రోహిణీప్రసాద్ గారు చేసిన అనేక రచనలు, వివిధ అంశాల మీద ఆయన అభిప్రాయాలు ఈమాట పత్రికలో చదవొచ్చు.”
శాస్త్రీయసంగీతంలో, ముఖ్యంగా హిందూస్తానీసంగీతంలో, విశేషమైన ప్రతిభ ఉన్న ఈయన ప్రధానంగా సితార్ వాద్యకారులు. ముంబైలో ఎన్నో లలితసంగీత కార్యక్రమాలు ఇచ్చారు, ఇప్పించారు. సంగీతం గురించిన అనేక విశేషాలను వివరిస్తూ వారు రాసిన వ్యాసాలు సంగీతంతో ఇంతకుముందు పరిచయం లేని వారికి కూడా దాన్లో ఆసక్తిని, అభిరుచిని కలిగిస్తాయని పేరు పొందాయి. ఈయన భారతీయ సంగీతకారులు, సంగీత రాగాలు, సంగీత వాయిద్యాల విశేషాల గురించి దాదాపు నలభై వ్యాసాలను ఇంతవరకు ప్రచురించడం గమనార్హం.
‘శ్రుతి మించని రాగం,’ ‘మన శాస్త్రీయ సంగీతం,’ ‘రాగాలూ స్వరాలూ,’ ‘శ్రుతిలయల నందనవనం,’ ‘సినిమా పాటల్లో తాళం, నడకలు, విరుపులు,’ ‘పాటల్లో లయవిన్యాసాలు,’ ‘హిందూస్తానీ సంగీతం,’ సంగీతంతో కుస్తీ,’ ‘జుగల్బందీ కచేరీలు,’ ‘కీబోర్డ్ మీద రాగాలు,’ ‘హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు,’ ‘కల్యాణి రాగం – అనుబంధం,’ ‘హిందోళ రాగం – అనుబంధం,’ ‘భావతరంగాల సింధువు: భైరవి,’ ‘ఖమాజ్/ఖమాచ్/ కమాస్ రాగం,’ ‘పుష్ప విలాపం – రాగాలతో సల్లాపం’ వంటి పలు రచనలలో.. సంగీతంలోని రాగాలు స్వరాలు, లయ విన్యాసాలు, తాళం నడకలు, విరుపుల గురించిన ప్రాధమిక సమాచారాన్ని ఈయన అత్యంత సులభరీతిలో పాఠకులకు అందించారు. సంగీతం అంటే ఓనమాలు తెలియని వారికి కూడా ఆసక్తి కలిగించే రచనలివి.
హిందూస్తానీ సంగీతంలో దిగ్గజాలపై ‘సితార్, సుర్బహార్ల సవ్యసాచి ఉస్తాద్ ఇమ్రత్ఖాన్,’ ‘గురువుల సంస్మరణ కొనసాగిస్తున్న గాయని ప్రభా ఆత్రే,’ ‘అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు బడేగులాం ఆలీఖాన్,’ ‘వాద్య సంగీతానికి అద్భుత దీవం వెలిగించిన అల్లాఉద్దీన్ఖాన్,’ ‘తబలా మాంత్రికుడు అహ్మద్జాన్ థిరక్వా,’ ‘గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ఖాన్,’ ‘సర్వోత్తమ సితార్ విద్వాంసుడు ఉస్తాద్ విలాయత్ఖాన్’ వంటివారిపై అపురూప విషయాలను పంచుకున్నారు. దక్షిణ భారతీయ సంగీతజ్ఞులు ‘మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి,’ ‘సార్థక నామధేయుడు సంగీతరావు,’ ‘నౌషాద్,’ ‘ఓపీ నయ్యర్,’ ‘బాలమురళీ కృష్ణ,’ ‘బాలమురళీ కృష్ణ సంగీతం,’ ‘అసామాన్య సంగీత దర్శకుడు సి.ఆర్. సుబ్బరామన్,’ ‘సంగీతరస పానశాల ఘంటసాల’ వంటి ప్రముఖుల కృషి వివరాలు కూడా అందించారు.
ఈయన అందించే విషయం, శైలి ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలుసుకోవడానికి “మన శాస్త్రీయ సంగీతం‘ అనే ఈయన ఒక్క రచన చదివితే చాలు. “అనాదిగా ప్రజలు పాడుకొనే జానపద సంగీతం నుంచి పుట్టి,”సంస్కృతీకరించబడి” ప్రస్తుతపు రూపాన్ని సంతరించుకున్న మన శాస్త్రీయ సంగీతం ఈనాటి “ప్రజల” సంగీతమైన సినీగీతాలనూ, “లలిత” సంగీతాన్ని విశేషంగా ప్రభావితం చేసింది. మారుమూల పల్లెల్లో సినిమా “షోకులు” సోకనివారు మాత్రం ఇంకా తమ జానపద సంగీతం పాడుకుంటూనే ఉన్నారు. గద్దర్ వంటి గాయకులు ఆ బాణీలను అనుసరించి తమ భావాలను అతి సమర్ధవంతంగా ప్రకటించడం చూస్తూనే ఉన్నాం.”
శాస్త్రీయ సంగీతపు మూలాలు కూడా అనాది ప్రజల జానపద సంగీతంలోంచే పుట్టాయని చదివితే చారిత్రక క్రమంలో సంగీతం అభివృద్ధి చెందిన తీరు పట్ల ఆసక్తి కలుగుతుంది. “శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం అనేది ఒక శిక్షలాగా అనిపించకూడదు.” అనే వీరి అభిప్రాయం చదివేవారి కళ్లల్లో మెరుపును సృష్టిస్తుంది.
“జ్ఞాపకశక్తి ఉండాలి. నేర్చిన ప్రతీదీ కంఠస్థం కావాలి. అభ్యాసం రాక్షస సాధనలాగా ఉండాలి. సాధన చేస్తున్నప్పుడు ఏ అభ్యాసం వల్ల ఏ ఫలితం కలుగుతుందో చూచాయగానైనా తెలియాలి. గాత్రం నేర్చుకోనివారు కూడా విధిగా తాము వాయించబోతున్నది పాడి చూచుకోవాలి. ఈ పాడడం ఎంత ముఖ్యమో చాలా మందికి తెలియదు. స్వరజ్ఞానం లేనివారికి అది అబ్బే అవకాశం, పాడుకోవడం వల్ల పెరుగుతుంది.”
ఒక మిత్రుడన్నట్లుగా, సైన్స్, సంగీతం, సాహిత్యం మూడింటిలోనూ ప్రావీణ్యత సాధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రోహిణీ ప్రసాద్ గారు ఇంత హఠాత్తుగా నిష్క్రమించటం అనూహ్యం, జీర్ణించుకోలేని వాస్తవం! శాస్త్రీయ అంశాలను -సంగీత మెలకువలను కూడా- హేతువాద దృక్పథంతో సరళంగా, ఆత్మీయమైన శైలిలో వివరించటంలో ఆయన కొ.కు.ను గుర్తుకుతెస్తారు! ఒక రచయితగా, సంగీతకారుడిగా, శాస్త్రవేత్తగా, హేతువాదిగా ఆయన వంటి వ్యక్తి మళ్లీ పుట్టడానికి చాలా కాలం పడుతుంది.
ముగింపు
ఇవ్వాళ రోహిణీ ప్రసాద్ మన ముందు లేరు. సంగీతంలోని ప్రాధమిక విషయాలను మంచినీళ్ల ప్రాయంలా వివరించిన వీరి రచనలు ఇకనైనా ప్రచురించవలసిన అవసరం ఉంది. సంగీత వాయిద్యాలపై, హిందూస్తానీ, కర్నాటక సంగీత విద్వాంసులపై, ఘంటసాల వంటి అమరగాయకులపై, చిత్రసంగీత దర్శకులపై ఈయన రచనలు ఈమాట.కామ్లో మరోసారి చదువుతున్నప్పుడు ఒకటే ఆలోచన. శాస్త్రీయ. సంగీతంపై, చిత్రసంగీతంపై ఇంత ప్రభావవంతమైన రచనలు చేసిన ఈయన కృషి ఎందుకు ఇన్నాళ్లుగా పుస్తక రూపం దాల్చలేదనిపిస్తుంది. ఈమాట.కామ్ వారు ఇప్పటికయినా ఈ పనికి పూనుకోగలిగితే సంగీత చరిత్ర డాక్యుమెంటేషన్లో రోహిణీప్రసాద్ గారి ‘ఆత్మావిష్కారం’ తెలుగు పాఠకులందరికీ అందుతుంది.
రోహిణీప్రసాద్ గారితో పరిచయమున్న వారు ఇప్పుడాయన గురించి పంపుతున్న స్పందనలు ఆయన బహుముఖ వ్యక్తిత్వాన్ని మరింత తేటతెల్లంగా చేస్తున్నాయి. మొత్తం సంగీత చరిత్రనే తన చేతివేళ్లమీద పెట్టుకున్న ఈ ప్రతిభామూర్తిని, సాహిత్యం, సైన్స్, అనువాదాలు, సంగీతం వంటి పలు రంగాల్లో తన మేధస్సును ప్రశంసించడం సరే సరి. తనను కలిసేందుకు వచ్చిన వారికి పాత హిందీ, తెలుగు పాటలు, గజల్స్ కూడా పాడి వినిపించి తన్మయులను చేసేవారట. ఇతరుల సంతోషాన్ని తాను ఆస్వాదించేవారట. అత్యంత స్పష్టంగా సభల్లో సైన్స్ గురించి ఇతర విషయాల గురించి ఈయన ప్రసంగాలు విన్నవారు ఈయన భావస్పష్టతను మర్చిపోలేమని చెబుతున్నారు.
ఇన్ని రంగాల్లో ప్రావీణ్యమున్న ఈ విశిష్టవ్యక్తిని ఆంధ్రజ్యోతిలో ఆయనపై వచ్చిన నివాళి వ్యాసం చూసేంతవరకు తెలుసుకోలేక పోయామని కొందరంటున్నారు. వాదాలకు, వివాదాలకు అతీతంగా జాతి సంపదగా వెలుగొందవలసిన మనుషులు అజ్ఞాతంగానే ఉండిపోవలసిరావడం, తెలిసిన వారికి మాత్రమే వారి పరిచయ సుగంధాలు మిగలటం కన్న విషాదం ఏముంటుంది?
మరోసారి… భారతీయ సంగీత రీతులపై ఆయన రచనలు పుస్తకంగా వెలువడితే ఆయన కృషి, సంగీత చరిత్రపై ఆయన ఆలోచనలు ప్రపంచానికి మరింతగా అందే అవకాశం ఉంటుంది.
(ఈ కథనం కోసం అరుణపప్పు గారు రోహిణీ ప్రసాద్గారితో చేసిన ఇంటర్వ్యూనుంచి, ఈమాట.కామ్ వెబ్సైట్ నుంచి కొన్ని వివరాలు తీసుకోవడం జరిగింది. వీరికి కృతజ్ఞతలు.)
ఆన్లైన్లో చందమామ పరిచయం: రోహిణీప్రసాద్ కృషి
తెలుగువారి బాల్యానికి, ఇంకా చెప్పాలంటే భారతీయుల బాల్యానికి ఐకాన్గా నిలిచిపోయిన ‘చందమామ, పత్రిక గురించి ఈమాట.కామ్ లో రోహిణీప్రసాద్ గారు 2006లో అందించిన ‘చందమామ జ్ఞాపకాలు’ రచన ఆన్లైన్ పాఠకలోకంలో ఒక సంచలనం కలిగించింది.
చందమామ దిగ్గజ చిత్రకారుల గురించి, కొకుతో సహా సంపాదక బృందం గురించి, చందమామ చరిత్ర గురించి స్థూలంగా తెలిపిన ఈ రచన తెలుగుదేశంలో, విదేశాల్లో కూడా చందమామ గురించి కొత్త ఆసక్తి కలిగించింది. చందమామ అభిమానులు, ఆరాధకులు కలిసి చందమామ పిచ్చోళ్లు అనే స్వయం ప్రకటిత సంస్థగా ఏర్పడి చందమామ పత్రిక గురించి సంవత్సరాలపాటు ప్రచారం చేసుకుంటూ వెళ్లిన చరిత్రకు ఈ వ్యాసమే నాందిపలికింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చందమామ ప్రియులకు 1947 జూలై తొలి సంచిక నుంచి 2012 ఆగస్టు సంచిక వరకు సాఫ్ట్కాపీల రూపంలో లభ్యమవుతున్నాయంటే దానికి రో.ప్ర గారి తొలి వ్యాసమే మూలం.
తండ్రిలాగా కల్పనా సాహిత్యంలో రోహిణీ ప్రసాద్ గారు పెద్దగా రచనలు చేసి ఉండకపోవచ్చు కాని 2010 నుంచి చందమామలో కొన్ని పిల్లల కథలు రాశారు. తను రాసిన బేతాళ కథ కూడా ఆ సంవత్సరమే ప్రచురించబడింది. చందమామకు చాలా ఆలస్యంగా పరిచయమైన ఈయన 2010లో తెలుగు మినహా ఇతర భాషలలో చందమామ పత్రిక అనువాదకుల కోసం ఎంపికైన తెలుగు కథలను ఇంగ్లీషులోకి అనువదించారు.
ఒక అక్షరం కూడా వంకబెట్టడానికి వీల్లేదని చందమామ యాజమాన్యం నుంచి ప్రశంసలందుకున్నంత చక్కని అనువాదం ఆయనది. ఈ క్రమంలోనే 1947 నుంచి 1953 వరకు చందమామ పాత సంచికలలోని కథలన్నింటినీ ఆంగ్లంలోకి మార్చే బృహత్ ప్రాజెక్టులో ఆయన కీలకపాత్ర పోషించారు. మెరుపువేగంతో, ఖచ్చితమైన పదజాలంతో చందమామ కథలకు ఆయన చేసిన అనువాదాలు చందమామ ఆన్లైన్ లైబ్రరీలో ప్రస్తుతం భద్రంగా అమరి ఉన్నాయి.
Filed under Kodavatiganti Rohiniprasad | Comments (2)మనం కోల్పోయిన ఆలోచనా ధార
తెలుగు సమాజం అరుదైన ఆలోచనా ధారను కోల్పోయింది. నండూరి రామమోహన్ రావు సైన్స్ రచనలు తర్వాత శాస్త్ర విషయాలను ఇంత తేలికగా, ఇంత హేతుపూర్వకంగా తెలుగువారికి అందించిన రోహిణీ ప్రసాద్ మేధస్సు ఇంత త్వరగా ఆగిపోవడం పెద్ద విషాదమే.
ఒక కుటుంబం తన ప్రియతముడిని కోల్పోయింది. మిత్రులు తమ ఆప్తుడిని కోల్పోయారు. కానీ ఒక సమాజం అరుదైన ఆలోచనా ధారను కోల్పోయింది. తెలుగు సమాజానికి ఇటీవల కాలంలో అద్వితీయ సైన్స్ రచయితగా పరిచయమైన కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ శనివారం మన నుంచి దూరమైనారు.
మిత్రులు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి స్మృతిలో ఆంధ్రజ్యోతిలో ఈరోజు ప్రచురించబడిన నా నివాళి పూర్తిపాఠం కింది లింకులో చూడగలరు.
http://andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/sep/11/edit/11edit4&more=2012/sep/11/edit/editpagemain1&date=9/11/2012
రాయగలిగిన శక్తి, అధ్యయనంపై ఆసక్తి ఉండి కూడా మెయిన్స్ట్రీమ్ పత్రికలకు రచనలు పంపకుండా బ్లాగ్ రచనలకు ఎందుకు పరిమితమవుతున్నారు అంటూ రోహిణీప్రసాద్ గారు గత కొంత కాలంగా నాకు ప్రేరణనిస్తూ, ప్రోత్సహిస్తూ, మందలిస్తూ హెచ్చరించేవారు. బ్లాగ్ రచనలు కొన్నాళ్లు ఆపివేయండంటూ కూడా నాపై విసుక్కున్నారు.
కాని ఆయనకు నివాళి పలకడం ద్వారానే మెయిన్స్ట్రీమ్ పత్రికా రచనలోకి అడుగుపెట్టవలసి ఉంటుందని నేను ఎన్నడూ ఊహించలేదు. జీవితంలో ఎన్నడూ చూడని, ఇక చూడలేని ఈ గురుసమానుడికి, ప్రేరణకర్తకు ఈ విధంగా గురుదక్షిణ ఇవ్వాల్సి ఉందని ఎన్నడూ అనుకోలేదు.
………………………..
అలాగే.. ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అరుణపప్పు గారు గతంలో ప్రచురించిన రోహిణీ ప్రసాద్ గారి జ్ఞాపకాలను ఇక్కడ చూడగలరు.
మనిషి సజీవంగా ఉండాలంటే బహుముఖంగానే ఉండాలని నమ్మే రోహిణీప్రసాద్ గారు సంగీతం, సాహిత్యం, శాస్త్రం వంటి విభిన్న రంగాల్లో ఇంత వైవిధ్య పూరితమైన కృషి చేయడం ఎలా సాధ్యమో హృద్యంగా ఇక్కడ చెప్పారు.
“…ఇన్ని డైమెన్షన్లు ఎట్లా అంటే ఏదో ఒకదానిలో తలమునకలై కూరుకుపోవడం, తీరికలేనట్లు ఉండటం, ఎంత జ్ఙానం సంపాదించినా ఇంకా మిగిలే వుందని అనుకోవడం… ఎవరి భావనలు వారివేకదా! అందుకే సైన్స్ వ్యాసాలు రాసే నేను, కాలచక్రం పత్రికకూ ఎడిటర్గా వుండగలిగాను. భౌతిక విషయాలను మాత్రమే నమ్మే నేను సాయి చాలీసా రాశాను.”
“….పరమాణు శాస్త్రవేత్తనైన నేను జీవశాస్త్రం వ్యాసాలు రాయాలనుకోవడం మరో మలుపు. అదీ ఆసక్తి వున్న సాధారణ మనిషికి బోధపడే రీతిలో రాయాలనుకోవడం … సాహసమే. అయితే నేను దానిలో విజయం సాధించాననే అనుకుంటాను. గతితార్కిక భౌతికవాదాన్ని నమ్మడంతో, ప్రజలందరూ బహుముఖ పార్శ్వాలను కలిగివుండే సమాజం సాధ్యమేనని నమ్మడంతో ఇప్పుడు మన పని ముగిసిపోవడంలేదు. దానిని ఆచరిస్తూ, పదిమందికీ చెప్పడమనే అవసరం రోజురోజుకూ మరింత విస్పష్టంగా కళ్ళముందు గోచరిస్తోంది. నా దారి నాకు స్పష్టంగా కనబడుతూనే వుంది.’’
తన బాల్యంలో విద్యా, ఉద్యోగ జీవితంలో మిగిల్చుకున్న అరుదైన జ్ఞాపకాలను హృద్యంగా ఆయన మాటల్లోనే వినాలంటే కింది లింక్ చూడండి. ఇది కూడా గతంలో ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది.
http://arunapappu.wordpress.com/2012/09/10/%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A3%E0%B1%80%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5/
Filed under Kodavatiganti Rohiniprasad | Comments (3)
మా నాన్న విషాదమరణం – కొడవటిగంటి కార్తీక్
ప్రియమైన మిత్రులకు,
మా నాన్న డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు నిన్న మధ్యాహ్నం ముంబయ్లో కన్నుమూశారనే వార్తను మీకు తీవ్ర విషాదంతో తెలియజేస్తున్నాను. కొంత కాలంగా అస్వస్థతతో ఉంటున్న ఆయన కొద్దిరోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.
నాన్న శ్రేయోభిలాషులు, రేపు (సెప్టెంబర్ 10) ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్యలో ఆయన భౌతిక దేహాన్ని ముంబై, వడాల ఈస్ట్ లోని లాయిడ్స్ ఎస్టేట్లో కడసారి దర్శించవచ్చు. తర్వాత ఆయన భౌతికదేహాన్ని గ్రాంట్ మెడికల్ కాలేజీకి తీసుకెళతాము. ఆయన కోరిక మేరకు ఆయన భౌతిక దేహాన్ని వైద్య అధ్యయనం, పరిశోధనలకు గాను సమర్పిస్తున్నాము.
మా నాన్నగారికి మీరు ఇన్నాళ్లుగా అందించిన తోడ్పాటుకు మా కుటుంబం తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఇన్నాళ్లుగా మీ అందరితో పరిచయాలు, సహ సంబంధాలను ఆయన ఎంతో ఆస్వాదించారు. మీతో పరిచయం తనను జ్ఞానవంతుడిగా చేసిందని ఆయన భావించేవారు.
ఒక రచయితగా, సంగీతకారుడిగా, శాస్త్రవేత్తగా, హేతువాదిగా ఆయన వంటి వ్యక్తి మళ్లీ పుట్టడానికి చాలా కాలం పడుతుందని మీ అందరి తరపున చెప్పాలనుకుంటున్నాను.
మరోసారి, మా నాన్న, మా కుటుంబం యొక్క శ్రేయోభిలాషులుగా ఉంటూ వస్తున్న మీ అందరికీ మేము వినమ్రంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
ధన్యవాదాలతో,
కార్తీక్ కొడవటిగంటి.
Karthik Kodavatiganti
2303-D, Lloyds Estate,
Wadala East
Mumbai 400037
Mobile: +91-98190-44855
Home: +91-22-2414-3274
Email: k_karthik@outlook.com
కార్తీక్ గారు,
నాన్నగారి ఫోన్ నంబర్ తప్పితే ఇన్నాళ్లుగా మీతో కాని లలిత గారితో కాని నేరుగా సంభాషించే వీలు లేకపోయింది. ‘శరీరం చాలా బాధపెడుతున్నా తన మనస్సు, బుద్ధి చాలా చురుకుగా ఉందం’టూ ముంబై ఆసుపత్రిలో మీ మాతృమూర్తి లలితగారు పది రోజుల క్రితం ఆయన ఫోన్ నుంచి చెప్పిన మాటలే ఆయన తరపున నాకు అందిన చివరి సందేశం.
చందమామలో నా ఉద్యోగ జీవితం గడిపిన గత మూడున్నరేళ్ల కాలంలో ఆయనతో పరిచయం నా ఆలోచనలను, జీవితాన్ని కూడా ప్రకాశవంతం చేసింది. పల్లెటూరి నుంచి జీవిక కోసం వచ్చిన వారు మహానగరాల్లో ఎదుర్కొనే జీవన సంక్లిష్టతలను ఆయన ఎంతో వివరంగా విశ్లేషిస్తూ ధైర్యం చెప్పేవారు.
అమెరికా నుంచి, ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి గత మూడేళ్లుగా ఎన్నిసార్లు ఆయన ఫోన్ ద్వారా సంభాషించారో, చాట్ చేశారో, మెయిల్స్ పెట్టారో లెక్క తెలీటం లేదు. దురదృష్ట మేమిటంటే రెండు వారాల ముందు ఆయనను, లలితగారిని, వరూధినిగారిని తొలిసారిగా కలిసే అవకాశం నాకు నేనుగా పొగొట్టుకున్నాను.
శారీరకంగా చాలా ఇబ్బంది పడుతున్నా సాయంత్రం నాలుగు గంటల వరకు అమీర్ పేటలో బంధువుల ఇంటిలో వేచి చూశానని ఆయన చెప్పినప్పుడు నేను క్షమాపణ చెప్పాను కాని ఆయనను ఇక ఎన్నటికీ చూడలేనని కనీసంగా కూడా ఊహించలేకపోయాను.
సెప్టెంబర్ రెండోవారంలో హైదరాబాద్కు వస్తాను కాబట్టి ఈసారి తప్పక కలుస్తానని నేరుగా నాన్నగారి ఇంటికే వచ్చి కలుస్తానని ఆయనకు చెప్పాను. కాని ఇక సాధ్యం కాదని, ఆయన అప్పటికే జీవితంలో చివరి చలనం వైపు అడుగులేస్తున్నారని ఊహించలేకపోయాను.
హైదరాబాద్కు వచ్చి కూడా ఆయనను చూడలేకపోవడం ఘోరమైన తప్పిదం. కాని ఇలా జరుగుతుందని ఎవరు ఊహించగలరు?
ఇంగ్లీష్ చదవలేని తెలుగు వారికి తాను విస్తృతంగా పరిశీలిస్తున్న శాస్త్ర, సాంకేతిక విషయాలను, నూతన ఆవిష్కరణలను సులభశైలిలో పుస్తకాల రూపంలో అందివ్వాలనే మహా సంకల్పం ఆయనను అవిరామ శ్రామికుడిగా మార్చింది. ఆయన ఆయుర్దాయాన్ని కూడా ఈ మహాసంకల్ప భారమే క్షీణింపజేసిందేమో..
తండ్రి కుటుంబరావు గారి రచనా వారసత్వాన్ని కొనసాగించడంలో అత్యంత వేగంతో అక్షరాలను కూర్చి రచనలు చేయడంలో ఆయనది అనితరసాధ్యమైన మార్గం.
నండూరి రామమోహన్ రావు గారి సైన్స్ రచనలు తర్వాత శాస్త్ర విషయాలను ఇంత తేలికగా, ఇంత హేతుపూర్వకంగా తెలుగువారికి అందించిన నాన్నగారి మేధస్సు ఇంత త్వరగా ఆలోచించడాన్ని ఆపివేయడం వ్యక్తులుగా మీ కుటుంబానికి, మిత్రులకు ఎంత విషాదకరమో, తెలుగు పాపులర్ సైన్స్ రచనలకు అంత నష్టకరమైన విషయం కూడా.
తెలిసిన విషయాలను పదిమందికి విస్తృతస్థాయిలో చెప్పడానికి పత్రికలు ముఖ్యమార్గమని, ఎక్కువమంది పాఠకులకు మన భావాలను చెప్పగలిగే అవకాశాలను ఎన్నటికీ వదులుకోవద్దని ఆయన పదే పదే చెప్పేవారు. చివరి రోజుల్లో ఆయన ఈ విషయమై నన్ను మందలిస్తూ పంపిన చివరి ఇమెయిల్ని ఇక మరువలేను.
నాలుగేళ్ల స్వల్పకాలంలో ‘విశ్వాంతరాళం’, మానవ పరిణామం, ‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’, ‘జీవకణాలు -నాడీ కణాలు,’ ‘ప్రకృతి పర్యావరణం,’ ‘అణువులు’, ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి ఎనిమిది పాపులర్ సైన్స్ పుస్తకాలు రాశారు. శాస్త్ర సంబంధ రచనలు అంటే పెద్దగా ఆసక్తి చూపని తెలుగు పాఠకలోకంలో తెలుగు ప్రచురణల చరిత్రలో అవి ఎంత సంచలన విజయం సాధించాయో ఇవ్వాళ అందరికీ తెలుసు.
మూడేళ్ల స్వల్ప పరిచయంలో ఆయన నా పట్ల పితృసమాన వాత్సల్యాన్నే ప్రదర్శించారు. ఈ కష్టకాలంలో మీరు ఒకరికొకరు తోడుగా, ధైర్యంగా ఉంటారని, అమ్మను, నాన్నమ్మను జాగ్రత్తగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. తండ్రిగా, విజ్ఞానవేత్తగా, హేతుచింతనకారుడిగా ఆయన అందించిన ప్రేరణే మీ కుటుంబానికంతటికీ మనోధైర్యాన్ని ఇస్తుందని భావిస్తున్నాను.
తన శరీరాన్ని మట్టిలో కలపటం కాకుండా వైద్య పరీక్షలకు, మానవ శ్రేయస్సు కోసం అందివ్వాలన్న ఆయన కోరికను మీరు నెరవేరుస్తున్నందుకు ఈ విషాద సమయంలో కూడా ఒకింత సంతోషంగా ఉంది. ఒక శాస్త్రజ్ఞుడికి, హేతువాదికి, తండ్రికి మీరు మీ కుటుంబం ఇస్తున్న ఈ నివాళికంటే మించినది ఏదీ ఉండదు.
మీరు తండ్రిని పోగొట్టుకున్నారు. కాని జీవిక కోసం చెన్నయ్ నుంచి హైదరాబాద్కు మారాలనుకుంటున్న నాకు ‘మనం దేంట్లోనైనా పనిచేయగలం, కష్టపడగలం, కొత్త విషయాలను నేర్చుకోగలం, భాగ్యనగరంలో అనేక అవకాశాలున్నాయి, ధైర్యంగా రండి’ అంటూ చివరి వరకూ ప్రోత్సాహాన్ని, ప్రేరణను అందించిన ఒక గొప్ప సహాయ హస్తాన్ని, ఆప్యాయ స్వరాన్ని నేను శాశ్వతంగా పోగొట్టుకున్నాను.
ఇన్నాళ్లుగా ఏ సమయంలో అయినా సరే కాల్ చేయగానే ‘రాజుగారూ బాగున్నారా’ అంటూ పలుకరించిన నాన్నగారి మొబైల్ ఇక మూగపోతుందన్న వాస్తవాన్ని భరించలేకున్నాను.
ప్రస్తుతం నాకున్న ఆర్థిక వనరుల పరిమితి కారణంగా చివరి చూపుకు కూడా ముంబైకి నేను రాలేకపోతున్నందుకు క్షమించండి.
మీరు ఈ మెయిల్లో ఇచ్చిన మొబైల్ నంబర్కు కాల్ చేయాలంటే కూడా సాహసించలేకపోతున్నాను.
మీరు నిబ్బరంగా ఉంటారని, ఉండాలని కోరుకుంటూ..
రాజశేఖరరాజు.
చెన్నయ్
7305018409
krajasekhara@gmail.com
…………………….
కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి కుమారుడు కార్తీక్ తమ నాన్నగారి మిత్రులకు, శ్రేయోభిలాషులకు కాస్సేపటిక్రితం ఈమెయిల్ ద్వారా కింది సమాచారం పంపారు. వారు పంపిన ఇంగ్లీష్ ఇమెయిల్ పాఠాన్ని ఇక్కడ చూడవచ్చు.
Sad demise – Kodavatiganti Rohiniprasad
Dear Friends
It is with deep sorrow that I inform you of the passing of my father, Dr Kodavatiganti Rohiniprasad, yesterday afternoon in Mumbai. He had been ill for a brief while and was hospitalised during his last days.
His well wishers can pay their last respects tomorrow morning (10th Sep) between 9AM – 10.30 AM at Lloyds Estate, Wadala East, Mumbai. Thereafter he will be taken to Grant Medical College where his body will be donated for medical study and research, as per his wish.
On behalf of our family I would like to thank you all for your support to my father. He thoroughly enjoyed his interactions with you all and believed that it enriched him.
I think I can say on behalf of you all that a person of his caliber – Writer, Musician, Scientist and Rational Thinker – may not be found for a long time to come.
Once again, we sincerely thank you for being well wishers of my father and our family.
Best Regards,
Karthik Kodavatiganti
2303-D, Lloyds Estate,
Wadala East
Mumbai 400037
Mobile: +91-98190-44855
Home: +91-22-2414-3274
Email: k_karthik@outlook.com
Filed under Kodavatiganti Rohiniprasad | Comments (10)కొడవటిగంటి రోహిణీప్రసాద్ రచనల సూచిక:
శాస్త్రీయ సంగీతం, సినీ సంగీతం, సినిమా, సంస్కృతి, విశిష్ట వ్యక్తులు, చందమామ జ్ఞాపకాలు వంటి పలు అంశాలపై 2000 సంవత్సరం మార్చి నెల నుంచి 2012 జనవరి వరకు కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సుప్రసిద్ధ ఆన్లైన్ పత్రిక ఈమాట.కామ్లో ప్రచురించిన రచనల సూచికను ఒకేచోట ఇక్కడ చూడగలరు.
ఒక రచయిత తమ కోసం పంపిన రచనలన్నింటి వివరాలను ఒకేచోట చేర్చి అందరికీ అందించిన ఈమాట.కామ్ వారికి కృతజ్ఞతలు.
మిత్రులు రోహిణీ ప్రసాద్ గారు గత నాలుగేళ్లుగా ఎపివీక్లీ.కామ్లో క్రమం తప్పకుండా సైన్స్ రచనలను ప్రచురిస్తూ వస్తున్నారు. ఏ ఒక్క వారం కూడా ఆయన తన రచనను పంపకుండా ఆపింది లేదు.
అలాగే వీక్షణం, ప్రజాసాహితి, అరుణతార వంటి ప్రత్యామ్నాయ పత్రికలలో, ఆంధ్రభూమి, హెచ్ఎంటివి వారి ఇంగ్లీష్ పత్రిక “The Hans India”లో, ప్రజాకళ.ఒఆర్జి, ప్రాణహిత.ఒఆర్జి వంటి వెబ్ పత్రిలలో అసంఖ్యాకంగా రచనలు చేస్తూ వచ్చారు. చందమామ పత్రికకు కూడా ఆయన కథలు, రచనలు 2009 నుంచి 2011 వరకు పంపారు. దురదృష్టవశాత్తూ -?- చందమామ ఆయన సేవలను కొనసాగించలేకపోయింది. 2009 చివరి నుంచి 2010 మధ్య వరకు తెలుగు మినహా ఇతర భాషల చందమామ అనువాదకులకోసం ఆయన ఇంగ్లీషులోకి చేసిన తెలుగు కథల అనువాదాలు సుప్రసిద్ధాలు.
అలాగే 1947 నుంచి 53 వరకు చందమామ పాతసంచికలలోని కథలను అన్నిటినీ ఇంగ్లీషు లోకి మార్చే బృహత్తర ప్రాజెక్టులో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. 1947-1970 వరకు తెలుగు చందమామ సంచికలలోని కథలను ఇంగ్లీషులోకి మార్చాలని తలపెట్టిన ఈ ప్రాజెక్టు కూడా చందమామ పూర్తి చేయలేకపోయింది.
తండ్రి కొడవటిగంటి కుటుంబరావు గారి సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని అక్షరాలా కొనసాగించిన అరుదైన రచయిత రోహిణీ ప్రసాద్ గారు. ఇటీవలే ముంబైలోని తమ స్వంత ఇంటిలోనుంచి కుటుంబరావుగారికి చెందిన దాదాపు వెయ్యి పుస్తకాలను హైదరాబాద్కు తీసుకొచ్చారు. నాన్న తను కొన్న పుస్తకాన్ని దేన్నీ చదవకుండా వదిలిపెట్టలేదని. ఆయన కామెంట్లు, గీతలు లేని పుస్తకం అంటూ లేదని, పుస్తకం కొంటే, తన వద్దకు పుస్తకాలు వస్తే తప్పకుండా చదివిన అలవాటును ఆయన చివరివరకూ కొనసాగించారని ఇటీవలే ఆయన నాతో పంచుకున్నారు.
కుటుంబరావుగారు అధ్యయనం చేసిన అపురూప పుస్తకాలను వేటినీ పోగొట్టవద్దని, అమ్మేయవద్దని వీలైతే సుందరయ్య విజ్ఞానకేంద్రం వంటి పుస్తక సంరక్షణ కేంద్రాలకు వాటిని అందించమని కోరాను. ఆయన జీవన సహచరి లలిత గారు, అబ్బాయి కార్తీక్, అమ్మాయి యామిని ఆయన సంరక్షించిన పుస్తకాలను భద్రపర్చవలసిన అవసరం ఉంది.
ఆన్లైన్ పత్రిక ఈమాట.కామ్లో ప్రచురించిన రచనల సూచికను ఒకేచోట ఇక్కడ చూడగలరు.
కొడవటిగంటి రోహిణీప్రసాద్ రచనల సూచిక:
3. కినిమా మాసపత్రిక: హాస్యనటుల అనుభవాలు
6. కొడవటిగంటి కుటుంబరావు రచనలలో కుటుంబ నేపథ్యం
7. పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం
8. వ్యాసానుబంధం (గుర్రం జాషువా పాపాయి పద్యాలు)
9. బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు
15. సర్వోత్తమ సితార్ విద్వాంసుడు ఉస్తాద్ విలాయత్ఖాన్
16. హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు
17. సత్యజిత్ రాయ్ – ఓ చిన్న ఉపోద్ఘాతం
19. గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్
24. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు
25. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి
29. సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు
30. ఘంటసాల ప్రతిభకు మచ్చుతునక “కుంతీకుమారి”
31. సార్థక నామధేయుడు సంగీతరావు
32. తబలా “మాంత్రికుడు” అహ్మద్జాన్ థిరక్వా
34. వాద్య సంగీతానికి అద్భుతదీపం వెలిగించిన అల్లాఉద్దీన్ఖాన్
35. అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు బడేగులాం అలీ ఖాన్
36. సినిమా పాటల్లో తాళం నడకలు, విరుపులు
38. అసామాన్య సంగీతదర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్
39. గురువుల సంస్మరణ కొనసాగిస్తున్న గాయని ప్రభా అత్రే
40. సితార్,సుర్బహార్ల సవ్యసాచి ఉస్తాద్ ఇమ్రత్ఖాన్
Filed under Kodavatiganti Rohiniprasad | Comment (0)కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు ఇకలేరు.
ఇప్పుడే అందిన దుర్వార్త.
అణుధార్మిక శాస్త్రవేత్త, శాస్త్ర, సంగీత, సాహిత్య రంగాలలో సుపరిచితులు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు కాసేపటికి ముందు కన్నుమూశారని ఇప్పుడే తెలిసింది. గత పది రోజులుగా అస్వస్థులై ముంబైలో జెస్లోక్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ శనివారం మధ్యాహ్నమే కన్నుమూశారని విశ్వసనీయంగా తెలిసింది. -ఉదయం 11 గంటలకు పోయారని నిర్ధారించబడింది- దీర్ఘకాలంగా డయాబెటిక్తో ఇబ్బందిపడుతున్న ప్రసాద్ గారికి గత కొద్ది రోజులుగా కిడ్నీ సమస్య తీవ్రమై కోలుకోలేకపోయారు. ఈరోజు ఉదయమే ఆయనకు అమర్చిన వెంటిలేటర్ తీసివేశారని తెలుస్తోంది.
సరిగ్గా రెండువారాలకు ముందు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్ను కలిసే అవకాశం కొద్దిలో తప్పిపోయింది. ప్రత్యక్షంగా చూడలేకపోయినప్పటికీ, గత మూడు సంవత్సరాలుగా ఆయనతో నాకు వ్యక్తిగతంగా, భావజాల పరంగా కూడా అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. చందమామ కథలకు ఆర్నెల్లపాటు ఆయన చక్కటి అనువాదాలను విస్తృత స్థాయిలో చేశారు కూడా. చివరి దశలో చందమామకు కథలు, సైన్స్ రచనలు పంపారు.
శాస్త్రరంగంలో తాజా ఆవిష్కరణలు, శాస్త్ర భావనల గురించి 50 పుస్తకాలు రాయాలని ఆయన సంకల్పించారు. గత రెండేళ్లుగా ‘విశ్వాంతరాళం’, మానవ పరిణామం, ‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’, జీవకణాలు -నాడీ కణాలు, ప్రకృతి పర్యావరణం, ‘అణువులు’, ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి ఎనిమిది పాపులర్ సైన్స్ పుస్తకాలు రాశారు. ఇవి సంచలన విజయం సాధించాయి కూడా. కొన్ని రచనలు మూడు నాలుగు ముద్రణలు కూడా పొందాయి.
వివిధ పత్రికలు, ఆన్లైన్ మీడియాకు గత అయిదారేళ్లుగా ఈయన విస్తృతంగా రచనలు పంపుతున్నారు. సైన్స్, సంగీతం, సాహిత్యం మూడింటిలోనూ ప్రావీణ్యత సాధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
ఆయన గురించి మరిన్ని వివరాలు త్వరలో…
శాస్త్ర విషయాలపై ఆయన రాసిన గొప్ప రచనలలో ఒకటి ఇక్కడ చూడండి.
చావుపుటకలు – డా.కొడవటిగంటి రోహిణీప్రసాద్
http://prajakala.org/mag/2008/02/krp_feb_essay
Filed under Kodavatiganti Rohiniprasad | Comments (4)
కోట్లమంది కంట కన్నీరు… “బొమ్మరిల్లు”
బొమ్మరిల్లు బాస్కర్ గారూ,
నమస్కారం,
ఈ రోజు ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో “నన్ను మార్చింది మా నాన్న కన్నీరే” శీర్షికతో వచ్చిన మీ ఇంటర్ప్యూ చూశాను. 35 ఏళ్ల ముందటి నా బాల్య జ్ఞాపకాలను మళ్లీ తట్టిలేపారు మీరు. పుస్తకాల విషయంలో సరిగ్గా నాలాగే ఉన్నారు మీరు. ఇంట్లో, లైబ్రరీలో పుస్తకాలు చదవటం అయిపోతే, రోడ్డుమీద నడుస్తూ దార్లో కిందపడిపోయి ఉన్న కాగితం ముక్కలో ఏముందోనని తీసుకుని చదివిన బాల్యం నాది కూడా.
చిన్నప్పుడు మా నాన్న చందమామ పత్రికను తీసుకొచ్చి,’ జ్ఞానం వస్తుంది చదవండిరా!’ అన్నారు. జ్ఞానం వచ్చిందో లేదో తెలియదు కాని వందల వేల పుస్తకాలను ఆబగా చదివేసిన అపురూప బాల్యం మాత్రం నా స్వంతమైంది. 35 సంవత్సరాల క్రితం చందమామ నా బాల్యాన్ని ఆడిస్తే ప్రస్తుతం అదే చందమామలో తెలుగు అసోసియేట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా చందమామ బాల్యానికి, ప్రస్తుతం దాంట్లోనే నా పనికి ఎంత కో ఇన్సిడెన్స్ ఉందో చూడండి. -కాని మరో పది రోజుల్లో చందమామ నుంచి బయటపడవలసిన పరిస్థితి.-
నాన్న కన్నీరు మీ జీవితాన్ని మార్చింది. అది బొమ్మరిల్లయి కోట్లాది తెలుగువారి హృదయాల్లో కన్నీరొలికించింది. ఒక కమర్షియల్ దర్శకుడికి జీవితంలో ఇంతకు మించి ఏం కావాలి?
1980ల మొదట్లో రాయచోటి పట్టణంలో శంకరాభరణం సినిమాను 13 సార్లు చూసి -అదే మొదటి సారి చివరిసారి కూడా- ’దొరకునా ఇటువంటి సేవ’ పాట వింటూ, చూస్తూ 13 సార్లూ ధియేటర్లోనే ఏడ్చిన అనుబవం నాది. ఇప్పటికీ ఈ పాటను లేదా సినిమాను చూస్తే కన్నీళ్లు అలాగే ఒలికిపోతాయి నాకు. (ఆ సినిమా సారాంశంతో నేను ఏకీభవించినా ఏకీభవించకున్నా..)
బాలచందర్ గారి ‘ఆకలిరాజ్యం’ సినిమాలో కమల్ హసన్ తన ప్రియురాలు కూడా దూరమవుతున్న విపత్కర క్షణంలో పాడుకున్న శ్రీశ్రీ గీతం ‘ఏదిసత్యం ఏదసత్యం ఓ మహాత్మా, ఓ మహర్షీ’ ని వింటూ బావురుమని విలపించడం కూడా మర్చిపోలేను నేటికీ. ఇప్పటికీ ఆ గీతం విన్నా, చూసినా అదే ఏడుపు. విషాదం సామాజికరూపం తీసుకున్నప్పుడు మనుషుల ఉద్వేగాలను అమాంతం తట్టిలేపే కమనీయ దృశ్యమిది.
తర్వాత అన్నమయ్య సినిమాలో ‘అంతర్యామీ.. అలసితీ..’ అనే చివర్లో వచ్చే పాట అలాగే ఏడిపించిది. ఇప్పటికీ అది నన్ను ఏడిపిస్తోనే ఉంది. భక్తిసాహిత్య చరిత్రలో మనకాలంలో వచ్చిన అద్వితీయ రచన ఇది.
ఆ తర్వాత మీ బొమ్మరిల్లు.. ‘మొత్తం మీరే చేశారు’ అంటూ సిద్ధూ తండ్రిపై చేసిన ఆరోపణ.. కోట్లమంది యువతరాన్నే కాదు తల్లిదండ్రులనే కాదు. ఒక సమకాలీన సమాజాన్నే తీవ్రంగా కదిలించివేసింది. పిల్లలు ఏం తినాలి, ఏం చూడాలి, ఏం చదవాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని చేసుకోవాలి అనే సమస్త అశాలనూ తల్లిదండ్రులే నిర్దేశిస్తున్న, శాసిస్తున్న సమాజానికి సిద్ధూ ఆక్రోశం ఒక పొలికేకలా తగిలింది.
అడుగడుగునా పిల్లల బాల్యం ఖండితమవుతోదిక్కడ. పిల్లల ఇష్టాలు ఖండితమైపోతున్నాయి. వాళ్ల ఉద్వేగాలు, భావాలు సమస్తమూ ఖండించబడుతున్నాయిక్కడ
ఖండిత భావాలు, ఖండిత ఆలోచనలు, ఖండిత ఇష్టాలు, ఖండిత ఉద్వేగాలు… ఇలా బాల్యం బాల్యమే ఖండించబడుతున్న సమాజానికి బొమ్మరిల్లు సినిమా ఒక మేలుకొలుపు అయింది కాబట్టే తెలుగు సమాజం ఆ సినిమాలో తనను తాను పోల్చుకుంది.
నాన్న కన్నీరు మిమ్మల్ని మారిస్తే, బొమ్మరిల్లు సినిమాలో ఆ ఒక్క సంభాషణతో కోట్లమందికి కన్నీరు తెప్పించారు.
బొమ్మరిల్లు ధనికవర్గ జీవితానికి పట్టం కట్టి ఉండవచ్చు…. టేకిట్ ఈజీ అనే మన కాలపు తారకమంత్రాన్ని అది దృశ్యరూపంలోకి మార్చి ఉండవచ్చు..
కాని అది కోట్ల హృదయాలను ఒక్క సింగిల్ డైలాగ్తో ఊగించింది. బాల్యం అనే ఖండిత జ్ఞాపకాలకు, పిల్లల బాధలకు, ఆరాటాలకు ఆక్రోశాలకు శ్వాసగా, ప్రతిరూపంగా మారింది.
ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా కళను దీప్తిమంతం చేసిన డైలాగ్ అది.
అందుకే మీరు నిలిచిపోయారు. తెలుగు సినీ ప్రేమికుల హృదయాల్లో శాశ్వతంగా నిల్చిపోయారు. సమకాలీన ప్రపంచం గుండెల్లో బొమ్మరిల్లు కట్టుకుని ఉండిపోయారు. బొమ్మరిల్లు ముందూ, తర్వాతా మీకు మరేమీ లేదన్నంతగా ఈ తరం జ్ఞాపకాల్లో మిగిలిపోయారు.
బొమ్మరిల్లు భాస్కర్ గారూ! ఈ ఆదివారం ఒక కమ్మటి జ్ఞాపకాన్ని మళ్లీ గుర్తుచేసి చెమ్మగిల్లజేసినందుకు మీకు మనఃపూర్వక కృతజ్ఞతలు..
మీకు యూనికోడ్ గౌతమి ఫాంట్లోని ఈ తెలుగు ఇమెయిల్ అందుతుందో లేదో, బిజీ షెడ్యూల్లో మీరు ఈమెయిల్స్ చూడగలరో లేదో తెలియదు.
అందుకే నా చందమామలు బ్లాగులో కూడా నా ఈ స్పందనను ప్రచురిస్తున్నాను.
కోట్లమంది కంట కన్నీరు… “బొమ్మరిల్లు”
blaagu.com/chandamamalu
రాజశేఖర రాజు.
చందమామ
7305018409
బాల్యం ఖండించబడుతుండటానికి సంబంధించి నా మరో బ్లాగులో కింది కథనం గతంలో ప్రచురించాను. వీలయితే చూడండి.
పాలు ఒలికిపోయినప్పుడు
http://kanthisena.blogspot.in/2010/12/blog-post_1521.html
Filed under బొమ్మరిల్లు | Comments (3)
ద్రావిడ భాషల యుగకర్త భద్రిరాజు కృష్ణమూర్తి ఇక లేరు….
భాషా శాస్త్ర చరిత్రలో, ప్రత్యేకించి ద్రావిడ భాషా శాస్త్ర అధ్యయన చరిత్రలో ఒక యుగకర్త ఇక లేరు. 20వ శతాబ్దిలో ఆధునిక శాస్త్రీయ పద్ధతుల్లో ద్రావిడ భాషా పరిశోధన చేసి ద్రావిడ భాషాధ్యయన రంగానికి శాస్త్రీయతను సాధించిపెట్టిన మేటి భాషా శాస్త్రజ్ఞుడు భద్రిరాజు కృష్ణమూర్తి గారు ఈ శనివారం ఉదయం కన్నుమూశారు.
గత రెండు శతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యయనంలో సాధించిన అభివృద్ధిని సాధికారంగా చర్చించిన ‘ద్రవిడయన్ లాంగ్వేజెస్’ ఉద్గ్రంథానికి ఈయనే కర్త. వర్తమాన తరం ద్రావిడ భాషా శాస్త్రజ్ఞులకు ప్రామాణిక గ్రంథంగా నిలిచిన యుగకర్తృక రచన ఇది. విశ్వవిద్యాలయాల్లోని తెలుగు సాహిత్య, భాషా శాస్త్ర విభాగాల్లో ఆయన రచించిన భాషాధ్యయన గ్రంథమే దశాబ్దాలుగా పాఠ్యంగా ఉంటూ వస్తోంది. ద్రావిడ భాషా తత్వం గురించి, తెలుగు ధాతువుల ప్రాతిపదిక స్వరూప స్వభావాల గురించి, తెలుగు భాష నవీకరణ గురించి ఆయన ఎన్నో పరిశోధనా గ్రంథాలు, వ్యాసాలు రచించారు.
ద్రావిడ భాషల అధ్యయనంలో కొత్త అధ్యాయంగా మారి నిలిచిన ఆచార్యుడు భద్రిరాజు కృష్ణమూర్తి ఈ రంగంలో ఆధునిక తులనాత్మక అధ్యయన పద్ధతిని ప్రవేశపెట్టిన పరిశోధకుడిగా చరిత్రకెక్కారు. రెండు శతాబ్దాల క్రితం ఆంగ్ల భాషా శాస్త్రజ్ఞుడు బిషప్ రాబర్ట్ కాల్డ్వెల్ ద్రావిడ భాషల అధ్యయనానికి కొత్త బాటలు తీస్తే, ఆయన మార్గంలో ముందుకు సాగిన భద్రిరాజు 1949 నుంచి ఎన్నెన్నో అపూర్వమయిన పరిశోధన పద్ధతులు అమలు చేస్తూ పోయారు.
అచ్చమైన పరిశోధన
ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ పరిశోధన మొదలుపెట్టే నాటికి ఆ శాస్త్రం శిశుప్రాయంలో ఉంది. బిషప్ కాడ్వెల్, డాక్టర్ ముర్రె బి.ఎమెనో, బరో, భద్రిరాజు కృష్ణమూర్తి వంటి హేమాహేమీల అద్వితీయ కృషి ఫలితంగా ఈ రోజున ద్రావిడ భాషా శాస్త్రపరిశోధన కొమ్మలూ రెమ్మలతో విస్తరించి మహావృక్షంగా ఎదిగింది. “మన దేశంలో మాత్రమే కాదు- అంతర్జాతీయంగానే ఈ అధ్యయన విభాగానికి అపారమయిన ప్రాముఖ్యం దక్కుతోంది ఇప్పుడు. సాహిత్యం- భాష- శాసన పరిశోధన- సాంస్కృతిక చరిత్రలాంటి రంగాల్లోనే కాకుండా మానవశాస్త్రం, సమాజ పరిణామ శాస్త్రం, ఆచార వ్యవహారాల అధ్యయనం, సాంస్కృతిక సంప్రదాయాల విశ్లేషణ, పండగలూ పబ్బాల అన్వయం- ఇలా అనేక అధ్యయన విభాగాల్లో భద్రిరాజు పరిశోధనలకు కీలకమయిన ప్రాధాన్యం ఉంటోంది.”
వృత్తి పద కోశాల నిర్మాణం. వ్యవసాయం నుంచి మొదలుపెట్టి, చేనేత తదితర వృత్తులవాళ్లు వినియోగించే పారిభాషిక పదాలను ఒకచోట చేర్చి, చరిత్ర కోసం భద్రపరచడం కృష్ణమూర్తి గారి మార్గదర్శకత్వంలో సాగిన అద్భుతమయిన కృషి. భారతదేశ భాషా చరిత్రలోనే మొట్టమొదటి మేటి కృషి ఇంది. ఆరు దశాబ్దాలకు పైగా, ద్రావిడ భాషల్లో పరిశోధనా కృషితో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు దక్కింది.
1986-87 ప్రాంతంలో ఎస్వీ యూనివర్శిటీలో జరిగిన ఒక సెమినార్ సందర్భంగా భద్రిరాజు గారు తిరుపతికి వచ్చినప్పుడు అప్పటి నా పరిశోధన గైడ్ పి.సి నరసింహారెడ్డి తరపున వీరిని ప్రత్యక్షంగా కలిసిన అనుభవం నాకు దక్కింది.
సమకాలీన భారతీయ భాషాశాస్త్రవేత్తల్లో, మౌలిక భాషా పరిశోధకుల్లో, ఆధునిక నిఘంటు నిర్మాతల్లో అగ్రగణ్యులయి ప్రపంచప్రఖ్యాతి పొందిన ఒకే ఒక్కరు భద్రిరాజు కృష్ణమూర్తిగారు. గిడుగు గురజాడల వారసులుగా వ్యావహారిక భాషోద్యమ లక్ష్యాన్ని, సర్వోన్నత విద్యాస్థాయివరకు విస్తరింపజేసి కృతకృత్యులయి తెలుగు భాష సమగ్రాభివృద్ధికి బహు విధాలుగా కృషి చేసిన మహనీయుడీయన.
తెలుగు క్రియా ప్రాతిపదికల మీద పరిశోధన చేసి పిహెచ్.డి. డిగ్రీ అందుకున్న భద్రిరాజు కృష్ణమూర్తి గారిని అనేక విదేశీయ విద్యాలయాలు, అమెరికా, జపాన్, జర్మనీ, రష్యా వంటి దేశాల్లోని సంస్థలూ, భద్రిరాజు వారిని ఆచార్య పదవితో ఆహ్వానించాయి. యునైటెడ్ కింగ్డమ్ లోని రాయల్ సొసైటీ అఫ్ ఎడింబర్ వరిష్ఠ విశిష్ట సభ్యత్వం ఈ సందర్భంలో చెప్పుకోదగ్గది. 2004లో మొత్తం భారతీయుల్లో ఈ గౌరవాన్ని పొందినవారు భద్రిరాజు కృష్ణమూర్తి గారొక్కరే.
తెలుగు ధ్వనుల ఉచ్చారణ గురించి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో వీరు చేసిన కృషి విశిష్టమయినది. దేశవిదేశాల్లోని అనేక ఉన్నత విద్వత్ సంస్థల నుండి ఇంత గుర్తింపూ ఇన్ని గౌరవాలూ పొందిన వారు కోట్ల మందికి ఒక్కరుండటం అరుదు!
“భారతదేశం మొత్తం మీద తొలిసారిగా విదేశాల్లో భాషాశాస్త్రాధ్యనం చేసి పరిశోధన కావించారు భద్రిరాజు కృష్ణమూర్తిగారు. భాషాశాస్త్ర సిద్ధాంతాల అనువర్తనం గాని, వివిధ కోణాల్లో భాషాధ్యయనం గాని, భారతీయ భాషల్లో మరో భాషలోనూ జరగనంత కృషి తెలుగు జరగడానికి ప్రధాన కారకులు వీరే. దక్షిణాసియా భాషల్లో ఆధునిక భాషా శాస్త్ర పద్ధతిలో వృత్తిపదకోశాల నిర్మాణం తొలిసారిగా తెలుగులోనే జరగడానికి కారకులు వీరు. తెలుగులోని ఆధునిక భాషా మండలాలను వర్గమాండలికాల స్వరూపాన్ని తొలిసారి శాస్త్రీయంగా నిరూపించిన వారూ, ప్రమాణ భాషా లక్షణాలనూ ప్రయోజనాలనూ నిర్దిష్టంగా నిర్వచించి స్పష్టపరిచిన వారు కృష్ణమూర్తిగారు. అన్ని స్థాయిల పాఠ్య పుస్తకాల్లోను వాడుక భాషను ప్రవేశపెట్టడానికి జరిగిన ప్రయత్నంలో సఫలత సాధించి సత్ఫలితాలు చూపించారు.”
“విదేశీయులకు, వివిధ భాషీయులకు ఇంగ్లీష్ ద్వారా తెలుగు బోధించడానికి సాధన సామగ్రిని తయారు చేశారు. తెలుగు-ఇంగ్లీష్ నిఘంటు నిర్మాణానికి పూనుకున్నారు. తెలుగు అకాడమి చేపట్టిన సామాజిక భాషా పరిశీలన పథకానికి స్వరూప స్వభావాలను, విధివిధానాలు నిర్ణయించారు. ఆధునికమైన తెలుగు భాషకు ఇంగ్లీషులో (గ్విన్ గారితో కలిసి) వ్యాకరణ గ్రంథం రచించారు. భాషాయోజనావశ్యకతను, భాషాభివృద్ధి వ్యూహాలను విపులంగా చర్చించారు. తెలుగులోనూ ఇతర భారతీయ భాషల్లోను ప్రతికా భాషలో కనిపించే నూతన పద కల్పన విధానాలను పరిశీలించడానికి వీరు దేశంలో ప్రప్రథమంగా ఒక జాతీయ సదస్సు నిర్వహించి దాని ఫలితాలను పుస్తకరూపంలో ప్రచురించారు. దీని ప్రేరణవల్ల పత్రికాభాష ఒక ప్రత్యేక పరిశోధన రంగంగా దేశంలో విస్తరించింది. చదువురాని వయోజనులకు తెలుగు నేర్పడానికి తగిన పుస్తకాలను శాస్త్రీయంగా తయారు చేశారు.”
డాక్టర్ మర్రీ బి. ఎమెనో గారి ప్రియశిష్యులు
కెనడాలో పుట్టి, ఇంగ్లాండూ అమెరికాలలో చదువుకుని, అమెరికాలో పనిచేస్తూ… భాషా పరిశోధన కోసం భారత దేశం వెళ్ళి, ఆ జన జీవన స్రవంతిలో కలిసిపోయి, దక్షిణ భారతీయ భాషలూ, శబ్దాలూ, శబ్ద వ్యుత్పత్తులపై (Linguistics, phonetics and Etymology) పరిశోధన చేసి, వాటిని వెలుగు లోకి తెచ్చిన భాషామహర్షి డాక్టర్ మర్రీ బి. ఎమేనో గారి ప్రియశిష్యులు భద్రిరాజు కృష్ణమూర్తి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పని చేసిన కీ.శే. బర్రో తో కలిసి ఎమెనో ప్రచురించిన ‘ద్రావిడ భాషావ్యుత్పత్తి విశేష నిఘంటువు (Dravidian Etymological Dictionary,aka. DED)’ తరతరాలకూ నిలిచిపోయే ఉద్గ్రంథం.
ఎమెనో గారికి భద్రిరాజుగారు భాషాధ్యయనంలో శిష్యుడైన చరిత్రను ఆయన మాటల్లోనే విందాము.
“కృష్ణమూర్తి తెలుగు భాషపై పరిశోధన చేయడానికై పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో చేరాడు. కానీ అక్కడ ద్రవిడ భాషలు తెలిసినవారు ఎవరూ లేకపోవడంచేత అతని సిద్ధాంత వ్యాసానికి పర్యవేక్షకుడిగా ఉండమని నన్ను కోరారు. నాకు భాషాశాస్త్రం తెలిసినా తెలుగు అంతగా రాదు, మరి అతనేమో తెలుగులో ఉద్దండుడు. అలా మా జంట సరిగ్గా కలిసింది. చాల మంచి పరిశోధనలు చేశాం మేమిద్దరమూ కలిసి. అతను, చాలా మంచి మనిషి. గొప్ప శాస్త్రజ్ఞుడు మాత్రమే కాదు, గొప్ప అధ్యాపకుడూ, పరిపాలనాదక్షుడు కూడా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర విభాగాన్ని ఎంత వృద్ధిలోకి తెచ్చాడో! అతను హైదరాబాదు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడుగా ఉన్నప్పుడు, నాకొక గౌరవ డాక్టరేటు ఇచ్చారు. నాకు చేయబడిన అన్ని సన్మానాల్లోనూ ఇదంటే నాకు చాలా గర్వమూ, మక్కువానూ. నా ప్రియ శిష్యుడిచ్చింది కదా!”
(దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో
http://www.eemaata.com/em/issues/200209/73.html నుంచి)
తెలుగు వ్యాకరణం, మాండలిక భాషలు, నిఘంటు నిర్మాణం, అక్షరాస్యతా వ్యాపనం, ద్రావిడ భాషల తులనాత్మక అధ్యయనం వంటి విషయాల్లో కృష్ణమూర్తిగారిది మార్గదర్శకమైన కృషి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమకాలీన ప్రముఖ భాషావేత్తల మన్ననలందుకున్న భద్రిరాజు గారు ద్రావిడ భాషా శాస్త్ర అధ్యయనంలో యుగకర్తృత్వ రచనలు చేశారు.
ఇప్పటి వరకు భద్రిరాజు వారు తెలుగులోను, ఇంగ్లిషులోను ప్రచురించినవి 25 గ్రంథాలూ, నూటికి పైగా పరిశోధన వ్యాసాలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ఇంగ్లిష్ పుస్తకాలు
1. A Grammar Of Modern Telugu by Bhadriraju Krishnamurti, J.P.L. Gwynn
2. Telugu Verbal Bases: A Comparative And Descriptive Study
3. Comparative Dravidian Linguistics: Current Perspectives
(This volume is a contribution both to comparative Dravidian studies and to the theory of language change and linguistic reconstruction. It makes available the author’s most important published articles on Dravidian over the last forty years and includes a new and substantial introduction to the field. The book concludes with a survey of Dravidian language studies over the last thousand years and a critical account of work since 1950. Those articles reprinted in the work appear substantially unchanged, with individual comments.)
4. Language, Education and Society
5. The Dravidian Languages (published 2003 — 2 editions)
(The Dravidian languages are spoken by nearly 200 million people in South Asia and in diaspora communities around the world. They include Tamil, Malayalam, Kannada and Telugu, as well as over 20 non-literary languages. Bhadriraju Krishnamurti, one of the most eminent Dravidianists of our time, provides a linguistic overview of the Dravidian language family. He describes its history and writing system, discusses its structure and typology, and considers its lexicon. Distant and more recent contacts between Dravidian and other language groups are also covered.)
6. Konda or Kubi A Dravidian Language (Hyderabad Government of Andhra Pradesh, 1969)
7. Gold Nuggets An Anthology of Selected Post-independence of Telugu Short Stories in English (Translations) (ed with C. Vijayasree)
కృష్ణమూర్తిగారు తెలుగులో ప్రచురించిన గ్రంథాల్లో ఆరింటికి సంపాదకత్వం వహించారు
1. మాండలిక వృత్తిపదకోశం (తొలి సంపుటం) – వ్యవసాయ పదాలు (1962)
2. మాండలిక వృత్తిపదకోశం (రెండో సంపుటం) – చేనేత పదాలు (1971)
3. తిక్కన పదప్రయోగకోశం – మూడు సంపుటాలు (1971, 1974, 1977) (మరో ఇద్దరు సంపాదకులతో కలిసి)
4. తెలుగు భాషా చరిత్ర (1974 – తరువాత ఏడెనిమిది సార్లు పునర్ముద్రణ అయింది)
వీరు స్వయంగా రచించినవి:
1. జనవాచకం – ఐదు పుస్తకాలు (ఈశ్వరరెడ్డిగారితో కలిసి) (1980)
2. తేలిక తెలుగు వాచకం – రెండు భాగాలు (1993)
3. చిన్ననాటి పద్యాలు (1998)
4. భాషా-సమాజం-సంస్కృతి (1999) ఈ గ్రంథంలోని వ్యాసాలన్నీ సామాజిక భాషా శాస్త్ర సంబంధమయినవి.
మన కాలపు మేటి భాషా శాస్త్రవేత్త అయిన ఈ యుగకర్తపై ఆన్లైన్లో గత కొంత కాలంగా నేను సేకరించిన ప్రామాణిక సమాచారాన్ని లింకులతో సహా ఇక్కడ ఇస్తున్నాను. భాషా శాస్త్ర అధ్యయనకారులకు, ద్రావిడ భాషల చరిత్రపై జిజ్ఞాసువులకు ఈ కింది లింకులలోని సమాచారం ఉపయోగపడుతుందని నా ఆశ.
భద్రిరాజు కృష్ణమూర్తి గారికి నివాళిగా రూపొందిన ఈ కథనంకు సోర్స్గా నిలిచిన ఈమాట.కామ్ రచనలు, వివిధ పత్రికలు, వెబ్సైట్లకు నా కృతజ్ఞతలు.
నిన్న రాత్రి ప్రచురించిన ఈ కథనం లింకులకు అదనంగా ఇవ్వాళ వివిధ పత్రికలలో వచ్చిన ప్రధాన వార్తలు, కథనాల లింకులను ఇక్కడ ఇస్తున్నాను. వీటి తర్వాత వివిధ వెబ్సైట్లలో భద్రిరాజు కృష్ణమూర్తి గారిపై గతంలో వచ్చిన కథనాల లింకులను యధాతథంగా చూడవచ్చు.
భద్రిరాజు కృష్ణమూర్తిపై ప్రధాన వార్తలు – పత్రికలు
మన కాల్డ్వెల్ కన్నుమూశాడు!_ఈనాడు ప్రధాన వార్తాకథనం
నేలకొరిగిన భాషా శిఖరం – భద్రిరాజు కృష్ణమూర్తి అస్తమయం
http://www.eenadu.net/Homeinner.aspx?item=news/panel7
ఆచార్య భద్రిరాజు అస్తమయం_సాక్షి ప్రధాన వార్త
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=429970&Categoryid=1&subcatid=33
భాషా రారాజు.. భద్రిరాజు ఇకలేరు_ఆంధ్రజ్యోతి ప్రధాన వార్త
http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/aug/12/main/12main10&more=2012/aug/12/main/main&date=8/12/2012
భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి కన్నుమూత
http://telugu.oneindia.in/news/2012/08/11/andhrapradesh-linguist-bhadriraju-krishnamurti-passes-away-104020.html
భద్రిరాజు కృష్ణమూర్తిపై తాజా పత్రికా కథనాలు – నివాళి
భాషా శాస్త్ర రారాజు_ఈనాడు కథనం
డాక్టర్ అద్దంకి శ్రీనివాస్
http://www.eenadu.net/Editorial/vyakyanaminner.aspx?qry=opini2
విశిష్ట భాషావేత్త!_సాక్షి కథనం
నివాళి
http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=46985&Categoryid=1&subcatid=18
భద్రిరాజుకు పీసీఎన్ నివాళి_సాక్షి
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=429733&subcatid=7&Categoryid=3
భాషకు రారాజు!_సాక్షి కథనం
Written by MK On 8112012 50300 PM
http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=46918&Categoryid=28&subcatid=0
భాషా శాస్త్ర మహోపాధ్యాయుడు_ఆంధ్రజ్యోతి కథనం
ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు
http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/aug/12/edit/12edit4&more=2012/aug/12/edit/editpagemain1&date=8/12/2012
ఆధునిక తెలుగు భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి_ ఆంధ్రభూమి కథనం
-సామల రమేష్ బాబు తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు 12082012
http://www.andhrabhoomi.net/content/bhadriraju
భాషే శ్వాసగా మిగిలిన భద్రిరాజు
http://aksharajalam.wordpress.com/2012/08/12/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B1%87-E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D/
వివిధ వెబ్సైట్లలోని పాత కథనాల లింకులు
http://te.wikipedia.org/wiki/%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81_%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF
భద్రిరాజు కృష్ణమూర్తి గారికి తెలుగు భారతి పురస్కారం
రచన సి. పి. బ్రౌన్ అకాడమి
http://www.eemaata.com/em/issues/200805/1255.html
మేరు నగ మేధావి
రచన : కె. కె. రంగనాథాచార్యులు
http://www.eemaata.com/em/category/library/bhadriraju/
ఆలోచింపచేసిన మనిషి
రచన : వెల్చేరు నారాయణరావు
http://www.eemaata.com/em/issues/200806/1289.html
భాషాశాస్త్రానికి పర్యాయపదం భద్రిరాజు
రచన చేకూరి రామారావు
http://www.eemaata.com/em/issues/200806/1292.html
మాండలిక వృత్తి పదకోశం
రచన ఆరుద్ర
http://www.eemaata.com/em/issues/200806/1290.html
మాండలిక వృత్తిపదకోశ నిర్మాణం: భద్రిరాజువారి మార్గదర్శకత్వం
రచన : బూదరాజు రాధాకృష్ణ
http://www.eemaata.com/em/issues/200806/1287.html
http://www.engr.mun.ca/~adluri/telugu/language/linguistics/krishnamurti.html
http://en.wikipedia.org/wiki/Bhadriraju_Krishnamurti
భద్రిరాజు కృష్ణమూర్తి గారితో ఇంటర్వ్యూ
రచన : సుమనస్పతి
http://www.eemaata.com/em/issues/200807/1301.html
ప్రామాణిక భాష ప్రాంతాన్ని తెలిపేది కాదు!
http://vrdarla.blogspot.in/2009/08/blog-post_28.html
2005లో 101 ఏళ్ల వయసులో తన గురువు శ్రీ మర్రి ఎమెనో అమెరికా కాలిఫోర్నియాలోని బర్క్లీలో కన్నుమూసిన సందర్భంగా ఆయనకు నివాళి పలుకుతూ ఆయన శిష్యుడు భద్రరాజు కృష్ణమూర్తి గారు పంపిన నివాళిని ఈ లింకులో చూడవచ్చు
Homage to a Western Indologist
by Bh. Krishnamurti, PhD
http://linguistics.berkeley.edu/people/emeneau/homage.html
దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో
రచన : మాధవ్ మాచవరం
http://www.eemaata.com/em/issues/200209/73.html
(తెలుగు భాషా, సాహిత్య చరిత్రలోకెల్లా అతి గొప్ప ఇంటర్వ్యూలలో ఒకటి. శ్రీ మర్రీ ఎమెనో ప్రియ శిష్యుడు భద్రిరాజు కృష్ణమూర్తి గారు)
http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B0%BE_%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101
రచన : సురేశ్ కొలిచాల
http://www.eemaata.com/em/issues/200701/1049.html?allinonepage=1
తెలుగు భాష వయస్సెంత
రచన సురేశ్ కొలిచాల
http://www.eemaata.com/em/issues/200511/43.html
http://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1_%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B0%B2%E0%B1%81
Telugu is 2,400 years old, says ASI
Special Correspondent
http://www.hindu.com/2007/12/20/stories/2007122054820600.htm
http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B0%BE_%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0(%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%82)
http://en.wikipedia.org/wiki/Murray_Barnson_Emeneau
Professor Murray Emeneau Remembered
http://linguistics.berkeley.edu/people/emeneau/tributes.html
http://sangamtamilforeignscholars.wordpress.com/t-burrow-and-m-b-emeneau/
Murray Emeneau — famed UC Berkeley linguist
Patrick Hoge, Chronicle Staff Writer
Published 0400 a.m., Monday, September 12, 2005
http://www.sfgate.com/bayarea/article/Murray-Emeneau-famed-UC-Berkeley-linguist-2569700.php
Filed under Bhadriraju Krishnamurthi | Comments (4)ఈమెకు నోబెల్ రాలేదు…
ఈమె పేరు ఇరెనా సెండ్లర్. 2008 మే 12న 98 ఏళ్ల వయస్సులో పోలెండ్లోని వార్సాలో ఈమె కనుమూశారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో, వార్సాలోని నాజీల గ్యాస్ చాంబర్లో మురికినీటి గొట్టాలను అతికించే నిపుణురాలిగా పనిచేయడానికి ఇరెనా అనుమతి పొందింది. ఈ పని చేయడంలో ఆమెకు మరొక ఉద్దేశం ఉంది.
తను మోసుకెళ్లిన పనిముట్ల పెట్టె అడుగు భాగంలో, నాజీల చిత్రహింసల శిబిరాలలో ఉంటున్న యూదు శిశువులను దాపెట్టిన ఇరెనా, వారిని అలా ఆ శిబిరాలనుంచి నాజీలకు తెలియకుండా తరలించేది. మరింత పెద్ద వయసు పిల్లలను తరలించడానికి తన ట్రక్ వెనుకన ఆమె ఒక గోనె సంచిని పెట్టుకుని వెళ్లేది.
నాజీ సైనికులు చిత్రహింసల శిబిరంలోకి ఆమెను అనుమతించి, బయటకు పంపుతున్నప్పుడు ఇరెనా తన వెంట ఒక కుక్కను తీసుకెళ్లి అది ఆ సమయాల్లో మొరిగేలా దానికి శిక్షణ ఇచ్చింది.
సైనికులు తమ ముందు మొరుగుతూ వెళ్లే ఈ కుక్కను ఏమీ చేసేవారు కారు. కుక్క మొరుగుడు ఇరెనా తరలిస్తున్న శిశువులు చేసే శబ్దాలు బయటకు రాకుండా అడ్డుకునేది.
ఇలా ఆమె 2500 మంది యూదు శిశువులను అప్పట్లో గ్యాస్ చాంబర్ల నుంచి బయటకు తరలించగలిగింది.
చివరకు ఒక రోజు ఆమె పట్టుబడింది. నాజీలు ఆమె కాళ్లూ చేతులూ విరిచి చితకబాదారు.
ఇలా తను తరలించిన శిశువుల పేర్ల చిట్టాను తన ఇంటి పెరడు లోని ఒక చెట్టు కింద గ్లాస్ జాడీలో పెట్టి భద్రపర్చింది ఇరెనా
యుద్ధం ముగిసిన తర్వాత ఈ పిల్లల తల్లిదండ్రులలో ఎవరైనా బతికి ఉంటే వారిని కనుక్కునేందుకు ఆమె ప్రయత్నించింది. పిల్లలను వారి కుటుంబాలతో కలిపేందుకు కూడా ప్రయత్నించింది.
కాని పిల్లల తల్లిదండ్రులలో చాలామంది గ్యాస్ ఛాంబర్లకు బలయ్యారు. ఆమె కాపాడిన పిల్లలను క్రైస్తవ శరణాలయాలు స్వీకరించాయి లేదా దత్తత తీసుకున్నాయి.
2007లో ఇరెనా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయబడింది. కాని ఆమె ఎంపిక కాలేదు.
భూతాపంపై స్లయిడ్ షో ప్రదర్శించిన అల్ గోరెకి ఆ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి దక్కింది.
మరొక రాజకీయనేత బరాక్ హుస్సేన్ ఒబామా ఆక్రోన్ -ACORN- కోసం కమ్యూనిటీ ఆర్గనైజర్గా వ్యవహరించినందుకు నోబెల్ శాంతి బహుమతి గెల్చుకున్నాడు.
ఇరెనా చేపట్టిన సాహసిక చర్యకు ఇప్పుడు 65 ఏళ్లు. యూరప్లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 65 ఏళ్లయింది.
60 లక్షల మంది యూదులు, 2 కోట్ల మంది రష్యన్లు, కోటి మంది క్రైస్తవులు, 1,900 మంది కేథలిక్ ప్రీస్ట్లు ఈ యుద్ధంలో చంపబడ్డారు, ఊచకోతకు గురయ్యారు. రేప్ చేయబడ్డారు, తగులబెట్టబడ్డారు, పస్తులతో చంపబడ్డారు, అవమానించబడ్డారు.
వీరి స్మృతిలో ఒక మెమోరియల్ చైన్లో భాగంగా ఈ ఇమెయిల్ పంపబడింది.
ఆ దారుణ మారణ కాండను ప్రపంచం ఎన్నటికీ మర్చిపోకుండా చేయడమే ఈ ఇమెయిల్ లక్ష్యం.
ఎందుకంటే మళ్లీ దాన్ని చేయాలని ఇతరులు అనుకుంటున్నారు మరి.
ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ప్రజలకు ఈ ఇమెయిల్ చేరాలని ఉద్దేశించబడింది.
ఈ మెమోరియల్ చైన్లో మనమూ భాగం పంచుకుందాం.
Remember this lady! — no Nobel for her.
మీకు తెలిసిన వారికి ఈ ఇమెయిల్ను పంపండి. వారిని కూడా ఇతరులకు దీన్ని పంపమని కోరండి.
దయచేసి ఈ ఇమెయిల్ను డిలెట్ చేయవద్దండి. దీన్ని మరొకరికి పంపడానికి మీకు ఒకే ఒక నిమిషం సమయం పడుతుంది అంతే.
ఆల్కహాలిక్ పిల్లలు, బుజ్జి రచయిత్రి శ్రీదేవి మురళీదేవి గారు ఈ ఇమెయిల్ సమాచారాన్ని అందించారు. వారికి కృతజ్ఞతలు.
ఈ కారుణ్య కథనం చదివాక ఒక సందేహం…
ఇంతకీ…
ఇరెనా గొప్పదా…. నోబెల్ గొప్పదా….
Filed under సమాజం | Comments (3)ఆమె కావాలి… ఇండియాకు పంపించండి….
మిత్రులు సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు ఇవ్వాళ ఉదయమే ఒక మహాద్భుతమైన వార్తను ఈమెయిల్లో పంపించారు.
ఆస్ట్రేలియాలో 81 సంవత్సరాల వృద్దురాలు ఎవా ఎస్టెల్లెకు జీవిత చరమాంకంలో ఒక అనూహ్య ఘటన ఎదురైంది. ఇద్దరు దొంగలు 18 ఏళ్ల వయసున్న ఈ బామ్మ మనవరాలిపై లైంగిక అత్యాచారం చేశారు. నడవడం కూడా కష్టంగా ఉండే ఆ పండువయసులో ఆ బామ్మ రాంబోవతారం ఎత్తి వారం రోజుల పాటు గాలించి తన మనవరాలిపై అత్యాచారం జరిపిన ఇద్దరు దుండుగలను పట్టుకుంది. తనదైన ప్రత్యేక మార్గంలో వారిపై ప్రతీకారం తీర్చుకుంది.
హోటల్లో ఉన్న దుండుగుడు డేవిస్ ఫర్త్, అతడి మాజీ జైలు సహచరుడు స్టాన్లీ థామస్లను హోటల్ రూమ్లో వెతికి పట్టుకున్న ఈ బామ్మ తన వద్ద ఉన్న 9-ఎమ్ ఎమ్ పిస్టల్తో వారి అంగాలను, వృషణాలను ఛిద్రమయ్యేలా కాల్చిపారేసింది.
తర్వాత నింపాదిగా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి సార్జెంట్ బల్లపై పిస్తోలు పెట్టి ఇలా అంది.
“దేవుడి దయవల్ల, ఈ లం.. కొ.. లు ఇకపై ఎవరినీ అత్యాచారం చేయలేరు.”
“ఆమె చేసింది తప్పే, ఆమె చట్టాన్ని ఉల్లంఘించారు. కాని 81 సంవత్సరాల వయస్సున్న ఈ ముదుసలిని జైలులో పెట్టటమంటే చాలా కష్టమైన విషయం… అందులోనూ మెల్బోర్న్ నగరంలోని 3 మిలియన్ల మంది ప్రజలు ఆమెను నగర మేయర్గా ఎన్నుకోవాలనుకుంటున్నప్పుడు ఈ పని చేయడం మరీ కష్టం…” అంటూ ఒక అధికారి వ్యాఖ్యానించారు.
తన కుటుంబ సమస్యకు ఒక వృద్దురాలు ఎన్నుకున్న భయానక పరిష్కారం సమాజానికి సమ్మతం అవునో కాదో కాని పురుషాంగం కలిగి ఉన్న మదాంధకారంతో కన్ను మిన్ను గానకుండా ప్రవర్తించే ముష్కరులు జీవితాంతం మర్చిపోలేని ‘తూటా మూద్ర’ను ఆమె ఈ ప్రపంచానికి చూపించారు.
“Those bastards will never rape anybody again, by God.”
ప్రపంచ చరిత్రలో ఏ నాటకంలో అయినా, ఏ నవల్లో అయినా, ఏ సినిమాలో అయినా ఇంతటి భారమైన, ఇంతటి న్యాయపూరితమైన ధర్మాగ్రహ ప్రకటనను మనం ఇంతవరకూ ఎక్కడైనా చూశామా?
దీంతో పోలిస్తే కాళీపట్నం రామారావు గారి “యజ్ఞం” కథలో తన అప్పులు వారసత్వంగా లభించకూడదంటూ తన కొడుకునే ఉన్న ఫళానా నరికివేసిన ఆ తండ్రి చర్య ఏపాటిది?
దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం అమెరికాలో, లోరెనా బాబిట్ అనే వివాహిత మహిళ తన తాగుబోతు భర్త పెడుతున్న క్రూర హింసలను భరించి భరించి ఒక మంచి రోజు చూసుకుని అతడి ఆంగాన్ని వంట కత్తితో తరిగేసి దాన్ని పట్టుకుని కాలువలో విసిరేసి తీరిగ్గా పోలీస్ స్టేషన్కు వెళ్లి కూచున్న ఘటన బహుశా అందరికీ గుర్తుండవచ్చు. భర్త అంగాన్ని పరపరా కోసేసిన ఆ ధీరురాలికి మద్దతు ప్రకటించడంలో, వ్యతిరేకత ప్రదర్శించటంలో అమెరికా సమాజం అప్పట్లో రెండుగా చీలిపోయింది.
లోరెనా బాబిట్ చేసిన ఈ సాహసోపేత చర్యకు గుర్తుగా ఆమె చర్య బాబిటైజేషన్ -Babitization- అనే పదంగా నిఘంటువుల్లో కూడా ఎక్కిపోయింది.
స్త్రీలపై అత్యాచారాలు ప్రాచ్య, పాశ్చాత్య సమాజాలు రెండింట్లోనూ సహజ వికారమైపోయిన పాడుకాలంలో ఆస్ట్రేలియా అవ్వ, అమెరికా పడతి ఎంచుకున్న పరిష్కారాలను ఎవరైనా సమర్థించవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు కాని…
నన్నెందుకో ఆ ఇంగ్లీషు మెయిల్ లోని చివరి వాక్యం విశేషంగా ఆకర్షిస్తోంది.
DEPORT HER TO INDIA , WE NEED HER!
ఆమె మనక్కావాలి.. తనను ఇండియాకు పంపించండి.
(అప్రస్తుతమనుకోకుంటే, నా బాల్యంలోకి ఒకసారి వెళ్ళి చూస్తే మా ఊళ్లో మాంచి వయసుకొచ్చిన ఎద్దులు, దున్నలు జంతు సహజాతాలతో కనిపించిన ఆవును, ఎనుమును -గేదె- వెంటాడి మీదబడి లైంగిక కార్యం పూర్తి చేసుకునేవి. మేతకు వదిలితే వాటి మేటింగ్ సీజన్ పొడవునా ఇవి ప్రతిరోజూ తమ జతగత్తెల వెంటబడేవి. ఇలా కనిపించిన ప్రతి ఆవు, గేదె వెంట బడి పోతుండటం వాటి యజమానులు చూశారంటే వాటికి మూడినట్లే మరి.
రోజూ అవి లైంగిక కృత్యాలకు పాల్పడితే వాటి శక్తి హరించుకుపోతుందని, వ్యవసాయానికి పనికిరావనే ఉద్దేశంతో రైతులు అలా ఏపుకొచ్చి విర్రవీగే వ్యావసాయక మగ జంతువులు -ఎద్దు, దున్న- లను గుంజకు కట్టేసి వాటి వృషణాలను కొయ్య బద్దలతో పగులకొట్టేవారు. దీన్ని కడపజిల్లా పల్లె భాషలో “వట్ట గొట్టడం” అంటారు. ఈ పనికోసం ప్రతి గ్రామంలో ఒక వృషణ విచ్ఛేదక నిపుణుడు -వట్ట గొట్టేవాడు- ఉండేవాడు కూడా. విచ్ఛేదనకు గురయిన తర్వాత అవి బుద్దిగా మసులుకునేవి.
మగ జంతువులు తమ ప్రకృతి సహజమైన కార్యక్రమాన్ని చేసుకోనీయకుండా శాశ్వతంగా వాటిని లైంగిక వ్యంధత్వానికి గురి చేసే ఈ చర్యను చూసినప్పుడల్లా చిన్నతనంలో అయ్యో పాపం అనిపించేది. కాని పల్లె జీవితంలో ఇదీ ఒక వాస్తవమే..
జంతు ప్రేమికులకు ఇది భయంకరమైన చర్యగా అనిపించవచ్చు కాని యుక్తవయస్సులో పడి అదుపు తప్పి వ్యవహరించే జంతువులను పల్లె సమాజం ఇలాగే అదుపులో పెట్టేది. వయసులో అడ్డూ ఆపూ లేనితనం ప్రారంభమయ్యాక ఒక్కోసారి ఈ మగ పశువులు యజమాని మీద కూడా తిరగబడేవి. ‘నువ్వెంత.. నీ తాహతెంత అనే వయోగత కండర ధిక్కారంతో. పశుపాలకులకు ఇక వేరే మార్గముండేది కాదు మరి.)
జంతువుల చరిత్రతో పోలిస్తే మానవుల చరిత్ర, లైంగిక అత్యాచారాల చరిత్ర కొత్త పుంతలు తొక్కుతున్నట్లుగా ఉంది.
వృషణ విచ్ఛేదన తప్ప రేపిస్టుల సమస్యకు పరిష్కారం దొరకని దశలోకి సమాజం పయనిస్తోందా…
అవధులు మీరి ప్రవర్తించే పశువు వ్యవసాయానికి పనికిరాకుండా పోయే చందాన, లైంగిక అత్యాచారాన్ని ఆయుధంగా చేసుకుంటూ విర్రవీగుతున్న ముష్కరులు కూడా సమాజానికి పనికిరాకుండా పోయే కాలం వస్తుందా..!
మన బామ్మ చర్యను ఎలా అర్థం చేసుకోవాలి? మీరే చెప్పండి.
ప్రసాద్ గారు పంపిన ఈమెయిల్ లో ఆ సాహసోపేతమైన అసాధారణమైన బామ్మ ఫోటో కూడా ఉంది. ఎందుకో దాన్ని ప్రచురించాలనిపించటం లేదు.
ఒకటి మాత్రం చెప్పగలను. ఇది చందమామ కథ కాదు. ఇది చందమామ లాంటి అందమైన ప్రపంచపు అనుభపమూ కాదు.
సుబ్రహ్మణ్య ప్రసాద్ గారూ, మీనుంచి మరికొందరు మిత్రులనుంచి ఇలా మెయిల్స్ అందుకోవడం ఒక సమాజాన్ని నిత్యం చదువుకుంటున్నంత చక్కని అనుభూతిని కలిగిస్తోందండి. ధన్యవాదాలు సర్.
ఆ ఇంగ్లీష్ ఈమెయిల్ పూర్తి పాఠం….
The Rambo Granny of Melbourne, Australia
Gun-toting granny Ava Estelle, 81, was so ticked-off when two thugs raped her 18-year-old granddaughter that she tracked the unsuspecting ex-cons down… And shot off their testicles.
“The old lady spent a week hunting those men down and, when she found them, she took revenge on them in her own special way,” said Melbourne police investigator Evan Delp.
Then she took a taxi to the nearest police station, laid the gun on the sergeant’s desk and told him as calm as she could be: “Those bastards will never rape anybody again, by God.”
Rapist and robber Davis Furth, 33, lost both his penis and his testicles when outraged Ava opened fire with a 9-mm pistol in the hotel room where he and former prison cell mate Stanley Thomas, 29, were holed up.
Now, baffled lawmen are trying to figure out exactly how to deal with the vigilante granny..
“What she did was wrong, and she broke the law, but it is difficult to throw an 81-year-old Woman in prison,” Det. Delp said, “especially when 3 million people in the city want to nominate her for Mayor.”
DEPORT HER TO INDIA , WE NEED HER!
– Anand Ma
Filed under సమాజం | Comments (7)చందమామ@66
ఈ జూలై నెలతో చందమామ 66వ సంవ త్సరంలోకి అడుగుపెడుతోంది. అలనాటి ఉజ్వల గతాన్ని గుర్తు చేసుకుంటూ 1947 జూలై నెలలో ప్రచురించబడిన చందమామ తొలి ముఖచిత్రాన్ని మళ్లీ మీముందుకు తీసుకువ స్తున్నాము. ఈ ముఖచిత్రంలో ప్రచురించబడిన ఆరణాల పత్రిక ధరను కూడా మీరు చూడవ చ్చు. కథలను ఇంపుగా చెప్పడం ద్వారా మన ఘనమైన దేశపు సంస్కృతి, వారసత్వాన్ని భారతీయ చిన్నారులకు అందించాలనే గొప్ప ఆలోచనతో శ్రీ చక్రపాణి, శ్రీ నాగిరెడ్డి గార్లు చందమామ పిల్లల పత్రికను తీసుకొచ్చారు.
అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో విస్తృతంగా వ్యవ హారంలో ఉన్న రెండు భాషలలో -తెలుగు, తమిళం- 1947లో ప్రారంభించబడిన చందమామ తర్వాతి నాలుగేళ్లలోపే ఆరు భాషల్లో ప్రచురించబడింది. ఇప్పుడు చందమామ పత్రికను 12 భాషలలో, ఇంగ్లీషులో కూడా ప్రచురిస్తున్నాము. ఈ వార్షిక సంచికలో మా సంస్థాపకుల ఉన్నతాశయాన్ని మా కర్తవ్యాన్ని మరోసారి మననం చేసుకుంటూ, చందమామ మన సమాజానికి తన వంతు దోహదం అందించేందుకు మరింత కష్టపడి పనిచేస్తామని ప్రతిన చేస్తున్నాము.
భారతీయ చిన్నారులు బాధ్యతాయుత పెద్దలుగా ఎదిగేలా చేయ డానికి, తమ సంస్కృతి పట్ల వారు గర్వించేలా చేయ డానికి శతథా కృషి చేస్తామని చెబుతున్నాము. భారతదేశంలో ప్రతి కుటుంబంలోనూ పెద్దలు మరో ఆలోచన లేకుండా చందమామ పత్రికను తమ పిల్లల చేతిలో పెట్టగలిగేటంత నమ్మకాన్ని వారిలో కలిగిస్తామని, మేం పిల్లల ఎదుగుదలకు నిజమైన మిత్రులమని నిరూపించుకుంటామని మాట ఇస్తున్నాము.
ఈ మహా సామ్రాజ్యం ఎలా నిర్మించబడిందో తెలిపే కొన్ని చిత్రాలను ఈ సందర్భంగా పాఠకులతో పంచుకోవాలని అనుకుంటున్నాము. అలనాటి చందమామ కార్యాలయం, ప్రెస్, సిబ్బంది గది, పంపిణీ విభాగం వంటి కొన్ని ఫోటోలను మీముందుకు తీసుకొస్తున్నాము.
వీటి వివరాలకోసం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జూలై చందమామ సంచికలో చూడగలరు.
Filed under చందమామ చరిత్ర | Comment (0)చందమామ శంకర్ గారికి 89 వసంతాలు..
ఇవాళ్టితో చందమామ దిగ్గజ చిత్రకారులు శంకర్ గారికి 89 ఏళ్లు.
ఆయనకు ఫేస్బుక్ వంటి సాంకేతిక విప్లవాలతో సంబంధం లేదు కాబట్టి, పుట్టినరోజు వంటి ఆధునిక అలవాట్లలో పాలు పంచుకోవడం తెలీదు కాబట్టి చందమామలో పనిచేసేవారికి కూడా ముందస్తు సమాచారం తెలీదు. తీరా ఉదయం ఆఫీసుకు వచ్చిన గంట సేపటి తర్వాత ఆయన నుంచి యధాప్రకారంగా చందమామ లో పనిచేసే ‘పిల్లలందరికీ’ స్వీట్స్ అందాయి. ఆఫీసుకు వచ్చి పనిచేసేటప్పుడు ఆయన సాయంత్రం పూట చాక్లెట్ చప్పరిస్తూ పక్కనున్న వారికి కూడా తలొకటి అందించడం తనతో కలిసి పనిచేసేవారందరికీ అపురూపమైన అంశం కాగా, ఇంటినుంచి పని చేస్తూ కూడా, ఈరోజున తనకూ చందమామకు ఉన్న దశాబ్దాల బంధాన్ని గుర్తు చేస్తూ అయన ఆఫీసుకు మర్చిపోకుండా చాక్లెట్ పంపారు.
యాజమాన్యం ఆయనతో ఇవ్వాళ మాట్లాడి ఆశీస్సులు తీసుకోవడమే గాకుండా, ఆయనకు పండ్లు, తీపి పదార్థాలు పంపారు.
పుట్టినరోజు అనేది ఆయనకు అంతగా పట్టింపు లేని ఘటనే అయినప్పటికీ ఈ రోజు సందర్భంగా చందమామను పరామర్శించడం, అందరితో మాట్లాడటం ఆయనకు చిరకాలంగా అలవాటు. బాగున్నారు కదా అనే పలకరింపుతో మొదలై అరవైఏళ్ల అనుభవాలను ఆయన పంచుకుంటుంటే చెవులు రిక్కించి అలా వింటూ పోవటం మాకందరికీ అలవాటు.
రాజకుమారి చిత్రం గీసినా, నెమలి బొమ్మ గీసినా, ఫుల్ పేజీలో డేగ బొమ్మ గీసినా 90 ఏళ్ల వయసులో కూడా ఆయన కుంచె కాదు కాదు.. ఆయన కలానికి మాత్రం వృద్ధాప్యం తెలియదు. ఆయన గత సంవత్సరం డిసెంబర్ నెల బేతాళ కథ ‘అమృతవర్షిణి నిర్ణయం’ కు గీసిన చిత్రాలు కొన్ని ఇక్కడ చూస్తే ఆయన కలం గొప్పదనం అర్థమవుతుంది. ఒక చిన్న స్పేస్లో ఎన్ని వివరాలను బొమ్మలో చూపుతారో మళ్లీ ఆ బొమ్మ ఎంత ప్లెయిన్గా ఉంటుందో చూడాలంటే శంకర్ గారి చిత్రాలు తప్పక చూడాల్సిందే.
మాష్టారు గారూ! మీకు నిండు నూరేళ్లు… మీతో ఎప్పుడూ చెప్పేమాటే ఇప్పుడు కూడా… మీరు చల్లగుంటే మేమూ -చందమామలో- చల్లగుంటాము.
ఆయన గత సంవత్సర కాలంగా చందమామ పనిమీద ఫోన్లో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన చెప్పిన జీవితానుభవాలను కొన్నింటిని ఇక్కడ చూడండి.
“స్టోరీస్ రీటోల్డ్ అని కథల గురించి చెబుతుంటారు. కాని చందమామ కథలు స్టోరీస్ రీటోల్డ్ రకం కాదు. అవి స్టోరీస్ ఆఫ్ రీబర్త్ వంటివి. చందమామ నిజంగానే అనేక కథలకు పునర్జన్మ నిచ్చింది. పశుల కాపరి వెదురు బొంగులో దాచుకుని మరీ చదువుకునేటటువంటి ఆసక్తికరమైన కథలకు చందమామ తిరిగి జన్మనిచ్చింది.”
“చందమామ ఈజ్ నాట్ ఎ కమ్మోడిటీ. హౌ కెన్ వియ్ గెస్ హై ప్రాపిట్స్ ప్రమ్ చందమామ. మేగజైన్ అంటే నీ బిడ్డలాంటిది. నీ బిడ్డను నిన్ను ఎలా పోషిస్తావో, దాన్ని అలా పోషించుకోవాలి.”
చందమామ నన్ను బిడ్డలా పెంచింది. నేను దాన్ని పెంచాను అనుకుంటున్నాను. దానికి నేను రుణపడి ఉన్నాను. అనేది శంకర్ గారు ఎప్పుడూ తల్చుకునే మాట. అందుకే ఎంత మంది తమ వద్దకు వచ్చి పనిచేయమని కోరినా ఆయన ప్రలోభ పడలేదు. 1980లలో శంకర్ గారికి చందమామలో నెలజీతం వెయ్యి రూపాయలట. అప్పట్లోనే పూణేకి చెందిన ఒక ప్రముఖ పబ్లిషింగ్ హౌస్ ఆయనకు బంఫర్ ఆఫర్ లాంటిది ఇచ్చిందట. మీకు సెపరేట్గా రూము, బోర్డింగ్, లాడ్జింగ్తో సహా అన్ని సౌకర్యాలను కల్పించి నెలకు 3 వేల రూపాయల జీతం కూడా ఇస్తామని వారు ఆహ్వానించినా ఈయన చలించలేదు.
‘”రాముడికి ఒకే మాట ఒకే బాణం అనే చందాన జీవితంలో ఒకే పత్రికలో, ఒకే యాజమాన్యం కింద నేను పనిచేసాను., అదీ చందమామలో పనిచేశాను.. జీవితమంతా పనిచేసాను. ఈ సంతోషం చాలు నాకు. డబ్బు కోసం నేను పనిచేయలేదు. డబ్బు చూసి కూడా పనిచేయలేదు. సంస్థను విడవకుండా, మారకుండా పని చేయవచ్చని జీవితమంతా ఒకే చోట పనిచేయవచ్చని చందమామ నిరూపించింది. దానికి నేనే సాక్ష్యం.’ అంటారు శంకర్ గారు.
దక్షిణ చిత్ర వారు ఈమధ్య శంకర్ గారి బేతాళ కథల బొమ్మలను పెద్ద సైజులో మద్రాసులో మాయాజాల్ భవనం పక్క భవంతిలో పెట్టి ప్రదర్సించారు. శంకర్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయనతో బేతాళ కథల చిత్రాల నేపధ్యం చెప్పించుకని పరవశించారు అక్కడికి వచ్చిన పిల్లలూ, పెద్దలూ.
దశాబ్దాలుగా తను గీస్తూ వచ్చిన బేతాళ బొమ్మలు భారీ సైజులో అక్కడ కనిపించేసరికి ఆయన మహదానందపడ్డారు. దక్షిణ చిత్ర నిర్వాహకులు ముందే చందమామను సంప్రదించి బేతాళ కథల ఒరిజనల్ శాంపుల్ చిత్రాలను అడిగి తీసుకోవడంతో ఆ కార్యక్రమానికి నిండుతనం చేకూరింది.
ఆ ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు పిల్లలు, పెద్దలు అందరూ ఆయన చుట్టూ మూగిపోయారట. ‘బేతాళ కథ బొమ్మలు గీయడంలో మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అని అందరూ అడిగారట. కథకు తగిన బొమ్మ మీకు ఎలా స్ట్రయిక్ అవుతుంది. ఆ రహస్యం చెప్పండి’ అంటూ కోరారట.
చాలా సింపుల్గా సమాధానమిచ్చారాయన. ‘బొమ్మకు కథ ప్రాణం. కథ బాగా నడిచిందంటే సగం బొమ్మ అప్పుడే పూర్తయిపోయినట్లే. ఒకటికి రెండు సార్లు కథ చదువుతాను. తర్వాత కథతో పాటు చందమామ సంపాదకులు పంపించిన బొమ్మల వివరణ -ఇమేజ్ డిస్క్రిప్షన్- కూడా చూస్తాను. ఆవివరణకు తగినవిధంగా మనసులోనే బొమ్మ తయారయిపోతుంది. అన్నిటికంటే మించి చందమామకు బొమ్మ గీస్తున్నప్పుడు దేవుడు నన్ను ఆదేశించినట్లే ఉంటుంది నాకు. ఎందుకంటే ఆయన కదా నన్ను చందమామకు రమ్మని పిలిచింది. ఆయన కదా నన్ను తన బొమ్మలు వేయమని అడిగింది. ఇదే నా బొమ్మల రహస్యం’ అనేశారట ఆయన.
తనముందు నిలువెత్తు బేతాళ బొమ్మల చిత్రాల ప్రదర్శనను చూసిన ఆయన ఈ ప్రదర్శనపై అబిప్రాయాన్ని నిర్వాహకులు అడిగినప్పుడు ఒకే మాట అన్నారట. ‘వీటిని చూస్తుంటే నా వయస్సు ఒక్కసారిగా పదేళ్లు తగ్గిపోయినట్లనిపిస్తోంది.’
ఆయన మాటలు వింటున్న వారు మొత్తంగా కదిలిపోయారు. ఆ భవంతిలోని ఆ పెద్ద గది మొత్తంలో మౌన ప్రశాంతత.
మద్రాసులో కొత్తగా ఆర్ట్స్ స్కూల్స్లో కోర్సులు చదువుతున్న పిల్లలు ఈ ప్రదర్శనకు వచ్చారు. ఆయన చుట్టూ మూగి ప్రశ్నలు సంధించారు. ‘ఈ కోర్సు పూర్తయిన తర్వాత మాకు ఉద్యోగావకాశాలు ఉంటాయా? చిత్రలేఖనాన్నే కెరీర్గా మార్చుకోవచ్చా?’ అని అడిగారు వారు. ఆయన ఇచ్చిన సమాధానం హృద్యంగా ఉంది.
‘పది నెలల తర్వాతే కదా బిడ్డ వస్తుంది. వెంటనే బొమ్మలు వేసేయాలి. పెద్ద జీతం పెద్ద ఉద్యోగం రావాలి అనుకుంటే ఎలా. మీరు ప్రతిఫలం ఆశించకుండా కృషి చేయండి సంవత్సరం, అయిదేళ్లు, పదేళ్లు మీకు మెచూరిటీ వచ్చేంతవరకు బొమ్మలు గీస్తూ పోండి. మీరు నమ్మి ఒక పని చేస్తే అది మీకు తప్పకుడా మేలు చేస్తుంది. ప్రతిఫలం ఇస్తుంది.’
‘మీరు పిల్లలు. మీముందు చాలా అవకాశాలు ఉన్నాయి. మంచి జీవితం దొరకదేమో అని భయపడవద్దు. మీలో వర్త్ ఉంటే ప్రపంచం మిమ్మల్ని ఎప్పటికైనా గుర్తిస్తుంది’ అని శంకర్ గారు వారికి సలహా ఇచ్చారు.
‘ఇన్ని సంవత్సరాలు బొమ్మలు వేశారు కదా మీకు విసుగు పుట్టలేదా అనడుగుతారు. పని మీద శ్రద్ద ఉంటే అది నా పని అనుకుంటే విసుగు ఎందుకొస్తుంది అన్నది నా ప్రశ్న’ ఇదీ ఆయన జీవన తాత్వికత.
శ్రీనివాస్ అని శంకర్ గారి బ్యాచ్లో పైన్ ఆర్ట్స్ కోర్స్ పూర్తి చేశారు. కాని ఆ రంగంలో ఇమడలేక తర్వాత మేస్త్రీ పనిలోకి దిగి దాంట్లోనే స్థిరపడిపోయారు. చాన్నాళ్ల తర్వాత ఆయన శంకర్ గారిని కలిసినప్పుడు ‘ఎప్పుడూ బొమ్మలేనా దాంట్లోంచి బయటకు రాలేవా’ అంటూ ఎకసెక్కాలాడారట మిత్రుడు.
‘నీకు బొమ్మల పిచ్చిరా’ అని మిత్రుడు అంటే ‘నీకు మేస్త్రీ పని పిచ్చిరా మరి!’ అన్నారట శంకర్ గారు. ‘నువ్వు జీవితమంతా తాపీ పని చేస్తూ నన్ను మాత్రం బొమ్మలు వేసే పని మానమంటావేంరా’ అని ఈయనా దెప్పిపొడిచారట.
తనతో పాటు ఆర్ట్స్ స్కూల్లో చదువుకున్న మిత్రులు చాలామంది చిత్రలేఖన రంగంలో ఇమడలేక ఇతర వృత్తులు చేపట్టారట. వీటిలో ఇదొక ఉదాహరణ.
(తమిళ చిత్ర హీరో సూర్య తండ్రి, అలనాటి తమిళ సినీ హీరో శివకుమార్ గారు ఇటీవలే శంకర్ గారి ఇంటికి వెళ్లి తాను చిత్రలేఖనం నుంచి నటనలోకి ఎలా జంప్ అయ్యారో చెప్పి నవ్వించారట. డబ్బులొచ్చే మార్గం బొమ్మల్లో కనబడలేదు కాబట్టే ముందస్తుగానే నేను తప్పుకుని నటనలోకి వెళ్లిపోయానని చెప్పారట. ప్రపంచమంతా డబ్బు మార్గమే చూడండి అంటూ ఈయన నవ్వడం ఫోన్లో..)
“గాడ్ విల్ బి యువర్ సైడ్ వెన్ యు పుట్ ఎపర్ట్ ఇన్ యువర్ వర్క్.”
‘దైవం మానుషరూపేణా’ అంటూ దైవం మనిషిరూపంలో వస్తాడనే మన పెద్దవారు అన్నారే తప్ప దైవం దైవం రూపంలో వస్తాడని ఎక్కడా చెప్పలేదు. మనుషుల్లోనే దేవుడున్నాడు. వారి పనిలో దేవుడున్నాడు. ఆ పనిని నీవు చిత్తశుద్దితో చేస్తే చాలు. అదే దేవుడికి నీవు అర్పించే నిజమైన పూజ. సేవ కూడా.
ఇది శంకర్ గారు గత 60 ఏళ్లుగా స్మరిస్తున్న మంత్రవ్యాక్యం.
Sri. K.C.Sivasankaran
(Chandamama Sr. Artist)
F2. Santham Apartments
No.46, Venkatesh Nagar Main Road
Virugambakkam
Chennai – 600092
Ph.044-64508610
గత సంవత్సరం హిందూ పత్రికలో చందమామ శంకర్ గారిపై వచ్చిన విశేష కథనం లింక్ ఇక్కడ చూడండి
Vikram, Vetala and Sankar
Bishwanath Ghosh
November 9, 2011 (in online. Aricle published in the hindu metro plus in 10-11-2011
http://www.thehindu.com/life-and-style/metroplus/article2611627.ece?homepage=true
గమనిక: శంకర్ గారి జన్మదినంకి సంబంధించి చిన్న సవరణ. ఆయనకు ఇప్పుడు 87 సంవత్సరాలు నిండి 88వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. స్వయంగా ఆయనను అడిగి నిర్ధారించుకున్న తర్వాతే ఆయన జన్మ సంవత్సరానికి సవరణను ఇక్కడ పొందుపర్చడమైనది. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు.
తిండి దొరకని సమాజోన్నతి నాకెందుకు?
చందమామ చక్రపాణి గారు ఇంకా మద్రాసుకు అడుగుపెట్టనప్పుడు ఆయన బెంగాల్ భాషలోంచి అనువాదం చేసిన ‘పాంచజన్యం’ కథల సంపుటిని 1939లో నాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య గారు పరిచయం చేశారు. ఈ అరుదైన పరిచయం 1997 మార్చి నెలలో వచ్చిన ‘చక్రపాణీయం’ పుస్తకంలో ఉంది. చక్రపాణి గారి అనువాదం అనువాదంలా కాక స్వతంత్ర రచనగా కన్పడేది అంటూ సుందరయ్య గారు చేసిన ఈ పరిచయాన్ని పాఠకుల సౌలభ్యం కోసం ఇస్తున్నాను.
1939లో చేసిన ఈ సమీక్షలో ఒక కథలోని పిల్లి పాత్ర ద్వారా చెప్పించిన వాక్యం. “తిండి దొరకని సమాజోన్నతి నాకెందుకు?”
నాలుగు కార్ల ఫ్యాక్టరీలు, రెండు విమానాశ్రయాలు, అయిదు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, నాలుగు లైన్ల రోడ్లు వేయడమే అభివృద్ధి అని ఊదరగొడుతున్న ఈ ప్రపంచీకరణ యుగానికి కూడా వర్తించదగిన గొప్ప ప్రశ్న ఇది.
తిండి దొరకని సమాజోన్నతి నాకెందుకు?
రాసిన 70 సంవత్సరాల తర్వాత కూడా ప్రాసంగికతను కోల్పోని గొప్ప వాక్యం. చక్రపాణి గారు బెంగాలీ లోంచి అనువదించిన ఈ దొడ్డ మనసు ‘పిల్లి’ కథ ఇప్పుడు చదివేందుకు దొరికితే ఎంత బావుణ్ణో..
సుందరయ్య గారి పరిచయాన్ని కింద చూడండి.
పాంచజన్యం – కథల సంపుటి
-పుచ్చలపల్లి సుందరయ్య
ప్రజాబంధులో ‘బడదీదీ’ నవల నవశక్తిలో ‘దేవదాస్’ ‘పరిణీత’ లు ప్రకటించబడుతూ ఉన్నప్పుడు చాల ఆతురతతో చదివేవాణ్ణి. చక్రపాణి భాషాంతరీకణం భాషాంతరీకరణంగా కన్పడక అసలు స్వతంత్ర రచనగానే కన్పడేది. వారు తిరిగి పాంచజన్యమను పేర కొన్ని కథలను తర్జుమా చేశాక వాటిని కూడా చాలా ఆతురతతో చదివాను.
‘పిల్లి’లో ఆకలిబాధచే మాడుతూ ఉన్నవారికి కష్టాలూ, ధనవంతులకు, తిండికి లోటు లేనివారికి గౌరవాలూ వస్తాయి. ఈ పరిస్థితుల నుండి బయటపడాలంటే ధనవంతులు సమాజంపై తమ లాభాలకోసం విధించిన నిబంధనలను ఉల్లంఘించడమే మార్గమని పిల్లి ఉపన్యసిస్తుంది. తిండి దొరకని సమాజోన్నతి నాకెందుకు అన్నది పిల్లి. దానికే కాదు. ఏ మనిషికీ కూడా అవసరం లేదు. అసలు అది సమాజోన్నతి కూడ కాదు.
‘సామ్యవాదం మంచిదని మేము ఒప్పుకుంటాము, కాని దానికి ఒక హద్దున్నది.’ తమకు పైనున్నవారు తమ్ము సమానంగా చూడాలి. తాము మాత్రం తమ కన్న కింద ఉన్నవారిని తమతో సమానంగా చూడరు. ఈ ధోరణిని వ్యక్తీకరిస్తూ ఉన్న ఒక చిన్న వ్యంగ్యం ‘కానీ కడగండ్లు.’
ప్రభుత్వాలు, ఉద్యోగస్తులు, ‘కుట్ర’లను భయంతో ఎంత నిరాధారంగా ప్రజలపై అత్యాచారాలు దౌర్జన్యాలు చేస్తారో ‘కుట్ర’ వెల్లడిస్తూ ఉంది.
దేశద్రోహి తన సర్వస్వం దేశసేవలో ధారపోస్తాడు. తల్లికి తిండి కూడ ఏర్పాటు చేయడు. కారాగారంలో పడి క్షయతో బయటపడుతాడు. ఈతని త్యాగసేవలపై నాయకత్వం సంపాదించిన వ్యక్తి ఇతనిని నిరసిస్తాడు. ‘దేశద్రోహి’ అంటాడు. ప్రజలు ఈ వింత ‘దేశద్రోహి’ని కొట్టి చంపుతారు. ఈ చిన్న కథ ప్రస్తుతం మన దేశ సేవకుల స్థితిని ఒక పర్యాయం కన్నులకు కట్టినట్లు తెలియచేస్తూ ఉంది. దేశానికి సర్వస్వం ధారపోసి పనిచేస్తూ ఉన్న వారికి, వారి కుంటుంబాలకు తగిన ఉపాధులు కల్పించడం, వారిని మరిచిపోకుండటం ప్రజలు చేయవలసిన కనీస ధర్మమని ఇది ఎలుగెత్తి చాటుతూ ఉంది.
‘మీరూ – మేమూ’ ప్రాచ్యదేశాలకు, పాశ్చాత్య దేశాలకు ఉన్నవనుకునే భేదాలను తీసుకుని వ్యంగ్యంగా రాయబడింది. మన దేశంలోని మూఢ విశ్వాసాలను, తీవ్రంగా ఎత్తిపొడుస్తూ ఉంది. ఈ ఎత్తిపొడుపులతో పౌరుషం తెచ్చుకుని దేశ స్థితి మార్చడానికి పాఠకులు నడుము కట్టుతారనుకుంటాను.
కాని ఈ కథనలన్నిటిలోనూ పాఠకుల్ని, భారతీయుని ఎక్కువ సంతృప్తి పరచేది కథ ‘అడ్డం తిరిగితే.’ కాని ఈ సంతృప్తి చేతకాని వానికి మాత్రమే కలుగుతుంది. భారతీయులు ఇంగ్లండుపై రాజ్యాధికారం చేస్తున్నారనుకోండి. అప్పుడు మనం వారిని ఇంగ్లీషువారు మనకు నేడు చూపుతున్న మార్గాన వెళ్లితే. ఇంగ్లీషు వారిని ఏవిధంగా అవమానాలకు గురిచేయగలమో తెలియజేసే ఒక ఊహాచిత్రం.
భారతీయులకెప్పుడూ ఇంగ్లండుపై గాని మరియే ఇతర దేశంపై కాని పెత్తనం వద్దు. వారిని మనం ప్రతీకారం కోసమని నీచంగా చూడము. కానీ ఈ ఊహాచిత్రంలో ప్రతి భారతీయుడూ తన జీవితంలో ప్రతి ఘట్టమందు ఇంగ్లీషువారు తన్ను ఏ విధంగా అవమానపరుస్తూ ఉందీ గుర్తించి స్వాతంత్ర్య పిపాసి అవుతాడని వ్యంగ్యంగా రాయబడింది. ప్రతి భారతీయుడు దీనిని చదవాలి. ఆత్మ గౌరవం కాపాడుకోవాలి. దానికోసం స్వాతంత్ర్య సంపాదించుకోవాలి.
ఇలాంటి కథలు, బెంగాలీ భాషనుండీ అనువదించి ఇచ్చిన చక్రపాణికి ఆంధ్రులు కృతజ్ఞులు. కాని ఆంధ్రభాషలోనే ఇట్టి కథలు స్వతంత్రంగా ఎప్పటికి రచించడము.
(ఆగస్టు 1939)
‘చక్రపాణీయం’ నుంచి. 82వ పుట.
————————–
ఈ పుస్తకం లోని 81వ పుటలో చందమామ ఎందుకు చదవాలో, చదివించాలో చెప్పే ఒక చిన్న భాగాన్ని కూడా ఇక్కడ చూడండి.
మానసిక ప్రశాంతతను తెచ్చే చందమామ
మానసిక ప్రశాంతత కోసం డాక్టర్లు ఏ సలహా ఇస్తారో కాని, నేను మాత్రం చందమామ చదవమని చెబుతాను. ఈ రోజుల్లో పిల్లల్ని పెంచటం కష్టమని చెప్పే ప్రతి తల్లికీ, తండ్రికీ నేను చెప్పే మొదటి సలహా, తమ పిల్లల చేతుల్లో చందమామ పత్రిక పెట్టమని. చందమామ వారి పిల్లలకు బుద్ధి కుదురు, ముడ్డి కుదురు కలుగజేసి సజ్జనులుగా తయారవటానికి పునాది వేస్తుందని.
– ఏలేశ్వరపు రఘురామశర్మ.
‘పరోక్షంగా ప్రభావితం చేసిన ప్రత్యక్ష వ్యక్తి’ కథనంలోంచి కొంత భాగం
‘చక్రపాణీయం’ నుండి, పుట 81
దైవకణాలా? దైవ ధిక్కార కణాలా?
మూడే్ళ్ల అనంతరం దైవకణాల గుట్టు గురించి మళ్లీ వార్తలు వస్తున్నాయి.
I think we have it. You agree
అంటూ ఈ బుధవారం ఉదయం సెర్న్ డైరెక్టర్ జనరల్ రాల్ఫ్ హ్యూయర్, ‘దైవకణాలు’ అని పేరొందిన హిగ్స్ బోసోన్ ఉనికి నిర్ధారించబడినట్లు ప్రకటించి విజ్ఞాన శాస్త్రంలో పెను సంచలనం రేపారు.
God Particle Found Historic Milestone From Higgs Boson Hunters
కాని ‘దైవకణాలు’ అనే పదబంధమే ఇటీవలి చరిత్రలో అత్యంత వక్రీకరించబడిన భావనగా నిలిచిపోయింది. దైవ ‘ధిక్కార’ కణాలను దైవ కణాలుగా తారుమారు చేసి నిలిపిన ఈ ‘దైవకణాల’ వెనుక చరిత్రను మిత్రులు, వెన్నెలకంటి రామారావు గారు మూడున్నర ఏళ్ల క్రితమే “‘దైవ’ కణాల మహాన్వేషణ” అనే కింది వ్యాసంలో సుస్పష్టంగా వివరించారు.
ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ విభాగంలో పనిచేస్తున్న రామారావు గారి ఆమోదంతో తాను గతంలో రాసిన ఈ బృహత్ వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాను.
‘దైవ’ కణాల మహాన్వేషణ
ఏమిటి? ఎలా? ఎందుకు? అనే ప్రశ్నలు మానవ మస్తిష్కాల్ని సహస్రాబ్దాల తరబడి నిరంతరాయంగా తొలుస్తూనే ఉన్నాయి. తన గురించి, తానున్న ప్రపంచం గురించి, ఆ ప్రపంచంలో తన స్థానం గురించి నిరంతరాయమైన అన్వేషణ, పర్యవసానంగా విశ్వం ఆవిర్భావానికి చెందిన పలు నమూనాలను మానవులు సృష్టించుకున్నారు. అర్థం కాని అంశాలను విశ్వాసాలతో భర్తీ చేసుకుంటూ, ప్రకృతితో చేసే అస్తిత్వ పోరాటంలో ఆత్మవిశ్వాసం కోసం ‘దైవ’ భావనను సృష్టించుకున్నారు. సూక్ష్మ, స్థూల ప్రపంచాల అంతస్సారం మనిషికి మరింతగా అవగతమయ్యే కొద్దీ మరిన్ని శాస్త్రీయమైన, విప్లవాత్మకమైన విశ్వనమూనాలు ఉనికిలోకి వచ్చాయి.
విశ్వాసం నుంచి విజ్ఞానానికి మనిషి చేస్తున్న అనంతమైన గ్రహణ క్రమమే ఈ అన్వేషణ. అణువులు, పరమాణువులు, ఎలక్ట్రాన్-ప్రొటానుల్లాంటి ప్రాథమిక కణాలు, క్వార్క్లు వరుసగా విశ్వ నిర్మాణపు మౌలిక ప్రాథమిక కణాల భావనలు వచ్చాయి. వస్తూనే ఉంటాయి.. ఈ అన్వేషణ ఇంతటితో ఆగిపోయిందనడానికి లేదు. అంకెల్ని లెక్కించడం ఎలా అనంతమో, సత్యాన్వేషణ కూడా ఒక అనంత పరిణామ క్రమం ఈ క్రమంలో బిగ్బ్యాంగ్ విశ్వావిర్భావ సిద్ధాంతం, తొలి విశ్వ పదార్థమైన ‘హిగ్స్ బోసాన్’ భావనలు ఆవిర్భవించాయి. అణువు నుంచి బ్రహ్మాండ గోళాల ఆవిర్భావానికి ఈ హిగ్స్ బోసాన్లే ప్రాణం. అందుకే వీటికి ‘దైవకణాల’ని పేరొచ్చింది. వీటి కోసమే ఈ మహాన్వేషణ.
***************
ప్రకృతి రహస్యాలను ఛేదించేందుకు మనిషి బహుముఖంగా కృషి చేస్తూనే ఉన్నాడు. విశ్వ రహస్యాలను శోధించే లక్ష్యంతో ప్రపంచంలో కెల్లా అతి పెద్ద పార్టికల్ యాక్సిలరేటర్ (కణవేగవర్ధక పరికరం) లార్జ్ హెడ్రాన్ కొల్లాయిడర్ – ఎల్హెచ్సి- ని యూరోపియన్ యూనియన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. స్విట్జర్లాండ్లోని జెనీవాకు సమీపంలో, ఫ్రాన్స్ సరిహద్దున కణ-భౌతిక శాస్త్ర ప్రయోగశాల కేంద్రంగా 27 కిలోమీటర్ల చుట్టు కొలతతో కూడిన ఎల్హెచ్సి నిర్మాణం జరిగింది. 2008 సెప్టెంబర్ 10న యాక్సిలేటర్ ప్రయోగం ప్రారంభంలోనే విఫలమైంది. అయస్కాంతాల చుట్టూతా ఏర్పాటు చేసిన ద్రవ హీలియం కారిపోవడంతో ప్రయోగాన్ని అర్థాంతరంగా నిలిపివేయవలసి వచ్చింది.
దాదాపు ఏడాది కాలంపాటు దానికి మరమ్మత్తు పనులు జరిగాయి. ఈ పరికరంలో కాంతివేగంతో ప్రోటాన్ కణపుంజాలను విజయవంతంగా సృష్టించినట్లు సెర్న్ శాస్త్రవేత్తలు 2008 నవంబర్ 24న ప్రకటించారు. ప్రొటాన్ కణాలను శాస్త్రవేత్తలు నెలరోజులపాటు కొల్లాయిడర్లో నింపారు. ఆ ప్రొటాన్లు కొల్లాయిడర్ చుట్టుకొలత ఆసాంతం ఒక కణపుంజంగా రూపొందాయి. మొదటగా సవ్యదిశలో తిరిగే ప్రొటాన్ కణపుంజాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆ తర్వాత మూడురోజుల లోపు, అపసవ్య దిశలో చలించే మరో ప్రొటాన్ కణపుంజాన్ని సిద్ధం చేయగల్గారు. ఒక ఖచ్చితమైన, సువ్యవస్థితమైన, వ్యతిరేక దిశల్లో పరిభ్రమించే కణతరంగాలుగా శాస్త్రవేత్తలు ఈ రెండు కణపుంజాలను ఎల్హెచ్సిలో సమన్వయించారు. ఈ ప్రొటాన్ కణపుంజాలు ఒకదాన్నొకటి ఢీకొట్టుకునేందుకు దాదాపు పదిరోజుల సమయం పడుతుందని, దాంతో ప్రొటాన్ కణపుంజాలు నిర్వహణ, నియంత్రణలకు తగిన సమయం ఉంటుందని సెర్న్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
దాదాపు కాంతివేగంతో ప్రయాణించే ప్రొటాన్ కణ పుంజాలు ఢీకొట్టడంతో ఒక చిన్నపాటి బిగ్ బ్యాంగ్ ఏర్పడుతుంది. కాంతివేగంలో 99.999991 శాతం వేగంతో ప్రయాణించే ప్రొటాన్ కణ పుంజాలు సెకనుకు 11,245 చుట్లు తిరుగుతూ 600 సార్లు ఢీకొంటాయి. కాంతివేగంతో ప్రయాణించే ప్రొటాన్ కణపుంజాలను ఢీకొట్టించడం ద్వారా మహా విస్పోటనం (బిగ్బ్యాంగ్) నాటి పరిస్థితులను ప్రయోగశాలలో సృష్టించి, ఆ తొలి క్షణాల్లో ఏర్పడే హిగ్స్ బోసాన్ కణాలను ప్రయోగశాలలో పట్టుకునేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. విశ్వ రహస్యాలు ఈ ప్రయోగం ద్వారా వెల్లడి కాగలవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదొక గొప్ప శాస్త్ర సాంకేతిక అద్భుతమని, విజ్ఞాన శాస్త్ర చరిత్రలోనే ఇంత పెద్ద వైజ్ఞానిక కార్యక్రమం జరగలేదని యూరోపియన్ ఆర్గనేజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (సీఈఆర్ఎన్-సెర్న్) ప్రాజెక్ట్ అధిపతి లైన్ ఇవాన్స్ వ్యాఖ్యానించారు.
ఈ ప్రయోగం ద్వారా విశ్వంలో మాయమైన ద్రవ్యరాశిని గురించి మనం తెలుసుకునే వీలుంటుంది. విశ్వంలోని కేవలం నాలుగు శాతాన్ని మాత్రమే మనం ఇంతవరకు తెలుసుకోగలిగాము. 96 శాతం విశ్వ సమాచారం పట్ల మనకెలాంటి అవగాహన లేదు. అది కేవలం ఒక మార్మిక విషయంగా మిగిలింది. ఈ ప్రయోగంలో ఈ మర్మాన్ని ఛేదించే వీలుంటుంది. మహావిస్ఫోటనం తర్వాత ఏర్పడే తొలి ద్రవ్యరాశికి చెందిన మౌలిక కణాలను హిగ్స్ బోసాన్లుగా శాస్త్రవేత్తలు పిలుస్తారు.
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఈ కణాలను సైద్ధాంతికంగా ఆవిష్కరించినప్పటికీ, ఇప్పటిదాకా ప్రయోగాత్మకంగా పట్టుకోలేకపోయారు. బ్రహ్మాండ గోళాల ఆవిర్భావానికి బొసాన్లు ప్రథమ, ప్రధాన కారణం కావడం మూలాన వీటికి ‘దైవకణాలు’ అని పేరొచ్చింది. ఎల్హెచ్సీ ద్వారా కృత్రిమ బిగ్ బ్యాంగ్ను సృష్టించి, బోసాన్లను పట్టుకోవడం ద్వారా విశ్వరహస్యాన్ని ఛేదించాలని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. అయితే ఇలాంటి కృత్రిమ బిగ్బ్యాంగ్ వల్ల బ్లాక్ హోల్స్ (కృష్ణబిలాలు) ఏర్పడి, అది 15 నిమిషాల్లో భూమినే మింగివేసే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెను నక్షత్రాలను సైతం మింగివేసే బ్లాక్ హోల్స్ ఏర్పడి, మహాప్రళయానికి దారితీస్తుందా? అన్న భయాందోళనలు శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.
బొసాన్లే అన్నిటికీ మూలం!
ఉనికిలో ఉన్న విశ్వపదార్థాని కంతటికీ మూలం బోసాన్ (దైవకణం) అనేది శాస్త్రవేత్తల భావన. ప్రొటాన్ కణ పుంజాలు ఢీకొన్న విధ్వంస శిథిలాల అధ్యయనం ద్వారా విశ్వావిర్భావ రహస్యం అవగతమయ్యే అవకాశముంది. మీసాన్ల ద్వారా అనబంధించబడిన ప్రొటాన్లు, న్యూట్రాన్లతో ఏర్పడిన కేంద్రకం, ఎలక్ట్రాన్ల సమ్మేళనంతో విశ్వపదార్థం ఏర్పడిన విషయం తెలిసిందే. రెండు కేంద్రకాలు ఢీకొన్నపుడు సూర్యుని కేంద్రంలోని ఉష్ణోగ్రత కంటే లక్షల రెట్లు హెచ్చు ఉష్ణోగ్రత ఏర్పడే అవకాశముందని శాస్త్రవేత్తల అంచనా. అంతటి తిరుగులేని ఉష్ణోగ్రతల్లో పరమాణు ప్రాథమిక కణాలు తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. ప్రొటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ కణాలు ఆరు రకాల క్వార్క్ కణాలుగా విడిపోతాయి. ఈ క్వార్కులు గ్లూయన్స్తో అనుబందించబడి ఉంటాయి.
మహా విస్ఫోటన ఉష్ణోగ్రతల్లో అస్తిత్వాన్ని కోల్పోయిన పరమాణు ప్రాథమిక కణాల క్వార్క్లు, గ్లూయన్స్ల మిత్రమ ప్లాస్మాగా రూపాంతరం చెందుతుంది. ఆ ఉష్ణోగ్రత ఎంతటి అనితర సాధ్యమైనదైనప్పటికీ, బిగ్బ్యాంగ్ సమయంలో అలాంటి ఉష్ణోగ్రతలు వెలువడి విశ్వావిర్భావ తొలినాళ్లలో క్వార్క్లు, గ్లూయాన్ల ప్లాస్మా వాతావరణం ఏర్పడినట్లు శాస్త్రవేత్తల అంచనా. ఎల్హెచ్సీ ప్రయోగం ద్వారా విశ్వావిర్భావం నాటి తొలి కణాలను సృష్టించేందుకు సెర్న్ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాల నుంచి దాదాపు 10 వేల మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 800 కోట్ల డాలర్లను ఈ ప్రయోగ నిర్వహణకు ఖర్చు చేస్తున్నారు. 30 ఏళ్ల నాటి హిగ్స్ బోసాన్ ఉనికి ఈ ప్రయోగంతో తేలిపోతుంది.
బోసాన్ మీమాంస
బోసాన్లపై శాస్త్రవేత్తలు రెండు శత్రు శిబిరాలుగా చీలిపోయారు. కొంతమంది బోసాన్ కణాల ఉనికిలో ఉండే అవకాశమే లేదన్న వాదనను బలంగా ముందుకు తెస్తున్నారు. హిగ్స్ బోసాన్ల భావనను తప్పు పట్టిన వారిలో అభినవ ఐన్స్టైన్, స్టీఫెన్ హాకింగ్ ప్రముఖంగా ఉన్నారు. అసలు ఉనికిలో లేని బోసాన్ కణాల కోసం ప్రయత్నించడంలో నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఈ ప్రయోగం ద్వారా హిగ్స్ బోసాన్లు ఉండవని, అదొక తప్పుడు సూత్రీకరణ అని తేలిపోవడమే కాక, పలు కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో సరికొత్త వైజ్ఞానిక సూత్రీకరణలను రూపొందించగలమన్న ఆశాభావాన్ని హాకింగ్ వ్యక్తం చేశారు. ఎల్హెచ్సీ ప్రయోగం ద్వారా ‘దైవకణాల’ను కనుగొనలేరని ఆయన 100 డాలర్ల పందెం కట్టారు కూడా. హిగ్స్ బోసాన్ ఆవిష్కరణ ద్వారా పదార్థ ద్రవ్యరాశి భావన గురించి మరింత లోతైన అవగాహన కలుగుతుందన్న ఆశాభావాన్ని సైతం హాకింగ్ సవాలు చేశారు. హిగ్స్ బోసాన్ కణాల భావన సూత్ర రీత్యా తప్పుడు అవగాహనతో రూపొందిందని హాకింగ్ చాలాకాలం క్రితమే పలు వ్యాసాల్లో, రచనల్లో ఖండించారు. ఈ సిద్ధాంతాన్ని ఆయన పూర్తిగా తోసిపుచ్చారు.
అయితే హాకింగ్ వ్యాఖ్యానాలను దైవకణాల సృష్టికర్త హిగ్స్ తోసిపుచ్చారు. కణ భౌతిక శాస్త్రంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని హాకింగ్ చొప్పిస్తున్నారు… ఈ అంచనా నుంచి చూస్తే శుద్ధ భౌతిక శాస్త్రవేత్తల సిద్ధాంతాలన్నీ తప్పుడు తడకలుగా కనిపిస్తున్నాయని హిగ్స్ వ్యాఖ్యానించారు.
దైవకణాలా? దైవ ధిక్కార కణాలా?
బిగ్ బ్యాంగ్ జరిగిన తరుణంలో కణాలకు ఎలాంటి బరువూ ఉండదు., సెకనులో శతకోటి వంతు కాలంలో ఆ కణాలకు బరువు చేకూరుతుంది. ఈ ప్రక్రియను అర్థం చేసుకునేందుకు ‘హిగ్స్ క్షేత్రం’ లోని హిగ్స్ బోసాన్ కణాలు పరస్పరం చర్యాప్రతిచర్యలు జరిపే పరిమాణంపై ఆధారపడి పలు ద్రవ్యరాశులతో కూడిన పదార్థాలు ఆవిర్భవించాయని హిగ్స్ ప్రతిపాదించారు. ఇప్పటివరకు ప్రపంచ శాస్త్రవేత్తలు ఈ భావననే ప్రామాణికంగా తీసుకున్నారు. ‘హిగ్స్ బోసాన్’ లను కనుగొనే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.
ఈ భావనను దాదాపు 44 ఏళ్ల క్రితం హిగ్స్ ప్రతిపాదించారు. పీటర్ హిగ్స్ ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర శాఖలో ఎమిరటీస్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన స్వభావరీత్యా ఒక నాస్తికుడు. తాను ప్రతిపాదించిన మౌలిక కణాలకు ఆయన హిగ్స్ బోసాన్స్ అని మాత్రమే పిలిచారు. అయితే హిగ్స్ భావనను లియోన్ లిడర్మాన్ వ్యాఖ్యానిస్తూ రాసిన పుస్తకంలో ‘హిగ్స్ బోసాన్’లకు ‘ది గాడ్ డామ్ పార్టికల్స్’ (దైవ ధిక్కార కణాలు) అని ముద్దు పేరు పెట్టారు. అయితే లిడర్మాన్ పుస్తకాన్ని ప్రచురించిన ప్రచురణ కర్త ‘గాడ్ డామ్ పార్టికల్స్’ -god damn particles- అన్న పేరులోని ‘డామ్’ ను తొలగించి ‘గాడ్ పార్టికల్స్‘ -దైవ కణాలు- అని ముద్రించడం జరిగింది. అప్పటి నుండి హేతువాది హిగ్స్ అభీష్టానికి పూర్తి విరుద్ధంగా హిగ్స్ బోసాన్ కణాలకు దైవకణాలనే పేరు స్థిరపడిపోయింది. హిగ్స్ ఈ ప్రచారాన్ని అడ్డుకోలేకపోయారు.
లార్జ్ హెడ్రాన్ కొల్లాయిడర్ (ఎల్హెచ్సి)
ఎల్హెచ్సీ ఒక అద్భుతమైన పరికరం. ఇందులో అలీస్, క్రయోజనిక్ మ్యుయాన్ స్పెక్ట్రోమీటర్, ఏటర్రోయిడల్ ఎల్హెచ్సీ ఆపరేటస్ లేదా అట్లాస్ అని మూడు గొప్ప అయాన్ డిటెక్టర్లుంటాయి. వీటి నిర్మాణానికి వందలాది కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. యూరప్, భారతీయ శాస్త్రవేత్తలతో సహా పలువురు 15 ఏళ్లపాటు శ్రమించి దీన్ని రూపొందించారు. కాంతివేగంతో ప్రయాణించే ప్రొటాన్ కణపుంజాలను సృష్టించేందుకు ఈ పరికరంలో అతి పెద్ద సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలను ఉపయోగించారు.
ప్రోటాన్ కణపుంజాలను సృష్టించే సమయంలో విపరీతమైన వేడి వెలువడుతుంది. మైనస్ 271 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా పరమ శూన్య ఉష్ణోగ్రత కంటే కేవలం 1.9 డిగ్రీలు అధికంగా ఉండే ఉష్ణోగ్రతల ద్వారా ఆ అయస్కాంతాలను చల్లబరుస్తారు. అందుకోసం అధునాతనమైన క్రయోజెనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు వినియోగించారు. అతిశీతల ఉష్ణోగ్రతలను సృష్టించేందుకు ప్రారంభంలో దాదాపు 1.20 కోట్ల లీటర్ల ద్రవ నైట్రోజన్, దాదాపు 7 కోట్ల లీటర్ల ద్రవ హీలియంలు ఖర్చవుతాయి. ఈ ఎల్హెచ్సి శక్తిని విపరీతంగా వినియోగిస్తుంది. అత్యధిక శక్తి క్షేత్రంలో ప్రొటాన్ కణపుంజాలను ఢీకొట్టించడం ఒక మహాద్భుతంగా చరిత్రకెక్కనుంది.
ఎల్హెచ్సీని తిరిగి పనిచేయిస్తున్న ప్రయత్నాలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఎల్హెచసీ పరిస్థితి ఉత్కృష్టంగా తయారయింది. అని సెర్న్ డైరెక్టర్ స్టీవ్ మేయర్స్ ప్రకటించారు. మొదటగా ప్రొటాన్ కణపుంజాలు సాపేక్షికంగా 900 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టు (జీఈవీ) అతి తక్కువ శక్తితో ఢీకొట్టుకుంటాయి. ఒక్కొక్క కణపుంజం 450 జీఈవీ శక్తిని సరఫరాగా చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శీతాకాలం విరామం తర్వాత, ఎల్హెచ్సీ కార్యక్రమాలు తిరిగి 2010 జనవరిలో ప్రారంభం కానున్నాయి. అప్పుడు శాస్త్రవేత్తలు ప్రొటాన్ కణపుంజాలకు 7 టీఈవీ వోల్టుల శక్తిని అందిస్తారు. అంత శక్తితో ప్రొటాన్ పుంజాలు ఢీకొట్టుకోవడంతో బిగ్ బ్యాంగ్ పరిస్థితులు నెలకొంటాయి.
బిగ్ బ్యాంగ్ కాలం నుంచి ఈనాడు మనం చూస్తున్న విశ్వం దాకా జరిగిన పరిణామ క్రమాన్ని పరిశీలించేందుకు ఎల్హెచ్సీలోని అత్యంత శక్తివంతమైన కణపుంజాల అభిఘాతం ఉపకరిస్తుందని శాస్త్రవేత్తల భావన. దాంతో విశ్వం పుట్టుక రహస్యాన్ని ఛేదించేందుకు వీలవుతుందని వారు ఆశిస్తున్నారు. బిగ్ బ్యాంగ్ జరిగిన తొలి క్షణాల్లో తొలి పదార్థ ప్రాథమిక కణాలుగా హిగ్స్ బోసాన్లు ఏర్పడుతాయన్న సైద్ధాంతిక పరకల్పన కూడా ఈ ప్రయోగం ద్వారా తేలిపోతుంది. హిగ్స్ బోసాన్ కణాలతో సాధారణ అణువుల నుంచి బ్రహ్మాండ గోళాల వరకు క్రమంగా ఏర్పడ్డాయన్నది శాస్త్రీయమైన అంచనా. ప్రయోగ శాలలో బిగ్ బ్యాంగ్ను సృష్టించేందుకు అసాధారణ జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అంతరిక్షంలోని అత్యల్ప ఉష్ణోగ్రతల కంటే తక్కువ స్థాయి ఉష్ణోగ్రతల్లో వేలాది విద్యుదయస్కాంతాలను పనిచేస్తున్నారు. ఈ విద్యుదయస్కాంతాలు భిన్న దశల్లో ప్రయాణించే ఆ రెండు ప్రొటాన్ కణపుంజాల గమనాన్ని, గమ్యాన్ని నిర్దేశిస్తాయి.
కణ భౌతిక శాస్త్రంలో ‘సెర్న్’ అగ్రగామి
ప్రకృతి చీకటి కోణాలపై దృష్టి సారించి పలు అద్భుతాల వెనుక దాగిన మర్మాలను వెలుగులోకి తెచ్చేందుకు పార్టికల్ యాక్సిలేటర్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రెండవ ప్రపంచ యుద్ధం నుంచి కోలుకుంటున్న యూరప్ దేశాలు సెర్న్ అనే సంస్థను ఏర్పాటు చేశాయి. ఈ సంస్థ కార్యకలాపాల వలన యుద్ధ నష్టాల్లో కూరుకుపోయిన యూరప్లో శాస్త్ర సాంకేతిక విప్లవం మరోసారి వివృతమయింది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మరి ఇతర యూరప్ దేశాలు సెర్న్ నిర్మాణంలో కీలకపాత్రను పోషించాయి. అమెరికా నుంచి కూడా పలువిధులను సేకరించడం జరిగింది.
సెర్న్ కార్యకలాపంలో పలు ఆవిష్కరణలు పురుడు పోసుకున్నాయి. సెర్న్ కృషి ఫలితంగా విద్యుత్ అయస్కాంత శక్తి, రేడియో ధార్మికత కేంద్ర శక్తి రెండింటి ఏకీకరణ సాధ్యమయింది. ప్రాథమిక కణాలకు సంబంధించిన తొలి ఆవిష్కరణల పర్యవసానంగా వరల్డ్ వైడ్ వెబ్గా పిలిచే వెబ్ కంప్యూటింగ్ వ్యవస్థ రూపొందింది. యాక్సిలేటర్ భౌతిక శాస్త్రంలో చేసిన విశేష కృషికి గాను సెర్న్కు చెందిన భౌతికవేత్తలు కార్లో రూబియా, సైమన్ వాండర్ మీర్లకు 1984లో నోబెల్ బహుమతి వచ్చింది. ప్రత్యేకించి ఎల్హెచ్సీ నిర్మాణానికి సంబంధించిన ఘనత రూబియాకు చెందుతుంది.
దైవకణాల అన్వేషణలో భారత్ పాత్ర
సెర్న్ ఏర్పాటు చేసిన తొలినాళ్లలో మన దేశం పాత్ర నామమాత్రంగా ఉండేది. 1980ల దాకా భారత్ నుంచి సెర్న్ ఒకే ఒక ప్రతినిధి ఉండేవారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్కు చెందిన పీకే మల్హోత్ర సారథ్యంలో ఒక శాస్త్రవేత్తల బృందం సెర్న్ పరిశోధనా కార్యకలాపంలో పాలు పంచుకుంది. కలకత్తాలోని ‘వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్’, భువనేశ్వర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్, ఐఐటీ -బాంబే, రాజస్థాన్, జమ్మూ-కాశ్మీర్, ఛండీగఢ్, పంజాబ్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు సెర్న్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. ఫోటాన్ మల్టిప్లిసిటీ డిటెక్టర్ (పీఎమ్డి) ఎల్హెచ్సీలో కీలక భూమిక పోషించనుంది.
సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్కు చెందిన భౌతిక శాస్త్రవేత్తలు మ్యుయాన్ ఆలీస్ డిటెక్టర్లో మానస్ అని పిలిచే ఒక లక్ష ఎలక్ట్రానిక్ చిప్ల ఆకృతి, నిర్మాణాలను చేపట్టారు. ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం సహకారంతో ఆ సంస్థ ఆలీస్ యాక్సిలరేటర్కు చెందిన ఒకానొక భాగాన్ని అభివృద్ధి చేసింది. ఆలీస్ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ సంస్థ భాగస్వామిగా కొనసాగుతోంది. ప్రోటాన్ కణ పుంజం నిలిచేందుకు ఉపకరించే 40 మిలియన్ డాలర్ల విలువ చేసే సూపర్ కండక్టింగ్ స్టీర్ మాగ్నెట్ జాక్స్ను రాజా రామన్న సెంటర్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంస్థ అందజేసింది. ఈ నేపథ్యంలో నక్షత్రాల్లోని ఫోటాన్ శిథిలాలను అంచనా వేసేందుకు అమెరికాకు చెందిన బ్రూకోవన్ నేషనల్ లేబొరేటరీ సంస్థ భారతీయ శాస్త్రవేత్తలను ఆహ్వానించింది.
ఎల్హెచ్సీలోని మూడు డిటెక్టర్లు ప్రొటాన్ కణ పుంజాలు ఢీకొన్న తర్వాత ఏర్పడిన శిథిలాలను పరిశీలిస్తాయి. ఆ డిటెక్టర్లలో అమర్చిన భారతీయ పరికరాలు పీఎమ్డీ, మానస్ చిప్లు అత్యంత ప్రాథమికమైన ప్లాస్మా పదార్థాన్ని గుర్తించేందుకు ఉపకరిస్తాయి. యుద్ధం, పేదరికం, ప్రపంచ సంక్షోభంతో మానవ జాతి అతలాకుతలం అవుతున్న ప్రస్తుత సమయంలో విశ్వపదార్థపు చీకటి కోణాలను, దైవకణాల విన్యాసాలను పరిశీలించేందుకు జరిగే కృషిని అభినందించక తప్పదు. దైవ కణాల ఉనికి నిర్ధారణ జరిగినా, జరగకపోయినా ఈ ప్రయోగంతో విశ్వానికి సంబంధించిన పలు చీకటి కోణాలు వెలుగులోకి వస్తాయని పలువురు శాస్త్రవేత్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
– వెన్నెలకంటి రామారావు.
NB: ఈ టపాను నిన్న ప్రచురించిన తర్వాత వివిధ పత్రికలలో ఇవ్వాళ వస్తున్న అప్డేట్ వార్తలు, సంపాదకీయాలు, కథనాల లింకులను కొన్నింటిని లభ్యమైన మేరకు ఇక్కడ ఇస్తున్నాను. ఆసక్తి గల పాఠకులు వీటిని తప్పక చూడగలరు.
దైవ కణం జాడ!
- సంపాదకీయం
https://www.andhrajyothy.com/editorial.asp?qry=2012/jul/5/edit/editpagemain&date=7/5/2012
మహాద్భుతం…!
సంపాదకీయం
http://sakshi.com/Main/Weeklydetails.aspx?Newsid=44773&subcatid=17&categoryid=1
సంపాదకీయం
http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=5&ContentId=124879
- భౌతిక శాస్త్రంలో అతికీలకమైన ఆవిష్కరణ
http://sakshi.com/main/FullStory.aspx?catid=406509&Categoryid=1&subcatid=31
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/jul/5/main/5main1&more=2012/jul/5/main/main&date=7/5/2012
http://eenadu.net/news/newsitem.aspx?item=panel&no=1
విశ్వ ఆవిర్భావ సమాచారాన్నందించే కొత్త కణాన్ని కనుగొన్నాం
http://www.prajasakti.com/worldsdestiny/article-367464
విశ్వ సృష్టి శోధనలో కొత్త అధ్యాయం
http://www.visalaandhra.com/headlines/article-86374
http://www.suryaa.com/Main/News/Article.asp?Category=1&SubCategory=4&ContentId=88334
God Particle Found Historic Milestone From Higgs Boson Hunters
http://news.nationalgeographic.com/news/2012/07/120704-god-particle-higgs-boson-new-cern-science/?plckOnPage=4
http://www.thehindu.com/opinion/op-ed/article3602966.ece?homepage=true
Higgs boson ‘The beauty spot on the perfect face’
http://www.thehindu.com/sci-tech/science/article3601946.ece
Elusive particle found, looks like Higgs boson
http://www.thehindu.com/sci-tech/science/article3601654.ece
This is just the beginning of a long journey
http://www.thehindu.com/sci-tech/science/article3603258.ece
What next after a Higgs boson-like particle
http://www.thehindu.com/sci-tech/science/article3602374.ece
Footprint of ‘God particle’ found
http://www.thehindu.com/sci-tech/science/article3594941.ece
Filed under దైవ -ధిక్కార- కణాలు | Comments (4)
ఏది మంచి కథ?
పత్రిక, పాఠకులు, రచయితలు మధ్య సంబంధ బాంధవ్యాలు అరిటాకు లాంటి సున్నిత పునాది మీదే కొనసాగుతుంటాయి, చెదిరిపోతుంటాయి కూడా. పత్రిక నిర్వాహకుల అహం, పాఠకుల అహం, రచయితల అహం.. వీటిలో ఏ ఒక్కటీ తక్కువ కాదు. -ఇక్కడ అహం అనేమాటను పాజిటివ్గా తీసుకుంటేనే మంచిది- చందమామ కూడా దీనికి మినహాయింపు కాదు. అసలు ఒక పత్రికలో రచనలు ఏ ప్రాతిపదికన సెలెక్ట్ అవుతాయి, తిరస్కరింపబడతాయి అనేది పై మూడు కేటగిరీలలో ఏ ఒక్కరూ స్పష్టంగా చెప్పలేకపోవచ్చు.
కథ చాలా బాగుంది అనుకున్న సందర్భాల్లో కూడా అతి స్వల్పమైన కారణాల వల్ల ఎంపిక కాకపోవచ్చు. అవి సాహిత్య కారణాలు, సాహిత్యేతర కారణాలు, రాజకీయ కారణాలు, శైలి, కథలోని టోన్ ద్వారా వచ్చే సమస్యల కారణాలు, మంచి కథను కూడా పాడుచేసేలా పాత్రల చిత్రీకరణలో జరుగుతున్న లోపానికి సంబంధించిన కారణాలు ఇలా ఏవయినా కావచ్చు. కథ స్వీకరించడానికి, స్వీకరించకపోవడానికి ఇవన్నీ దోహదం చేసేవే.
పైగా వీటన్నిటికి మించి ఎంపిక దారుల మానసిక స్థితి -మూడ్- ఎలా ఉందనేది కూడా కథల ఎంపికలో గణనీయ ప్రభావమే చూపుతుందనుకుంటాను. ఒక సమయంలో అంత బాగాలేదనిపించిన కథ మరో సందర్భంలో ఫర్వాలేదు వేసుకోవచ్చు అనిపించి దాన్ని స్వీకరిస్తున్న సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. ఒక సారి సెలెక్షన్ కాని కథలు మరోసారి సులభంగా స్వీకరించబడటానికి ఎంపికదారుల మూడ్ కూడా అంతో ఇంతో పనిచేస్తుందనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవలిసిందే.
అందుకే కథను ఎందుకు ఎంపిక చేస్తున్నారు, ఎందుకు చేయలేదు అనే విషయంపై నూటికి నూరుపాళ్లు ఎవరూ సాధికారతను కలిగి ఉండరనుకుంటాను. దశాబ్దాలుగా కథలను స్వీకరిస్తున్న చందమామ కూడా దీనికి భిన్నం కాదు. లబ్ద ప్రతిష్టులైన రచయితల కథలు, కొత్తగా పంపుతున్న రచయితల కథలు కూడా స్వీకరించలేనప్పుడు మీ కథలో లోపం కాదని, అనేకానేక చిన్న చిన్న కారణాలతో మీ కథ తీసుకోలేకపోతున్నామని చెబుతూ చందమామ గతంలోనే సంజాయిషీతో కూడిన వివరణను రచయితలకు పంపుతూ కొత్త కథలు పంపవలసిందిగా అభ్యర్థించేది.
ఒక రచయిత కథలు పదే పదే చందమామలో ప్రచురించబడటానికి, స్వీకరించబడటానికి, 20, లేదా 30 కథలను ఒక రచయిత పంపినా ఒక కథ కూడా స్వీకరించలేకపోవడానికి ఇలాంటి సకారాణ, అకారణ అంశాలు పనిచేస్తుండవచ్చు.
చందమామలో ఎలాంటి కథలు పడుతాయి, పడవు?
1. ఏ జాతికైనా దానికే సంబంధించిన మూల కథలు -బేసిక్ స్టోరీస్- ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకుని ఇప్పటికే కొన్ని డజన్లసార్లు పలు పత్రికలలో కథలు గత కొన్ని దశాబ్దాలుగా ప్రచురించబడి ఉంటాయి. ఆ బేసిక్ కథల సారాంశాన్ని తీసుకుని పూర్తిగా రూపాన్ని మార్చి కొత్త కథ రాసి పంపినా ప్రచురణకు తీసుకోకపోవచ్చు.
ఈ కారణంవల్లే ఒకప్పుడు జంతువుల పాత్రలతో నడిచే కథలకు ప్రాముఖ్యతనిచ్చిన చందమామ తర్వాత కాలంలో రీటోల్డ్ స్టోరీస్ రూపంలో వస్తున్న జంతు కథలను పూర్తిగా పక్కన పెట్టేయడం జరిగింది. ప్రస్తుతం చందమామలో జంతుకథలు వస్తున్నాయంటే అవి చందమామలోని పాత కథలే అయి ఉంటుంది.
2. స్త్రీలను, వృద్ధులను, అంగవికలురను, బలహీన వర్గాల ప్రజలను కించపర్చే, నిందించే రకం కథలు గత సమాజాలలో లేదా శతాబ్దాల క్రితం పుట్టిన సాహిత్యంలో వచ్చి ఉండవచ్చు. కాని సమానత్వం సార్వజనిక విలువగా మారిన ఆధునిక కాలంలో వాటిని యధాతథంగా స్వీకరించడం పరమ అభ్యంతరకరం కాబట్టే కథ ఎంత బాగున్నా ఇలాంటి కించపర్చే సంభాషణలు కథలో వచ్చాయంటే వాటిని ఏ పత్రిక కూడా స్వీకరించలేకపోవచ్చు.
పీడకుడు పీడితుడిని తిట్టడం, దూషించడం పాత్రస్వభావ రీత్యా సహజమే కావచ్చు కాని ఇలాంటి వాటిని కూడా యధాతథంగా స్వీకరించలేని సున్నితత్వం సమాజంలో ప్రబలుతోంది కాబట్టి ఇలాంటి కథలను జాగ్రత్తగానే పరిశీలించడం జరుగుతోంది.
3. కుటుంబరావు గారు చందమామ అనధికారిక సంపాదకులుగా ఉన్నప్పుడే ఒరిజనల్ బేతాళ కథలను రెండు మూడింటిని యధాతథంగా ప్రచురించి ఇక సాధ్యం కాని పరిస్థితుల్లో వాటికి ఆధునిక సంస్కారాన్ని, కొత్త భావజాలాన్ని తొడిగి కొత్త బేతాళ కథలను తీసుకురావడం జరిగింది. గత 50 ఏళ్లకు పైగా చందమామ బేతాళ కథలు ఎంత సంచలనానికి కారణమవుతున్నాయో చెప్పవలసిన పనిలేదు.
4. సాధారణీకరణలు
ఆడదాని నోట్లో నువ్వు గింజ కూడా నానకూడదు అనే శాపాన్ని ధర్మరాజు పెట్టాడని భారతంలో అందరూ చదివే ఉంటారు. కర్ణుడు తనకే పుట్టాడనే విషయాన్ని కర్ణుడి మరణ సందర్భంలో గాని చెప్పలేకపోయిన కుంతీదేవిపై ఆగ్రహంతో ధర్మరాజు ‘ఇకపై స్త్రీల నోటిలో ఏ రహస్యమూ దాగకుండు గాక’ అని శపించాడట. ఇది సమాజంలోని మొత్తం స్త్రీలకు వ్యతిరేకంగా తీర్చి దిద్దబడిన గతకాలపు భావజాలం నుంచి పట్టిన పదబంధం. ఇలాంటి సాధారణీకరించిన సంభాషణలను స్త్రీ పాత్రలకు, నిస్సహాయులకు, వెనుకబడిన ప్రజలకు ఆపాదించి కథలు తయారైతే ఆధునిక సాహిత్యం వాటిని తిరస్కరించడమే జరుగుతుంది.
5. చిన్న ఉదాహరణ. పంచతంత్రకథల్లో ఆషాడభూతికి ఆశ్రయం ఇచ్చిన మంగలి తన భార్యను అనుమానిస్తూ ‘ఓసి ముక్కిడి ముండా’ అని తిట్టిన సందర్భాన్ని 70లలో చందమామలో వచ్చిన పంచతంత్రకథల్లో యధాతథంగా ప్రచురించారు. దీన్ని మళ్లీ 2011లో ప్రచురించినప్పుడు ఆ పదం వెనుక స్త్రీలను కించపరిచే భావజాలాన్ని గమనించకుండా అలాగే ప్రచురించడంతో పాఠకులనుంచి తీవ్ర నిరసన వచ్చింది. చందమామ కథల మంచిచెడ్డలను పాఠకులే నిర్దేశిస్తున్న చక్కటి పఠనా పురోగతిని, పరిశీలనను ఇక్కడ గమనించవచ్చు.
6. కథ ఎంత బాగా రాసినప్పటికి దాన్ని పోలిన, దాని సారాంశాన్ని పోలిన కథ అంతకుముందే చందమామలో వచ్చి ఉంటే, స్వీకరణ సాధ్యం కాదు. ఉదాహరణ చందమామలో వైద్యుల కథలు, దయ్యాల కథలు, జంతువుల కథలు, చాలా ఎక్కువగా వచ్చాయి. ఈ కోవలోని కథలు ఒకటి రెండు వరుసగా పడగానే వాటిని పోలిన ఇతివృత్తంతో చాలామంది కొత్త కథలను పంపడం సహజం. దాదాపు అన్ని పత్రికల విషయంలో ఇలాంటి ధోరణి ఉందేమో మరి. నాలుగైదు చందమామలను వరుసగా చూసి వాటిని పోలిన కథలు పంపితే వేసుకుంటారేమో అనే ఊహతో కొన్ని కథలు పంపించండం అందరి శ్రమ వృధా కావడానికే దారితీస్తుంది.
7. ప్రతి కథలోనూ వైవిధ్యతను ప్రదర్సించడం, కథను పోలిన కథను ఎట్టి పరిస్థితుల్లోనూ పంపకపోవడం గతంలో వచ్చిన కథను మార్చి, పాలిష్ చేసి కొత్త రూపంలో పంపడం వంటివి ఎక్కడైనా ప్రచురణార్హతకు నోచుకోవనుకుంటాను.
8. ఆడదాని సలహా అనే పాత కథను ఈ సంవత్సరం ఏప్రిల్ చందమామలో ప్రచురించడమైనది. బెస్తవాడి చర్యలకు దురుద్దేశ్యం అంటగట్టిన రాణిని ఉద్దేశించి పర్షియా ప్రభువు చివరలో నగరంలో చాటింపు వేస్తాడు “ఆడదాని సలహా ప్రకారం ఎవరూ నడుచుకోవద్దు. వారి సలహా విన్నట్లయితే సగం పొరపాటును దిద్దుకోవడానికి రెండు పొరపాట్లు అదనంగా చేయవలసివస్తుంది”
ఈ ప్రకటన మహిళలపై ప్రస్తుత సమాజం అంగీకరించని అభిప్రాయాలను వ్యక్తీకరిస్తోంది. ఈ మూలకథను నలభై ఏళ్ల క్రితం ఆడదాని సలహా పేరుతో యధాతథంగా ప్రచురించారు. ఈకథను అలాగే మళ్లీ ప్రచురిస్తే పాఠకులు దాడిచేయడం తప్పదు. మొత్తం స్త్రీ జాతినే అవమానిస్తున్న పై ప్రకటనను మార్చకుంటే కొంప మునుగుతుందని భావించి యాజమాన్యం వారి దృష్టికి తీసుకుపోయి అన్ని భాషల్లోనూ పై వాక్యాన్ని ఇలా మార్చడం జరిగింది.
“మన సన్నిహితులు, ఆంతరంగికులు చెప్పిన సలహా ప్రకారంమాత్రమే ఎవరూ నడుచుకోవద్దు. ఇతరుల సలహాను గుడ్డిగా విన్నట్లయితే సగం పొరపాటును దిద్దుకోవడానికి రెండు పొరపాట్లు అదనంగా చేయవలసి వస్తుంది”
మార్చిన కథకు అనుగుణంగా ఆడదాని సలహా అనే కథ శీర్షికను కూడా నష్టం మూడుసార్లు అని మార్చటం జరిగింది. అలనాటి తమిళ చందమామలో ఇదే పేరుతో ఈ కథను ప్రచురించడంతో ప్రస్తుత సందర్భానికి ఇదే బాగుందని దాన్నే స్వీకరించడం జరిగింది.
కథనం పెద్దది కావడంతో ఇప్పటికి ముగించి మరోసారి కలుద్దాము.
చందమామ.
మందులు తెచ్చిచ్చేవాళ్లూ లేరు నాయనా!
నిన్న మధ్యాహ్నం నా పాఠశాల సహ విద్యార్థి, మా ఊరికి పక్క ఊరివాడైన శ్రీనివాస్ని చెన్నయ్లో కలిశాను. తను ప్రస్తుతం కడప జిల్లా రాయచోటి పట్టణంలో ఉంటున్నాడు. విఐటి పరీక్షలకు హాజరవుతున్న తన పెద్ద కూతురుకు తోడుగా కుటుంబంతో కలిసి వచ్చాడు. ఆ పాప మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్షకు వెళితే సాయంత్రం అయిదు గంటలవరకు అన్నానగర్లో బిఒఎ స్కూల్ వెస్ట్ గేటు వద్ద వేచి ఉంటూ పిచ్చాపాటీగా మాట్లాడుకుంటూ గడిపాం.
ఎలా ఉన్నావు అంటూ పలకరింపులు అయ్యాక సహజంగానే మా సంభాషణ ఊరివైపు, మనుషులు, సంబంధాలు, మార్పుల వేపు మళ్లింది. “పల్లెలు, పట్నాలు మాట్లాడేందుకు మనుషులు లేక చస్తున్నాయి రాజా” అంటూ మొదలెట్టాడు శీను. గత కొంతకాలంగా ఈ విషయం అనుభవంలోకి వస్తున్నప్పటికీ తన గొంతులో మారుతున్న మానవ సంబంధాల వికృత విశ్వరూపం కొత్తగా ధ్వనించింది. తన మాటల్లోనే గత పదిహేనేళ్లలో మారిపోయిన మా ఊళ్లు మా మనుషుల కథ విందాము.
“నా యాభై ఏళ్ల జీవితానుభవంతో చెబుతున్నా రాజా, ఊళ్లలో, పట్నాల్లో మనుషులకు డబ్బు జబ్బు పట్టింది. పలకరించే మనిషిలేక, ముసలితనంలో ఆదుకునే దిక్కు లేక మనుషులు చస్తున్నారు. రెక్కలు వచ్చీ రాకముందే పిల్లలు చదువుల కోసం, ఉద్యోగాల కోసం పట్నాలు, నగరాలు, విదేశాల బాట పడుతున్నారు. కాళ్లూ చేతులూ కదపలేని ముసలితనంలో ఉన్న కన్న తల్లిని, తండ్రినీ కాసింత ధైర్యం చెప్పి మందూ మాకూ ఇచ్చేందుకు కూడా మనిషి లేకుండా పోతున్నాడు. ఎన్ని లక్షలూ, కోట్లూ సంపాదించి మాత్రం కన్నవారి బాగోగులు చూడటం సాధ్యం కాకుండా పోయాక ఇక మనం ఎన్ని చెప్పుకుని ఏం ప్రయోజనం?
నా ఉదాహరణే తీసుకుందాం. మాది వాస్తవానికి కృష్ణా జిల్లా అబ్బవరం గ్రామం. మా నాన్న 40 ఏళ్ల క్రితం బతుకు కోసం వలస వచ్చి మీ ఊరు పక్కూరికి వచ్చేశాడు. అలా మనం కలిసి చదువుకున్నాం. దాదాపు 25 ఏళ్ల తర్వాత 2008లో మళ్లీ రాయచోటిలోనే కలుసుకున్నాము. కొన్ని సంవత్సరాల క్రితం అబ్బవరంలో మాకు దగ్గర బంధువైన అవ్వను చూసుకోవడానికి ఎవరూ లేరనిపించి రాయచోటికి తీసుకువచ్చి మా ఇంట్లో పెట్టుకుని నా శక్తిమేరకు సేవ చేశాను. కాని ఆమెకు మా ఇల్లు కొత్త ప్రపంచమైపోయింది. 90 ఏళ్లు అబ్బవరం గ్రామంలో పెరిగిన అవ్వ వందలమంది జనంతో, బంధుబలగం తోడుగా బతుకు సాగించిన అవ్వ మా ఇంటికి వచ్చేశాక మాట్లాడే మనిషి లేక విలవిల్లాడిపోయింది.
ఎవరి బతుకు పోరాటం వారిదైపోయాక ఏదో ఒక పనితో ఇంటిబయటకు పోవలసిన పరిస్థితుల్లో 24 గంటలూ ఆమెను అంటిపెట్టుకుని ఉండటం సాధ్యమా? నేను నా సన్ టీవీ డిష్ నెట్ వ్యాపారం కోసం బయటకు వెళ్లిపోవడం, నా భార్య టీచర్ జాబ్ చేయడం, ఆడపిల్లలిద్దరూ చదువుకోసం వెళ్లిపోవడం రొటీన్గా మారాక ఆమెకు తోడుగా ఉండి పలకరిస్తూ, అవసరమైనది తీరుస్తూ ఉండే మనిషి లేకుండా పోయాడు. నాకు పెద్దగా పరిచయం లేని మా నాన్న తరపు బంధువులను ఎంతగానో అడుక్కున్నాను. ఆమెకు మీతోటే అటాచ్మెంట్ ఎక్కువ కాబట్టి నెలకు ఒకరైనా ఇక్కడికి వచ్చి ఆమెకు తోడుగా ఉండమని, ఖర్చులన్నీ నేను భరిస్తానని చెప్పినా ఎవరూ రాలేదు. మాలాగే వారికి ఎన్ని జీవిత సమస్యలో.
ఈరోజుల్లో ఊరు విడిచి బయటికి వచ్చిన ప్రతి ఒక్క ముసలివారి ప్రపంచం వేరుపడిపోతోంది. పుట్టి పెరిగిన ఊరిని, కష్టంలోనూ, సుఖంలోనూ జీవితాన్ని పండించిన ఊరిని, ముసలివయసులో చూసుకునే వారు లేక వదిలేసినప్పుడు నగరాల్లో ఉన్న పిల్లల వద్దకో, బంధువుల వద్దకో వెళ్లిపోయి రోజులు గడుపుతున్న వారు నిజంగా జీవచ్ఛవాలే. మా అవ్వకు తిండిలోటు లేకుండా చూసుకున్నాము గాని స్వంత ఊరితో, స్వంత మనుషులతో అనుబంధాన్ని ఆమెకు కల్పించలేకపోయాము. తన వాళ్లంటూ లేక ఆమె మా ఇంట్లో ఎంత విలవిల్లాడిపోయిందో నాకు తెలుసు.
అందుకే ఆమె చనిపోతే రాయచోటిలో ఆమె అంత్యక్రియలు చేయాలనిపించలేదు. ఎంత కష్టమైనా సరే ఆమెను ఆమె స్వంతఊరిలోనే సాగనంపాలని రాయచోటినుంచి కృష్ణాజిల్లావరకు ఆమెను తీసుకుని ఊరివారిమధ్యే ఆమెకు అంత్యక్రియలు పూర్తి చేశాను. ఫలానా వారి కొడుకు అని తెలిశాక ఆ ఊరి పెద్దలంతా వరుసపెట్టి మాట్లాడుతూ తమ బాధలు చెప్పుకున్నారు.
చాలా సంపాదించాము నాయనా, పిల్లలందరికీ చదువులు చెప్పించాము. అందుకే ఒక్కరూ ఊరిలో మిగల్లేదు. ఉద్యోగాల బాటపట్టిన బిడ్డలు లక్షలు సంపాదిస్తున్నారు కాని మాకేమయినా అయితే మాట్లాడే వారులేరు. కనీసం మాత్రలు బయటూరికి పోయి తెచ్చిచ్చే వారు లేరు. ఎందుకు నాయనా ఈ దిక్కులేని బతుకు మాకు. ఇలా అవుతుందని కనగన్నామా.. అంటు అందరూ వలవలా ఏడ్చేవారే. ముసలామెకు ఇంత ఘనంగా ఊరు తీసుకొచ్చి చివరి క్రియలు జరుపుతున్నావు సంతోషం నాయనా అంటూ ఏడ్చేవారే ఆ ఊళ్లో..
వాళ్లముఖాల్లో దైన్యం, కన్నబిడ్డల సాయం అందని ఘోరం కనిపిస్తూంటే నిజంగా తట్టుకోలేకపోయాను. రేపు మా పిల్లలకు చదువు చెప్పించి, వారు ఉద్యోగాలకో లేదా పెళ్లి చేసుకుని వెళ్లిపోయాక మా గతి కూడా ఇంతే కదా అని జీవితంలో మొట్టమొదటి సారి భయం పుట్టింది రాజా..
మనందరి బతుకులూ తాతా మనవడు సినిమాలో చూపిన బతుకులే అయిపోతున్నాయి. ఆ సినిమా అప్పట్లో చూసినప్పడు మన జీవితాలకు అది కొత్త అనుభవం. అలాంటిది మనకు లేదులే అని సంతోషించి ఉంటాము కూడా. కాని 30 ఏళ్లలోపే అది వెంటాడుతూ మన జీవితాల్లోకి వచ్చేసింది. పదోతరగతి చదువుకున్నంతవరకు ఇంట్లోనే ఉన్న పిల్లలు రేపు మరొకచోటికి వెళ్లిపోతే అదీ ఇద్దరూ చెరొక చోటికి వెళ్లి చదువుకోవలసివస్తే, నా భార్య ట్రాన్స్ఫర్ అయి వేరే ఊరికో, పట్నానికో వెళ్లిపోతే, నేను నా చిన్న బిజినెస్ కోసం ఇక్కడే ఉండిపోవలసి వస్తే.. బతుకేమిటి అనే గ్లాని పుడుతుంది. ఎన్నడూ లేనిది అప్పుడే మేం ఒకరికొకరం దూరమవుతున్నంత ఫీలింగ్ వచ్చేసింది.
ఉమ్మడి కుటుంబాల బంగారు కాలం ఎప్పుడో పోయింది. కనీసం సింగిల్ కుటుంబాల కాలం కూడా మన కళ్లముందే కరిగిపోతోంది. ఎక్కడో విదేశాలకు పోవడం కాదు. మన ఉంటున్న చోట్లోనే ఒక కుటుంబంగా ఉండలేని పరిస్థితి వచ్చేశాక ఇక దేన్ని చూసి సంతోషించాలి?
నాకు తెలిసి మరో దేశంలో ఉద్యోగం చేస్తున్న ఒకరి తల్లి ఊర్లో ఉండి టాయ్లెట్లో పడిపోతే చివరకు ఆ విషయం కూడా రోజూ ఫోన్ చేసే కొడుకు తెలుసుకుని తెలిసిన డాక్టర్కి కబురు చేసి అక్కడినుంచే వైద్యం ఇప్పించిన ఘటనలు జరుగుతున్నాయి. వందల కోట్లు సంపాదించి బిడ్డలకు పంచిపెట్టిన పెన్నా సిమెంట్స్ ఓనర్ ఇప్పుడు దిక్కులేకుండా రాయచోటిలో ఒక వృద్ధాశ్రమంలో బతుకు వెళ్లదీస్తున్నాడు. 90 ఏళ్ల వయసులో ఆయన ఏడుపును, ఒంటరితనపు చిత్రహింసను ఎవరు పరిష్కరిస్తారు?
మన జీవితాల్లో ఈ ఒంటరితనం రోగాన్ని మించిన భయంకరమైన రోగం మరొకటి లేదు. వద్ధాశ్రమంలోకూడా పోయి ఉండలేని వారి బతుకు మాటేమిటి మరి. మనం పుట్టి పెరిగిన ఊళ్లలో వారానికి ఒకసారి ఆరెంపీ వైద్యుడు పోయి ముసలివారికి మందూమాకూ ఇచ్చి వచ్చే రోజులొచ్చేశాయి. తల్చుకున్నప్పుడల్లా దేవుతుంది నాకు. మన చిన్నప్పుడు మనం చూడలేనంత డబ్బు మనం సంపాదిస్తున్నాము. డబ్బుతో పనిలేకుండా ఉన్నంతలో పొదుపుగా, కలివడిగా, సంతోషంగా గడిపిన రోజులు పోయాయి. ఊరు ఊరంతా బంధుబలగంతో, ఆటలతో, సంతోషంగా గడిపిన రోజులు ఎక్కడిపోయాయి ఇప్పుడు? కుటుంబాలు కూడా చెట్టుకొకరూ, పుట్టకొకరుగా వేరుపడిపోవలసి వస్తున్న పాడుకాలంలో చివరకు మనం ఏమైపోతామో అర్థం కావడం లేదు.”
నిన్న శనివారం శీనుతో గడిపిన మూడుగంటలూ ఇదే సంభాషణ.. మంచి జీవితం కోసం, సంపాదన కోసం, భవిష్యత్తు కోసం మనుషులు పడుతున్న పాట్లు వారి వృద్ధాప్య జీవితంలో బతికి ఉన్నప్పుడే నరకాన్ని చూపిస్తున్నాయని, కోరికోరి మనం మన గతిని ఇలా నిర్దేశించుకుంటున్నామంటూ శీను విషాదంతో చెబుతుంటే మౌనంగా ఉండిపోయాను. స్వర్గ నరకాలను నమ్మవచ్చు నమ్మకపోవచ్చు కాని నరకం ఇప్పుడు భూమ్మీదే మనందరి కోసం తయారవుతోంది. ఇది మనందరి జీవితాలనూ వెంటాడుతోంది. తల్లిదండ్రులు, పిల్లలు కూడా కలిసి బతకడం సాధ్యం కాని నరకం ఇది. ఆ నరకంలో కూడా -అదంటూ ఉంటే- మనిషికి ఎదురుపడనంత ఘోర నరకం ఇది.
నా స్నేహితుడితో ఊరి ఊసులాడుకుంటున్నప్పుడే చందమామ చిత్రకారులు శంకర్ గారి స్థితి గుర్తుకొచ్చింది. కొడుకులూ కూతుళ్లలో చాలామంది దేశంలో వేరే నగరాలకు, విదేశాలకు వెళ్లిపోయాక స్వంత ఇంటిలోనే కావచ్చు ఇప్పుడు ఆ దంపతులు ఇద్దరే మిగిలారు. భారీ సంతానం వీరికి. కాని ఒక్కరూ దగ్గరగా లేరు. 88 ఏళ్ల వయసులో ఆయన, సహచరి షణ్ముఖవల్లి గారు ఒకరికొకరు తోడుగా బతుకుతున్నారు. సాంప్రదాయక జీవితం గడుపుతున్న వీరిలో ఆమెకు ఆరోగ్యం బాగాలేక నగరంలోనే దూరంగా ఉంటున్న కూతురు ఇంటికి ఆమె వెళ్లిపోతే కాసింత అన్నం, కాసింత పప్పుకూర స్టౌమీద పెట్టి చేసుకుకోవటం తప్పితే ఆయనకు వేరే దారిలేదు.
“ఏంటి మాస్టారూ ఈ రకమైన జీవితం” అని అడిగితే ఆయన ఎప్పటిలాగే శాస్త్రోక్తంగా అంటుంటారు. “కాళ్లూ చేతులూ ఆడుతున్నంతవరకూ ఇలాగే బతకాలని ఆ శంకరుడు ఆదేశించాడు కదా మరి. ప్రతివాడికీ ఆ శంకరుడు టికెట్ రాసి పెట్టాడు. ఆ రోజు దగ్గర కాగానే టికెట్ చింపేసి వెళ్లిపోవడమే గతి. ఎవరూ ఏమీ చేయలేరు కదా”. ఆయన జీతం చెక్ బ్యాంకులో వేసి రావడానికి, అవసరమైన డబ్బు తీసుకొచ్చి ఇవ్వడానికి కూడా చందమామ నుంచి ఎవరో ఒకరు పోతే తప్ప మరో దారి లేదు వాళ్లకు.
ఈ వయసులో కూడా సంపాదన ఉన్న ఇలాంటి వారిని మినహాయిస్తే కోట్లాది సాధారణ జీవితాల పరిస్థితి ఏమిటి? ఇది మనకే కాదు సంపదల మేట పడిన అమెరికాలో కూడా కోట్లాదిమందికి గృహసమస్య పెనుభారంగా మారి సంక్షేమ కోతల కోరల్లో పడి నలుగుతున్నారని, దీనికి తెలుపు నలుపు వర్ణభేదం కూడా లేదని వార్తలు విస్తృతంగా అంతర్జాలంలో కనబడుతున్నాయి.
మొత్తం మానవ సమాజానికే డబ్బు జబ్బు, ఒంటరితనం జబ్బు పడుతున్నట్లుంది. మందు మాకులివ్వడానికి కూడా మనుషులు లేరంటూ విలపిస్తున్న మన తరానికి, మన జాతికి ఇదే ఒక పెద్ద నరకం. మన బంగారు బాల్యాన్ని, ఉమ్మడి కుటుంబం, విడి కుటుంబం యొక్క మధురోహలను కూడా దూరం చేసి మనుషులను అమాంతంగా చెల్లాచెదురు చేస్తున్న మహా నరకమిది. రేపు మాపు ఎవరయినా దీనికి బలి కావలిసిందే కాబోలు.
మనుషులుగా మనం కోల్పోయిన, కోల్పోతూ వస్తున్న మన జీవితానందాలను, ఒకనాటి మన ప్రపంచం నడకను పట్టిచూపుతున్నందుకే చందమామ కథలు ఇవ్వాల్టికీ సమాజాన్ని అంతగా ఆకర్షిస్తున్నాయేమో..!
Filed under డబ్బు చేసింది | Comments (5)లేఖల్లో చందమామ…
నేను గత 55 సంవత్సరాలుగా చందమామ పాఠకురాలిని. ఆ చల్లని చందమామకు లాగే ఈ పంచరంగుల చందమామ కూడా ఇంటిల్లిపాదికి ఎంతో ఆనందం కలిగిస్తోంది. 50 ఏళ్ల క్రితం చదివిన తోకచుక్క, రాకాసిలోయ, విచిత్రకవలలు ఇంకా నా కళ్లకు కట్టినట్లే ఉన్నాయి. చందమామను చూస్తే ఎన్నో జ్ఞాపకాలు. జైలు సూపర్నెంటుగా పనిచేసిన మా వారు ఆఫీసు నుంచి వచ్చాక ఏమాత్రం తీరిక దొరికినా చందమామే చదివేవారు. మా ఏడుగురు పిల్లలకు రామాయణ, భారతాలు పరిచయం చేసిన పుణ్యం చందమామదే. ఇప్పుడు చందమామ తిరిగి పూర్వవైభవం సంపాదించింది. చాలా కథలు వేస్తున్నారు. పాత సీరియల్స్, కొన్ని పాత కథలు చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. మళ్లీ మా ఇంట్లోకి వెన్నెల వెలుగులు వస్తున్నాయి. చందమామలో 40 ఏళ్లుగా కథలు రాస్తున్న మాచిరాజు కామేశ్వరరావు నా కుమారుడే. ఐదేళ్ల గ్యాప్ తర్వాత తను మళ్లీ చందమామకు కథలు రాసి పంపనున్నాడు. నా వయస్సు ఇప్పుడు 81 సంవత్సరాలు. వంద సంవత్సరాల వరకు చందమామ చదువుతుండాలని నా ఆశ. మా అభిమాన చందమామ ఇంటిల్లపాదిని ఇలాగే అలరించాలని ఆశీర్వదిస్తున్నాను.
–మాచిరాజు రత్నకుమారి, హైదరాబాద్.
ఊహ తెలిసినప్పటినుంచి చందమామ తెలుసు. ఇప్పటికీ చందమామ చేతిలో పడిందంటే చాలు పుస్తకం మొత్తం చదవందే వదలను. అయితే నేను చదివే విధానం గమ్మత్తుగా ఉంటుంది. వెనకపేజీ నుంచి మొదలు పెట్టి ముఖచిత్రంతో ముగిస్తాను. నాకు పది సంవత్సరాల వయసు గల మనవడున్నాడు. వాడు కథ చెబితే గాని నిద్రపోడు. రోజుకో కొత్త చెప్పాలి. అలాంటప్పుడు అనిపిస్తుంటుంది. ‘చందమామ నెలకొక్కటేనా’ అని.
–వై. సువర్ణకళ, ఉప్పల్, హైదరాబాద్.
ఏప్రిల్ సంచికలో నా తొలి కథ ‘అనువుగానిచోట‘ చూడగానే ఎంత సంతోషమేసిందో మాటల్లో చెప్పలేను. నర్సింగ్ హోమ్ నుంచి ఇంటికొచ్చి రాత్రి ఏక బిగిన చదివేశాను. నడి రాత్రి తర్వాత కూడా చందమామను మునివేళ్లతో పట్టుకుని నిమురుతుంటే మా చెల్లెలు చూసి ‘ఇక చాల్లే పడుకో’ అంటూ మందలించింది. దీనికి కారణం ఉంది. ఇతర పిల్లల పత్రికలకు కథలు పంపే నా స్నేహితురాళ్లు ‘చందమామలో నా కథ పడుతోంద’ని చెబితే అదీ చూద్దాం అంటూ గత కొద్ది నెలలుగా అపహాస్యం చేస్తూ వచ్చారు. అందుకే చందమామలో నా తొలి కథను ఆనందంతో కాదు కసిగా చదివాను. 12 భాషల్లో చందమామను తెప్పించుకుని వాళ్లందరికీ నా కథను 12 భాషల సంచికలలో చూపించి నవ్వాలని ఉంది. చందమామలో నా తొలి కథ ప్రచురించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
–డాక్టర్ సిరి, మిర్యాలగూడ, నల్గొండ
ఏప్రిల్ చందమామ చక్కటి కథలతో పున్నమి చంద్రుడిలా నిండుగా ఉంది. అయితే జాబిలిలోని మచ్చలా ‘తరం-అంతరం’ కథ అనిపించింది. అలాంటి కథల ప్రచురణ దయచేసి ఇకనైనా ఆపండి. గ్యాస్ స్టవ్లు, మిక్సీల బొమ్మలు, పిజ్జాలు, బర్గర్లు, కంప్యూటర్, ఆఫీసు లాంటి పదాలు చందమామకు వద్దు. ఈ కాలం సబ్జెక్టులతో వెయ్యి కథలు రాయొచ్చు. అయితే అవి చందమామకు అందాన్నివ్వవు. అలాంటి కథలకు చాలా పత్రికలు ఉన్నాయి. తాజ్మహల్కి గులాబి రంగు లేస్తే ఇంకా అందంగా అర్థవంతంగా ఉండొచ్చు గాక. కానీ దాన్ని పాలరాతితో నిర్మించిన షాజహన్ అభిరుచే అందరికీ ఇష్టం. ఆమోదం. చందమామ కూడా అంతే. ఎన్నో గొప్ప పత్రికలు సైతం కాలగర్భంలో కలిసి పోయినా, చందమామ ఇప్పటిదాకా గర్వంగా తలెత్తుకుని నిలబడిందంటే ఆ గొప్పతనం దాని మూలాల్లోనే ఉంది. దయచేసి వాటిని అలాగే కాపాడండి. ఇది నా ఒక్కడి అభిప్రాయం కానేకాదు. చందమామ అభిమానులందరి అభిప్రాయం. కావాలంటే సర్వే జరపండి. చందమామకి ఆధునికత వద్దు.. వద్దు.. వద్దు…
– పి. వెంకటేశ్వరరావు, తూర్పుగోదావరి, ఎపి.
గత కొద్ది నెలలుగా చందమామలో వస్తున్న కథల సంఖ్య చూసి చాలా ఆనందం కలిగింది. ఎక్కువ మంది రచయితలకు అవకాశం కల్పించడం ముదావహం. మీరు చేస్తున్న కృషికి దన్యవాదాలు. చందమామకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నంలో మీరు విజయం సాధించాలని అభిలషిస్తున్నాను.
– జి. సుబ్రహ్మణ్య గౌడ్, రాజంపేట, కడప, ఎపి.
చందమామతో మా కుటుంబ అనుబంధం నాలుగు తరాలకు సంబంధించినది. తాతగారు, నాన్నగారు, మేము, మా పిల్లలము. గత 60 ఏళ్లుగా మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ చందమామను చదువుతూ వస్తున్నారు. పదేళ్లకు పైబడి, చందమామ ఫోటో వ్యాఖ్యల పోటీలో నా పేరు చూసుకోవాలని తహతహలాడాను. కాని అంబలి కోరుకుంటే, అమృత పరమాన్నం దక్కినట్లు.. ఏప్రిల్ సంచికలో నా కథ ‘చెల్లని నాణెం‘ ప్రచురించబడింది. చందమామలో నా పేరును నా కళ్లతో చూసుకున్న అదృష్టవంతుడిని. చందమామ ప్రాణస్నేహితులైన మా పూర్వీకులకు ఇది ఘననివాళిగా భావిస్తూ నా ఈ చిన్ని కథను వారికే అంకితం ఇస్తున్నాను.
–జి. జాన్ కెనడి. రంగారెడ్డి జిల్లా, ఎపి.
నా తొమ్మిదవ ఏటనుంచి చందమామ చదవటం అలవాటు. అప్పుడు దీని ధర పావలా ఉండేది. ఇప్పుడు నాకు 66 సంవత్సరాలు. ఇప్పటికే ప్రతినెలా కొని చదువుతున్నాను. ఆ ఆసక్తే నన్ను చందమామకు కథలు వ్రాసేలా చేస్తోంది.
–ఇందిర, హైదరాబాద్
జీవితంలో మర్చిపోలేని రోజిది. ఏప్రిల్ సంచికలో నా కథ ‘చౌకబేరం‘ అచ్చయింది. నా కథ చందమామలో వస్తోందని ఇప్పటికే మా బంధుమిత్రులకు చెప్పాను కాబట్టి వాల్లందరూ విశాఖపట్నంలో తెలుగు చందమామలు కొనుక్కుని మరీ చదివారు. బ్యాంకులో పనిచేసే మా అన్నయ్య కూడా చందమామ కాపీలు కొని ఆయన ఆఫీసులో పంచారట. చందమామ అంటే ఓల్డెస్ట్ మరియు గోల్డ్ మేగజైన్ కదా. దాంట్లో నా కథ పడటం అంటే మా వాళ్లందరికీ పెద్ద విశేషమైపోయింది. ఇక చంద్రాపూర్లో మా పిల్లలు చదువుతున్న స్కూలులో టీచర్లందరూ లైబ్రరీకి పోయి మరీ చందమామలో పడ్డ నా కథ చదవారట. నాన్న కథ 12 భాషల చందమామలలో వచ్చిందని వారు చెబితే అందరికీ ఆశ్చర్యమే. అన్ని చందమామల్లో నా కథ వస్తుందని గతంలోనే మీరు చెప్పగా నాకు ఒక సెట్ కావాలని అడిగాను. ఆవిధంగా మీరు పంపిన 12+ 2 భాషల చందమామల పాకెట్ ఇవ్వాళే అందుకున్నాను -15-04-2012- మనస్పూర్తిగా చెబుతున్నాను. ఈ రోజును జీవితంలో మర్చిపోలేను. పన్నెండు చందమామల్లో ఒకేసారి నా కథ చూసుకోవడం నాకు గొప్ప అనుభూతి అయితే మా పిల్లలు వాటిని మొత్తంగా స్కూలుకు తీసుకుపోయి టీచర్లకు, సహ విద్యార్థులకు చూపిస్తామని గోల చేసేస్తున్నారు. చందమామకు ఎలాంటి కథలు రాయాలి అనే విషయంలో కూడా మీరు ఇస్తున్న సలహా మాలాంటి వారికి ఎంతగా ఉపయోగపడుతోందో మాటల్లో చెప్పలేను. థాంక్యూ చందమామా..
–మళ్ల లక్ష్మీనారాయణ, రైల్వేస్, చంద్రాపూర్, మహారాష్ట్ర
అభివృద్ధి వెలుగునీడలు : మల్లెమడుగు
ఈ ఆదివారమంతా మరే పనీ చేయకుండా ఇంటికి వచ్చే మూడు పేపర్లు అక్షరాక్షరం తిరిగేస్తూ, బ్లాగులు చూస్తూ, ఇష్టమైన కథనాలను ఆన్లైన్ లింకులతో సహా నిలవ చేసుకుంటూ గడిపేశాను. నాకు బాగా నచ్చిన కొన్ని అపురూప కథనాల లింకులను ఇక్కడ ఇస్తున్నాను.
కూటాలమర్రి, మల్లెమడుగులను వెతుక్కుంటూ…
గత ఫిబ్రవరి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధాలలో రెండు వారాల పాటు ఒక అద్భుత కథనం ప్రచురించబడింది. అడవికీ, నాగరికతకు మధ్య తెగిపోయిన పేగు బంధాన్ని అద్వితీయ శైలిలో వివరించిన ఈ కథనాల కర్త డాక్టర్ లెనిన్ ధనశెట్టి గారు.
కడప-నెల్లూరు జిల్లాల మధ్య వెలిగొండు పర్వత శ్రేణుల మధ్య ఉంటే కూటాలమర్రి- మల్లెమడుగు గ్రామం గ్రామమే అటవీ జీవనాన్ని వదిలిపెట్టి మైదానాల పాలబడిన శిథిలమైపోయిన చరిత్రను కమనీయంగా, మానవీయంగా, కరుణామయంగా చిత్రించిన కథనం ఇది.
బస్సులూ, కరెంటు దీపాలు ఎట్టుంటాయో కూడా చూడకుండానే కాటికి పోయినోళ్ల ఊళ్లు కూటాలమర్రి, మల్లెమడుగు. ఒక్క మల్లెమడుగు గ్రామంలోనే 350 గడప ఉండేది. నీటి సౌకర్యం లేకపోయినా మంచుకే పంటలు పండే జీవగడ్డ. పురుగు మందు, ఎరువు అనే పదాలు తెలియని, దుక్కి దున్ని విత్తనాలు విసిరితే చాలు పుట్లకొద్దీ పంట కోసుకోవడమే తరువాయిగా బతికిన పచ్చపచ్చటిప్రాంతం..
నాగరికత తన కరకు కత్తులను మెత్తగా దింపగా పిల్లలు చదువులపాలై, ఉద్యోగాల పాలై.. ఒక్కొక్కరూ బయటి ప్రపంచంలోకి ఎగిరిపోగా బిత్తరపోయిన ఊరు. నలభై ఏళ్లుగా ఊరికి రోడ్డెయ్యండనీ, కరెంటీయండనీ నాయకులకూ, కలెక్టర్లకూ మొక్కిన మొక్కులు మొక్కులుగానే మిగిలిపోయిన నేపథ్యంలో కొంపా గోడూ, పొలాలూ ఆవులూ వదిలి చెట్టుకొకరూ పుట్టకొకరూగా ఒక్కో కుటుంబం దేశం మీద పడిపోతే ఖాళీ అయిపోయిన ఊరు. మల్లెమడుగు.
రచయిత మాటల్లో చెప్పాలంటే…. “ఒక తరం ఆశలకు వృద్ధతరం విశ్వాసాలకూ మధ్య ఈ గ్రామంలో జరిగిన యుద్ధంలో- సంఘర్షణలో ఎన్ని హృదయాలు గాయపడ్డాయో? ఎన్ని గుండెలు ఊరిని వదలలేక కుమిలి కుమిలి ఆగి మరణించాయో? ఒక యుద్ధానంతర దైన్యాన్నీ, వేదననూ ఆ శిథిల గ్రామం అణువణువునా ప్రతిబింబిస్తోందనిపించిందా క్షణం.?”
దాదాపు పాతికేళ్లుగా ఈ ఊర్ల గురించి వింటూ వస్తున్న రచయిత ఒకరిద్దరు మిత్రులతో కలిసి ఈ సంవత్సరం అడవిబాట పట్టి ఈ శిధిల గ్రామాలను శోధిస్తూ పోయిన క్రమమే ఈ కథనానికి మూలం. యుగాలనుండి మనుషులు సాగిస్తున్న పర్యాటక యాత్రల చరిత్రలో ఒక అద్వితీయ ఘట్టాన్ని ఈ కథనం మన కళ్లముందు దివ్యంగా ప్రదర్శించింది.
భూ దిగంతాల కనుచూపు మేరా ఆక్రమించిన విశాలమైన లోయ- ఆ లోయ పొడవునా సమ్మోహన నిశ్శబ్ద ధ్యానం.. కనుచూపు పరిమితికి లొంగని విశాల లోయ.. రెండు కొండల నడుమ లోయలోకి నడుస్తూ అడవితల్లి సౌందర్యాన్ని విభ్రాంతితో నిశ్చేష్టులై చూస్తూ… ఆమె గర్భంలోకి నిర్భయంగా… నిరాయుధంగా… జ్ఞాన రహితంగా… అచేతనంగా ఎవరో మంత్రించినట్టు అలా సాగిపోవడం… చీకటి పొదలను దాటే క్రమంలో ఆ వేణువనం మధ్యలోని ఆయిల్ పెయింటింగ్ లాంటి ఒక చెరువు.. ఎత్తయిన కొండ చరియలతో సహా వెదురు గెడల ఆకుల సూక్ష్మ కొనలు సైతం స్వచ్ఛమైన ఆ చెరువు నీళ్ళలో ప్రతిఫలిస్తుండగా కోటి వర్ణాలుగా వివర్ణించిన కాంతి ఇంద్రజాలం…
వేల ఎకరాల పచ్చిక బీళ్ళ మైదానం… కోటి ఐమాక్స్లలోనూ పట్టని దృశ్య ఉత్సవం. దూరంగా చెట్ల సందుల్లో కనిపిస్తున్న పూరిళ్ళ ఊరు… మల్లెమడుగు… ఏళ్ళ జ్ఞాపకం వాస్తవమై సాక్షాత్కరించిన సందర్భం.. కొరివి దెయ్యాల కథల్నుంచి… గాయత్రి, ఎగ్జార్సిస్ట్, వోమెన్, అరుంధతి, కాంచన వరకూ విలేజ్ అండ్ అర్బన్ లెజెండ్స్ అనబడే హత్యా ఆత్మహత్యల బీభత్సరస ప్రధాన గాథలన్నీ మెదళ్ళ స్మృతి పేటికల నుంచి మాటలుగా ప్రవహిస్తుండగా, కొన్ని వేల పిట్టల అరుపులతో ఆ అడవిలోయ ప్రతిధ్వనిస్తుండగా, ఉత్తర దక్షిణాలుగా వ్యాపించిన మల్లెమడుగు ఈ కథన రచయితకు క్షతగాత్రురాలిలా దర్శనమిచ్చిందట.
ముగ్గురు కలెక్టర్లు మమ్మల్ని అడవి నుంచి బయటకు తరిమి మా బతుకులను నాశనం చేశారని అడవికి మమ్మల్ని దూరం చేసిన వారికి అడవి తల్లి గోస తగిలి వంశనాశనం అయిపోతుందని కూటాలమర్రి కాలనీలో జీవచ్ఛవాలుగా మిగిలి ఉన్న వారి శాపాలు..
ఒక యుద్ధం లేదు. ఒక సైనిక దాడి లేదు… ఒక దురాక్రమణ లేదు. ఆదివాసీ అభివృద్ధి పేరిట పాలకులు చేపట్టిన అర్థరహిత చర్యల కారణంగా అడవికి దూరమైపోయిన అడవిపుత్రుల విషాద చరిత్ర ఇది.
నాకు తెలిసి సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితమే అనుకుంటాను.. నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలో జీవిస్తున్న చెంచులను ఉద్ధరించడానికి నడుం కట్టిన ప్రభుత్వం వారిని అక్కడి నుంచి బయటకి తెచ్చి మైదాన ప్రాంతంలో నివాస ప్రాంతం, వ్యవసాయ భూమి కల్పించి బతికేయమని చెప్పింది. అడవి ఉత్పత్తులమీద, ఆహార సేకరణ మీద ప్రధానంగా బతుకుతూ వచ్చిన చెంచులు ఒక్కసారిగా తమ కళ్లముందు కనిపించిన ఈ విశాలప్రపంచంలో ఏం చేయాలో, ఎలా బతకాలో అర్థం కాక తిండిలేక చనిపోయారు.
భూమి ఇచ్చాం కదా బతికేస్తారులే అని వదిలేసిన మన ఘనత వహించిన ప్రభుత్వం, అధికారులు వారికి వ్యవసాయం వచ్చా, రాకపోతే వారికి కల్పించవలసిన కనీస ప్రాధమిక శిక్షణ, పరికరాలు, తదితర వ్యవసాయ అవసరాలను తీర్చడం ఎలా అనే విషయాలను ప్రాథమికంగానే మర్చిపోయారు. ఏం చేయాలో తోచని స్థితిలో ఆ ఆడవి పుత్రులు ఆకలికి మాడి చనిపోయారు.
ఈ రోజుకీ అడవి పుత్రులను ఇలాగే ఉద్ధరిస్తున్నారని ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో లెనిన్ ధనశెట్టి గారు రాసిన అద్భుత కథనం తేటతెల్లం చేసింది. అభివృద్ధి అని మనం అనుకుంటున్న గొప్ప విషయాలు ఆ అదివాసీలను ఆకలికి మాడి చావకుండా నిరోధించలేకపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా అభివృద్ధి నమూనా ఇలాగే కొనసాగుతున్నట్లుంది.
మనం నివశిస్తున్న నేలమీద ఒకానొక మహారణ్యంలో అభివృద్ధి భావన విషప్రభావంతో అంతర్ధానమైపోయిన రెండు గ్రామాల శిథిల చరిత్రను దయనీయంగా తడిమిన ఆ రెండు కథనాల లింకులను కింద చూడండి.
కూటాలమర్రి, మల్లెమడుగులను వెతుక్కుంటూ…
http://www.andhrajyothi-sunday.com/AJweeklyshow.asp?qry=2012/feb/5/travel&more=2012/feb/5/sundaymain
http://www.andhrajyothi-sunday.com/AJweeklyshow.asp?qry=2012/feb/12/travel&more=2012/feb/12/sundaymain
ఈ రెండు కథనాలపై దేశదేశాల ఆంధ్రజ్యోతి పాఠకుల నుంచి వచ్చిన స్పందన కింది ఉత్తరాలలో చూడండి.
అద్భుతం ఆ వనవ్యాహ్యాళి
ట్రావెలోకం చదువుతున్నంత సేపూ ఉత్కంఠ, ఉద్వేగం. అనిర్వచనీయమైన అనుభూతిని పొందాను. సాహిత్యంలో ఇదో కొత్త ఒరవడి. అద్భుతమైన వర్ణనా చాతుర్యం, పదగాంభీర్యం, శైలీ విన్యాసం పాఠకుల మనసు రంజింప చేసేలా ఉంది. మంచి వనవ్యాహ్యాళికి తీసుకెళ్లారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితం గా నిరాశ్రయులైన, అవుతున్న ఒక సమూహ జీవన వాస్తవాన్ని కళ్లముందు ఆవిష్కరించారు. విధ్వంసక అభివృద్ధి వెనుక దిసమొలతో సంచరిస్తున్న (అ)నాగరికుల అసలు స్వ రూపాన్ని నిర్భయంగా చెప్పి, చెంప ఛెళ్లు మనిపించారు.
శెభాష్. ఆత్మనిందను (నాగరికతా శాపగ్రస్తులం) సైతం అలంకార పదబంధాలతో అందించారు. మట్టిమనుషులు మృత జీవులుగా మారుతున్న క్రమాన్ని, నరజాతి చరిత్ర నరహంతకుల పాలవుతున్న వైనాన్ని, అడవి బిడ్డల ఆవేదనల మూలాన్ని, అమ్మతనం కనిపించని అభివృద్ధి మోసాల్ని ఎంత స్పష్టంగా సూటిగా చెప్పారో! తిరుగు ప్రయాణంలో అలసట చెందిన మీ కళ్లు విశ్రాంతి కోరుకోవాల్సిందిపోయి, కన్నీళ్లు కార్చాయం టే మీ హృదయం ఎంతగా చలించిందో అర్థమవుతోంది.- డా.జి.వి.కృష్ణయ్య, కొత్తపట్నం
ట్రావెలోకం చదువుతున్నంతసేపూ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాము. ఈ మధ్యకాలంలో ఇంతగా మనసును హత్తుకున్న రచన మరోటి లేదు. మీతో ప్రయాణించిన స్నేహితులందరికీ శుభాకాంక్షలు. మీ స్నేహబృందంతో కలిసి ఇలాంటి ప్రయాణం చేయాలని నాకు ఉంది.-శ్రీనివాస్, మలేసియా,ప్రసాద్, శివప్రసాద్, శ్రీధర్, ఇ-మెయిల్
కూటాలమర్రి, మల్లెమడుగులను వెతుక్కుంటూ.. సాహసయాత్ర వ్యాసాలు అద్భుతం. వెలిగొండ అందాల ఆవిష్కరణ శైలి కూడా ప్రకృతి అంత స్వచ్ఛంగానే ఉంది. తెలుగు సాహిత్యలోకంలో మీలాంటి రచయిత ఉన్నందుకు గర్వంగా ఉంది. ‘అకారణంగా కన్నీళ్లు వచ్చాయి ఎందుకో?’ అనే పదాలు రాయకుండా ఉండాల్సింది.- హరిప్రసాద్, ఇ-మెయిల్
మీరెంతో ప్రేమతో, శ్రద్ధ తీసుకుని రాసినా ఈ బ్యూరోక్రాట్స్ మారతారంటారా? రెండు వ్యాసాలు చదివేసరికి నేను కూడా లోపలెక్కడో విలపించాను. బహుశా చదివిన అందరూ ఇలాగే ఫీలౌతుండచ్చు. బయటో…లోపలో…- విజయ్కుమార్ కోడూరి
లెనిన్గారి ట్రావెలాగ్ చదివాక ఇది రాయకుండా ఉండలేకపోతున్నాను. మీరు నడచిన ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ ప్రచార అధికారిగా 1983-90 మధ్య తెగ తిరిగిన రోజులన్నీ గుర్తుకు వచ్చి సంభ్రమానికి గురయ్యాను. ఆ తర్వాత బెజవాడ రేడియోలో న్యూస్ ఎడిటర్గా చేసేటప్పుడు లంక వెంకటరమణతో కలిసి ఎక్కి దిగిన కొండలు, చేసిన సాహసాలూ గుర్తొచ్చాయి. పైపెచ్చు నేను నెల్లూరు వాడిని కావడం వల్ల మీ అనుభూతి నన్ను మరింతగా కుదిపింది. మంచి వ్యాసంతో ఆపాతమధురాలను తలపు తెచ్చినందుకు ధన్యవాదాలు.- ఎమ్.వి.ఎస్.ప్రసాద్, చెన్నై.
కొసమెరుపు:
నిన్ననే మా ఊరునుంచి శివరాం ఒక కబురు మోసుకువచ్చాడు. 1970ల మొదట్లో హరిత విప్లవంలో భాగంగా మా ఊరులోకి కరెంటు, హైబ్రిడ్ సేద్యం వచ్చింది మొదలు ఇంతవరకు ఏటా రెండు పంటలకు తక్కువ కాకుండా పండుతూ కడప జిల్లా కోస్తాగా పేరొందిన మా ప్రాంతంలో -సుండుపల్లె, మడితాడు, రాయవరం- ఏట్లో కిలోమీటర్ల పొడవునా వేసిన వేలాది సాగునీటి బోర్లు ఈ నెలలో పూర్తిగా నీటిచుక్క లేకుండా పోయాయట.
మాకు తెలిసి ఈ నలభై ఏళ్లలో మొదటిసారిగా మా ప్రాంతాల్లోని ఊర్లలో మంచినీటి ట్యాంకర్లు అడుగుపెట్టి నీటిని బిందెల లెక్కన ఇస్తున్నాయట. గల్ఫ్ దేశాలనుంచి వచ్చిపడుతున్న డబ్బుతో అన్ని ఊర్లలో భూములను కొనివేసి తోటల సాగు మొదలెట్టిన మా ప్రాంత ముస్లింలు బోర్లు మొత్తంగా ఎండిపోవడంతో విలవిల్లాడిపోతున్నారట.
దీనంతటికీ కారణం వరుసగా రెండేళ్ల పాటు వర్షాలు కురవకపోవడం. ఊళ్లలో చెరువులు ఎండిపోవటం. వాన పడితే, చెరువునిండితే, ఏటిలో జల పైకి ఎగబాకితే పచ్చగా బతికిన మాప్రాంతం ఇవ్వాళ తాగేందుకు మంచి నీళ్లకు కూడా గతిలేక బయటినుంచి ట్యాంకర్లను తెప్పించుకుని బతకాల్సిన పరిస్థితి.
500 ఏళ్ల క్రితం కృష్ణదేవరాయలకున్న పాటి ముందు చూపు కూడా మన పాలకులకు లేకపోవడమే మనుషులను, ఊర్లను చంపేస్తోంది. చెరువులను చదును చేసి ప్లాట్ల బిజినెస్ మొదలెట్టేస్తున్నారు. ఊరు మనుగడకు ప్రాణాధారమైన చెరువులను మాయం చేసేస్తున్నారు. చెరువుకు, ఏటి జలకు ఉన్న పేగు బంధాన్ని తెంచేస్తున్నారు.
మా ఊరికి చాలా దగ్గరలోనే ఉన్న కూటాల మర్రి, మల్లెమడుగు ఊర్ల అంతర్ధానం గురించి బాధపడుతున్నాం కాని అడవుల్లోని గుడిసెలనే కాదు. మైదానాల్లోని ఊర్లను కూడా వల్లకాట్లోకి పంపిస్తున్న పాలకులు, పాలనలే మా ప్రాంతాన్ని కూడా కాటేస్తున్నాయి. మరొక్క సంవత్సరం ఇలాగే ప్రకృతి పెడముఖం పెట్టిందంటే మా ప్రాంతం మొత్తంగా ఖాళీ అయిపోతుంది. ఈ సారి కూడా వర్షపాతం తక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే తేల్చేసింది.
65 ఏళ్ల స్వాహాతంత్రం మా ఊరు పునాదులను కూడా పెకిలించివేస్తోంది. శతకోటిలింగాల్లో ఒక బోడిలింగంలాగా మా ఊరు కూడా అంతరించిపోనుందా..?
తల్చుకుంటేనే భయమేస్తోంది.
Filed under అభివృద్ధి : వెలుగునీడలు | Comment (0)చందమామలో ఓ చక్కటి కథ : “విమర్శ”
చందమామ కథకులు శ్రీ తిరుమలశ్రీ గారు పంపిన ఈ కథ ‘విమర్శ’ జనవరి చందమామలో ప్రచురితమైంది. మధ్యయుగాలకు సంబంధించిన ఈ రాజరికపు నేపథ్యంలోని కథలో ఆధునిక భావాలను అతి చక్కగా చొప్పించడంలో రచయిత ప్రదర్శించిన నైపుణ్యం సాటిలేనిది. పాలకుడిని సామంతుడు విమర్శించినంత మాత్రానే అతడికి వెంటనే బుద్ది చెప్పి వస్తానని ఔద్ధత్యం ప్రదర్శించిన సేనాధిపతికి రాజు ఎలా కనువిప్పు కలిగించాడో ఈ విమర్శ కథ మనోహరంగా వివరిస్తుంది.
కుటుంబ పెద్ద అభిప్రాయాలను కుటుంబ సభ్యులే ఏకగ్రీవంగా ఆమోదించలేనప్పుడు రాజు ఆదేశాలను, నిర్ణయాలను సామంతులు, పాలితులు ఏకగ్రీవంగా ఎలా ఆమోదించగలరు అనే సార్వకాలిక ఇతివృత్తంతో ఈ కథ నడిచింది.
“అనంతవర్మ సామంతుడైనంతలో మనకు బానిస అని అర్థం కాదు. మన సామ్రాజ్యమనే ఉమ్మడి కుటుంబంలో అతనూ ఒకడు. చక్రవర్తి చేసే శాసనాలను విశ్లేషించి విమర్శించే హక్కు సామంతరాజులకు ఉన్నాయి. వారు మనకు చెల్లిస్తూన్న కప్పమూ, మన సామ్రాజ్యంలో వారూ ఒక భాగమే నన్న సత్యమూ వారికి ఆ హక్కును ప్రసాదించాయి. అందుకు వారిని తప్పు పట్టడం సమంజసం కాదు”
“ఓ క్షణం అధికార మదం అనే పొరని తొలగించి శాంతంగా ఆలోచిస్తే నీకే బోధపడుతుంది. చిన్నదైన నీ స్వంత కుటుంబం లోనే ఏకాభిప్రాయం కుదరడం అరుదు. భార్యకూ భర్తకూ, కన్నవారికీ సంతానానికీ నడుమనే ఆలోచనలలో ఓ పొందికంటూ కుదరడంలేదు. అటువంటప్పుడు సామ్రాజ్య పాలనలో రాజకీయ పరమైన శాసనాల విషయంలో ఏలికల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంలో వింత ఏముంది?… మన శాసనాల పట్ల అనుమానాలు రేగాయాంటే ఆ లోపం మనదే ఔతుంది. ఆ సందేహాలను తీర్చవలసిన బాధ్యత మనపైన ఉంది
“మనకు అధికారం ఉందికదా అని…విమర్శించినవారినల్లా శిక్షించాలనుకోవడం అవివేకమే ఔతుంది. అసలు విమర్శలనేవే లేకుంటే మన చర్యల లోని లోటుపాట్లు మనకు ఎలా తెలిసి వస్తాయి? సద్విమర్శలు ఎప్పుడూ ఆరోగ్యకరమే”.
పాతకాలానికే కాదు ఏ కాలానికైనా సరే వర్తించే అక్షరలక్షల్లాంటి జీవిత పాఠాలను ఈ శక్తివంతమైన సంభాషణలు బోధిస్తున్నాయి. ఎంపిక విషయంలో ఈ కథ ఇక్కడే నిలిచి గెలిచిందంటే కూడా అతిశయోక్తి కాదు.
తిరుమలశ్రీ గారూ.. ఆధునిక భావసంస్కారాన్ని పాత రూపంలో చొప్పించి ఇంత మంచి కథను పంపినందుకు మన:పూర్వక కృతజ్ఞతలండీ..
ఈ కథ పూర్తి పాఠం ఇక్కడ చదవండి
విమర్శ
-తిరుమలశ్రీ (పి.వి.వి. సత్యనారాయణ)
జనవరి 2012 చందమామ
త్రిపర్ణ సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తి విష్ణువర్ధనుడు సహృదయుడూ, సమర్థుడూనూ.
ఒకసారి సర్వ సేనాని శూరసేనుడు చక్రవర్తి వద్దకు వచ్చి, “ప్రభూ! మన సామంత రాజ్యాలలో ఒకటైన రామపురి రాజ్యాన్ని ఏలే అనంతవర్మ ఏలినవారి శాసనాలను విమర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కప్పం కట్టడానికి కూడా సవా లక్ష ప్రశ్నలు వేస్తున్నాడట. తమ ఆజ్ఞ ఐతే తక్షణమే వెళ్ళి అతనికి బుద్ధి చెప్పి వస్తాను” అన్నాడు.
సేనాని ఫిర్యాదును శాంతంగా ఆలకించిన విష్ణువర్ధనుడు, “అనంతవర్మకు తప్పక బుద్ధి చెప్పవలసిందే. ఎలా చెప్పాలన్నది మేం ఆలోచిస్తాం,” అని అప్పటికి అతన్ని పంపేసాడు.
చక్రవర్తి ఆదేశాలకు ఎదురుచూస్తూ, రామపురి మీదకు దండెత్తేందుకు సన్నాహాలను చేసుకోసాగాడు శూరసేనుడు. అంతలో ఓ రోజున అతనికి చక్రవర్తి నుండి పిలుపు రానే వచ్చింది. ఉత్సాహంగా వెళ్ళాడు అతను.
విష్ణువర్ధనుడు, శూరసేనుడితో రామాపురం గురించి గాని, అనంతవర్మ గురించి కాని ప్రస్తావించలేదు. “శూరసేనా! ఉమ్మడి కుటుంబపు వ్యవస్థను గూర్చి అధ్యయనం చేస్తున్నాం మేము. ఆ సందర్భంలో నీ సహకారం కోరి పిలిపించాము” అన్నాడు.
సామాజిక దృక్పథం కలిగిన చక్రవర్తి తరచు అటువంటి విషయాలపై అధ్యయనం చేస్తూండడం కద్దు. అందుకే, “అవశ్యం సెలవీయండి, ప్రభూ!” అన్నాడు శూరసేనుడు.
”ఆ అధ్యయనంలో ఓ భాగమైన ‘కుటుంబంలో సామరస్యతను’ గూర్చి పరిశీలించేందుకని వివిధ తరగతులకు చెందిన కొన్ని కుటుంబాలను నమూనాలుగా తీసుకున్నాం మేము. వాటిలో నీదొకటి,” చెప్పాడు విష్ణువర్ధనుడు. “నువ్విప్పుడు చేయవలసిందల్లా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించి…గత మూడు మాసాలలోనూ నీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి నువ్వు తీసుకున్న నిర్ణయాలూ, వాటిని నీ కుటుంబ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భాలూ వగైరా వివరాలన్నీ రాసుకుని వచ్చి మాకు చూపించాలి నువ్వు”.
’ఓస్, అదెంత భాగ్యం!’ అనుకున్న శూరసేనుడు చక్రవర్తి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
మర్నాడు తల వ్రేలాడేసుకుని వచ్చిన సేనానిని చూసి విస్తుపోయాడు విష్ణువర్ధనుడు.
“మహాప్రభూ! తరచి చూస్తే గత మూడు మాసాలలోనూ నేను చేసిన ప్రతిపాదనలతో, నిర్ణయాలతో నా భార్య కాని, నా ఇద్దరు కుమారులు గాని ఏకగ్రీవంగా అంగీకరించిన సందర్భాలు ఒకటీ అరా తప్పితే ఏవీ లేవు,” అని విన్నవించుకున్నాడు శూరసేనుడు.
విష్ణువర్ధనుడు విస్తుపోతూ, “ఆశ్చర్యంగా ఉన్నదే! మరి కుటుంబ పెద్దగా నువ్వేం చేసావ్? వారిని దండించి నీ దారికి త్రిప్పుకున్నావా లేదా?” అనడిగాడు.
అందుకు శూరసేనుడు నవ్వి, “ఓ పక్క నేను తాళి కట్టిన భార్య, మరో పక్క పిల్లలు పసివాళ్ళూ, అనుభవశూన్యులూను. నా నిర్ణయాల లోని లోతుపాతులు వారికి ఎలా అర్థమౌతాయి? అందుకే వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. అలా కొన్ని సందర్భాలలో వారి ఆలోచనా సరళిని మార్చగలిగాను. కొన్ని సందర్భాలలో వారి ఆలోచనలకు అనుగుణంగా నా నిర్ణయాలను మార్చుకున్నాను,” అని జవాబిచ్చాడు.
అప్పుడు విష్ణువర్ధనుడు మందహాసం చేసి, “రామపురాధీశుడు అనంతవర్మ విషయంలో నువ్వు చేసిన ఫిర్యాదుకు సమాధానం కూడా ఇదే, శూరసేనా! అనంతవర్మ సామంతుడైనంతలో మనకు బానిస అని అర్థం కాదు. మన సామ్రాజ్యమనే ఉమ్మడి కుటుంబంలో అతనూ ఒకడు. చక్రవర్తి చేసే శాసనాలను విశ్లేషించి విమర్శించే హక్కు సామంతరాజులకు ఉన్నాయి. వారు మనకు చెల్లిస్తూన్న కప్పమూ, మన సామ్రాజ్యంలో వారూ ఒక భాగమే నన్న సత్యమూ వారికి ఆ హక్కును ప్రసాదించాయి. అందుకు వారిని తప్పు పట్టడం సమంజసం కాదు” అన్నాడు శాంతంగా.
“ప్రభూ!” అన్నాడు శూరసేనుడు తెల్లబోయి.
“శూరసేనా! ఓ క్షణం అధికార మదం అనే పొరని తొలగించి శాంతంగా ఆలోచిస్తే నీకే బోధపడుతుంది. చిన్నదైన నీ స్వంత కుటుంబం లోనే ఏకాభిప్రాయం కుదరడం అరుదు. భార్యకూ భర్తకూ, కన్నవారికీ సంతానానికీ నడుమనే ఆలోచనలలో ఓ పొందికంటూ కుదరడంలేదు. అటువంటప్పుడు సామ్రాజ్య పాలనలో రాజకీయ పరమైన శాసనాల విషయంలో ఏలికల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంలో వింత ఏముంది?… మన శాసనాల పట్ల అనుమానాలు రేగాయాంటే ఆ లోపం మనదే ఔతుంది. ఆ సందేహాలను తీర్చవలసిన బాధ్యత మనపైన ఉంది”.
ఓ క్షణం ఆగి సాభిప్రాయంగా సేనాని వంక చూసాడు విష్ణువర్ధనుడు. “మనకు అధికారం ఉందికదా అని…విమర్శించినవారినల్లా శిక్షించాలనుకోవడం అవివేకమే ఔతుంది. అసలు విమర్శలనేవే లేకుంటే మన చర్యల లోని లోటుపాట్లు మనకు ఎలా తెలిసి వస్తాయి? సద్విమర్శలు ఎప్పుడూ ఆరోగ్యకరమే”.
చక్రవర్తి నిశిత దృష్టికి, విశాల దృక్పథానికీ జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయాడు శూరసేనుడు. “నా అజ్ఞానానికి మన్నించండి, మహాప్రభూ! స్వయంగా రామపురికి వెళ్ళి అనంతవర్మను కలుసుకుంటాను. అతని అనుమానాలనూ, శంకలనూ నివృత్తి చేసి పని సాధించుకుని వస్తాను,” అని చక్రవర్తి వద్ద అనుమతి తీసుకుని నిష్క్రమించాడు.














