సంస్కృతి నుంచి వైమానిక శాస్త్రం దాకా…
‘భారతీయ సంస్కృతి – ఆధునిక విజ్ఞానం’ అనే పేరిట మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ శ్రీ శ్రీనివాస చక్రవర్తిగారు ఇటీవల తమ శాస్త్ర విజ్ఞానము బ్లాగులో ఒక కథనం ప్రచురించారు.
“ఆధునిక విజ్ఞానం గురించి విస్తారంగా చెప్పుకోవడం ఒక విధంగా ప్రాచీన భారత విజ్ఞానాన్ని, అసలు మొత్తం భారతీయ సంస్కృతినే కించపరిచినట్టుగానిర్లక్ష్యం చేసినట్టుగా కొంత మంది భావిస్తూ ఉంటారు. ఆ ధోరణిలో ఎన్నో కామెంట్లు కూడా గతంలో చూశాం. ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు స్పష్టీకరించదలచుకున్నాను.
ఆధునిక విజ్ఞానం “పాశ్చాత్య” విజ్ఞానం కాదు. విశ్వజనీన విజ్ఞానం. దాని ఆరంభంలో కొన్ని శతాబ్దాల క్రితం పాశ్చాత్యులు ప్రముఖ పాత్ర పోషించి ఉండొచ్చును గాక. గత శతాబ్దాలలో కూడా వారే ఎంతో కృషి చేసి ఉండొచ్చును గాక. కాని ఈ ఇరవయ్యొకటవ శతాబ్దంలో వైజ్ఞానిక ఆవిష్కరణ ఒక అంతర్జాతీయ ప్రయాస అయిపోయింది. తూర్పుకి, పడమరకి చెందిన ఎన్నో దేశాల వారు కలగలిసి విజ్ఞానపు సరిహద్దులను ముందుకు తోస్తున్నారు. కనుక అది పాశ్చాత్య విషయం అనడం అసమంజసం.
ఇది ఇలా ఉండగా అసలు ఆధునిక విజ్ఞానం లోని తత్వం వ్యక్తులకి, జాతులకి, దేశాలకి, సంస్కృతులకి అతీతమైన తత్వం. ఏ దేశం చెప్పినా, ఏ సంస్కృతి నమ్మినా చివరి మాట ప్రకృతిదే, యదార్థానిదే. “మా సంస్కృతి చెప్పింది కనుక ఇది గొప్పది” అనడం వైజ్ఞానిక తత్వానికి పూర్తి వ్యతిరేకం. ఆ చెప్పిన విషయాన్ని యదార్థం సమర్ధిస్తోందా లేదా అన్నదాన్ని మళ్ళీ మళ్లీ పరీక్షించి తేల్చుకున్న తరువాతే దాని గొప్పదనాన్ని ఒప్పుకోవడం జరుగుతుంది.”
చర్చ కాస్త వివాదాస్పదమయినప్పటికీ, ప్రాచీన విజ్ఞానంపై నుంచి 2,400 సంవత్సరాల క్రితం భరద్వాజ మహర్షి రచించిన “వైమానిక శాస్త్రం” వరకు చర్చ కొనసాగింది. భారతీయ వైమానిక శాస్త్రంపై కాస్త అవగాహన కలిగించేందుకు తదుపరి అధ్యయనానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ వ్యాసం లింకును ఇక్కడ ఇవ్వడమైనది.
2,500 సంవత్సరాల క్రితం లేదా అంతకు మునుపు మానవ ఆలోచనల్లో మెదిలిన ‘ఎగరగలగడం’ అనే భావన ఇమేజినేషన్ నుంచి బయటపడి వాస్తవరూపం దాల్చిన అమోఘ చరిత్రకు సంబంధించిన సమాచార లింకులు కూడా ఈ వ్యాసం కింది వ్యాఖ్యలలో పొందుపర్చబడినవి.
భారతీయ సంస్కృతి – ఆధునిక విజ్ఞానం
http://scienceintelugu.blogspot.com/2011/12/blog-post_04.html
భరద్వాజ మహర్షి 2,400 సంవత్సరాల క్రితం రచించిన వైమానిక శాస్త్రం ఆంగ్ల ప్రతి ఆన్లైన్లో దొరుకుతోంది.
కింది లింకును చూడండి
http://www.bibliotecapleyades.net/vimanas/vs/default.htm
Filed under భారతీయ సంస్కతి | Comment (0)
మా తెలుగు మాస్టారూ…మా తెలుగు పద్యమూ…
మా తెలుగు మాష్టారూ… మా తెలుగు పద్యమూ… అనే ఈ టపా నేను కొత్తగా రాసి ప్రచురిస్తున్నది కాదు. నేను గతంలో వెబ్దునియా.కామ్లో పనిచేసినప్పుడు నాలుగేళ్ల క్రితం ఆ సంస్థ బ్లాగులో తొలిసారిగా ఈ టపాను ప్రచురించాను. తర్వాత చందమామలు బ్లాగులో రెండేళ్ల క్రితం ప్రచురించినప్పుడు ఈ టపాకు విశేష స్పందనలు లభించాయి. 20 ఏళ్లు, 30 ఏళ్ళకు ముందు తెలుగు టీచర్లతో, తెలుగు పద్యాలు, పాటలతో అపురూపబంధాన్ని మనసులో నిలుపుకున్న పెద్దా, చిన్నా బ్లాగర్లు చాలా మంది ఈ టపాలో తమ జ్ఞాపకాలను కూడా పంచుకుని ఈ టపాకు అరుదైన విలువను ఆపాదించారు.
తెలుగు సమాజంలో కొన్ని తరాల పిల్లలకు తెలుగు భాష పట్ల మమకారం, తెలుగు పద్యం పట్ల అనురక్తి ఏర్పర్చి తెలుగు తియ్యదనాన్ని మనస్సులలో నింపిన అపూర్వ గౌరవం తెలుగు ఉపాధ్యాయులకే దక్కుతుంది. ఇప్పుడంటే టింకిలు, టింకులు లిటిల్ స్టార్లు వచ్చేసి తెలుగు పద్య గానామృతం అందరి మనస్సులలోంచి తప్పుకుంటోంది గాని మారోజుల్లో తెలుగు పద్యం, తెలుగు పాట లేని బాల్యం ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు.
పద్యం సంగతి ‘దేవుడె’రుగు… పాట సంగతి సరే… కళ్లు తెరిచి టీవీయో… సినిమానో చూస్తే తాడేపల్లిగారు ఈమధ్యే ‘దూకుడు’ సినిమాను వారి అబ్బాయికోసం చూడవలసివచ్చిన సందర్భంగా అన్నట్లు, భయంకర శబ్దాలు తెలుగు పాటల రూపంలో మన కర్ణ భేరులను బద్దలు గొడుతుంటాయి. కాని.. తెలుగు పద్యం… తెలుగు పాట మా బాల్యాన్ని మెత్తగా తడిపిన రెండు అద్భుత ప్రపంచాలు.
ఎప్పుడో ప్రచురించిన ఈ టపాను మళ్లీ ఇప్పుడు ప్రచురిస్తున్నందుకు చిన్న కారణం ఉంది. ఎలిమెంటరీ, హైస్కూల్ జీవితంలో నా సహచర విద్యార్థి, మిత్రుడు శ్యామ్ సుందర్ రాజు అమెరికా నుంచి ఈ సాయంత్రమే తొలిసారిగా నాకు ఈమెయిల్ పంపి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. 1995లో తనను కలకడలో కలిశాను. మళ్లీ ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఊరిలో కలుసుకున్నాము. సంవత్సరం తర్వాత ఇప్పుడు మళ్లీ తననుంచి మెయిల్ వచ్చింది.
వ్యవసాయ సమాజంలో నాలుగైదు దశాబ్దాల క్రితం పుట్టి పెరిగిన మాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అనేవి పూర్తిగా విదేశీయమైనవిగానే ఉండేవి. ఇక నూతన సంవత్సరం అంటే కూడా స్కూలుకు సెలవు అనే అర్థంలోనే ఉండేది కాని అంతకు మించిన ప్రాధాన్యతను మేము చూసి ఎరగం. కాని నగరాల బాట పట్టి, ఆధునిక విద్య, అవకాశాల రూపంలో కాస్త నగర సంస్కృతి అబ్బిన కారణంగా ఒకప్పుడు లేని శుభాకాంక్షల పిలుపులను ఏదో ఒక విధంగా అలవర్చుకోవడం తప్పనిసరవుతోంది. మనం పాటించక పోయినా ఇతరుల కోసం కొన్ని కొంతవరకైనా పాటించాలి కదా…
అలా శ్యామ్ నాకు నూతన సంవత్సర ముందస్తు మెయిల్ ఇచ్చాక తనకు తిరిగి ఏం చెప్పాలి అని తలచినప్పుడు మా బాల్యానికి, మా విద్యా జీవితానికి, అలనాటి తీపి స్మృతులకు గుర్తుగా నా ఈ తెలుగు మాష్టారుపై టపాను తనకు గుర్తుగా ఇస్తే బాగుంటుందని అనిపించింది. జీవితంలో చాలా కష్టపడి, ఉద్యోగం చేస్తూ, ఉన్నత చదువు చదివి ఎదిగిన వాడు శ్యామ్.
తనకు ఒకనాటి మధుర జ్ఞాపకాలను తిరిగి పంచి పెట్టడం కంటే మించిన బహుమతి ఏముంటుందని ఈ టపాను మళ్లీ ఇక్కడ ప్రచురిస్తున్నాను. నా చందమామలు, నెలవంక బ్లాగుల లింకులు తనకు పంపాను. ’చందమామ’ కథలతో పండించుకున్న మా బాల్యాన్ని గుర్తు చేస్తూ ఆన్లైన్లో లభ్యమవుతున్న 60 ఏళ్ల చందమామల లింకును కూడా తనకు పంపాను.
మా వ్యక్తిగత మితృత్వానికి గుర్తుగా పంచుకుంటున్న ఈ టపాను కొత్తగా బ్లాగ్లోకంలో చేరిన వారికి కూడా అందిస్తే బాగుంటుందనిపించి మళ్లీ ప్రచురిస్తున్నాను. సంవత్సరం ముగిసి, ప్రారంభమవుతున్న ఘడియలో, తెలుగును ప్రేమించడం మాకు నేర్పిన తెలుగు మాస్టారు కంటే గుర్తు పెట్టుకోవలసిన వారు ఎవరుంటారు?
ఈ టపా మీకు కూడా మీ తెలుగు టీచర్ని ఒకసారి గుర్తు చేస్తుందని ఆశిస్తూ…
శ్యామ్!
ఇంతకు మించిన నూతన సంవత్సర బహుమతిని నేనివ్వలేను..
రాజు.
తెలుగు మాష్టారు, తెలుగు పద్యంపై పూర్తి టపాను, గతంలో దీనిపై వచ్చిన కామెంట్లను ఇక్కడ చూడండి.
మా తెలుగు మాస్టారూ…మా తెలుగు పద్యమూ…
పల్లెటూరి బడిలో 8వ తరగతి చదువుతున్న రోజులు….7వ తరగతి నుంచి అప్పుడే పెద్దక్లాసుకు ఎగబాకివచ్చిన రోజులు.. (1974) మా క్లాసుకు రెండు సెక్షన్లు. 8 ఎ, 8 బి. మా బి సెక్షన్కి తెలుగు టీచర్గా సహదేవరెడ్డి సార్ వచ్చేవారు. పురాణాలు, ప్రబంధాలు, చక్కటి పద్యపఠనాలతో క్లాసును ఉర్రూతలూగించేవారు..
ఇంగ్లీష్, సైన్స్, లెక్కలు సబ్జెక్ట్లతో పరమ విసుగ్గా ఉండే మాకు తెలుగు క్లాస్ అంటే చాలు చెవులు నిక్కబొడుచుకుని ఆయన రాక కోసం ఎదురు చూసేవాళ్లం. మామూలుగానే తెలుగు క్లాసు అంటే పిల్లల తూగును, నిద్రమత్తును వదిలించేదని అప్పట్లో గుర్తింపు పొందింది. అందుకే లెక్కలు, సైన్స్ మధ్యలో లేదా సైన్స్, ఇంగ్లీష్ మధ్యలో తెలుగు క్లాసును ఇరికించేవారు. ఇది తెలుగు టీచర్లను కాస్త మండించేదనుకోండి.
మా సహదేవరెడ్డి సార్ తెలుగు ప్రాచీన సాహిత్యం పట్ల మాలో ఎంత గాఢానురక్తిని క్లాసులో పెంచి పోషించేవారంటే ఏ ఒక్కరం కూడా తెలుగు క్లాస్ను తప్పించుకునే వాళ్లం కాదు. స్వతహాగా గత జీవితంలో హరికథాగానం చేసి బతికిన ఆయన రాగయుక్తంగా ప్రబంధపద్యాలు పాడి వినిపిస్తుంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్లం.
పద్యాన్ని మొదటిసారి రాగయుక్తంగా, రెండోసారి మామూలుగా చదివి వినిపించే ఆయన నేర్పుకు మేం దాసోహమయ్యేవాళ్లం. పద్యాన్ని రాగయుక్తంగా పాడకుండా చదివి వినిపించాలన్న నిబంధన ఇంటర్, డిగ్రీ, పిజి తరగతులలో అప్పటికే అమలవుతున్నందువల్ల మేం పై చదువులకు వెళ్లే కొద్దీ తెలుగు పద్య గాన మహిమా శ్రవణానుభవం మాకు కొరవడిందనుకోండి.
ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా
షాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ
క్షాపరతంత్రు డంబురుహగర్భ కులాభరణం బనారతా
ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూవిలాసుడై
అటజని గాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్జరీ
పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన
స్పుట నటనానురూప పరిపుల్ల కలాపి జాలమున్ గ్ర
కట శరత్కరేణు కర కంపిత జాలము శీత సాలమున్
అంటూ సంస్కృత సమాస పద భూయిష్టమైన మనుచరిత్రలోని ప్రవరుడి ఘట్టాలను పాడి వినిపిస్తుంటే, మాకు ఒక్క పదం అర్థం కాకపోయినా ఒళ్లు పులకరించిపోయేది. రేడియోలో ఘంటసాల, సుశీల, లీల, జిక్కి పాటల, పద్యాల పారవశ్యం ఒక వైపు, ఇల్లు వదిలాక స్కూల్లో తెలుగు పద్య శ్రవణానందం మరోవైపు… మా బాల్యం ఎంత హాయిగా గడిచిపోయిందో…
వ్యావసాయిక జీవన సంస్కృతిలో పెరిగిన మా కష్టాలను తాత్కాలికంగా మర్చిపోయేలా చేసిన ఈ పాటలు, పద్యాలు ఒక రకంగా చెప్పాలంటే పారే యేటినీటిలో స్నానంలాగా, మా తరాన్ని సేదతీర్చేవి,
తెలుగు పాట… తెలుగు పద్యం… ఈ రెండింటికి నోచుకున్న పచ్చకాలం మాది. ఇవి లేని పల్లె జీవితాన్ని ఊహించుకోలేం.
ఇప్పటికీ ఘంటసాల పద్యాలు రేడియోలోనో, టీవీలోనో, సినిమాల్లోనో, లేక ఇంట్లో మా సిస్టమ్లోనో వింటూ ఉంటే ప్రపంచాన్ని అలాగే మర్చిపోవాలన్నంత మైమరపు… తదనంతర జీవితంలో ఎన్ని డక్కీమొక్కీలు తిన్నా, సొంతఊరు వదిలి చదువు కోసం, ఆశయం కోసం, జీవిక కోసం ఎన్నెన్ని ప్రాంతాలు తిరిగినా ఆ తెలుగు పద్య గాన శ్రవణా సౌరభం నానుంచి దూరం కాలేదు.
“కనియెన్ రుక్మిణి, చంద్రమండల ముఖున్, కంఠీరవేంద్రావలగ్ను…” అంటూ శ్రీకృష్ణపాండవీయం సినిమాలో తొలిసారి శ్రీకృష్ణుడిని రుక్మిణి సందర్శించిన తీరును ఘంటసాల పాడగా వింటూంటే… ప్రాణం అలాగే వదిలేసినా చాలు అనిపించేంత ఆత్మానందం కలిగేది. సంగీతం, మృదంగ ధ్వని, లయ, గానం కలగలసిన ఆ మహిమాన్విత అనుభూతిని ఈ నాటికీ మర్చిపోలేను.
ఇలాంటి ఎన్ని పద్యాలు ఎన్ని పర్యాయాలు భట్టీ కొట్టి మరీ మా బాల్యంలో మేం నడుస్తున్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు, కొండలు గుట్టలు ఎక్కుతున్నప్పుడు మేం పాడుకునేవారిమో… దీనికంతటికీ మా తెలుగు టీచర్ పెట్టిన పద్య బిక్షే మూలం.
తెలుగు పద్యాన్ని తలుచుకున్నప్పుడల్లా ఘంటసాల గారి గానం ఒకవైపు, మా తెలుగు టీచర్ గారి గంభీర స్వరం ఒకవైపు ఈ నాటికీ నేను కలలో కూడా మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు. తెలుగు పద్యగానామృతాన్ని మాకు పంచిపెట్టడంతో పాటు ఎన్ని వెలలేని జీవిత సత్యాలను ఆయన ఆ మూడేళ్ల మా స్కూలు జీవితంలో మాకు నూరిపోశారో….
(కానీ ఆయనలో ఒకే ఒక్క అంశం నాకు నచ్చలేదు. కవిత్వం అంటే ప్రబంధ సాహిత్యమేనని ఢంకా భజాయించే ఆయన వచన కవిత్వం అన్నా, ముఖ్యంగా శ్రీశ్రీ కవిత్వం అన్నా ఒళ్లు మంట ఆయనకు. ఎందుకంటే చందస్సుల సర్ప పరిష్వంగాన్ని చీల్చి చండాడుతానని శ్రీశ్రీ మహాప్రస్థానంలో కవితా ఓ కవితాలో తేల్చి చెప్పాడు మరి. పద్యమన్నా, చందస్సు అంటే పడి చచ్చే ఆయనకు వాటిపై శ్రీశ్రీ కొట్టిన దెబ్బ మండించిందనుకుంటాను.పద్యం పట్ల ఆయన అభిమానం శ్రీశ్రీ కవిత్వాన్నే తోసి పారవేసింది -నెగేట్-. క్లాసులో ఆయన శ్రీశ్రీని తిడుతుంటే మేం నవ్వుకునే వాళ్లం. ఎందుకంటే అప్పటికే అంత నిశితంగా కాకపోయినా పత్రికలలో, రేడియో ప్రసంగాలలో శ్రీశ్రీ గురించి అంత చిన్న వయసులోనే ఎంతో కొంత తెలుసుకుని ఉన్నాం. ఆ తర్వాత ఇంటర్ దాటి డిగ్రీ, తర్వాత యూనివర్సిటీ చదువులకు వచ్చాక, ప్రగతిశీల సాహిత్యం అందుబాటులోకి వచ్చాక జీవిత దృక్పథమే మారిపోయిందనుకోండి.)
ఈ రోజు ఆయన ఉన్నారో లేరో.. కానీ, కడప జిల్లా సుండుపల్లి మండలంలోని మా గుట్టకిందరాచపల్లె (జి.కె.రాచపల్లి) హైస్కూలు, 8, 9, 10 తరగతుల్లో మేం కూర్చున్న ఆ తెలుగు తరగతి గదులు, ఆ గదుల్లో కుర్చీలో మూర్తీభవించిన గానగంధర్వుడిలా మా సహదేవరెడ్డి సార్… ఇంకా ఇప్పటికీ గొంతెత్తి పాడుతున్నట్లు, జీవితంలో మేం కోల్పోతూ వస్తున్న ఎన్నెన్నో మధురానుభవాలను తట్టి లేపుతున్నట్లు…. పద్యం అనే తెలుగు జాతి సంపద సాక్షిగా మమ్మల్ని మనసారా ఆశీర్వదిస్తున్నట్లు…
మర్చిపోలేను… తెలుగు పద్యం అంటే రాజులు, రాణుల అంగాగ వర్ణనలకు ప్రాధాన్యమిచ్చిన ఫ్యూడల్ సాహిత్య ప్రతీక అంటూ గడచిన శతాబ్ద కాలంగా తెలుగు సాహితీలోకంలో ఎన్ని వాదోపవాదాలు పదే పదే కొనసాగుతూ వస్తున్నప్పటికీ… మర్చిపోలేను… పద్యరూపంలోని ఆ లయాన్విత సంగీత ఝరిని… ఆ విశ్వవీణానాదాన్ని…. పద్యగానంతో మా బాల్యజీవితాన్ని వెలిగించిన, మా సహదేవరెడ్డి మాస్టారు చిరస్మృతులను మర్చిపోలేను.
రాజు
blaagu.comchandamamalu
January 3rd, 2010 న చందమామ బ్లాగులో ప్రచురించబడింది.
Edit Comments (18)
18 Responses to “మా తెలుగు మాస్టారూ…మా తెలుగు పద్యమూ…”
1. Bhaskara Rami Reddy on January 3, 2010 553 PM Edit This
80 వ దశకంలో నా హైస్కూల్ చదువు సాగుతున్నప్పుడు కూడా ఇలాంటి తెలుగు టీచర్లను చూసాను రాజు గారు. సుబ్బారెడ్డి అని టీచరు వుండేవారు. ఒక్కొక్కసారి చెట్టుకింద కూర్చోపెట్టి తెలుగు పాఠం చెప్తుంటే, ఆ రాగయుక్త గానానికి మిగిలిన క్లాసుల విద్యార్థులందరూ నిశ్శబ్దం గా ఓచెవు ఇటు పడేసేవారు.
2. kalpana on January 3, 2010 838 PM Edit This
రాజు గారు,మీరెంత అదృష్టవంతులు.“ రాగయుక్తంగా ప్రబంధపద్యాలు పాడి వినిపిస్తుంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్లం.”ఇంత మంచి తెలుగు మాస్టర్ దొరికినందుకు. ఇప్పటి తెలుగు పంతుళ్ళ గురించి, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెస్సర్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.అబ్బా మళ్ళీ ఏమీ పద్యాలు గుర్తు చేశారండీ.. అటజని గాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్జరీ… చదువుకున్నా కూడా మళ్ళీ వొళ్ళు పులకరిస్తుంది.
“ తెలుగు పద్యం అంటే రాజులు, రాణుల అంగాగ వర్ణనలకు ప్రాధాన్యమిచ్చిన ఫ్యూడల్ సాహిత్య ప్రతీక అంటూ గడచిన శతాబ్ద కాలంగా తెలుగు సాహితీలోకంలో ఎన్ని వాదోపవాదాలు పదే పదే కొనసాగుతూ వస్తున్నప్పటికీ… “భలే వారే. అవన్నీ పట్టించుకోకుండా హాయిగా తెలుగు పద్యాన్ని, తెలుగు పాట ని ఆనందించండి.మీతో పాటు మమ్మల్ని కూడా ఇవాళ ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. అందుకు మీకు కృతజ్ఞతలు.
3. రవి on January 3, 2010 1117 PM Edit This
భలే ఉన్నాయి మీ జ్ఞాపకాలు. అదృష్టవంతులు. నేను చదువుకునేప్పుడు, నాకూ ఓ తెలుగు పంతులమ్మ ఉండేది. ఇప్పుడు ఏ లేశమాత్రం తెలుగు మీద అభిమానం ఉన్నా, ఆ తల్లి అప్పుడు నాకు పెట్టిన భిక్షే.అన్నట్టు ఆరవ తరగతి నుంచీ, పదవతరగతి వరకు, అన్ని పరీక్షలలోనూ (చివరికి యూనిట్ టెస్ట్తో సహా) నాకే ఎక్కువ మార్కులు. అది అప్పట్లో నాకో ప్రిస్టేజి ఇష్యూ గా భావించేవాణ్ణి.
4. వేణు on January 3, 2010 1126 PM Edit This
రాజు గారూ, మీ తెలుగు మాస్టారి ‘పద్యగాన శ్రవణ సౌరభాన్ని’గురించి ఎంత బాగా గుర్తు చేసుకున్నారండీ ! మీ ‘మహిమాన్విత అనుభూతి’, స్మృతులూ ‘చందమామ’ కథలంత మనోహరంగా అనిపిస్తున్నాయి. అన్నట్టు- మీ చిన్నప్పటి ఫొటో భలేవుంది!
5. రాజు on January 3, 2010 1157 PM Edit This
భాస్కర రామిరెడ్డి గారు,మీరు కూడా ఆ స్వర్ణయుగంలోనే చదివారన్నమాట. మీ అనుభవం మాకు కూడా ఉంది. ఆ మూడేళ్ల కాలంలో సహదేవరెడ్డి సార్ ఏ క్లాసులో, ఏ తరగతి వారికి పాఠం చెబుతున్నాసరే పక్క తరగతుల్లోనే ఉన్న మేం ఆయన పాడుతున్న పద్యం వినడానికి చెవులు రిక్కించి కూర్చునే వారం.
మా క్లాసులో ఇతర సబ్జెక్టుల టీచర్లు పాఠం చెబుతుంటే వారి పాఠాన్ని వింటున్నట్లుగా ఎంత చక్కగా నటించేవారమో. కానీ మా కళ్లు మాత్రమే క్లాసులో టీచర్ వైపు ఉండేవి తప్పితే చెవులు మాత్రం గాల్లో మంద్రమంద్రంగా తేలియాడుతూ వచ్చే ఆ పద్య శ్రవణంకోసం పడి చచ్చేవనుకోండి. ఓ రకంగా చూస్తే దీన్ని పల్లెపట్టు స్కూళ్లలో లెక్కలు, సైన్స్, ఇంగ్లీషు, సాంఘికశాస్త్రం ఇలా సకల శాస్త్రాలమీద తెలుగు పద్యం సాధించిన విజయంగా చెప్పవచ్చు.మీ అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
కల్పన గారూ,మీకూ తెలుగు పద్యం మీద మమకారం ఉంటుందని ఊహించలేదు. ఇప్పుడు పాఠశాలల్లో కూడా తెలుగు పద్యాన్ని పాడటం నిషేధించారేమో నాకు తెలియదు. పద్యాన్ని పాడటం కాకుండా చదవాలని ఎప్పుడైతే తీర్మానం చేశారో అప్పుడే తెలుగు క్లాసుపై అభిరుచి, ఆసక్తి పిల్లల్లో నశించడం మొదలైందనుకుంటాను.
నేను తిరుపతిలో 20 ఏళ్లక్రితం ఓ రెసిడెన్షియల్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేసినప్పుడు క్లాసు రూములో ప్రతి రోజూ పాఠం మొదలు పెట్టేముందు ఓ తెలుగు పద్యమో, లేదా వచన కవిత్వమో, గేయమో తప్పకుండా చదివి.. కాదు కాదు.. పాడి వినిపించి మరీ పాఠం మొదలు పెట్టేవాడిని. నిద్రపోయే ఆ కొద్దిగంటలు తప్ప తక్కిన విద్యాజీవితమంతా భట్టీ చదువుల భారం మోస్తూ ఉంటున్న ఆ పిల్లలు మొదట్లో ఆ అయిదు నిమిషాలు నేను చెప్పే ఆ పద్యం, గేయం, పాట కోసం సమస్త దేహాన్ని చెవులుగా చేసుకుని రిక్కించి మరీ వినేవారు.
రోజులు జరగగా జరగగా తెలుగు గద్యభాగంలోని పాఠాలను వాటిలో ఉత్కంఠ భరితంగా సాగే పద, వాక్యబంధాలను కూడా ఉద్వేగంగా చదివి వినిపించడం మొదలెట్టాను. పిల్లలు దానికీ పడిపోయారు. అప్పుడు తెలిసింది నాకు మన తరం పిల్లలు ఏం కోల్పోతున్నారో, ఏం కోరుకుంటున్నారో..
మీరన్నట్లు తెలుగు పద్యసాహిత్యంలోని ఆణిముత్యాల్లో మేలిముత్యం అటజని కాంచి.. పద్యం. ఆ అభంగ, తరంగ, మృదంగ అంటూ సాగే ఆ పద్యభాగం నిజంగా మా అందరి హృదయాల్లో మృదంగాన్ని మోగించేది. సంగీత సాహిత్యాల మేలు కలయికకు నిరసనగా నిలిచిన అరుదైన పద్యాల్లో ఇదీ ఒకటి. ఇక వసుచరిత్రలోని పద్యాలు చెప్పవలసిన పనిలేదు. అందులోని ప్రతిపద్యమూ సంగీతభరితమే.
చెన్నయ్లో ప్రస్తుతం పచ్చయప్పాస్ కాలేజీలో 33వ బుక్ ఫెయిర్ జరుగుతోంది. ఎమెస్కో వారు ప్రచురించిన అన్ని ప్రబంధాలను మళ్లీ ఓసారి కొనుక్కోవాలనిపిస్తోంది.
పద్యం పట్ల మీ అనురక్తికి మనఃపూర్వక అభినందనలు
6. రాజు on January 4, 2010 1214 AM Edit This
రవిగారూ,“ఆతల్లి అప్పుడు నాకు పెట్టిన భిక్షే..” మీ పంతులమ్మ పట్ల మీరు ప్రకటించిన భావం కృతజ్ఞతకు నిలువెత్తు నిదర్శనంగా నిలబడుతోంది. మార్కుల విషయంలో మీ అనుభవమే నాది కూడా. 500 మంది పిల్లలు చదివే మాస్కూల్లో తెలుగులో తొలి మార్కులు నాకు, మా ఊరివాడైన శ్యామసుందర్కి మాత్రమే వచ్చేవి. పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో కూడా తనకు తెలుగులో నూటికి 79 మార్కులయితే నాకు 78 మార్కులు.
‘ఆ ఒక్క మార్కుకు కాస్త ముక్కిఉంటే ఏం పోయేదిరా నీకు’ అంటూ సహదేవరెడ్డి సార్ నన్ను అభిమానంగానే మందలించారనుకోండి. ఎందుకంటే నేను ఆయన స్టూడెంట్ని కాగా మా శ్యామ్ మరో తెలుగు టీచర్ స్టూడెంట్. చేతివ్రాత బాగా లేనందున నాది ఇక్కడ వెనుకపట్టే అయ్యేది. నిజంగా అదో బంగారు కాలం. మళ్లీ రాదు కూడా.. నిజంగా తెలుగును ఓ ప్రిస్టేజి ఇష్యూగానే భావించి పోటీ పడేవాళ్లం.
వేణుగారూ,“మహిమాన్విత అనుభూతి, పద్యగాన శ్రవణ సౌరభం..” ఈ పదాలే ఏదో మ(హ)త్తును కలిగిస్తున్నాయి. మా చందమామ బాల్యంలో పద్యాలు, పాటలు కూడా భాగమే మరి. బాల్య జీవితంలో మాకు ఏవి లేకున్నా సరే మాకు చందమామ పత్రిక ఉండేది. తర్వాత ఇంట్లో రేడియో ఉండేది.
కడప రేడియో స్టేషన్ నుంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మలయమారుతంలా సాగివచ్చే పద్యాలు, పాటలు ఉండేవి. జీవితం ధన్యం కావడానికి ఇంకేం కావాలి నిజంగానే ఏవాదాలు, దృక్పధాలు, సిద్ధాంతాలు, ఉద్యమాలు లేని బాల్యం మాది. అప్పట్లో మమ్మల్ని ఆప్యాయంగా, ఆర్తిగా పలకరించినవి చందమామ, రేడియో పాటలు, పద్యాలు మాత్రమే.ఎలా మరువగలం…!ధన్యవాదాలు
7. రవి on January 4, 2010 126 AM Edit This
రాజు గారు, మీది 70 వ దశకం అయితే, నాది 80 వ దశకం ద్వితీయ అర్ధం. మీ కాలంలో 78 మార్కులంటే ఊహించగలను. నా వరకూ వచ్చేసరికి 89 అయాయి. ఇప్పుడు తొంభై తొమ్ముదులు, నూర్లు సర్వసాధారణమయాయి అనుకుంటాను. అవన్నీ పక్కన పెడితే, తెలుగు మీద అభిమానం మాత్రం అంత బలంగా ఉండేది, వెనుకటి రోజుల్లో.
8. chandamama on January 4, 2010 145 AM Edit This
రవి గారూ, మీరన్నది నిజం. మా రోజుల్లో తెలుగులో 78 మార్కులంటే మా స్కూలు టీచర్లే అదిరిపోయేటంత ఎక్కువ మార్కులు మరి. సంధి సమాసాల్లో ఒక చిన్న అక్షర దోషం కనబడినా మార్కులపై కోత విధించిన రోజులవి. తెలుగు సబ్జెక్టు తీసుకోవడానికి పిల్లలు తటపటాయించే కాలం రావడంతో భాషా దోషాలను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదనుకుంటున్నా. మీకు 89 మార్కులంటే చాలా గొప్పే మరి.. తర్వాత యూనివర్శిటీలో కూడా తెలుగులో66 శాతం సాధించడమే గొప్పయిపోయింది మాకు.
9. sreedhar on January 4, 2010 936 AM Edit This
రాజు గారు,నాకు కూడా తెలుగు పద్యాలు చదవడం అన్నా లేక రాయడం అన్నా చాలా ఇష్టం!!
మీది ఏ ఊరు ఎందుకు అడుగుతున్నాను అంటే మీ ఫోటో పై రాయచోటి డిగ్రీ కళాశాల అని ఉంది. మాది కూడా రాయచోటి కి దగ్గర్లోని ఒక పల్లెటూరు.శ్రీధర్.
telugupadyaalu.blogspot.com
10. kalpana on January 4, 2010 1000 AM Edit This
రాజు గారు,మీ సమాధానం ఇంకా ముచ్చట గా వుంది. మరి మా కోసం కూడా (మేము కూడా మీ స్కూల్ పిల్లలు అనుకోండి) ఆ పద్యాలు చదివి రికార్డ్ చేసి పెట్టండి.“ మన తరం పిల్లలు ఏం కోల్పోతున్నారో, ఏం కోరుకుంటున్నారో..”పిల్లలే కాదు, పెద్దవాళ్లం కూడా అన్నింటిని కోల్పోతున్నాము. మరి మీరు కూడా మంచి తెలుగు మాస్టర్ కదా.మాకోసం కొన్ని తెలుగు పద్యాలు……ప్లీజ్,మీరు చెన్నై లో వుంటారా మా తమ్ముడు అక్కడే వుంటాడు. అసలు ఒక్కో ప్రబంధం మీద ఒక్కో పోస్ట్ రాయవచ్చు మీరు. మేము ఎదుచూస్తూ వుంటాము మీ అనుభవాల కోసం.
11. కామేశ్వర రావు on January 4, 2010 1214 PM Edit This
రాజుగారు,తెలుగు పద్యాన్ని గురించి ఎంత మంచి రుచికరమైన మాటల్ని చెప్పేరండి! అంతమంచి మాస్టారు దొరికిన మీరు ఎంతో అదృష్టవంతులు. మళ్ళీ మీరు మాస్టారై మీ విద్యార్థులకి ఆ అమృతాన్ని అందించడం గొప్ప విషయం. కల్పనగారు అన్నట్లు ఆ మాధుర్యాన్ని మాక్కూడా కొంచెం (వినిపించి)పంచిపెట్టరూ.తెలుగు పద్యాలు పాఠశాలల్లో పాడకూడని నిషేధించారా ఇంక కొన్ని రోజుల్లో ఇళ్ళల్లో అమ్మలు జోలపాటలు కూడా పాడకూడదని నిషేధిస్తారో ఏమో!
12. రాజు on January 4, 2010 1219 PM Edit This
శ్రీధర్ గారూ, నా మెయిల్లోనే మా ఊరు, మాస్కూలు వివరాలు ఇచ్చినట్లున్నాను. మళ్లీ చూడండి. కడప జిల్లా, రాయచోటి తాలూకా, సుండుపల్లి మండలం, మడితాడు గ్రామం, చండ్రాజుగారి పల్లె. మా స్కూలు… గుట్టకింద రాచపల్లి హైస్కూలు. 35 సంవత్సరాల క్రితం మమ్మల్ని కాస్తయినా మనుషులుగా తీర్చి దిద్దిన స్కూలు. ఆ స్కూలులో మేం నాటి, పోటీలు పడి పెంచిన చెట్లు, చదువు, కాసింత సంస్కారం కూడా నేర్పిన గురువులు. అది ఓ పాత బంగారు లోకం. రాయచోటి దగ్గర ఊరు అంటే మీరు మాకు చాలా దగ్గరే మరి.
మీ బ్లాగు చూశాను. ఓ వేమన శతకం, ఓ సుమతి శతకం… ఇవి చాలు మూడు నాలుగు శతాబ్దాల క్రితం తెలుగు ప్రజల అనుభవసారాన్ని చాటి చెప్పడానికి. ఇవి మా తెలుగు పద్యాలు. మా జీవన వేదాలు అని ప్రపంచ సాహిత్యం ముందర సవాలు చేసి మరీ నిలబడడానికి ఈ రెండు శతకాలు చాలు.
తమ కాలపు సమాజాన్ని, దాని మంచిచెడ్డలను, నీచ, నికృష్ట మానవ స్వభావాలను నిర్భయంగా, నగ్నంగా, కొండొకచో మహా మూర్ఖంగా కూడా చాటి చెప్పిన పద్యశతకాలివి. వేశ్యలను సాధారణ మానవ స్వభావంతో బూతులతో తిట్టడం కూడా ఈ పద్యాల్లో ఉంటుంది. ఇలాంటి వాటిని మనం విచక్షణతో పరిహరించి, తీసివేస్తే బాగుంటుంది.
కాపీ రైట్ సమస్యలు లేకుంటే మీ బ్లాగును మరిన్ని పద్యాలతో, మీ స్వంత వ్యాఖ్యానంతో ఇంకా సుసంపన్నంగా మలచండి. పూర్తిగా పద్యాలకే అంకితం చే్స్తూ మంచి బ్లాగు నిర్వహిస్తున్నందుకు అభినందనలు. మీకు తీరిక ఉండి, సమయం సహకరిస్తే వచన కవిత్వంలోని గొప్ప గేయకవితలను కూడా ప్రత్యేక కేటగిరీలో ఉంచి ప్రచురించండి.
మన తెలుగు పద్యం ఎంతటి శక్తివంతమైందో, ఒక ఊరిలో నివసించాలంటే ఆ ఊరు ఏ లక్షణాలతో ఉండాలో చెప్పే ఈ పద్యం ఒక్కటి చాలు చూడండి. అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరు, ద్విజుడు వీళ్లంతా ఉన్న ఊరిలోనే ఉండమని సుమతీ కారుడు అప్పట్లోనే చెప్పాడు. నాటి గ్రామీణ సమాజ అవసరాలను మహత్తరంగా చాటి చెప్పిన ఈ పద్యసారాన్ని మన జీవితాలకు మన ఊర్లకు ఇప్పుడు అన్వయించుకుందామా
మన ఊర్లలో ఇప్పుడు వైద్యుడు లేడు. అంతా పట్నాలకు పారిపోయారు. వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడిన ద్విజుడు లేడు. విదేశీ చదువులకోసం ప్రవాసం పోయాడు లేదా పౌరోహిత్యం కోసం కాదు కాదు.. పొట్టకూటికోసం పట్టణాలకు పెద్ద పెద్ద గుడులకు వలసపోయారు. ఎప్పుడూ ఎడతెగకుండా పారే ఏరు. మన కలలో కూడా ఇలాంటిది ఇప్పుడు మన పల్లెల్లో కనపడదు. సహాయపడే అప్పులోడు కాదు కదా.. గ్రామీణ జీవితాన్ని పీల్చి వేస్తున్న వడ్డీ వ్యాపారస్తులు మాత్రమే ఉన్నారు. మనం వీటిని ఊర్లు అనే అందామా ఇక్కడే సుమతీ శతకకారుడి గొప్పతనం మనకు అర్థమవుతుంది.
మీ బ్లాగులో తెలుగు తల్లి చిత్రంతో మా తెలుగుతల్లికీ మల్లెపూదండ గీతం సైడ్లో ఉంచారు. కొన్నాళ్ల తర్వాత దీన్ని ఈ రూపంలో పాడుకోలేమో మరి. తెలుగు తల్లి మాటేమిటో కాని ఆమె పుత్రులు నిట్టనిలువుగా చీలిపోయారు. ఇక కలిసి బతకడం కల్లే అనిపిస్తోంది. మళ్లీ అక్కడా ఇక్కడా విద్వేషాలు, విధ్వంసాలు మొదలయ్యాయి.
మన పునాదిని అర్థం చేసుకోవడానికయినా మీరు మన ప్రాచీన గతాన్ని స్పురింపజేసే ఇలాంటి పద్యాలను తప్పక ప్రచురిస్తూ పోండి. మీ బ్లాగులో ప్రభాకర మందార గారన్నట్లు “సముద్రమంత భావాన్ని నాలుగు చిన్న చిన్న వాక్యాలలో పొందుపర్చడం మన తెలుగు పద్యానికే చెల్లింది.”మీరు ఇలాగే ముందుకు పోండి..
ఈమాట.కామ్ వంటి కొన్ని తెలుగు వెబ్ సైట్లలో ప్రాచీన పద్యాల గురించిన చక్కటి వ్యాఖ్యానాలతో వ్యాసాలు ప్రచురిస్తున్నారు.చూస్తున్నారనుకుంటాను.అభినందనలతోరాజు
13. chandamama on January 4, 2010 149 PM Edit This
కామేశ్వరరావు గారూ,మీ ఆప్తవాక్యానికి ధన్యవాదాలుపద్యం వినిపించి పంచి పెట్టడం మాటేమో గానీ, పల్లెలో ఉన్నప్పుడు చెరువు వద్దకు పోతున్నప్పుడో, గుట్టలెక్కుతున్నప్పుడో, పశువులను మేపుతున్నప్పుడో కాసింత సమయం దొరికిందంటే చాలు ఏదో ఒక పద్యమో, పాటో, శ్రీశ్రీ గేయమో ఆరున్నొక్కరాగంతో గొంతెత్తి పాడుకునేవాళ్లం. మైళ్ల కొద్దీ దూరం పొలాల్లోకి, పక్క ఊర్లకు నడిచిపోవలసి వచ్చినప్పుడు కూడా మాకు పద్యాలు, పాటలే కాసింత ఊరట నిచ్చేవి.
ఇక చిన్నప్పుడు రాత్రిపూట ఏరు దాటుతున్నప్పుడు, ఊరికి తిరిగి వస్తున్నప్పుడు చిమ్మచీకటిలో, నిశ్శబ్ద వాతావరణంలో తన్నుకుని వచ్చే భయాన్ని అధిగమించాలంటే మాకు పద్యం లేదా పాటే శరణ్యమయ్యేది. సిగ్గు, సందేహం, సంకోచం వంటివి ఏవీ లేకుండా నోరారా పాడుకోవడానికి పల్లె ఎంత అనుకూలప్రాంతమో.. ఈ వాతావరణానికి దూరమై 20 ఏళ్లయింది.
ఇప్పుడు అంతా పట్నవాసపు జీవితమే.. ఉన్న ఇరుకిళ్లలోంచి శబ్దం బయటకు పోతే కష్టం. ఎవరేమనుకుంటారో అనే మొహమాటం. అంతకు మంచి మనం రాగం తీస్తుంటే బయటినుంచి విన్నవారు నవ్వుతారేమో అనే సంకోచం. అందుకే మనసులో పాడుకోవడం. గతాన్ని గుర్తు తెచ్చుకోవడం. ఇలా అరుదుగా బ్లాగుల్లో బయటపడిపోవడం. అంతకుమించి ఇంకేవీ లేవండీ మనవద్ద. కానీ ఈ పనిఒత్తిళ్లూ, జీవిక కోసం చేయవలసిన అనివార్యతలూ లేని జీవితం ఒకటి ప్రాప్తించాక మళ్లీ ఆ పాత జీవితానికి, ఆపాత గాన మాధుర్యానికి తరలి వెళ్లలేమా అనే ఆశ మాత్రం చావడం లేదు.
అయినా జోలపాటలు ఇంకా ఎక్కడున్నాయిప్పుడు వాటిని పాడుకునే కాలమేనా ఇది. టింకిల్ టింకిల్ టింకిలే పాటలే గదా ఇప్పుడు ఎక్కడ చూసినాతెలుగు పద్యంపై మీ బ్లాగు చాలా బాగుంది. చూసిన వెంటనే నా చందమామ బ్లాగులో తెలుగుపద్యం కేటగిరీ కింద చేర్చేసుకున్నాను. మనం ఇలాగే కలుసుకుంటూ ఉందాం లెండి.
రాజు
blaagu.comchandamamalu
telugu.chandamama.com
14. chandamama on January 4, 2010 239 PM Edit This
కల్పన గారూ,మీ తూర్పు పడమర బ్లాగు -kalpanarentala.wordpress.com- లో మీ వివరాలు చూశాను, రెంటాల గోపాల కృష్ణ గారి అమ్మాయి కదా మీరు. ఆ అభిరుచి, ఆ సాహిత్య వాతావరణం ఎక్కడికి పోతుంది మరి. మీ సోదరుడు రెంటాల జయదేవ్ గారే కదూ.మేం చెన్నయ్లో తేజస్ -తెలుగు జర్నలిస్టుల సంఘ సభ్యులుగా అరుదుగా కలుసుకుంటుంటాం. చెన్నయ్లో పలు సమావేశాల్లో ఆయన ప్రసంగాలు విన్నాను. అంతే తప్ప పెద్దగా పరిచయం లేదు. ఒకరినొకరు గుర్తుపడతాం తప్పితే అంతకుమించి సాహిత్య సన్నిహిత సంబంధం మా మధ్య ఏర్పడలేదు. ఎందుకో కారణం తెలీదు మరి.
జర్నలిస్టు ప్రపంచంలో తొలినుంచి నేను భాగం కాకపోవడం చేత బయటి సర్కిల్తో పెద్ద పరిచయాలు లేవు. ఈ బ్లాగు ద్వారానే పదిమంది సాహితీ మిత్రులతో ఇటీవల పరోక్ష పరిచయాలు అవుతున్నాయి.
మంచి సమావేశం, లేదా సాంస్కృతిక కార్యక్రమం చెన్నయ్లో జరిగితే, తెలిసి ప్రవేశం దొరికితే పోయి చల్లగా ఆస్వాదించి రావడం మాత్రమే తెలుసు నాకు. ఇండియా టుడేలో పనిచేస్తున్నారు కదా.. పాపం.. విఎకే రంగారావు గారు తటస్థపడితే చాలు సభల్లో ఆయనకు మీ సోదరుడికి తండ్లాటే అనుకోండి. హాయిగా నవ్వుకుంటుంటాం అలాంటి సందర్భాల్లో.. ఇదీ మా పరిచయం. మీ ద్వారా అయినా తనతో పరిచయం పెరుగుతుందేమో చూద్దాం.
మంచి తెలుగు మాస్టారును అవునో కానో తెలీదు కానీ. రకరగాల సబ్జెక్టులతో, భట్టీయంతో బుర్రవేడెక్కిపోయే పిల్లలకు కాస్సేపు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిద్దాం అనే ఆలోచనతోటే వారితో పద్యాలతో, పాటలతో, గేయాలతో మమేకమయ్యేవాడిని. అంతే ఇరవయ్యేళ్ల తర్వాత కూడా వారు ఎక్కడున్నా సరే నన్ను మర్చిపోలేదు.
ఓసారి ప్రార్థనా సమయంలో గురజాడ వారి దేశమును ప్రేమించుమన్నా గేయం రాగయుక్తంగా విషాద శైలిలో పాడి వినిపిస్తే పక్కన ఉంటున్న మా కాలేజీ సంస్థాపకులలో ఒకరైన సాయిగారు -తిరుపతి ఆర్ట్స్ కాలేజీలో ఎకనమిక్స్ లెక్చరర్- తన జీవితంలో ఓ గొప్పరోజిది.. ఓ గొప్ప గేయాన్ని విన్నరోజిది అంటూ చేతులు పట్టుకున్నారు. మర్చిపోలేని క్షణాలవి.
ఇది 20 ఏళ్ల క్రితం నాటి మాట లెండి. తర్వాత్తర్వాత అనూహ్యంగా ఉద్యమాల్లోకి, అనంతరం కంప్యూటర్ ప్రపంచంలోకి, సాఫ్ట్వేర్ లోకలైజేషన్ లోకి, ఇటీవలే చందమామ పనిలోకి వచ్చిన తర్వాత ఇక పద్యశ్రవణం, పద్యగానం ఎక్కడ కుదురుతాయి. అప్పుడప్పుడూ ఇలా మననం చేసుకోవడం తప్పితే..
ఇక పద్యాల రికార్డు అంటారా.. నా గొంతు నేను వినడం కోసమైనా ఏదో ఓ సందర్భంలో రికార్డు చేస్తే బాగుంటుందేమోనని అనిపిస్తూ ఉంటుంది. అందుకు సందర్భం వస్తుందేమో.. చూద్దాం.
ప్రాచీన సాహిత్యాన్ని, పద్య సాహిత్య వైభవాన్ని చాలా మందే ఇప్పుడు వెబ్సైట్లలో, బ్లాగుల్లో పరిచయం చే్స్తున్నట్లున్నారు కదూ.. మళ్లీ మనమెందుకులెండి.. అంత పాండిత్యం కూడా లేని వాళ్లం. అప్పుడప్పుడూ క్లాసురూమ్ అనుభవాలతో ఇలా బ్లాగుల్లో కలుసుకుంటే చాలనుకుంటాను.మీ ఆప్తవాక్యాలకు కృతజ్ఞతలు.రాజుఇమెయిల్
krajasekhara@gmail.com
rajasekhara.raju@chandamama.com
NB మీ బ్లాగులో ఇటీవలే పరిచయం చేసిన ‘మధుపం’ -పూడూరి రాజిరెడ్డి-, పుస్తక పరిచయం చాలా బాగా వచ్చింది. అలాగే ‘మనసుని మెలిపెట్టే జ్ఞాపకాల రచయిత్రి అజర్ నఫిసీ!’ పేరుతో మీరు పరిచయం చేసిన ఇరాన్ రచయిత్రి వివరాలు అద్భుతంగా ఉన్నాయి. -Things I Have Been Silent About- చెన్నయ్లో ఈ పుస్తకం దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. మీ చక్కటి శైలికి అబినందనలు
15. SIVARAMAPRASAD KAPPAGANTU on January 5, 2010 730 PM Edit This
రాజుగారూ,అనిటికన్న మీ ఫొటో చాలా బాగున్నది. అప్పటి అమాయకత్వపు చూపులలో ఉన్న అందం ఎప్పటికి మరువలేము కదా. మంచి జ్ఞాపకాల దొంతరను కదలించారు రాజుగారూ. మేము చదువుక్నే రోజులలో బిల్వహణ శాస్త్రి గారని ఒక హింది మాష్టారూండేవారు. ఆయన పాఠం చెప్తుంటే అటు ఇటు గదులలో కూడ మారుమోగేది. హిందీ పాఠాలను చక్కగా వివరించేవారు.
తెలుగు పాఠాలకు వస్తే కాలేజీలో జంధ్యాల మహతీ శంకర్ గారు (జంధ్యాల పాపయ్య శాస్త్రిగారికి దగ్గర బంఢువు) తన గాన కౌశలంతో మాకు తెలుగు సాహిత్యం మీదకు మనసులను మళ్ళించారు. ఆయన పద్యం పాడుతుంటే అలా పద్యాలను చదవలేనందుకు బాధ కలిగేది. అవొక అద్భుతమైన రోజులు(1973-76) డిగ్రీ రెండో సంవత్సరం నుంచి తెలుగు ఇంగ్లీషులు లేవు.
మీరు ఈసారి మీ ఊరు వెళ్ళినప్పుడు సహదేవ రెడ్డిగారిని కలసి నా నమస్కారాలు తెలియ చేయండి. ఆయన కు ఓపిక ఉంటే మీకు వీలైతే ఆయన పద్య గానన్ని రికార్డు చేసి అందరికి అందించండి. ఇదొక చిన్న కోరికలాగ కనిపిస్తుంది కాని, ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక టి కుదిరితే మరొకటి జ్కుదరదు.మంచి వ్యాసం, అద్భుతమైన అనుభూతులు అందరితో పంచుకున్నారు. ధన్యవాదాలు రాజుగారూ.
16. kalpana on January 5, 2010 749 PM Edit This
రాజు గారు,అయ్యో, మా నాన్న గారి పాండిత్యం అసలు నాకు పిసరంతా కూడా రాలేదనుకుంటాను. ఇంకో మాట కూడా చెప్తాను సరదాకి. పండిత పుత్ర పరమ శుంఠ. మా నాన్నగారు నిస్సందేహం గా పండితులు. కాబట్టి నేను శుంఠనన్నమాట.ఇక మా తమ్ముడు కి, మీ కామెంట్ పంపించాను. తప్పక మీతో మాట్లాడతాడు.నా గురించి ఇంత వోపికగా చదివి నాలుగు మంచిమాటలు రాసినందుకు చాలా సంతోషంగా వుంది.
17. chandamama on January 6, 2010 1143 PM Edit This
‘మా తెలుగు మాస్టారూ, మా తెలుగు పద్యమూ’ అనే నా తాజా టపా చూసిన వలబోజు జ్యోతి గారు (jyothivalaboju.blogspot.com) వ్యక్తిగతంగా పంపిన మెయిల్లో కొన్ని మంచి విషయాలు తెలిపారు. బ్లాగులలో వ్యాఖ్య పెట్టకూడదు అని నిర్ణయించుకున్న ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తూనే, ఆ మెయిల్లో పొందుపర్చిన విషయాలను సందర్భోచితంగా ఉంటుందని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఆమె మెయిల్ ప్రకారం ఆమెది కూడా బంగారు బాల్యమే. అమ్మ తనచేత చదివించిన చందమామ పత్రికే తెలుగు అంటే ఇష్టాన్ని కలిగించిందట. మనలో చాలామందికి లాగే ఆమె కూడా స్కూలు నుంచి డిగ్రీవరకు తెలుగులోనే చదివారట. బ్లాగులలో కొచ్చాక తన తెలుగును మరింత మెరుగులు దిద్దుకుంటున్నానని ఆమె చెప్పారు.
మా తెలుగు మేష్టారును పోలిన వారు మన బ్లాగ్లోకంలో కూడా ఉన్నారని. ఆశువుగా అలా పద్యాలు అల్లెస్తారని ఆమె చెప్పారు. ఆయన శ్రీ చింతా రామకృష్ణారావు.
andhraamrutham.blogspot.com
నాదంటే నాదని ప్రస్తుతం తెలుగువారు కొట్లాడుకుంటున్న హైదరాబాదులో ఆయనకు ఉద్యోగం చేయాలంటే అసలు తెలుగు నేర్పే కాలేజీలే కరువైన విషయాన్ని ఆమె చెప్పారు.
అయినా ప్రస్తుతం మనకు ఇలాంటివి ఎందుకు దృష్టిలోకి వస్తాయి లెండి.
18. chandamama on January 7, 2010 1240 AM Edit This
శివరాంగారూ,పద్యకవిత్వాన్నే కాదు. వచన కవిత్వాన్ని కూడా చక్కగా పాడి వినిపించవచ్చు అనే విషయం ప్రస్తుతం మన విద్యాశాఖ ప్రభువుల వారికి తెలియదనుకుంటాను. చదివి వినిపించి ఎలాగోలా ముగించేస్తే చాలని ఏలినవారు భావిస్తున్నట్లుంది. పూర్వ కాలంలో వలే రాగాలు తీయనవసరం లేదు కానీ రాగయుక్తంగా పాడితే పిల్లల మనసులను క్లాసురూములో రంజింపజేయవచ్చు అనే విషయం ఇప్పుడు అందరూ మర్చిపోయినట్లే ఉంది.
జంధ్యాల మహతీ శంకర్ గారి తెలుగు పాఠాలను విన్న భాగ్యవంతులు మీరు. జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు తిరుపతిలో పాతికేళ్ల క్రితం ఎస్వీయూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ ఫంక్షన్కు వచ్చి దేశానికి భవిష్యత్తు ఇంజనీర్లు, భవన నిర్మాతలే అయినప్పటికీ తెలుగు భాష సౌందర్యాన్ని మర్చిపోవద్దని విద్యార్థులకు చేసిన విజ్ఞప్తి ఇంకా నా కళ్లముందు కదులాడుతానే ఉంది.
ఆయన రాసిన పుష్పవిలాపం, కుంతీకుమారి పద్యాలకు ఘంటసాల వారి ఆలాపనలు మీ వద్ద ఉన్నాయి కదూ!
నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి “మా
ప్రాణము తీతువా” యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానసమందెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై.
మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవనమెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !
ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు
హాయిగా చెట్టుపైనున్న పూలను కర్కశంగా కోసి, సూదులతో గ్రుచ్చి, త్రాళ్ళతో బిగించి, మానవులు తమ భోగ వస్తువులుగా వాడుకోవడం క్రౌర్యం అని పూలు రోదిస్తే పూలకోసం వచ్చిన భక్తుడు తల్లడిల్లి వెనుదిరిగాడట… గొంతుకు ఉరి బిగించి గుండెలో సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురకటా దయలేని మీ యాడువారు అని పూలు రోదించిన వైనం ఘంటసాల గారు పద్యరూపంలో పాడుతుంటే అప్పట్లో కొందరు తెలుగు మహిళలు తలలో పూలు ధరించడానికి కూడా భయపడిపోయారని ప్రతీతి.
మా తెలుగు మాస్టారు సహదేవరెడ్డి గారు ఇప్పుడు లేరు. ఈ కంప్యూటర్లు, మొబైల్స్, కెమెరాల గురించి గ్రామీణ సమాజానికి పెద్దగా తెలియని కాలంలోనే ఆయన కన్నుమూశారు. ఆయన పద్యగానం రికార్డు చేసే అవకాశం లేదు. ఎవరయినా ఆయన పద్యాలను రికార్డు చేసి ఉండే అవకాశం కూడా లేదు. ఉంటే… నా మట్టుకు నాకు భూమ్మీద అంతకంటే మంచి వార్త మరొకటి ఉండదు.
ఈ టపాకు వచ్చిన స్పందనలు చూస్తుంటే నాకు చదువు, సంస్కారం నేర్పిన మా గుట్టకింద రాచపల్లె హైస్కూలు పిల్లలకోసం చందమామ పత్రికను పంపించాలని ఆలోచన వస్తోంది. త్వరలో ఈ పని చేయగలనని విశ్వసిస్తున్నాను.
ధన్యవాదాలు
Filed under తెలుగు మాష్టారు -తెలుగు పద్యం | Comment (0)
చందమామ – పాఠకుల ఉత్తరాలు
చాలా కాలం తర్వాత చందమామ కార్యాలయానికి ఉత్తరాల వెల్లువ మొదలైంది. ప్రతి నెలా ఏ మూడు నాలుగు ఉత్తరాలకంటే ఎక్కువగా ప్రింట్ చందమామలో ప్రచురించడం కష్టం కాబట్టి పాఠకుల వాణికి ఆన్లైన్లో అయినా న్యాయం చేస్తే భావ్యంగా ఉంటుందన్న ఊహ నేపధ్యంలో మాకందిన వాటిలో కొన్ని ఉత్తరాలను ఇక్కడ ప్రచురిస్తున్నాము. వీలు చూసుకుని ఇకపై వచ్చే ఉత్తరాలను కూడా ఇక్కడ ప్రచురించడానికి ప్రయత్నిస్తాము.
చందమామ మంచిచెడ్డలకు నిఖార్సయిన ప్రతిరూపం పాఠకుల లేఖలే. నిర్మొహమాటానికి, నిక్కచ్చితనానికి మారుపేరైన చందమామ పాఠకులు దశాబ్దాలుగా తమ విలువైన అభిప్రాయాలద్వారా చందమామ దిశ దశ సరైన త్రోవలో పయనించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ వచ్చారు. 1950-80 నాటి ప్రామాణిక చందమామ నాణ్యత ప్రస్తుతం లేకపోయినప్పటికీ లక్షలాదిమంది అభిమాన పాఠకులు దేశవ్యాప్తంగా చందమామను నేటికీ తమదిగానే చూసుకుంటున్న చరిత్రకు పాఠకుల ఈ లేఖలే నిదర్శనం.
జీవితం చివరి క్షణాల్లోనూ చందమామను చదువుతూనే కన్నుమూయాలని, చందమామను చదివేందుకోసమే వందేళ్లు బతకాలని భావోద్వేగాలను శిఖరస్థాయిలో ప్రకటిస్తున్న మాన్య పాఠకులూ, అభిమానులే చందమామ మనుగడకు ‘శ్రీరామరక్ష’. గత రెండేళ్ల కాలంలో చందమామలో వచ్చిన మంచిమార్పులకు పాఠకులు నిత్యం పంపుతూ వస్తున్న లేఖలు, అభిప్రాయాలు, విమర్శలే కారణం.
‘ఎవడబ్బసొమ్మని కులుకుతు తిరిగేవు రామచ్చంద్రా’ అని రామదాసు ఆ శ్రీరామచంద్రుడినే మెత్తగా పొడిచిన రీతిలో చందమామ పాఠకులు పత్రిక నిర్వహణపై ప్రభావం వేస్తున్నారు. ‘మీ ఇష్టానుసారంగా కాదు, మా అభిమతానికి అనుగుణంగా పత్రికను నడపండి’ అంటూ దూషణ భూషణల జడివానలో పత్రికను ముంచెత్తుతున్నారు. ఒకమాట మాత్ర నిజం. చందమామ పాఠకుల ఆగ్రహాన్నీ తట్టుకోలేము. అలాగే అనితర సాధ్యమైన వారి మహాదరణను కూడా తట్టుకోలేము.
సందర్భోచితం కాదని పాఠకులు, అభిమానులు భావించని పక్షంలో ఒక చిన్న మాట. 64 ఏళ్ల క్రితం శ్రీయుతులు నాగిరెడ్డి-చక్రపాణి గార్లు తెలుగు సమాజానికి, భారతీయ సమాజానికి ఒక ‘మత్తుమందు’ను అందించారు. దాని పేరు చందమామ. లోకంలో సకల వ్యసనాలకంటే గొప్పదీ, ఔన్నత్యంతో కూడుకున్నది అయిన ఈ మత్తునుంచి పాఠకులు, అభిమానులు నేటికీ బయటపడలేదు. బయటపడలేరు కూడా.
మంచికి,మానవత్వానికి, నీతికి, నిజాయితీకి, సద్బుద్ధికి, సత్ప్రవర్తనకు, ఒక మహాజాతి సంస్కృతికి కూడా పట్టం కట్టిన మహా మత్తు చందమామ సొంతం. అది మంచి మత్తు కావచ్చు, చెడ్డ మత్తు కావచ్చు. ప్రపంచంలో మత్తుకు, వ్యసనానికి లోనయినవారు వాటిలోంచి బయటపడటం చాలా చాలా కష్టం. అందులోనూ చందమామ మత్తులోంచి బయటపడటం మరీ కష్టం. దానికి ఉదాహరణే చందమామ పాఠకుల ఉత్తరాలు. వాటిలో కొన్నింటిని ఈ విడత చదవండి.
ఇవి ఈ సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చందమామకు వచ్చిన ఉత్తరాలలో కొన్ని.
(అమృత సమానమైన వాక్కులతో, పొగడ్తలతో, విమర్శలతో, దూషణ భూషణలతో చందమామ దశను, దిశను నిర్దేశిస్తున్న పాఠకోత్తములందరికీ చందమామ కృతజ్ఞతాంజలులు…)
సెప్టెంబర్ చందమామను ఆగస్ట్ 27నే అందుకున్నాను. వపాగారి వినాయక చవితి ముఖచిత్రం అద్భుతంగా ఉంది. చందమామకు పూర్వ వైభవం వచ్చినట్టుంది. లోపలి కథలు కూడా చాలా బాగున్నాయి. అచ్చులో నా కథ చూసుకుంటే మహదానందమేసింది.
–ఆరుపల్లి గోవిందరాజులు, విశాఖపట్నం
సెప్టెంబర్ చందమామ వినాయకుడి ముఖచిత్రంతో అబ్బురమనిపించింది. వపాగారి మార్కు ముఖచిత్రాల్లో ఇది హైలెట్. అలాగే ఈ నెల బేతాళ కథలో కొట్టొచ్చినట్లు మార్పు ఏమంటే శంకర్ గారు పూర్తి పేజీ బొమ్మ వేయడం. బేతాళ కథకు ఫుల్ పేజీ బొమ్మ వేయడం చందమామ చరిత్రలో ఇదే తొలిసారేమో. రాజు, గుర్రం, పాముని శంకర్ పూర్తి పేజీలో అందంగా చిత్రించారు. కథ కూడా బాగుంది.
సారయ్య, కరీంనగర్, ఎపి.
సెప్టెంబర్ సంచిక సకాలంలో అందటం మహదానందంగా ఉండటమే కాకుండా ఇంతవరకు చందమామ సుదీర్ఘ చరిత్రలో ముఖచిత్ర వివరణ, -వినాయకుడు- చిత్రకారుని ప్రతిభ గురించి ఎప్పుడూ విశ్లేషించలేదు. వడ్డాది పాపయ్య గారు చందమామకు జీవనాడి. అలాగే నేడు కూడా కథోచిత చిత్రాలు అందిస్తున్న సీనియర్ చిత్రకారులు శంకర్ -కె.సి. శివశంకరన్- గారికి పెద్ద పీట వేసి గౌరవించాలి. పాత కొత్తల మేలుకలయికతో చందమామ చల్లని కిరణాలతో పరవశించని పాఠకుడు ఉండడంటే అతిశయోక్తి కానేరదు. ఆబాలగోపాలాన్ని హిమశీకరాలతో షష్ఠిపూర్తి దాటినా అందాల చందమామ అలరించడం ఎంత చిత్రం. వంద ఏళ్ళు చదవాలనే పాఠకుల ఆశ ఎంత విచిత్రం. ఇది దురాశ కాదెంతమాత్రం. ఇది మీకు నా శాశ్వత శుభప్రశంస.
–బి. రాజేశ్వరమూర్తి, చిలకలపూడి, కృష్ణా జిల్లా, ఎపి.
ఆగస్ట్ చందమామ సంచిక మా కుటుంబ సభ్యుల్నీ, మా స్నేహితుల్నీ ఆశ్చర్యానందాల్లో ముంచెత్తింది. మరీ అంతలా కథలు ఒక దానితో ఒకటి పోటీ పడి అలరించాయి. పైగా ధారావాహికలతో కలిపి పందొమ్మిది కథలు ప్రచురించారు. సంతృప్తినిచ్చింది. ఇక ముందు కూడా ఇదే పద్ధతి కొనసాగించండి. సరదా శీర్షిక అయిన నవ్వుల పువ్వులు తొలగించి మరో కథ వేస్తే బాగుంటుంది. ఓ చక్కని పౌరాణిక సీరియల్ కూడా వేయండి.
–ఎస్.ఎస్.వి.ఎల్.ఆర్.సి. మహర్షి, పాల్మకోల్, రంగారెడ్డి జిల్లా, ఎ.పి.
జూలై సంచికలోని ‘పిజ్జా బాట’ చాలా బాగుంది. మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. కథలన్నీ ఆసక్తికరంగా సాగి అబ్బురపరిచాయి. అయితే బొమ్మలలో మరింత శ్రద్ధ అవసరం. గత 40 ఏళ్లుగా చందమామ చదువుతున్నాను. చందమామలో బొమ్మలదే శిఖరాగ్రస్థానం. లక్షలాది మంది అభిమానులున్న చందమామలో ప్రస్తుతం మచ్చలాంటి లోపం బొమ్మలే. లోకజ్ఞానం క్విజ్ స్థానంలో రెండు మూడు తేలికపాటి క్విజ్లు ప్రవేశపెట్టండి. పత్రిక కోసం పడిగాపులు పడేలా, ఆసక్తిగా ఎదురు చూసేలా చేసేవి క్విజ్లే. కొత్త కథలను ప్రోత్సహించడం అభినందనీయం.
–జి.జాన్ కెన్నడీ, ఘట్కేశ్వర్, రంగారెడ్డి జిల్లా, ఎపి.
ఆగస్ట్ నెల చందమామ జ్ఞాపకాలు చాలా బాగున్నాయి. ‘చందమామను ఒకసారి చదవండి. తర్వాత దాన్ని వదలరు’ అన్న దుమాల్ గారి వాఖ్య అద్భుతం. వాస్తవం కూడా. అలాగే సెప్టెంబర్ సంచికలోని జ్ఞాపకాలలో ‘బతికినంతకాలం చందమామ చదువుతూనే ఉంటాను’ అంటూ సోమశంకర్ గారు చేసిన ప్రకటన చందమామ పాఠకులందరి అబిప్రాయాన్ని సూచిస్తోంది. చందమామ చరిత్రను తడుముతున్న జ్ఞాపకాలను శీర్షికగా కొనసాగించడం చాలాబాగుంది
– ఎ. నారాయణరావు, అనంతపురం, ఎపి.
గత 20 ఏళ్లనుంచి చందమామ పత్రికను కొని చదువుతున్నాను. నా వయస్సు ఇప్పుడు 28 ఏళ్లు. చందమామ కవర్పై వచ్చే వపా చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. చందమామతో వచ్చే వపా చిత్రాల కోసం కథల కోసం చందమామ కొని, చదివి, భద్రపరుస్తున్నాను. 60 ఏళ్ల నాటి వపా చిత్రాలు కవర్ పేజీపై చూడాలని ఉంది. కవర్ పేజీపై వపాగారి పాత చిత్రాలే వేయగలరు. చందమామ చివరి అట్టపై కూడా మీరు కోరిన చిత్రం పేరిట వపాగారి చిత్రం ప్రచురిస్తే బాగుంటుంది. వపా చిత్రాలతోటే పెయింటింగ్ బుక్ ప్రచురించగలరు.
–ఎస్. మాధవరావు, దబరు, శ్రీకాకుళం
నేను పదవీ విరమణ చేసిన ప్రభుత్వ డాక్టర్ని. 1960 నుంచి చందమామ చదువుతున్నాను. అప్పట్లో రోజు పాఠాలు అప్పచెప్పేసి, మా అమ్మదగ్గర పైసలు తీసుకుని, దగ్గరి బడ్డీ కొట్టులో చందమామను కొనుక్కుని తెచ్చుకుని ఒక్కో కథని నిదానంగా చదువుకునేవాడిని. నేను మా అక్క, తర్వాత మా అమ్మ, మానాన్న అందరమూ చందమామను చదివేవాళ్లం. ఈ రోజుకీ చందమామను నేను వదలడం లేదు. నా పిల్లలూ చదువుతున్నారు. చివరకి నా మనవడు కూడా మెల్లగా కూడబలుక్కుని చందమామ చదువుతున్నాడు. చందమామ పట్ల ఇంత ఆకర్షణకు కారణం దీంట్లోని కథలు ఇంగ్లీష్ వాళ్ల హారీ పోటర్ నవలల్లో లాగా మంత్రాలు, మంత్రగాళ్లు, గాలిలో ఎగిరిపోవటాలు లాగా కాకుండా, ఆ కాలపు ప్రజల్లో ఉన్న మంచితనం, చక్కని కొండలు, నదులు, అడవులు, పచ్చని చెట్లు, ప్రజల్లో అమాయకత్వం, స్వచ్ఛత వంటి గుణాలతో కూడి ఉండటమే. ఇవి.. విచిత్రవ్యక్తి, టామ్ సాయర్, హకల్ బెరిఫిన్ వంటి మార్క్ ట్వైన్ నవలలను గుర్తుకు తెచ్చేవి. ఈ పాత రీతినే కొనసాగించండి. పొరపాటున మీరు విమానాలు, కార్లు, ఛేజింగ్, జేమ్స్బాండ్ వంటివి పెట్టారంటే నాలాంటి వాళ్లు చందమామను చదవటం మానేస్తారు.
– డా. వి.వి. నరసింహారావు, బుట్టాయిపేట, మచిలీపట్నం, ఎ.పి.
స్వాతంత్ర్య దినోత్సవం, రక్షాబంధన్ ఒకే సమయంలో రావడం బాగుంది. చందమామ కథలో నోరు లేని ప్రాణులు తోటి ప్రాణులకు సహాయం చేయడం వింతగొల్పుతోంది. దేశ సుభిక్షానికి వనపెంపకాలు అవసరమన్న సాధువు మాట విన్న రాజు దేశ పూర్వ వైభవానికి పాటు పడటం బాగుంది. ఆగస్ట్ నెల ముఖచిత్రం రెక్కల గుర్రం ఆకట్టుకుంది. చందమామ కాగితం ముతగ్గా ఉన్నప్పటికీ ముఖచిత్రం మాత్రం బాగుంది. పాతశైలిలోని కథలు పాత కాలాన్ని గుర్తు చేస్తున్నాయి. క్విజ్ విధానం మార్చండి.
– వాస్తు రామచంద్ర, రాంజీనగర్, నెల్లూరు, ఎపి.
ఈమధ్య చందమామలో చాలా పాత కథలు వేస్తున్నారు. సంతోషం. కాని 1952కి ముందు చందమామ సంచికలో ఉన్న కథలకు 53 నుంచి ప్రచురించబడిన కథలకు చాలా తేడా ఉంది. రూపం, సారం విషయంలో కూడా అవి తేడాతో ఉంటున్న విషయం జగమెరిగిన సత్యం. కుటుంబరావుగారికి ముందు చందమామ కథలు చాలా సాదా సీదాగా, వచ్చినవి వచ్చినట్లుగా అచ్చయిపోయేవి. ఉగ్గుపాల వయసులో ఉన్న పిల్లలకు ఊకొట్టే కథలుగా, చనుబాల కథలుగా అవి ఉండేవి. కుటుంబరావు గారు వచ్చాకే చందమామ కథల శైలి, విషయం కూడా చాలా మారింది. గాంధీగారి శైలి అనబడే నిరాడంబర రచనా శైలితో కొకు చందమామ కథలకు జీవం పోశారు. దయచేసి 1953 నుంచి చందమామలో ఉన్న కథలనే తిరిగి ప్రచురించండి. 52కి ముందు కథలు అంతగా ఆసక్తి గొల్పవు.
–జి. త్రివిక్రమ్, బెంగళూరు (ఫోన్ సంభాషణ ద్వారా)
I would like to bring to your attention the usage of word” DONGA MUNDA” in your latest JULY issue, page 65. I do realize this is a reprint form 1947. May be it was accepted to use such language in those days.
However, in this day and age, when we are trying to teach all the good things to the kids and we depend on magazines like Chandamma, usage of such words especially in print is inappropriate. Just as times have changed, You should have edited the story and language before the print.
-Srilekha, Hyderabad.
చందమామతో నాకు యాభై ఏళ్ల అనుబంధం ఉంది. చిన్నప్పటినుంచి చందమామ కథలంటే చెవికోసుకునేవాడిని. భారతీయ భాషలన్నింటిలోనూ చందమామ వెలువడుతూ ఆబాలగోపాలాన్నీ అలరిస్తోంది. చందమామ పేజీలు నున్నగా, ఆయిల్ ప్రింట్తో ఉండటం ముఖ్యం కాదు.పాఠకులు కోరుకునేది వాసిగల కథలను మాత్రమే. కథ చిన్నదైనా చదవగానే మనస్సుకు హాయిని కల్గించాలి. మంచి కథ చదివాం అనే అనుభూతి కలగాలి. చందమామకే హైలెట్ అనదగిన ఫోటో వ్యాఖ్యల పోటీని రద్దు చేయడం ఏమాత్రం బాగాలేదు. ఈ శీర్షిక లేకపోవటం చందమామలో ఎంతో వెలితిగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని నా మిత్రులు చాలామంది అన్నారు. ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్లో ఫుల్ పేజీలో ఫోటోలు ప్రచురించేవారు. ఆ పేజీలు కనువిందు చేసేవి. ఫోటో వ్యాఖ్యలు రాసి బహుమతి పొందాలని మనస్సు ఉవ్విళ్లూరేది. ఈ శీర్షిక చందమామకోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసేలా చేసేది. ఈ శీర్షికను తిరిగి కొనసాగించాలని సవినయంగా మనవిచేస్తున్నాను.
-బొబ్బా సత్యనారాయణ, నిజామాబాద్
జూన్ గడవక ముందే జూలై సంచిక వచ్చేసింది. ఈ సంచికలో కథలన్నీ బాగున్నాయి కాని ప్రత్యేకించి పి. రంగనాయకమ్మ కథ ‘దేవుడితో చదరంగం’ మరీ బాగుంది. చందమామకు, యువ పత్రికకు నేను కథలు రాసి పంపడానికి ప్రేరణగా నిలిచిన గురుతుల్యులు అవసరాల రామకృష్ణారావు గారి పాత కథ, కొత్త కథ, జ్ఞాపకాలు మూడూ ఒకే సంచికలో వేయడం మరీ బాగుంది.
-ఎన్ ఎస్ ఆర్. మూర్తి, హైదరాబాద్
జూలై సంచిక వారం రోజుల ముందే మార్కెట్లోకి వచ్చేసింది. చాలా సంతోషం. అలాగే కథల ఎంపిక చక్కగా ఉంది. కొన్ని కథలు ఆయా ప్రాంతాల యాసను కలిగి ఉంటున్నాయి. వీటిని సంస్కరించి మాండలిక వాసనలు లేనివిధంగా తిరగరాస్తే బాగుంటుంది.
-ఎంవీవీ సత్యనారాయణ, విశాఖపట్నం
మీరు పంపిన జూలై చందమామ జూన్ 30వ తేదీనే నాకు చేరింది. చాలా సంతోషం. అలాగే చందమామ తొలిసంచికలో రాసిన నా తొలి కథ పొట్టిపిచుక, నేన్రాసిన కొత్త కథ విజయమాల, నా చందమామ జ్ఞాపకాలు మూడూ ఒకే సంచికలో ప్రచురితం కావడం మరీ సంతోషం. పొట్టి పిచుక కథకు వేసిన బొమ్మలు రంగుల్లో మరింత బాగా కనిపిస్తున్నాయి. కృతజ్ఞతలు.
-అవసరాల రామకృష్ణారావు
చందమామ 12 భారతీయ భాషల్లో వస్తుంది అని ఒక ముస్లిం అమ్మాయికి చూపిస్తూ అందులో ఉర్దూ ఉందనుకుని వెతికాను. కనిపించలేదు. అరే అనిపించింది. మన దేశంలో ఉర్దూ చాలా చోట్ల చాలా మందే మాట్లాడ్తారు కదా. ఉర్దూలో కూడా ఉంటే బాగుండును అనిపించింది. ఆ ఆలోచన పంచుకోవాలనిపించి వ్రాస్తున్నాను. ఉర్దూలో చందమామ ఎందుకని రాలేదు?
-జి.లలిత, అమెరికా
చందమామ ఇప్పుడు పూర్వరూపానికి వచ్చేసి చాలా బాగున్నది. ఏవైనా కొన్ని కొత్త శీర్షికలు ప్రవేశపెట్టండి
-కోలార్ కృష్ణఅయ్యర్, బెంగళూరు.
అంతర్జాలంలో అరుదైన కథనాలు…
అంతర్జాలంలో కాలక్షేప టపాలు, రచనలు సహజం. వ్యక్తుల స్యీయ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పరమ ప్రజాస్వామిక రూపం బ్లాగ్. ఇది మంచికీ, చెడ్డకీ కూడా వర్తిస్తుందనుకోండి. కాని అంతర్జాలంలో, వెబ్సైట్లలో కొన్ని అద్భుత మైన రచనలు ప్రచురించబడుతూ శాశ్వత ప్రాతిపదికన ఆసక్తి కలగిన పాఠకులందరికీ అందుబాటులో ఉంటూ జ్ఞానాన్వేషణకు పట్టుగొమ్మలుగా మిగిలి ఉంటున్నాయి.
ఈరోజు కాస్త ఆటవిడుపుగా ఉండటంతో అంతర్జాలం నుంచి రెండు మూడు విలువైన రచనలు తెలుగు భాషపైనా, ఆధునిక తెలుగు ప్రజల ఆవిర్భావం పైనా వెదికి పట్టుకున్నాను. ఇవి ఇటీవలి కాలంలో ఒక తెలుగు బజ్ సమూహంలో చర్చకు కూడా వచ్చాయి. బ్లాగర్లలో చాలామందికి ఇవి అందుబాటులోకి వచ్చి ఉంటాయి.
కాని వీటిని కొన్నాళ్లకు మళ్లీ మర్చిపోతానేమో అనిపించి నా బ్లాగులో వాటిని లింకులుగా ఇస్తే ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వీటిని పరిశీలించవచ్చు కదా అనే భావనంతో తెలుగు భాషపై వచ్చిన కొన్ని అపురూపమైన వ్యాసాలను కింద లింకులుగా ఇస్తున్నాను.
1.
మౌఖిక సాహిత్యం, లిపుల ఆవిర్భావం
కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు.
మానవజాతి మాటలు మాత్రమే నేర్చిన దశనుంచి తమ స్వంత లిపులను రూపొందించుకునే క్రమం వరకు పయనించిన మౌలిక చరిత్రను రోహిణీ ప్రసాద్ గారి ‘మౌఖిక సాహిత్యం, లిపుల ఆవిర్భావం’ అత్యద్భుతంగా ఒడిసి పట్టుకుంది. మౌఖిక సాహిత్యం, లిపులు చరిత్రలో ఆవిర్భవించిన క్రమానికి ఇదొక పరమ ప్రామాణిక రచన. భాషల, భాషల చరిత్రపై అధ్యయనం చేయాలనుకునేవారికి ఉపయోగపడే అత్యంత ప్రాధమిక, విశిష్ట రచనగా ఈ కథనం చక్కగా ఉపయోగపడుతుంది.
2.
తెలుగు భాష వయస్సెంత?
సురేశ్ కొలిచాల గారు.
http://www.eemaata.com/em/issues/200511/43.html
దాదాపు ఆరేళ్ల క్రితం సురేష్ గారు ఈమాట వెబ్సైట్ కోసం రాసిన ఈ వ్యాసం గత సంవత్సరం మళ్లీ పాఠకులలో విశేష చర్చకు దారితీసింది. తెలుగు భాష చరిత్రకు సంబంధించి ఇదొక ప్రామాణిక రచన.
తెలుగు భాషా చరిత్ర, ద్రావిడ భాషల పరిణామం గురించి కూలంకషంగా, విస్తృతంగా తెలుసుకోవాలంటే ఆంద్రా యూనివర్శిటీ ఆచార్యులు డాక్టర్ వెలమల సింగన గారు రాసిన “తెలుగు భాషా చరిత్ర” పుస్తకం చూడవచ్చు. దాదాపు 700 పేజీలకు పైబడిన ఈ పుస్తకం తెలుగు భాష, ద్రావిడ భాషల చరిత్రకు సంబంధించి తెలుగులో ప్రస్తుతం లభ్యమవుతున్న బృహత్ గ్రంధం. ఈ పుస్తకం గత కొన్ని సంవత్సరాలుగా అనేక ప్రచురణలు పొంది ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఇది అందుబాటులో లేనివారు సురేష్ గారి పై వ్యాసం లింకు తెరిచి తెలుగు భాష చరిత్రపై అత్యంత ప్రాథమిక అంశాలను వివరంగా తెలుసుకోగలరు.
3.
Origin and Evolution of Modern Telugus
యమడా కైకో
జపాన్ లోని ఇబరకీ యూనివర్శిటీ మానవ శాస్త్ర ఆచార్యులు
http://epw.in/epw/uploads/articles/15095.pdf
తెలంగాణా ఉద్యమం రగులుతున్న నేపధ్యంలో గత సంవత్సరం ఆగస్ట్ 21న ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సంచికలో ఈ విశేష రచన ప్రచురించబడింది. రాజకీయ దృక్కోణం నుంచి తెలుగువారి చరిత్రను పరిశీలించిన విశిష్ట వ్యాసం ఇంది. ఇది ఇంగ్లీషులో మాత్రమే పీడీఎప్ రూపంలో అందుబాటులో ఉంది.
గమనిక: ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో గత సంవత్సరం ఆగస్ట్ 21న అచ్చయిన పై కథనం ప్రస్తుతం ఆ పత్రిక ఆన్లైన్ చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వ్యాసాన్నే తెలంగాణాఉత్సవ్ అనే బ్లాగులో కింది పేరుతో యధాతథంగా ప్రచురించారు. తెలుగుప్రజల ఉనికిని రాజకీయార్థిక ప్రాతిపదికన వివరిస్తున్న ఈ వ్యాసాన్ని ఇక్కడ చదవగలరు.
Identity of Modern Telugus – Yamada Keiko
http://telanganautsav.wordpress.com/2010/08/28/identity-of-modern-telugus-yamada-keiko/
4.
మూడు వందల రామాయణాలు
అనువాదం : సురేశ్ కొలిచాల
మూలం : ఎ. కె. రామానుజన్
మనం గర్వించదగ్గ ఒక మేధావి, రచయిత, కవి, లాక్షణికుడు, జానపద సాహిత్య పరిశోధకుడు, బహు భాషావేత్త. ఎ.కె రామానుజన్ గతంలో రాసిన సుప్రసిద్ధ రచన మూడువందల రామాయణాలును డిల్లీ విశ్వవిద్యాలయం ఈమధ్యే చరిత్ర విద్యార్థుల పాఠ్యక్రమం నుంచి తొలగించింది. ఈ మాట వెబ్సైట్ నవంబర్ సంచికలో ఈ వ్యాసం అనువాదం ప్రచురించబడి విశేష చర్చకు పాత్రమైంది. ఆ వ్యాసం లింకు కూడా ఇక్కడ ఇవ్వడమైంది.
ఈ నాలుగు వ్యాసాలు భాషపైనా, సాహిత్య చరిత్రపైనా విశేష ప్రాచుర్యం పొందిన విశిష్ట రచనలు. ఇంతవరకు వీటి గురించి తెలియని పాఠకులకోసం మాత్రమే వీటిని ఈ బ్లాగులో లింకుల రూపంలో ఇవ్వడమైనది.
ఆసక్తి గల పాఠకులు సమయమున్నప్పుడు ఈ బృహత్ రచనలు,వాటిపై వ్యాఖ్యలతో సహా చదవగలరు.
Filed under తెలుగు భాష చరిత్ర | Comments (4)బానిసత్వం తప్పదు గాని మరీ ఇంతగానా..!
సాఫ్ట్వేర్ రంగం అమానుష పనివిధానానికి, శ్రమ అమానవీకరణకు నెలవుగా మారిపోయిన క్రమం గురించి ఇటీవలే చర్చించుకున్నాము. చర్చలో పాల్గొన్న అందరూ దాదాపుగా 8 గంటలనుంచి 12 గంటలు, 15 గంటల వరకు ఈ రంగంలో పెరుగుతున్న పనిభారం గురించి అంగీకరించారు. ఈ రోజు నేను సాక్షి పత్రికలో చదివిన ఈ వ్యాసం ఓ భయంకర సత్యాన్ని చాటుతోంది.
పని చేసుకుంటూ చదువుకునే పరిస్థితులున్న పాశ్చాత్య దేశాలలో, పొదుపు చర్యలు, బడ్జెట్ కోతలు పేరుతో అక్కడి ప్రభుత్వాలు తీసుకువస్తున్న సంస్కరణల కారణంగా విద్యార్థుల జీవితాలు తల్లకిందులవుతున్న వైనం గురించి ఈ వ్యాసం హృద్యంగా వివరిస్తోంది.
బ్రిటన్లో చదువుకుంటూ పార్ట్టైమ్ ఉద్యోగం వెతుక్కుంటున్న మూడు లక్షల మంది విద్యార్థులు తమకు నిరుద్యోగ భృతి లభించాలంటే ఇంటర్న్షిప్ -అప్రెంటిస్షిప్- పేరుతో సూపర్ మార్కెట్లలో, మాల్స్ లలో మూడు వారాలపాటు ఉచితంగా పనిచేసి పెట్టవలసిన వైనాన్ని ఈ వ్యాసం తెలిపింది.
ఉన్నత విద్యావంతులు, సాంకేతిక నిపుణులు, ఉద్యోగాలు కోల్పోయిన సీనియర్లు, తాజాగా మార్కెట్లోకి అడుగుపెట్టిన జూనియర్లు అందరూ బానిసత్వం కంటే అధ్వాన్నమైన ఈ ఉచిత ఇంటర్న్షిప్ల కోసం పోటీలు పడుతున్నారట. ఇలా ఏ పనిచెప్పినా చేయడానికి సిద్ధమవుతుంటే జీతాలిచ్చి ఉద్యోగులను పనిలో పెట్టుకోవడం దండగని యజమానులు బహిరంగంగానే చెబుతున్నారట.
బ్రిటన్ ప్రభుత్వం ప్రజాధనంతో ఇస్తున్న నిరుద్యోగ భృతిని పొందాలంటే విద్యార్థులు బడా కంపెనీలకు బానిస చాకిరీ చేయవలసిన ఆగత్యం ఏమిటి అంటూ ఆ వ్యాసం చివర్లో ప్రస్తావించింది.
సంస్కరణల పేరుతో పొదుపు చర్యల పేరుతో ప్రజల జీవితాలపైనే అన్నిరకాలుగా కోతలు విధిస్తూ పారిశ్రామిక సంస్థల, యజమానుల జోలికి వెళ్లని పాశ్చాత్య ప్రభుత్వాలు ఏ నాగరికతను గొప్పగా చూపబోతున్నాయి?
ఇంటర్న్షిప్ పనికి ఎర్ర ఏగానీ కాదు కదా ఒక పూట భోజనం కూడా పెట్టరట.
మన పల్లెలు గుర్తు వస్తున్నాయి. ఎవరైనా ఊర్లలో గంట పని చేయించుకుంటే డబ్బులు ఇవ్వలేక పోయినా కడుపునిండా అన్నం పెట్టి పంపేవారు. మన కోసం కాసింత పని చేసిపెట్టిన వారిని ఊరికే పంపవద్దన్నది మన గ్రామీణ సంప్రదాయం.
పాశ్యాత్య నాగరికతకు ఏ నీతి కూడా లేకుండా పోతోందా?
ఈ వ్యాసంలోని నిజానిజాలను పాశ్చాత్య దేశాలలో చదువుతున్న మన విద్యార్థులు, మన ఉద్యోగులు తేలిస్తే బాగుంటుంది. అక్కడి పరిస్థితి నిజంగా ఇంత భయంకరంగా ఉంటోందా..
నేటి ప్రపంచంలో బానిసత్వం తప్పదు కాని మరీ ఇంతగానా..!
పరిశీలన కోసం కింది వ్యాసం లింకును చూడండి.
చదువు‘కొనడానికి’ పడుపు వృత్తి!
Filed under అమానుష శ్రమ, ఆన్లైన్ చందమామ రచనలు | Comments (2)
మా అమ్మ పేపరు చదవటం
ఇది అరవై ఏళ్ల క్రితం చందమామలో వచ్చిన ఒక పేజీ కథ. 1953 జనవరి సంచికలోనిది. చందమామ అంతర్గత పనుల్లో భాగంగా దీన్ని ఇవ్వాళ టైప్ చేయవలసి వచ్చింది. చదవగానే నా మనసు ఎక్కడికో వెళ్లిపోయింది. సామాజిక స్పృహ అనే పెద్ద పెద్ద పదాలు వాడకుండానే చందమామలో సమకాలీన సమాజ చిత్రణ ఎంత స్పష్టంగా, ఎంత మనోహరంగా చిత్రించబడేదో చెప్పడానికి ఈ కథ ఈనాటికీ ఒక సజీవ ఉదాహరణ.
కుటుంబ సభ్యులందరి పనులూ చేసిపెట్టే అమ్మ పేపర్ చదవటానికి ఎంత హైరానా పడుతుందో, పని చేసి కోల్పోయిన శక్తిని ఎంతగా కూడగట్టుకోవలసి వస్తుందో, కనీసం పేపరు చదవడానికి కూడా ఆమె ఎంత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుందో విశాఖ పట్నంకి చెందిన లక్ష్మీబాయి గారు 1953 లోనే అత్యద్భుతంగా ఈ చిన్ని కథనంలో వర్ణించారు.
ఇంట్లో అందరూ విసిరేసిన పేపర్ ముక్కలను ఏరుకోవడం, పరుపుమీదికి చేరాక కళ్లద్దాలు మరిచిపోవడం, ఇల్లంతా వెతకడం, తీరా కళ్లద్దాలు దొరకటం, తర్వాత పేపర్ కనబడకుండా పోవడం. దిండు కింద పెట్టి మర్చిపోవడం. ఇన్ని కష్టాలు పడ్డాక పేపర్ చదవడం అనే పని మొదలు పెట్టి చేతిలో పేపరూ, ముక్కుమీద కళ్లద్దాలూ పెట్టుకుని హాయిగా నిద్రపోవడం. తీరా ఆ పేపరు ఆరోజుదు కాదు నిన్నటిదో మొన్నటిదో అని గ్రహించి కుటుంబ సబ్యులంతా నవ్వటం. కాని ఆ పాత వార్తలనే అమ్మ మర్నాడు పూస గుచ్చినట్లు చెప్పడం..
తెల్లారు జామునే లేచి పని చేసి కుటుంబాన్ని లేపి, బయటకు పంపే అమ్మ పేపర్ చదవడానికి ఎంత కష్టపడుతుందో మరి. అంత పని చేసి అమ్మకు నిద్ర రాదంటే రాదా మరి. “ఇంట్లో కూర్చుని ఏం చేస్తావు నువ్వు, నువ్వు చేసే పని ఏమిటి ఇంతకూ..’ అంటూ మగ మహారాజులం ఎన్ని లక్షలసార్లు మన అమ్మలనూ, మన జీవన సహచారిణిలనూ ఇన్నాళ్లూ అని ఉంటామో. అమ్మ కష్టాలు అమ్మకే అర్థమవుతాయోమో మరి.
మనుషులు చేసే శ్రమలన్నింటిలోనూ నిస్సారమైందీ, మనిషిని నిర్వీర్యం చేసేదీ, సమాజం దృష్టిలో ఎలాంటి విలువ లేనిదీ ఇంటిపనే అని లెనిన్ వందేళ్ల క్రితం ఢంకా భజాయించి చెప్పాడు. దానికి పరిష్కారంగా మహిళలను పెద్ద ఎత్తున సామాజిక ఉత్పత్తి కార్యకలాపాల్లోకి తీసుకురావాలని, ఉయ్యాలలూపే చేతులు రాజ్య వ్యవహారాలలో పాలు పంచుకోవాలని లెనిన్ ఒక మహత్తర స్పప్నాన్ని అప్పట్లోనే ఆవిష్కరించారు. దానికనుగుణంగా అక్టోబర్ విప్లవం విజయవంతమయ్యాక సోవియట్ రష్యాలో పురుషులతో సమానంగా స్రీలు సామాజిక ఉత్పత్తి కార్యకలాపాల్లో పాలు పంచుకున్నారు.
ప్రపంచ చరిత్రలో మహిళలకు ఉత్పత్తి వ్యవహారాల్లో సమాన భాగస్వామ్యం కల్పించిన మొట్ట మొదటి దేశంగా సోవియట్ యూనియన్ నిలిచింది కూడా. హిట్లర్ దండయాత్ర కాలంలో ఒక తరం యుపకులు మొత్తంగా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టవలసిన విపత్కర పరిస్థితుల్లో సోవియట్ మహిళలు దేశంలోని మొత్తం కర్మాగారాలలో ఉత్పత్తి సజావుగా కొనసాగే పాత్రను చేపట్టారని అప్పట్లో ఫ్యాక్టరీల్లో పని చేసిన స్ర్తీపురుషుల నిష్పత్తి 70:30గా ఉండేదని గణాంకాలు చెబుతున్నాయి. కాని ఆ స్వర్గం తనంతట తాను కూలిపోయింది. కారణాలు లక్షోపలక్షలు.
ఆశ్చర్యకరమైనదేమిటంటే ఇంట్లో మహిళలు చేసే వంటపని లోని శ్రమను గుర్తించి దానికి 3 వేలరూపాయల ఆర్థిక విలువను లెక్కగట్టి చెప్పడానికి భారత సర్వోన్నత న్యాయస్థానానికి దాదాపు 65 సంవత్సరాల సమయం పట్టింది. మన అమ్మ.. మనందరి అమ్మ… కుటుంబం కోసం తన శక్తియుక్తులను ఫణంగా పెట్టేది. తన జీవితం మొత్తాన్ని కుటుంబంకోసం త్యాగం చేసేది. నా దృష్టిలో పేపరు చదువుతూ అలాగే నిద్రపోయే అమ్మ మన సామాజిక జీవిత చిత్రణకు నిలువెత్తు దర్పణం. సమాజంలో సగభాగానికే కాదు… యావద్దేశానికే అన్నం వండి పెడుతున్న మహాత్మురాలు.
పైసా ఆదాయం అడగకుండానే, కుటుంబానికి సమస్త చాకిరీలు చేసిన, చేస్తున్న జీవిత ఔన్నత్యానికి మన కాలపు ప్రతీక అమ్మ. మన సహచరికి కూడా ఇది వర్తిస్తుంది. కుటుంబంలోపల, ఇంకా చెప్పాలంటే మన వెనుక ఉన్న అమ్మలూ, అర్దాంగినులూ మన వ్యక్తిగతానికి సంబంధించిన అన్ని పనులూ చాకరీలు చేసిపెడుతూ సామాజిక మానవులుగా, ఉత్పత్తిలో పాలుపంచుకునే మానవులుగా మనల్ని తీర్చిదిద్దుతుంటారు. మనం సమాజ కార్య కలాపాల్లో పాల్గొంటూ విశ్రాంతి సమయంలో అపుడప్పుడూ తీరిగ్గా సిద్దాంతాలు కూడా చేస్తుంటాం.
తీరా మహిళ బయట పనిచేయక తప్పని అనివార్య పరిస్థితులు వచ్చి పడిన నేటి కాలంలో కూడా ఇంటికి రాగానే వంటపని, ఇంటిపని వంతు మహిళ స్వంతంగానే ఉంటోంది. “అయినా ‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తావు నువ్వు, నువ్వు చేసే పని ఏమిటి ఇంతకూ..’ అని మనం అంటూనే ఉంటాము. మగ మహారాజులం కదా. ఆమాత్రం అనకపోతే మన మగతనం ఏమైపోవాలి..
చాకిరీ చేసే అమ్మా, ఇంటిల్లిపాదినీ బయటపనులకు తయారు చేసి పంపే అమ్మా, పేపరు చదువుతూ, చదువుతూ అలానే నిద్రపోయే అమ్మా.. నువ్వు చదువుతూనే నిద్రపోవే అమ్మా! ఈ ప్రపంచం ఏమీ మునిగిపోదు.
(అమ్మ గొప్పతనాన్ని, అమ్మతనం లోని విలువను మరోసారి గుర్తుకు తెచ్చిన చందమామ అలనాటి కథకు జోహార్లు.)
ఆ అలనాటి అపురూప కథ పూర్తి పాఠాన్ని ఇక్కడ చదవండి.
మా అమ్మ పేపరు చదవటం
మా అమ్మ సాయంత్రం పూట పేపరు ఎలా చదువుతుందో ఎప్పుడైనా చూశారూ? ఏ సంగతి మరిచినా అమ్మ పేపరు చదవడం మాత్రం మరవదు. పాపం, ఇంటిపనంతా ముగించుకుని అమ్మ హాల్లోకి వచ్చేసరికి పేపరు పేజీలన్నీ ఒక్క చోటున ఉండవు. నాలుగు వేపులా నాలుగు కాగితాలూ ఇంట్లో పడి ఉంటాయి. మేడమీద అన్నయ్య చదివి అక్కడే పారేసిన మొదటి పేజీ, అక్కయ్య చదివిన మధ్యపేజీ, ఇవన్నీ ఏరుకుని వచ్చి అమ్మ పడుకుని చదవడానికని ఆసక్తితో పరుపుమీదకు వెళుతుంది.
అమ్మకప్పుడు జ్ఞాపకమొస్తుంంది. తన కళ్లద్దాలు మరచిపోయనట్లు. వాటికోసరం ఇల్లంతా వెతుకుతుంది. ఇటు అటు ఇల్లంతా ఒక పదిహేను నిమిషాలు గాలించిన తర్వాత అమ్మకు అప్పుడు జ్ఞాపకమొస్తుంది ఎక్కడుంచిందీ, ఎలాగో కళ్లద్దాల పెట్టె దొరుకుతుంది. కాని, అది తీసి చూసేసరికి అందులో కళ్లద్దాలు ఉండవు. మళ్లీ ఐదు నిమిషాలు గాలించుతే కళ్లద్దాలు దొరుకుతాయి. ఆఖరుకి పరుపు దగ్గిరికి వెళితే, పేపర్లు ఏవి! ఇక్కడే పెట్టానే అనుకుంటుంది.
కొంత సేవు వెతికిన తర్వాత కళ్లద్దాల కోసం వెళ్లేముందు ఆ పేపర్లు తలగడ కిందనే పెట్టానని అప్పుడు జ్ఞాపకమొస్తుంది. ఇన్ని బాధలు పడి. ఎలాగో పేపరు చదవడానికి మొదలు పెడుతుంది. ఒక్క ఘడియ చదువుతుందో లేదో చేతిలో పేపరూ, ముక్కుమీద కళ్లద్దాలూ పెట్టుకుని హాయిగా నిద్రపోతుంది.
ఇంతలో మానాన్న వస్తారు. మమ్మల్ని అందరినీ పిలిచి, ఒక్కసారిలా వచ్చి చూడండి, అంటారు ఆ దృశ్యం చూసేసరికి మాకు నవ్వాగదు. ఇంతకూ అసలా పేపరు ఆ రోజుదే కాదు. నిన్నటిదో, మొన్నటిదో తారీకు చూడకుండానే అమ్మ అంత ఆసక్తితో పాత పేపర్లే చదివేస్తూ ఉంటుంది.
అన్నిటికంటే ముఖ్యమైన విష యం ఏమిటంటే, ఆ మర్నాడు అమ్మ మాతో పేపర్లో ఉండే వింతలూ, విశేషాలూ, వార్తలూ చక్కా పూసగుచ్చినట్లు చెపుతుంది. మరి ఎలా చెప్పగలుగుతుంమదో ఏమో..!
-లంకలపల్లి లక్ష్మీబాయి – వాల్తేరు
తొమ్మిది గంటలతోనే అంతమవుతున్న నరకం
“ఇండియా లో సాఫ్ట్-వేర్ రంగం : where are we going?” అనే శీర్షికతో మిత్రులు బొందలపాటి ప్రసాద్ గారు రెండు రోజుల క్రితం తమ బ్లాగులో టపా ప్రచురించారు. ఎనిమిది గంటల పని తొమ్మిది గంటల పనిగా మారిన సాఫ్ట్వేర్ రంగంలో మారిన పరిస్థితులను 150 ఏళ్ల క్రితం కారల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రచనలో ప్రతిపాదించిన సూత్రీకరణతో అన్వయిస్తూ ప్రసాద్ గారు ఒక అర్థవంతమైన చర్చను లేవనెత్తారు.
కాస్త ఆలస్యంగా స్పందిస్తూ ఇవ్వాళ తన బ్లాగులో నేను పోస్ట్ చేసిన వ్యాఖ్యను అందరి పరిశీలన కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాను. ఇండియా లో సాఫ్ట్-వేర్ రంగం అనే ప్రసాద్ గారి పూర్తి టపా కోసం ఈ కథనం కింది లింకులో చూడండి.
మార్క్సిజం అమలులో పరిమితులుండటం గురించి చెప్పాల్సి వస్తే.. సర్వకాలాల్లోనూ, సకల సమాజాలకూ అన్వయించదగిన, అమలు చేయదగిన సర్వ సమగ్ర సంపూర్ణ సిద్ధాంతం ఈ ప్రపంచంలోనే కాదు ఏ ప్రపంచంలో కూడా సాధ్యం కాదు అన్నది బహుశా అందరికీ తెలిసిన విషయమే. మార్క్సిజం కూడా దీనికి లోబడేదే.
మార్క్స్ సైద్ధాంతిక వైధానికాన్ని రాజకీయంగా, సామాజికంగా అమలు పర్చడంలో గత శతాబ్దం పొడవునా వివిధ దేశాలలో కొనసాగిన ఆచరణ మానవ సమాజానికి కొన్ని అద్భుత ప్రయోగాలను అందించింది. కాని అదే సమయంలో విప్లవ విజయానంతరం సోషలిస్టు “రాజ్యం” ఏర్పడిన క్రమంలో దాని అన్వయంలో జరుగుతూ వచ్చిన తీవ్రమైన పొరపాట్లు ఆ సిద్ధాంతపు సమగ్ర దృక్పధంపైనే అనుమానాల నీలి నీడలు ప్రసరించడానికి అవకాశమిచ్చాయన్నది కాదనలేని సత్యం. ఈ విషయంలో ఇక్కడి చర్చలో పాల్గొన్న మిత్రుల స్పందనను తృణీకరించనవసరం లేదు.
కాని వ్యవసాయిక, చేతి ఉత్పత్తుల దశను దాటి పెట్టుబడి ఆధారిత ఉత్పత్తి విధానం సమాజ ఉనికిలోకి వచ్చి, బలపడుతున్న దశలో మార్క్స్ చేసిన సూత్రీకరణలు ఈనాటికీ మన సమాజానికి అన్వయించబడుతున్నాయా లేదా అన్నదే మన చర్చకు ప్రాతిపదిక కావాలి. ఈ విషయంలో మీరు మార్క్సిజాన్ని సాఫ్ట్వేర్ రంగ పరిస్థితికి అన్వయించి చెప్పిన అభిప్రాయాలు చాలా విలువైనవి.
“అప్పట్లో రోజుకి ఎనిమిది గంటలే ఆఫీసు లో ఉండేవాళ్ళం… టెక్నాలజీ పెరిగితే, పని తగ్గి మనిషి సుఖపడాలి. జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి. మరి ఇప్పుడు సాఫ్ట్-వేర్ ఇంజినీర్లు, మునుపెన్నడూ లేనంత కష్టపడుతున్నారు. ఒత్తిడికి లోనవుతున్నారు. పని గంటలు తొమ్మిదికి పెరిగాయి.”
మీ వాక్యాలకు సంబంధించి ఒక చిన్న వివరణ. మీరు ఎనిమిది గంటల పనిని, ఇప్పుడు తొమ్మిది గంటల పనినీ, సౌకర్యాల రూపంలో ‘పార్టీలు’ పరమపదించిన పనినీ చవిచూశారు. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్లో భాగంగా మీ జీవితం ఇలా సాగింది సాగుతోంది.
“క్లయింట్లు కంపెనీలను పిండుతుంటే, కంపెనీలు ఉద్యోగులను పిండుతున్న” కొత్త బంగారులోకంలో ఈ తొమ్మది గంటల పని కూడా సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్లపై ఎంత భౌతిక, మానసిక ఒత్తిడిని పెంచిందో మన కళ్ళముందే ఘోరాతి ఘోరాతిమైన అనుభవాలను వార్తలుగా చూస్తున్నాము. మీది షిప్టుల వారీ పని కాబట్టి నరకం మీకు తొమ్మిది గంటలతోనే అంతమవుతోంది. (మీ ఒత్తిడికి ప్రతిఫలంగా మీరు సాధారణ ఉద్యోగులు కలలో కూడా ఊహించనంత అధిక మొత్తాలను ఈ మాంద్య పరిస్థితుల్లో కూడా పొందుతూండవచ్చు.)
కాని కాల్ సెంటర్లు, డేటా ఎంట్రీ బిజినెస్లు, సాఫ్ట్వేర్ లోకలైజేషన్ ప్రక్రియల వంటి రంగాలలో పనిచేస్తున్న వేలాది, లక్షలాదిమంది పరిస్థితి ఏమిటి? సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ రంగం అనేది ట్రేడ్యూనియన్లు పెట్టుకోవడానికి వీలులేని ఆధునిక అసంఘటిత రంగం కిందికే వచ్చినప్పటికీ, సాఫ్టవేర్ ప్రోగ్రామింగ్పై ఆధారపడి ఉనికిలోకి వచ్చిన సాఫ్ట్వేర్ లోకలైజేషన్ వంటి రంగాలు అంతకంటే మించిన అమానుష పని పరిస్థితులను సృష్టిస్తున్నాయి.
ఎవరి విషయమో వద్దు. నా విషయంలోనే చూద్దాం. నేను మూడేళ్లకు ముందు భారతదేశంలో 9 ప్రాంతీయ భాషా వెబ్సైట్లను నడుపుతున్న ఒక ఉత్తరాది సంస్థ చెన్నయ్ శాఖలో పనిచేశాను. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి 7 గంటల వరకు అంటే 10 గంటల పాటు సాధారణ పనివేళలయితే సరిగ్గా క్లయింట్ నుంచి ఒక అర్జెంట్ పని అంటూ సరిగ్గా 7 గంటలకు హెడ్డాఫీస్ నుంచి ఈమెయిల్ వస్తుంది.
అంతకుముందు చేసిన మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్, లేదా యాహో, మోటరోలా, నోకియా, రిలయెన్స్ లోకలైజేషన్ -తేలిగ్గా చెప్పాలంటే అనువాదం లేదా స్థానికీకరణ- పనులను వెంటనే మోడిపై చేసి పంపాలంటూ తాఖీదు వస్తుంది. ‘ఇట్ ఈజ్ అప్రిషియబుల్ టు డూ దిస్ వర్క్ టుడే’ అని ఇక్కడి వారి సన్నాయి నొక్కులు కూడా ఉంటాయనుకోండి. ఫలితం ఏమిటంటే పదిగంటల రోజువారీ పనికి అదనంగా ఏ రాత్రి రెండు గంటల వరకో పని పూర్తి చేసి అప్పుడు ఇంటికి వెళ్లడం లేదా అక్కడే పడుకుని తెల్లారి లేచిపోవడం. ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు సంవత్సరాలు ప్రతి నెలలో ఇలా 16 గంటలు పనిచేసే అనుభవాలను పదే పదే ఎదుర్కొన్నాము మేము.
పైగా, 2005లో మైక్రోసాఫ్ట్ కంపెనీ, ప్రాంతీయ భాషల్లో లెక్సికాన్ -పదకోశం- తయారీ కోసం మా సంస్థకు ప్రాజెక్టు ఇస్తే దాంట్లో భాగంగా తెలుగులో రెండున్నర కోట్ల పదాలు, పద వ్యుత్పత్తి రూపాలు – base words and generated words – రూపొందించడానికి ఐదున్నర నెలలపాటు సెలవు కూడా తీసుకోకుండా మా తెలుగు lexicon టీమ్ పనిచేసింది. ప్రారంభంలో ఈ లెక్సికాన్ టూల్తో ఎలా పనిచేయాలో, సరైన రూపంలో పద వ్యుత్పత్తి రూపాలను ఎలా రూపొందించాలో తెలియక పని మందగించిపోయింది. పలితంగా చివర్లో లీవు లేకుండా పనిచేయవలసి వచ్చింది.
ఒక అరుదైన రికార్డు సాధించామన్న పేరు రావడం.. 90 శాతం వరకు తెలుగు నామవాచక, క్రియాపదాలను ఈ టూల్తో ఒడిసిపట్టామన్న గర్వం మాకు మిగలడం. మా ప్రమోషన్, శాలరీ హైక్ వంటివి పెరగడానికి ఈ పని దోహదం చేయడం జరిగిందనుకోండి. తీరా చూస్తే మైక్రోసాఫ్ట్ ఈ రెండున్నర కోట్ల పదాల, పదరూపాల లెక్సికన్ ప్రాజెక్టును అటకెక్కించేసింది. వ్యక్తులుగా మాకూ, సంస్థగా మైక్రోసాప్ట్కూ, తెలుగు సమాజానికి కూడా ఏ రకంగా కూడా ఈ బృహత్తర పనివల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఇది వేరే విషయం. కాని మనుషులుగా మేం కోల్పోయిందేమిటి?
ఇలా మనుషులను పది గంటలపాటు, పద్నాలుగు పదహారు గంటల పాటు రొడ్డ కొట్టుడు పనిచేయిస్తే మనుషులు ఎలా మిగులుతారో, ఏమైపోతారో, వారి చుట్టూ అల్లుకున్న కుటుంబ, మానవీయ సంబంధాలు ఎలా అదృశ్యమవుతాయో చెప్పవలసిన పనిలేదు. ఇంత పని ఎవరు చేయమని చెప్పారు అని ఎవరైనా నిలదీయవచ్చు. మేం కాకపోతే మరొకరు ఈ పని చేస్తారు. ఆధునిక పెట్టుబడిదారీ విధానం కూడా తనకు అవసరమైన కార్మిక శక్తిని రిజర్వుగా పెట్టుకోవడంలో పనిచేయలేని, పని చేయనని మొరాయించే కార్మికులను తొలగించి వారి స్థానాన్ని రిజర్వు కార్మికులతో భర్తీచేయడంలో ఆరితేరిపోయింది.
పెట్టుబడిదారీ వ్యవస్థ వికసిస్తున్న కాలంలో తొలి తరం ప్యాక్టరీల్లో, గనుల్లో పిల్లలను, పెద్దలను కూడా పదహారు గంటలపాటు పనుల్లోకి దింపి యజమానులు సాగిస్తున్న అమానుష దోపిడీని బూర్జువా వర్గ ప్రతినిధులే ఖండించక తప్పని అనివార్య పరిస్థితుల్లో, పదహారు గంటల పనివిధానంలోని అమానుషత్వాన్ని బలంగా ఎత్తిచూపి 8 గంటల పనివిధానాన్ని నాటి సమాజంలో అమలుచేయాలని కోరిన వాడు కారల్ మార్క్స్. ఇది సామాజిక ఆమోదం పొంది చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎనిమిది గంటల పని విధానం 20 శతాబ్దిలో ఉనికిలోకి వచ్చింది.
కాని ఇప్పుడు జరుగుతున్నదేమిటి? సమాజం మొత్తంగా పోరాడి సాధించుకున్న 8 గంటల పనివిధానం ఇవ్వాళ తలకిందులైపోయింది. “టెక్నాలజీ పెరిగితే, పని తగ్గి మనిషి సుఖపడాలి. జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి.” అనే మనిషి ఆశ, ఆశయం సరిగ్గా తలకిందులైపోయి ఆఫీసులో, ఇంట్లో కూడా పనిని గురించే ఆలోచించవలసిన భయానక పరిస్థితులు మనకళ్లముందే ఏర్పడిపోయాయి.
మా సీనియర్ ఒకరు మా సంస్థను వీడి అయిదేళ్ల క్రితం మరొక సాఫ్ట్వేర్ క్వాలిటీ ప్రాసెస్ కంపెనీకి అధిక జీతంపై ఆశతో వెళ్లారు. రెండు నెలల తర్వాత మా అందరినీ కలవాలని మా ఆఫీసుకు వచ్చారు. ఎలా ఉంటున్నారు అని అడిగితే అయిదు పనిదినాలు, రెండు వారాంతపు సెలవులు అంటూ నిట్టూర్చారు. ఎందుకీ నిట్టూర్పు అని అడిగితే వచ్చే వారం ఆఫీసులో ఎవరి కొంపలు అంటుకుపోతాయో అని శని, ఆదివారాల్లో నిద్ర కూడా పట్టడం లేదంటూ వాపోయారు. ఇలాంటి పని ఒత్తిడి, ఉద్యోగ భయాలు అందరికీ ఇదే విధంగా వర్తిస్తున్నాయని కూడా చెప్పలేము. కాని సమాజం ఎన్నటికీ కోరుకోకూడని పని పరిస్థితులు వచ్చేశాయి.
కార్మికుడి అదనపు శ్రమసమయాన్ని, విశ్రాంతి సమయాన్ని కూడా పెట్టుబడిదారుడు ఉపయోగించుకుంటున్న క్రమంలోనే పెట్టుబడి పోగు పడుతోందని మార్క్స్ అప్పట్లో సూత్రీకరించాడు. ఇది ఈరోజుకీ వాస్తవంగా ఉందా లేదా తప్పుగా నిరూపించబడిందా అనేదే మన పరిశీలనాంశంగా ఉండాలి. మార్క్స్ చెప్పినదాంట్లో మార్క్సిజంలో పరిమితులు ఉంటే ఉండనివ్వండి. ఎవరి కొంపలూ మునగవు. కాని ఈరోజు సాఫ్ట్వేర్ కార్మికులు -వైట్ కాలర్ ఉద్యోగులే కావచ్చు- అనుభవిస్తున్న జీవిత విషాదాన్ని, అనవసర విషాదాన్ని మార్క్స్ ఆరోజే ఉత్పత్తి క్రమంలో పని పరిస్థితుల పునాదిగా ఊహించాడు. ఇది ఈనాటికీ నిరూపితమవుతున్న సత్యం.
మా పక్కవీధిలోని చాకలాయన రోజూ ఉదయం 7 గంటలకు కొట్టు తెరిచి సాయంత్రం 6 వరకు పనిచేస్తాడు. అది కూడా గొడ్డు చాకిరీయే అనుకోండి. తనకోసం, తన జీవిక కోసం ఆ గొడ్డుచాకిరీకి తలవంచే ఆయన సరిగ్గా రాత్రి 8 గంటలయ్యేసరికి భోజనం ముగించుకుని కొట్టు ముందు బల్లమీదే పడుకుని ఆదమరిచి నిద్రపోతుంటాడు. పదే పదే ఈ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు నాకు స్పురించేదొకటే. చీకూచింతా లేని ఈ చాకలాయన జీవితం గొప్పా లేదా ధనసంపాదన పేరుతో, బతకాలంటే పరుగుపందెం తీయక తప్పదనుకుంటూ ఒళ్లూ, మనసూ కూడా హూనం చేసుకుంటున్న మనలాంటి వారి జీవితం గొప్పా అని.
అమెరికా వాడో లేదా ఏ ఇతర ఔట్ సోర్సింగ్ దేశమో మీకు, నాకు పని అప్పగించి నిద్రపోతాడు. మనం నిద్రమానుకుని పనిచేసి వాడికి అప్పగించి తర్వాత పగటి పూట నిద్రపోతాము. ఇది నిజంగా ‘రాక్షస’ పని. మానవ శారీరక, సహజ ప్రక్రియలకు భిన్నమైన పనిపద్ధతులకు మనం అలవడుతున్నాము. చివరకు ఎవరికోసం అంటే మనకోసం కాదు. ఎవడికోసమో మన జీవితంలో ప్రకృతి సహజమైన నిద్రాసమయాన్ని ధ్వంసం చేసుకుని భార్య పగలూ, భర్త రాత్రీ పనిచేసే పరిస్థితుల్లో కూరుకుపోతున్నాము. సింపుల్గా చెప్పాలంటే చాకలాయన నేటికీ తన కోసం మాత్రమే తన పనిచేసుకుపోతున్నాడు. మనం వ్యాపారుల కోసం, కంపెనీల కోసం పనిచేస్తూ జీవితం నుంచి పరాయీకరణ పాలవుతున్నాము.
“….in proportion as the use of machinery and division of labour increases, in the same proportion the burden of toil also increases, whether by prolongation of the working hours, by the increase of the work exacted in a given time or by increased speed of machinery, etc”
అందుకే మార్క్సిజంలోని పరిమితులను మనం తప్పక పరిశీలిద్దాము. కాని శ్రమవిభజన లక్షోపలక్షలుగా విస్తరించుకు పోతున్న క్రమంలో మనుషుల మీద పడుతున్న అనంత భారం గురించి మార్క్స్ నూటయాభై ఏళ్ల క్రితం కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో చెప్పిన పై మంత్ర సదృశ వాక్యాలలోని సత్యాన్ని కూడా అంగీకరిద్దాము. దీనికి పరిష్కారాన్ని వెదికే క్రమంలోనే మనం విభేదించవచ్చు.
వ్యవసాయం గిట్టుబాటవుతున్న పరిస్థితులు ముప్పయ్యేళ్లకు ముందున్న విధంగా నేడు కూడా కొనసాగుతున్నట్లయితే నేను పల్లె విడిచి మహానగరాల దారి పట్టి ఉండేవాడిని కాదనుకుంటాను. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అనుభవంతో చెబుతున్నాను. కరెంట్ సక్రమంగా అంది, నీటి వనరులు సక్రమంగా లభ్యమై, కాసింత గిట్టుబాటు ధరలకు గ్యారంటీ ఇచ్చే పరిస్థితులు పల్లెల్లో ఇప్పటికీ ఉంటే, నీ పంట నువ్వు పండించుకుని నీ కూరగాయలు నీవు పండించుకుని బతికే వ్యవసాయం కంటే గౌరవనీయమైన వృత్తి ఈ ప్రపంచంలో మరొకటుండదనే నా దృఢాభిప్రాయం.
కాని పైన చెప్పిన వాటిలో వేటికీ గ్యారంటీ కనబడని రోజుల్లో మా పెద్దవాళ్లు ‘సేద్యంతో బతకలేరు పోయి చదువుకోండిరా’ అని పట్టణాలకు తరిమారు. వ్యవసాయ రంగ దుస్థితిపై వాళ్ల అంచనా ఎంత సత్యభూయిష్టమైందో మనందరికీ తెలుస్తూనే ఉంది. అందుకే మనం ఇప్పుడిలా బతుకుతున్నాము.
బతకాల్సి వస్తోంది అంటే ఇంకా బాగుంటుందేమో..
ఈ టపాకు మూలమైన పూర్తి కథనంకోసం కింది లింకులో చూడగలరు.
ఇండియా లో సాఫ్ట్-వేర్ రంగం : where are we going?
Filed under పని పరిస్థితులు | Comments (5)అంపశయ్య మీద ఉన్న బాలసాహిత్యాన్ని రక్షించుకుందామా!!!
ప్రియ మిత్రులకు అభివందనాలు,
మీకు భుజాన భేతాళుడిని చురకత్తిలాంటి చూపులతో మెలితిరిగిన కోరమీసంతో గంభీరంగా స్మశానంలోనుండి నడిచివెళ్తున్న విక్రమార్కుడు గుర్తున్నాడా?
మీకు ఒంటికన్ను రాక్షసుడు, అతనితో సాహసోపేతంగా యుద్ధం చేసి రాజకుమారిని ఆమె రాజ్యానికి తీసుకుని వస్తున్న సాహస వీరుడు గుర్తున్నాడా?
పోనీ మీకు మెలితిరిగిన తోకతో చూడగానే భయపెట్టేలా కాక ముద్దుగ అనిపిస్తూ, చెడ్డ అత్తగారి భరతం పట్టి మంచి కోడలికి సహాయం చేసిన అందమైన దెయ్యాలు గుర్తున్నాయా?
వీటిలో ఏ ఒక్కటి గుర్తున్నా మీరు చిన్నప్పుడు నాలాగనే ఖచ్చితంగా ఏ చందమామనో, బొమ్మరిల్లునో పదిలంగా దాచుకుని చదివిన అదృష్టవంతులు అయ్యి ఉంటారు. మరి మన ముందు తరం సంగతో ఇప్పటి పిల్లలకు బాల సాహిత్యం అంటే హ్యారీ పాటర్, టింటిన్, సిండ్రెల్లా మరోటో మరోటో మనది కాని సాహిత్యమే కానీ మనము గ్రోలిన రుచులు వారికేవి?
మంచి దెయ్యాల గురించి, సాహస వీరుల గురించి, భేతాళుడి గురించి వారికి తెలిసే అవకాశం ఎంత ఉంది, ఆ అవకాశం వారికి మనం ఎంతవరకూ ఇస్తున్నాము ఇంగ్లీషులో చదివితే గ్లోబల్ మార్కెట్ లో విలువ పెరుగుతుంది, నిజమే కానీ తెలుగులో అదీ వారి మాతృభాషలో అందమైన కథలున్నాయి, వాటిలో నీతితో పాటు బ్రతుకు మార్గాలు ఉంటాయని కానీ అసలు తెలుగులో కథలు ఇంత బాగుంటాయి అన్న అనుభవం కానీ వారికి మిగులుస్తున్నామా?
నా దృష్టిలో ఈ తరం పిల్లలు అత్యంత దురదృష్టవంతులు, మాతృ భాషలో మాట్లడటమే మహాపరాధంగా భావించే తల్లితండ్రులు, బడి యాజమాన్యాలు ఒకవైపైతే, మనసుని కట్టిపడేసే బాల సాహిత్యం అందుబాటులో లేకపోవటం మరొకవైపు. ఇప్పటి తరానికి ఆ లోటు ని పూడ్చటానికీ, ఆనాటి రుచులని అందించటానికి మొక్కవోని దీక్షతో నడుము కట్టారు రచన పత్రిక నిర్వాహకులు శాయి గారు.
ఈ బృహత్కార్యంలో భాగంగా ఆయన దాసరి సుబ్రమణ్యంగారు ఒకప్పుడు యువ, బొమ్మరిల్లు పత్రికలకోసం రచించిన అగ్ని మాల, మృత్యులోయ సీరియల్స్ను విడి సంపుటాలుగా ఈ యేడాది మొదట్లో మన ముందుకు తెచ్చారు. ఈ సారి అప్పట్లో ప్రమోద పిల్లల కథలో వచ్చిన కపాల దుర్గం సీరియల్ వచ్చే జనవరి నాటికి ప్రచురించబోతున్నారు. అలాగే దాసరిగారు చందమామకు కాకుండా ఇతర పత్రికలలో రాసిన మరొక ఇరవై సీరియల్స్ ను లభ్యత మేరకు మన ముందుకు తెచ్చే మెగా ప్రాజెక్టు కు సిద్ధ పడ్డారు.
ఈ బృహత్కార్యం లో ఆయనకు తెలుగు భాష మీద బాల సాహిత్యం మీద మక్కువ ఉన్న అభిమానుల అండదండల అవసరం చాలా ఉంది. మనం చేసే ఏ చిన్న సహాయమైనా చాలా విలువైనదే.
మీకు వీలున్నంత వరకూ ఎంత చిన్న ఆర్ధిక సహయమైనా సరే అది మనం ఒక రోజు ఆటో ఎక్కితే ఖర్చయ్యేంత చిన్నదైనా, ఒక రోజు ఏ పిజా హట్ కో వెళ్ళి సంబరాలు జరుపుకున్నంత పెద్దదైనా, మీకు తోచిన సహాయం అందించి ఈ కార్యాన్ని విజయవంతం చేయండి. బాల సాహిత్యాన్ని బ్రతికించండి.
ఈ లేఖని చదివి చెత్త బుట్ట లో కి నెట్టివేయకుండా మీకు తెలిసిన నలుగురు మిత్రులకి పంపండి. మనం నిత్యం ఎన్నో స్పాం లేఖలని పేరు పేరునా ఎందరో మితృలకి పంపుతాము, దానివల్ల ప్రయోజనం ఉన్నా లేకపోయినా. ఈ లేఖ చదివి ఏ కొంతమంది స్పందించినా మన భావి తరానికి చక్కటి సాహిత్యాన్ని వారు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా బహుమతిగా అందించిన వారము అవుతాము. ఆసక్తి ఉన్నవారు వాహిని బుక్ ట్రస్ట్ (vahini book trust)పేరిట చెక్ పంపించగలరు
స్పందించిన ప్రతివారికీ ముందస్తుగానే కృతజ్ఞతలు తెలుపుతూ
మీ నేస్తం
సాయి లక్ష్మి కోరాడ.
నేనెవరు
నేను వృత్తిరీత్యా సాంకేతిక నిపుణురాలిని, ప్రవృత్తి రీత్యా పుస్తకాభిమానిని, స్వస్థలం భాగ్యనగరం. నాతరం పిల్లలు చాలా మందిలాగానే తెలుగులో పుట్టి, పదవ తరగతి వరకూ తెలుగు మాధ్యమంలో చదివి, ఆ తెలుగు తీయతనానికి ముగ్ధురాలినై తెలుగు సాహిత్యం మీద మక్కువ పెంచుకున్న సామాన్యురాలిని. తెలుగులో ఉత్తమ సాహిత్యం కరువైపోతోంది అని బాధపడుతూ కూర్చోకుండా నాకు చేతనైనంతలో ఏదైనా చేయాలి అని తాపత్రయ పడుతున్న పాఠకురాలిని, అంతే.
(“నాతరం పిల్లలు చాలా మందిలాగానే తెలుగులో పుట్టి, పదవ తరగతి వరకూ తెలుగు మాధ్యమంలో చదివి, ఆ తెలుగు తీయతనానికి ముగ్ధురాలినై తెలుగు సాహిత్యం మీద మక్కువ పెంచుకున్న సామాన్యురాలిని.”
సాయి లక్ష్మి గారూ,
తెలుగును, బాలసాహిత్యాన్ని కలకాలం బతికించే చిన్ని మాటలండీ ఇవి.
చందమామ పట్ల, ఉత్తమ సాహిత్యం పట్ల మీ అభిమానం, ఆదరణ కొనసాగుతుందని, ఇలాగే కొనసాగాలని మనసారా కాంక్షిస్తూ..
మీకూ, మిత్రులకూ హృదయపూర్వక కృతజ్ఞతలు.
రాజు)
రచన శాయి గారి చిరునామా, ఈమెయిల్, ఫోన్
Y.V.S.R.N. Talpa Sai
Rachana magazine
1-9-286/2/p
yadlapati vari illu
vidyanagar,
near to Ramnagar Gundu
hyderabad – 500044
040-27071500
040-27077599
99485 77517
Emails
rachanapatrika@gmail.com
rachanapatrika@hotmail.com
www.rachana.net
Vahini book trust, 1-9-286/3, Vidya Nagar, Hyderabad -500044
NB: ఈ కథనం ఈ బ్లాగులో ప్రచురించడానికి వెనుక నేపథ్యం గురించి కామెంట్ విభాగంలో చూడగలరు.
పెద్ద గమనిక: ఈ ఏడాది జనవరిలో దాసరి సుబ్రహ్మణ్యం గారి మృత్యులోయ, అగ్నిమాల, దాసరి గారి కథల సంపుటికి స్వచ్చందంగా ఆయన ఆభిమానులు తమ శక్తి మేరకు తోడ్పాటు నందించారు. ఈ ప్రకటన వీరికి సంబంధించినది కాదు. గతంలో తోడ్పాటు నందించిన వారిపై మళ్లీ భారం పెట్టడం తగదని శాయిగారి దృఢాభిప్రాయం. వారు మినహా ఇతర బాల సాహిత్య అభిమానులకు మాత్రమే ఈ ప్రకటన వర్తిస్తుందని తెలియపరుస్తున్నాము.
రచనపై, శాయిగారిపై పడుతున్న అదనపు బారాన్ని కొంచెం తగ్గించినా చాలు అన్నదే ఈ ప్రకటన ఉద్దేశం.
Filed under దాసరి సుబ్రహ్మణ్యం | Comments (3)
ఆన్లైన్లో 15 వేల సినిమాలు
ఇంటర్నెట్లో ఒకే సైట్లో 15,000 పైగా సినిమాలు, డాక్యుమెంటరీలు, టీవీ అవార్డ్ షోలు చూసే అవకాశం మనకు లభిస్తే…. ఒక ఐదేళ్ల క్రితం అయితే ఇలాంటి అవకాశం అందుబాటులోకి వస్తుందంటే కల్లో కూడా మనం ఊహించి ఉండము. కాని ఇప్పుడిది సాధ్యమవుతోంది మరి. ఇంగ్లీష్ సినిమాలు కూడా లెక్కలోకి తీసుకుంటే మరి కొన్ని వేల సినిమాలను మనం ఒకే సైట్లో చూడవచ్చు. ఆనందంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా.
ఇంటర్నెట్ లేదా అంతర్జాలం అనే నాలుగక్షరాల మాంత్రిక పదం ఇప్పుడు ప్రపంచ వినోద యవనికను ఏలుతోందంటే ఆశ్చర్చపోవలసిన పనిలేదు.
నిన్ననే శ్రీదేవీ మురళీధర్ గారు యధాలాపంగా ఒక ఆన్లైన్ సినిమాల సైట్ని పంపిస్తే నా కుతూహలాన్ని కొంత జోడించి ఆన్లైన్ పాఠకులకోసం దాని వివరాలు ఇక్కడే ప్రచురించాను.
వందలాది సినిమాలు ఒకే చోట ఆన్లైన్లో చూడవచ్చు అనే వార్త చాలామంది నెటిజన్లను ఆకర్షించినట్లుంది. కాని బెంగుళూరు నుంచి మిత్రులు సాప్ట్వేర్ ఇంజనీర్ కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు ఇప్పుడే ఫోన్ చేసి మరికొన్ని విశేషాలు పంచుకున్నారు. కొన్ని వేల సినిమాలు ఒకే చోట చూడవచ్చు, 2 వేలకు పైగా తెలుగు సినిమాలను నెట్లో చూస్తూ డౌన్ లోడ్ చేసుకోవచ్చు అంటూ చెప్పుకుంటూ పోయారు.
శ్రీనివాస్ గారు చెప్పిన లింకు ఓపెన్ చేసి చూస్తే దిగ్భ్రమ. షాక్. ఎలా సాధ్యం ఇది. ఇంత స్పేస్ ఎలా నిర్వహిస్తున్నారు అని ఒకటే ప్రశ్నలు. ఇంగ్లీష్ సినిమాలను పక్కన పెట్టండి. హిందీ తెలుగు, తమిళం, వంటి ప్రముఖ భారతీయ సినిమాలే 15 వేలకు పైగా ఈ సైట్లో కన్పిస్తున్నాయి.
లెక్కకు తీసుకుంటే…
హిందీ – 3958
తెలుగు – 2060
తమిళం – 1855
మళయాళం – 1252
డబ్బింగ్ సినిమాలు 1219
రాజ్శ్రీ కేటగిరీ – 1162
బెంగాలీ – 569
కన్నడ 622
షార్ట్ ఫిల్మ్స్ – 302
మరాటీ – 220
పంజాబీ – 165
గుజరాతీ – 111
చెప్పుకుంటూ పోతే ఇవి మచ్చుకు కొన్ని సినిమాలు మాత్రమే.. వీటికి ఇంగ్లీష్ సినిమాలను కలపలేదు. అత్యంత పాత సినిమాలు, 2011లో విడుదలైన సినిమాలు కూడా ఈ సైట్లో చూడవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ అవకాశం కూడా ఉంది.
బాల్యంలో, తదుపరి జీవితంలో మనకు నచ్చిన లేదా మనం మెచ్చిన సినిమాలను మన ఇష్టప్రకారం చూడాలంటే వాటిని కొనుక్కోవాలి. లేదా టీవీలో వచ్చినప్పుడు వాటిని ఆ సమయంలో మాత్రమే చూడాలి. కాని ఇప్పుడు ప్రపంచం తన సరిహద్దులను తానే తెంచుకున్నట్లుంది. ఏదీ తన పరిమితుల్లో ఉండటం లేదు. హద్దులను, సరిహద్దులను, పరిమితులను బద్దలు గొట్టడమే ఇప్పుడు ఏకైక విలువ.
తెలుగులో గత 80 ఏళ్లలో 5 వేల సినిమాలు తయారయ్యాయనుకుంటే వాటిలో 2 వేల సినిమాలు ఒక్క ఈ సైట్లోనే కన్పిస్తున్నాయి.
ఒకే సైట్లో 15 వేల సినిమాలు అంటేనే నోరు తెరిచేస్తున్నాం. ఏమో.. 50 వేల సినిమాలను కూడా తన గర్భంలో దాచుకున్న మహా సైట్లు మనకు తెలియకుండా ఉన్నాయేమో ఎవరికి తెలుసు. ఇవి బయటపడే వరకు ప్రస్తుతానికి ఈ లింకుతో సంతృప్తి చెందుదాం మరి.
శ్రీనివాస్ గారూ అమూల్య సమాచారం పంచుకున్నందుకు ధన్యవాదాలు. రేపు మీరు పనిమీద చెన్నయ్ వస్తున్నారు కాబట్టి గురువారం సాయంత్రం చందమామ ఆఫీసులో తప్పక కలుసుకుందాం. మీరు కోరినట్లుగా మీకోసం ‘చందమామ ఆర్ట్బుక్’ సెట్ ఒకటి తీసిపెడతాను. మీరాక కోసం ఎదురు చూస్తుంటాను.
ఈ సైట్ నిర్వాహకులు పై లింకును అందరికీ తెలియజేయాలని మాత్రమే మనల్ని కోరుతున్నారు. ఇప్పుడా వంతు మనదే మరి.
మానవ వినోద విజ్ఞాన రంగం సృష్టించిన ఆత్యున్నత సాంకేతిక ఆవిష్కరణకు ప్రతిబింబమే సినిమా. శతాబ్ద కాలంగా ప్రపంచాన్ని ఇది మాయ చేసినంత మరేదీ చేయలేదు. 15 వేల సినిమాలు ఒకే చోట అందుబాటులోకి రావడం కూడా ఈ మాయలో భాగమే.
దాదాపు 15,000 పైగా సినిమాలను తనలో దాచుకున్న ఆ మహా సైట్ లింక్ కోసం ఇక్కడ చూడండి.
సినిమా ప్రియులకు ఇంకేం కావాలి?
ఎస్వీ రామారావు గారు 2006లో రాసి ప్రచురించిన ‘నాటి 101 చిత్రాలు’ జాబితాలో పది సినిమాలు మినహాయిస్తే మిగతా 90 అపురూప చిత్రాలు శ్రీనివాస్ గారి సేకరణలో ఉన్నాయట. బెంగళూరుకే చెందిన శ్రీయుతులు, బి. విజయవర్ధన్, శ్రీనివాస్, కె. శివరామప్రసాద్ గార్లు, హైదరాబాద్లో శ్యామ్ నారాయణ్, కె. గౌరీశంకర్ గార్ల వంటివారు ఒక చోట కలుసుకుంటే ఆ దొరకని పది సినిమాలు కూడా దొరకొచ్చునని నా ప్రగాఢ విశ్వాసం.
ఏమో! ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు?
పగలే వెన్నెల కురిపించిన విజయా వారి సినిమాల సెట్, కెవి రెడ్డి గారి సినిమాల సెట్, మణిరత్నం సినిమాల సెట్, మన విశ్వనాధ్, బాపు వంటివారి సినిమాల సెట్ వంటివి టోకున భవిష్యత్తులో మనందరికీ లభించాలంటే పాత బంగారాన్ని హృదయంలో పొదువుకున్న పై మాన్యులకే సాధ్యం. ఉత్తమాభిరుచికి, సాంకేతిక జ్ఞాన సంపత్తి తోడయితే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చనేదానికి వీరే ఒక ఉదాహరణ.
ఇక్కడ మనం మన అభిరుచికి తగిన అంశాలను స్వంతం చేసుకోవడానికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి పరుగెడుతున్నాం. అక్కడ శ్యామ్ నారాయణ్ వంటివారు గౌడౌన్ లాంటి షాపులో కూర్చుని పాటలు, సంగీతం, సాహిత్యం, సినిమాలు… మనిషికి కావలసిన సమస్త అంశాల సమాచారాన్ని సేకరిస్తూ జీవితాన్ని ధారపోస్తున్నారు.
తమకంటూ ఏమీ కోరుకోకుండా తమ కష్టం పదిమందికీ అందితే చాలుననుకుంటూ, భవిష్యత్తులో కనుమరుగు కానున్న అమూల్య రత్నాలను ఇప్పుడే డిజిటలైజ్ చేయిస్తూ భద్రపరుస్తున్న ఇలాంటి మాన్యులకు అంజలి ఘటించడమే ప్రస్తుత సందర్భానికి అర్హమైన విలువగా ఉంటుంది.
మనలో… మన తరంలో… కొందరు చేస్తున్న ఘనతర కృషికి, సంప్రదాయానికి అభివందనం చేస్తూ… ముగిస్తున్నాను….
మర్చిపోకండి. ఆ 15 వేల సినిమాల మహా సైట్ లింకును మరోసారి చూడండి.
(ఇప్పుడే ఈ బ్లాగ్ పోస్ట్ ముగించి మెయిల్ చూస్తే శ్రీదేవి గారు మరొ ఆణిముత్యాన్ని వెదికిపట్టుకుని పంపారు. కింద చూడండి.)
విజయావారి ‘చంద్రహారం’-1954
-నాగిరెడ్డి చక్రపాణి నిర్మాతలు,
నందమూరి,శ్రీరంజని,సావిత్రి,రేలంగి,ఎస్వీ రంగారావు,సూర్యకాంతం,జోగారావు.
ఇందులో ఏముందో వారి మాటల్లో ……
We thought that this cultural heritage should not end here, and the stream of music should be flowing forever, and should go on to the next generations to come, for the music lovers to listen to the beautiful songs and enjoy, and for the budding singers to learn the lessons which the songs themselves teach.
With the kind blessings of Smt Janaki amma, we are starting this site with nearly 1000 songs as the first batch, and we would always be adding fresh songs to the treasure. Please note that the initial collection of songs in any of the sections doesn’t mean that they are the best in the respective sections.
It is just a handpicked collection. More sections will be added in future as well.
Visiting us and keep coming regularly, because there will be new additions very frequently.
Enjoy the melodious surfing at sjanaki.net !
If you have any suggestions to make, or wish to have any more features in our site, or have something to contribute like rare articles / photos / songs of Smt S Janaki, please write to us at admin@sjanaki.net.
RIGHT ANGLE
అమీర్ పేట
హైదరాబాద్ -500 016
శ్యామ నారాయణ
9849 26 26 00
94403 62933
ఆన్లైన్లో సకల భాషల సినిమాలు
ఆల్కహాలిక్ పిల్లలు, బుజ్జి వంటి చక్కటి ఉచిత పుస్తకాల ప్రచురణతో ఆల్కహాలిక్ పిల్లల సమస్యలకు హృద్య పరిష్కారం చూపుతున్న శ్రీదేవి మురళీధర్ గారు ఈరోజు నా బ్లాగులో అమరశిల్పి జక్కన కథనం చూసి దేశంలోని చాలా భాషల్లోను, ఇంగ్లీషులోనూ వందలాది సినిమాలను ఆన్లైన్లో ఉచితంగా చూసేందుకు అవకాశం ఇస్తున్న ఒక అద్భుతమైన అన్లైన్ వెబ్సైట్ని చూడమంటూ నాకు మెయిల్ పంపారు.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, గుజరాతీ, కన్నడ, బెంగాలీ, పంజాబీ, నేపాలీ, మరాటీ తదితర భాషల చిత్రాలను, పిల్లల చిత్రాలు, హారర్ చిత్రాలు, యానిమేషన్ చిత్రాలు, పాత సినిమాలు, లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలింలు, ఇంగ్లీష్ నుంచి భారతీయ భాషల్లోకి డబ్ అయిన సినిమాలు, మనభాషల్లో ఒకదాంట్లోంచి మరొక దాంట్లోకి డబ్ అయిన సినిమాలు ఇలా వందలాది సినిమాలను ఒకే చోట ఉచితంగా ఈలింకులో చూడవచ్చు.
2007లో ప్రారంభించిన ఈ సైట్లో కొన్ని సినిమాలు డౌన్లోడ్కు కూడా అవకాశం ఉండటం గమనార్హం. టీవీ షోలు, అవార్డు ఫంక్షన్ల లింకులు కూడా దీంట్లో చూడవచ్చు.
ఇంగ్లీషులో 812 సినిమాలుహిందీలో 326 సినిమాలుతెలుగులో 94 సినిమాలుతమిళంలో 93 సినిమాలుమలయాళంలో 73 సినిమాలుకన్నడంలో 43 సినిమాలు…..
ఇలా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల పాత కొత్త సినిమాలను మంచి క్వాలిటీతో ఈ సైట్లో చూడవచ్చు. విశేషం ఏమిటంటే ఎవరి అభిరుచికి తగిన సినిమాలు వారికోసం ఇందులో ఉంచారు. పాత తెలుగు సినిమాలు కూడా చక్కటి నాణ్యతతో దీంట్లో చూడటానికి అవకాశ ముంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఖర్చు భరించగలిగితే సినిమా ప్రియులకు ఇది వీనుల విందు కలిగించక మానదు.
శాంపుల్గా పాత తెలుగు సినిమా ‘భామావిజయం’ -1967-ని కాస్సేపు చూస్తుంటే మనోహరంగా అనిపించింది1. రెండు చందమామలు ఈ రేయి వెలిగినే…. 2. ఇటు రారా సుందరా3. భువన మోహినీ… భువనమోహినీ..భువనమోహినీ… అవధిలేని యుగయుగాల అమృతవాహినీ….
ఎన్నాళ్లకు మళ్లీ ఈ పాటలు చూసి వినే అవకాశం కలిగిందో..
నర్తనకు, నాట్య శిల్పానికి దశాబ్దిపైగా ప్రతీకగా నిలిచి నాటి తరాన్ని తన నృత్య విన్నాణంతో ఉర్రూతలూగించిన ఎల్ విజయలక్ష్మి మనోహర నాట్య విన్యాసాలను చూడాలంటే ఈ సినిమా చూసి తీరాలి.
ఆన్లైన్లో అన్ని భాషల్లో ఉచిత సినిమాలు చూడాలనుకుంటే….
కింది లింకును చూడగలరు.
http://www.onlinewatchmovies.net/
మంచి సైట్ గురించి మెయిల్ పంపిన శ్రీదేవీ మురళీధర్ గారూ. కృతజ్ఞతలు.
Filed under ఆన్లైన్లో ఉచిత సినిమాలు | Comment (0)అమరశిల్పి జక్కన – మనసే వికసించెరా
ఈరోజు రాత్రి సన్ టీవీ సినిమా క్లబ్లో ‘అమరశిల్పి జక్కన’ సినిమా చూస్తున్నాను. ఒక అద్భుత వర్ణ చిత్ర ప్రపంచం కళ్లముందు అలా పరుచుకున్నట్లయింది. ఎంత గొప్ప సంగీతం, ఎంత మంచి పాటలు. ముఖ్యంగా ఈ నల్లని రాలలో వంటి ఈ చిత్రంలోని ప్రసిద్ధ పాటలు అందరికీ తెలుసు కాని ‘మనసే వికసించెరా’ అంటూ బి. సరోజా దేవి ఆడి పాడిన పాట విని చాలా కాలమయింది. వింటూంటే పరవశించిపోయాను.
లవకుశ -1963- తర్వాత తెలుగులో రెండో ఈస్ట్మన్ కలర్ చిత్రం అమరశిల్పి జక్కనే -1964- అనుకుంటాను.
ఆద్యంతం ఈ సినిమా నేపథ్య సంగీతాన్ని, పాటలను వింటూ పిచ్చెత్తి పోత్తున్న నేపథ్యంలో మీకు మెయిల్ చేస్తున్నాను. మీలో ఎవరివద్ద అయినా ఈసినిమా సీడీ లేదా డీవీడీ ఏదయినా ఉందా.. ఉంటే శ్రమ అనుకోకుండా నాకు ఒక కాపీ పంపగలరా..
సాలూరి రాజేశ్వరరావు గారి విశ్వరూపం చూడాలంటే ఈ సినిమా చూసి తీరాలి. ఆయన సంగీత దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘తాండ్ర పాపారాయుడు’ అనుకుంటాను. ‘అభినందన మందార మాల’ అనే పాట పాతికేళ్లుగా నన్ను వెంటాడుతూ వస్తోంది. సినీ సంగీతంలో లాలిత్యాన్ని శిఖరస్థాయిలో నిలబట్టిన మహనీయుడు కదా..
ఈ పాట కూడా ఆడియో మాత్రమే దొరుకుతోంది. సినిమా కాని, వీడియో పాట కాని లభ్యం కాలేదు. మీ వద్ద ఉంటే చెప్పండి
విజయావారి సినిమాల సెట్, కెవి రెడ్డి గారి సినిమాల సెట్ లాగా సాలూరు రాజేశ్వర రావు గారి పాటల సెట్ లేదా సినిమాల సెట్ సేకరించుకోవాలన్నది నా చిర కోరిక.
సుశీల గారు పాడిన పాటల్లో ఆమెకు బాగా నచ్చిన పాట ‘పాల కడలిపై శేషతల్పమున శయనించేవా దేవా’ పాటకు కూడా సంగీతం రాజేశ్వరరావుగారిదే అనుకుంటాను.
మణిరత్నం ‘ఘర్షణ’ చిత్రంలో ‘నిను కోరీ వర్ణం’ అనే పాటలో వినిపించే సంగీత జలపాత ఝరి అప్పటినుంచి ఇప్పటి దాకా ఆకట్టుకుంటూనే ఉంది. అది శ్రోతగా నేను పొందిన ఆనందం. కాని ఈ మధ్యే ఒక చానెల్లో సాలూరు వారి గురించి ప్రసారం చేస్తూ ఈ పాట సంగీతానికి ప్రాణం పోసిన ఇళయరాజాను ఆయన అప్పట్లోనే బాగా ప్రశంసించారని విని పొంగిపోయాను. మనం సంగీతజ్ఞులం కాకున్నా ఏది మంచి సంగీతమో గ్రహించే బుద్ది మనకూ ఉందిలే అనే నమ్మకం దీంతో మరింత బలపడింది.
ఈ ఆనందంలో నెట్లో వెతుకుతుంటే ఎస్వీ రామారావు గారు 2006లో రాసి ప్రచురించిన ‘నాటి 101 చిత్రాలు’ పరిచయాన్ని తెవికీలో చూశాను.
ఈ లింకులో తెలుగు సినిమా ఆణిముత్యాల సమాచారం చూడవచ్చు.
శ్రీనివాస్, శ్యామ్ నారాయణ, విజయవర్ధన్ గార్లకు….
దీంట్లోని 101 చిత్రాలు మీ సినిమాల కలెక్షన్లో ఏమయినా ఉన్నాయా.. చెప్పండి.
ఏంలేదు.. నా వద్ద ఓ టెరాబైట్ హార్డ్ డిస్క్ ఉంది. మీ సంపదలో కొంత కొల్లగొడదామని దురాశ. అంతే..
ఆహా… ఇంకా సినిమా చూస్తూనే ఉన్నాను. అడుగడుగునా మంత్రముగ్ధం చేస్తున్న నేపథ్య సంగీతం..ఎందుకు మనం పాత సినిమాలను చూడాలో, పాత సంగీతాన్ని వినాలో నిరూపిస్తున్న చిత్రం. ఏమి నా భాగ్యం..
మనసే వికసించెరా.. సాలూరి వారికి పాదాభివందనాలు…
పాత సినిమాల భాండాగారాన్ని సేకరిస్తున్న కె. గౌరీశంకర్ గారి మొబైల్ నెంబర్ మీ వద్ద ఉంటే తెలుపగలరు. ఈమధ్య నా మొబైల్ పోవడంతో అందరి ఫోన్ నంబర్లు పోయాయి.
నా కొత్త మొబైల్ నంబర్
7305018409
మీనుంచి మంచి వార్త వస్తుందని ఆశిస్తూ..
కె. రాజశేఖరరాజు
చెన్నయ్
జక్కన్న నిజజీవితం గురించిన వివరాలకు కింది లింకులు చూడండి.
తెలుగు సినిమా ‘అమరశిల్పి జక్కన’ -1964- గురించిన వివరాలకు కింది లింకు చూడగలరు.
Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Comments (3)చందమామ మాన్య పాఠకులు
చందమామ సీనియర్ పాఠకులు శ్రీ బొడ్డపాటి రాజేశ్వరమూర్తి గారు 1950 నుంచి ఇప్పటిదాకా దాదాపు అరవై ఏళ్లపాటు చందమామను విడవకుండా చదువుతూ వస్తున్నారు. 1946 నాటి ‘చిత్రగుప్త’, ‘ఆంధ్రపత్రిక’ నుంచి మొదలుకుని గత 60 ఏళ్లుగా వివిధ తెలుగు దిన వార పత్రికలకు కంటెంట్ ఇస్తున్న సీనియర్ కంట్రిబ్యూటర్ ఈయన. ప్రత్యేకించి అయిదు దశాబ్దాలుగా, అనేక తెలుగు దిన, వార పత్రికలకు జర్నలిస్టుని అని ఈయన సగర్వంగా ప్రకటిస్తుంటారు. నేటికీ ఈయన వ్యాసాలను తెలుగు పత్రికలు ప్రచురిస్తూ ఆదరిస్తున్నందుకు ఈయన ‘బాల్య సంతోషం’ అనుభవిస్తుంటారు.
చందమామ కథాపఠనంతో జీవితాన్ని పండించుకుంటున్న ‘కురువృద్ధబాంధవుడీ’యన. మీగడతరగల్లాంటి తెల్లకాగితంపై అద్భుత వర్ణచిత్రాలను పిండారబోసిన చందమామ గతకాలపు ముద్రణా నాణ్యతను గురించి ఈయన చెబుతుంటేనే మనం వినాలి. చందమామ ఫోటో వ్యాఖ్యల పోటీలో అందరికంటే ఎక్కువ సార్లు విజేతగా బహుమతి అందుకున్న ఘనత తనదే అని చెబుతుంటే ఆయన మాటల్లో పొడసూపే గర్వరేఖలు మనం వినితీరాలి. ప్రైజ్ మనీగా చందమామ నుంచి వందరూపాయలు గెల్చుకుని తీసుకునేవాడినని చెబుతూ ఆయన పొందే సంతోషం అనిర్వచనీయమైనది.
సహస్రచంద్ర దర్శనాలను చూసిన ఈ మాన్య పాఠకులు జీవితపు మలి సంధ్యలో చందమామతో ప్రత్యక్ష సంబంధంలోకి వచ్చారు. నాలుగు నెలల క్రితం వారి చందమామ జ్ఞాపకాలు పంపించినప్పుడు వాటిని అందుకున్నామని ఫోన్లో మాట్లాడితే ఆయనలో సంతోషం అంబరమంటిన ఫీలింగ్. 20 నిమిషాల పాటు ధారాపాతంగా తన చందమామ తీపి గురుతులు చెబుతూ పోతుంటే ఆలా వింటూండిపోయాము.
“భారతీయులందరికీ నిజాయితీతో ఈ సూచన చేస్తున్నాను. చందమామను మీ భాషలోనే చదివి దాన్ని జీర్ణం చేసుకోండి. నీతిని గ్రహించడానికి, మన వైభవోజ్వల గతాన్ని దర్శించేందుకు, మన ప్రాచీన రుషులు, మహర్షుల సనాతన వారసత్వాన్ని మన పిల్లలకు అర్థం చేయించి వారిని సరైన మార్గంలో పయనింపజేసేందుకు, దయచేసి చందమామను చదవండి, మీ పిల్లలచేత చదివించండి.”
అంటూ చందమామను ఈ రోజు కూడా సమున్నత స్థానంలో నిలిపి గౌరవిస్తున్న ఈ వయోవృద్దుడికి చందమామ కృతజ్ఞతాంజలులు అర్పిస్తోంది. హృదయపు లోతుల్లోనుంచి పొంగి పొరలి వచ్చిన మీ ఆశీస్సులు ఫలించాలని, చందమామ మరి కొన్ని దశాబ్దాలపాటు పిల్లలకూ, పెద్దలకూ తన దైన కథామృతాన్ని అందిస్తూనే ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. మీ వంటి మాన్యుల ప్రేమాభిమానాల అండదండలతో చందమామ తన ప్రయాణం సాగిస్తుందని, నెల్లు, పొల్లు వేరు చేస్తూ తమ గమ్యాన్ని సాగిస్తుందని వినమ్రంగా ప్రకటిస్తున్నాము.
మీ ఆరోగ్యం, మీ ఉనికి మాకు, చందమామకు శక్తిని ప్రసాదించాలని, మీమాట వేదంలా, నాదంలా సకల జనుల మనస్సులలో ప్రతిధ్వనించాలని, మీ శుభాశీస్సులు చందమామ భవితవ్యాన్ని మరింత ముందుకు నడపాలని హృదయ పూర్వకంగా కోరుకుంటూ మనస్సుమాంజలి ఘటిస్తున్నాము.
–చందమామ సిబ్బంది.
రాజేశ్వర మూర్తిగారి చందమామ జ్ఞాపకాలను నవంబర్ సంచికలో ప్రచురించిన తర్వాత ఆయన రాసి పంపిన మూడు లేఖలు, ఆయనతో ఫోన్ సంభాషణ సారాంశాన్ని ఇక్కడ చూడగలరు.
చందమామ పత్రిక ‘కథల కాలక్షేపం’ కాదు
నవంబర్ సంచిక సకాలంలో అందడమే గాక, చందమామతో నా జ్ఞాపకాలు ప్రచురించినందులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. కొన్ని నెలల క్రితం చందమామ నాకు ఫోన్ చేసి మీ జ్ఞాపకాలు ఈ డిసెంబర్ మాసంలో రావచ్చని తెలిపింది. అప్పుడు నేను సమాధానమిస్తూ నాకు ఇప్పుడు 82 సంవత్సరాలని జీవితం నీటిబుడగ లాంటిది కాబట్టి, దేవుడు ఎప్పుడు పిలిచినా నేను ‘పరంధామం’ చేరవలసిందే కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా జ్ఞాపకాలు ప్రచురించమని కోరాను. దేవుడు నన్ను కరుణించాడు. సరిగ్గా రెండు రోజుల క్రితమే నేను చందమామలో నా జ్ఞాపకాలు చదివాను. ఈ నవంబర్ నెల సంచికలోనే నా జ్ఞాపకాలు ప్రచురించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అప్పుడే పాఠకుల లేఖలకు రాసి పంపాను కూడా.
అందాల చందమామతో అపురూప ప్రేమానుబంధం అతిమధురం, శాశ్వతం. ఒక విషయంలో పత్రికా ప్రపంచానికి ఛాలెంజ్ చేస్తున్నాను. దేశీయ భాషల్లోనే గాక ఇతర దేశభాషల్లో కూడా ప్రచురించబడుతున్న కథల పత్రిక ఎక్కడైనా ఉందా? ఒక్క చందమామ తప్ప. దీంతో ఇతర కథల పత్రికలు ఎందుకు పోటీపడలేక పోతున్నాయి?
భారతీయులందరికీ నిజాయితీతో ఈ సూచన చేస్తున్నాను. చందమామను మీ భాషలోనే చదివి దాన్ని జీర్ణం చేసుకోండి. నీతిని గ్రహించడానికి, మన వైభవోజ్వల గతాన్ని దర్శించేందుకు, మన ప్రాచీన రుషులు, మహర్షుల సనాతన వారసత్వాన్ని మన పిల్లలకు అర్థం చేయించి వారిని సరైన మార్గంలో పయనింపజేసేందుకు, దయచేసి చందమామను చదవండి, మీ పిల్లలచేత చదివించండి.
82 ఏళ్ల ముదివయస్సులో మీకందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చందమామ పత్రిక కేవలం ‘కథల కాలక్షేపం’ కాదు. మానవ నీతి, రుజువర్తనకు సంబంధించి ఇదొక శాశ్వత నిధి. “నవ గ్రహాలు అన్నీ అనుకూలించిన శుభ ముహూర్తంలో” నాగిరెడ్డి, చక్రపాణి గార్లు తమ స్వర్ణ హస్తాలతో చందమామను 1947లో ప్రారంభించారు. ఆ ముహూర్త బలం ఎంత మహత్తరమైనదంటే 65 ఏళ్లుగా చందమామ దేశభాషల్లో ప్రచురితమవుతూ కోట్లాదిమందిని తన వెన్నెల కిరణాలతో తడుపుతూ జాతికి చల్లదనం కలిగిస్తూనే ఉంది. చందమామ మీది, మాది, మనందరిదీనూ.. మీరు చదవండి..మీ పిల్లల చేత చదివించండి చాలు…
ఈనాడు పత్రిక 2006లో చందమామపై కవర్ పేజీ కథనం ప్రచురిస్తూ నా పేరు వెలుగులోకి తెచ్చింది.
ఇపుడు చందమామలో ఫోటోతో సహా నా అభిమాన పత్రికతో నా జ్ఞాపకాలు నిండుపేజీలో ప్రచురించడం ‘హోమ్లీ’గా ‘మహదానందంగా’ ఫీల్ అయినాను. మా కుటుంబ సభ్యులు ముఖాముఖిగా, నా సారస్వత మిత్రులు, నా తోటి ప్రభుత్వాధికారులు ఫోన్లోను, ఇమెయిల్ ద్వారా, చందమామతో నాకున్న శాశ్వత బంధాన్ని ప్రశంసిస్తూ పొగడటం నాకు గర్వకారణమైనది. మధుర జ్ఞాపకాలతో జేజేలు పలికినట్లయింది. చందమామ సంపాదకులు, సిబ్బందికి నా ధన్యవాదాలు.
నేను గత 5 దశాబ్దాల నుండి ప్రముఖ తెలుగు దిన, వార పత్రికలకు కంట్రిబ్యూటర్ని. 1946లో మదరాసులోని ‘చిత్రగుప్త’ మాస పత్రికతో మొదలై ఆంధ్రపత్రిక వారపత్రిక -1952- నుండి ఈనాటివరకు ఉన్న దాదాపు అన్ని మాసపత్రికలకు జర్నలిస్టుగా పనిచేశాను. నేటికీ వారు నా రచనలు ప్రచురిస్తూ ఆదరిస్తూన్నారు. ఇది నా హాబీ.
చందమామ చిన్న కథలు నిమ్మ తొనలు
ఈ నవంబర్ మాసం ముఖచిత్రం ముచ్చటగొలిపే అమ్మాయి అబ్బాయి, కాసారంలో పడవ విహారం, క్షీరనీరన్యాయం చేసే రాజహంస, హరిత వాతావరణం అద్భుతం. నెహ్రూగారి సందేశ పునర్ముద్రణ అమోఘం. కథలు ఎక్కువగానే ఉన్నాయి. చిన్న కథలు నిమ్మతొనల్లా అలరిస్తూ ఉన్నాయి. పాత ఫోటో వ్యాఖ్యల పోటీని పునరుద్దరించండి. ప్రస్తుత క్విజ్ ఎత్తివేయండి. పాత చందమామల్లో ఉండే పాలతెలుపు కాగితాలే మిన్న. మీగడ తరకల్లాంటి చందమామ కాగితం పదిహేను సంవత్సరాల తర్వాత కూడా వన్నె తగ్గకుండా మిలమిలలాడుతూ ఉండేది.
1950 నుంచి చందమామను చదువుతూనే ఉన్నాను. దశాబ్దాలపాటు చందమామలు బైండ్ చేయించినప్పటికీ బంధువులు వస్తూ పోతూ వాటిని పట్టుకెళ్లిపోయారు. ఒక్కరూ తిరిగి ఇవ్వలేదు. చందమామకు గ్రహణం వీడాక 2000 సంవత్సరం నుంచి అన్ని చందమామల ప్రతులను బైండ్ చేయంచి భద్రంగా ఉంచుకున్నాను. మా బంధువులు, పుత్రులు, మనవళ్లు, మనవరాళ్లు ఎవరడిగినా సరే బయటికి మాత్రం చందమామలను ఇవ్వడం లేదు. నేను ఎంతవరకు ఉంటానో.. ఎప్పుడు పోతానో కూడా తెలియదు. కాని మా పిల్లలకు నేను గత పదేళ్ళ చందమామలను లీగల్ వారసత్వంగా అందించదలిచాను. వారు వాటిని కాపాడతారని, తమ పిల్లలకూ చందమామను అందిస్తారని కోరుకుంటున్నాను. ఇది తప్ప ఈ ముదివయస్సులో నాకిక ఏ కోరికలూ లేవు.
గమనిక: ఇటీవలి సూర్యా పత్రికలో చందమామ చిత్రకారులు చిత్రా గారి గురించి కథనం ప్రచురించారు. దాని కటింగ్ మీకు పంపిస్తున్నాను. గతంలో చందమామ చిత్రకారులు శంకర్ గారి గురించి కూడా ఈ పత్రిక కథనం ప్రచురించింది.
అలాగే ఈ ఆదివారం -13-11-2011- సాక్షి అనుబంధంలో ‘ఇది పిల్లల ప్రపంచం’ అనే పేరుతో చక్కటి ముఖచిత్ర కథనం ప్రచురించారు. దాంట్లో చందమామ కథల గురించి ఆణిముత్యాల్లాంటి వాక్యాలతో ప్రశంసల వర్షం గుప్పించారు. చందమామ కోరకుండానే దానికి ఇంత గౌరవం కల్పించిన ఆ వ్యాసం కటింగ్ కూడా చందమామ కార్యాలయానికి పంపిస్తున్నాను. చూడండి. -
(అయితే, ప్రధాన కథనంలో భాగంగా చందమామ గురించి సాక్షి పత్రికలో బాక్స్ ఐటమ్ గా వచ్చిన ఈ భాగం సాక్షి ఆన్లైన్ ఎడిషన్లో ఎందుకో రాలేదు.-సాక్షి పత్రిక ఆదివారం అనుబంధం కథనంలో భాగంగా చందమామపై వచ్చిన ప్రశంసను ఇప్పుడు కింద పొందుపర్చడమైనది.
మామ… చందమామ!
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు వెళ్లాడు. శవాన్ని దింపాడు. ఎప్పటిలాగానే భుజాన వేసుకున్నాడు. . . చాలు… చాలు.. ఈ మాత్రం నెరేషన్ చాలు.. చందమామ కథ చెబుతున్న విషయం పిల్లలకి అర్థమైపోతుంది. విక్రమ భేతాళ్ అంటూ మన కంటే ముందు వారే లోగుట్లన్నీ విప్పుతారు. చందమామ మాసపత్రిక అంతగా బాలభారతాన్ని అల్లుకు పోయింది. అరవై నాలుగేళ్ల కిందట చెన్నపట్నంలో పుట్టి తరాలకు తారలానే తన వెంట తిప్పుకుంటోంది.
నాగిరెడ్డి, చక్రపాణి మిత్రద్వయం దీన్ని 1947లో తెలుగు, తమిళాల్లో ప్రారంభించారు. నేడిది ఇంగ్లీష్ సహా పదమూడు భాషల్లో వెలువడుతోంది. పిల్లలందరూ ఈ పత్రిక కోసం ప్రతినెలా వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు. దీనిమీదున్న కుందేలు బొమ్మతో జట్టుకడతారు… పెద్దాళ్లు కూడా ఈ పుస్తకాన్ని చిన్నాళ్లకి కొనిచ్చేందుకు ముచ్చటపడతారు. మెదడుకు మేతపెట్టే సంగతులు, పసిదనాన్ని నిలువెల్లా నింపుకున్న చిన్న కథలు, భారతీయతను ఒడలంతా రంగరించుకున్న ధారావాహికలు చందమామ ప్రత్యేకత. అసలా పేరులోనే ఉంది పెన్నిధి. మామ అని అమ్మ తమ్ముణ్ణి పిలుచుకున్నట్టు హాయిగా పిలుచుకోవచ్చు. అందమైన వర్ణచిత్రాలతో, అద్భుతమైన కథనాలతో అలరారే చందమామ పిల్లల రాజ్యానికి నేడూ మహాప్రభువే.
సాక్షిలో ‘ఇది పిల్లల ప్రపంచం’ కథన కర్త డా. చింతకింది శ్రీనివాసరావు గారికి అభినందనలూ… కృతజ్ఞతలూనూ
గమనిక: నిన్న సాయంత్రం చందమామ అభిమాని, మిత్రులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు సాక్షిలో చందమామపై చిరు కథనాన్ని మరో లింకులో ఇచ్చారంటూ మెయిల్ పంపారు. ఆ లింకు ఇక్కడ చూడవచ్చు.
http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=30615&Categoryid=10&subcatid=29
కె. శ్రీనివాస్ గారూ, ఆ ప్రధాన కథనానికి ఇతర లింకులు సాక్షి ఆన్లైన్లో కనిపించాయి కాని చందమామ లింకు నాకు తగల్లేదు. పంపిన మీకు ధన్యవాదాలండీ. )
జీవితంలో 80 ఏళ్ళు గడిపిన తర్వాత చందమామ నేరుగా నాకు ఫోన్ చేయడం. నా చందమామ జ్ఞాపకాలు ప్రచురించడం, కాంప్లిమెంటరీ కాపీ పంపడం. నా ఉత్తరాలు రెగ్యులర్గా పాఠకుల పేజీలో రావడం. వృద్ధాప్యంలో నేను కోరుకోకుండా నాకు దక్కిన అపురూప వరాలు అనుకుంటాను. మరొక్క విషయం పంచుకోవాలని ఉంది. చందమామ చరిత్రలో బహుశా ఫోటో వ్యాఖ్యల పోటీకి ఎక్కువ సార్లు ప్రైజ్ గెల్చుకున్నది నేనే అని గర్వంగా చెప్పగలను. చందమామ నుంచి ప్రైజ్ మనీగా వందరూపాయలు అందుకోవడం ఎంత సంతోషదాయకమో. మళ్లీ ఫోటో వ్యాఖ్యల పోటీని ప్రారంభిస్తే బాగుంటుంది.
చందమామ సంపాదకులు, సిబ్బందికి నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు. మేలురత్నం లాంటి ఈ పత్రికలో మీరు పనిచేస్తున్నారు. మీ పని లక్షలాది మందికి వెన్నెల కిరణాలను పంచుతోంది. జాతి పట్ల బాధ్యతతో, గౌరవంతో మీ పని కొనసాగించండి. దీర్ఘాయుష్మాన్ భవ.
-బి.రాజేశ్వరమూర్తి, చిలకలపూడి, బందరు, కృష్ణాజిల్లా, ఎపి.
నిన్ననే -15-11-2011- ఆయన మరొక కార్డు ముక్క చందమామకు పంపించారు. చందమామ కథా, చిత్ర చరిత్రకు కేతనమెత్తిన ఈ హృదయోల్లాస లేఖా వ్యాఖ్యను కింద చూడండి.
‘చందమామ’ ప్రకాశ రహస్యం!!
ప్రారంభదశలో పిల్లల మాసపత్రిక అన్నట్లు గుర్తు! కాని ఇది చదివి వృద్ధులు బాలురైనారు. “నవ్యప్రాచీననవ్యుడితడు” అని పొగడబడిన జ్ఞానపీఠ అవార్డు తొలి గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు చందమామ పత్రిక చిరకాల పాఠకుడు. కొత్త చందమామ కోసం నౌకరును పంపి, రాలేదని చెబితే ‘వెధవా! నువ్వు అబద్దాలు ఆడుతున్నావ్’ అని విసుగుకొని తానే వెళ్లి, ఆలస్యం అయితే కొట్టువాడితో దెబ్బలాడేవారు.
పత్రిక వచ్చిన తర్వాత ఆసాంతం చదివి, “ఆహా! ఏమి హాయి” అని అనేవారు. ఆ కాసేపు తన నవలా రచన పక్కన పెట్టేవారు. అలాంటి వారిలో ఎందరో సాహిత్య పీఠాధిపతులు ఉన్నారు. ఐ.ఎ.ఎస్ అధికారులున్నారు. కొడవటిగంటి కుటుంబరావు, ఆరుద్ర, శ్రీశ్రీ, పాలగుమ్మి పద్మరాజు మున్నగువారు నేపథ్య ప్రతిభాశాలురు ఉన్నారు. చక్రపాణి చిత్రాలకు ప్రాతినిథ్యమిస్తూ కథల్ని సైజుతగ్గిస్తూ, ‘టైలరింగ్’ చేసేవారు. చిత్ర, వపా, శంకర్, ఆచార్య గారలు కథలకనుగుణంగా, కళాత్మకంగా, చారిత్రికంగా, సంసార పక్షంగా, పండితులు మెచ్చేటట్లు, పామరులు రంగుల సొగసుతో అబ్బురపడేటట్లు, కథాసన్నివేశాల పక్కనే గీస్తూ వచ్చిన చిత్రాల అమరిక చందమామను జాజ్వల్యమానంగా ప్రకాశింపచేశాయి.
ఇక చిత్రకళాకారుల ప్రతిభా కౌశలం, వారు మన భారత, రామాయణ, భాగవత ఇతిహాసాలకు అనుగుణంగా వస్త్రాలు, నగలు, కిరీటాలు, అంతఃపుర వైభవ దృశ్యాలు, సరోవరాలు, పచ్చటి పకృతి, భీకరారణ్యాలు, గుహలు, ఆటవికుల ఆహార్యాలు, పట్టణాల భవనాల అందచందాలు, పల్లెటూళ్లలోని జానపదుల విచిత్రవైఖరులు, వింత వింత ద్వీపాలలోని మానవ మృగాల పాశవికత్వాన్ని దేశంలోని ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను ప్రతిబింబించే కేశాలంకరణ హోదాలను బట్టి దుస్తులు, అచటి జంతువుల రూపాలు,విన్యాసాలు, కురుక్షేత్ర సంగ్రామంలోని పద్మవ్యూహాలు, సేనా పరంపర ‘ఏరియల్ వ్యూ’ గా చిత్రించడం వీరికే చెల్లు.
కీర్తిశేషులైన చందమామ చిత్రకారులకు జోహార్లు. సజీవులైన వారికి అనంత కోటి అభినందనలు. ఎన్నో బాలపత్రికలు వీరిని అనుకరించి కృతకృత్యులు కాలేకపోవడం ‘మామామ’ విశిష్టత. చందమామ చిరంజీవి!!!
-బి.రాజేశ్వరమూర్తి, చిలకలపూడి
రాజేశ్వరమూర్తిగారు చెప్పిన ఈనాడులో ‘చందమామ కథ’ కోసం కింది లింకు చూడగలరు.
http://blaagu.com/chandamamalu/category/%E0%B0%88%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE/
దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సంచికగా ‘రచన’ మాసపత్రిక 2010 మే నెలలో తీసుకువచ్చిన ప్రత్యేక సంచిక వివరాలు దురదృష్టవశాత్తూ మూర్తిగారికి ఇంతవరకూ తెలియవట. నిన్న -15-11-2011- ఆయనతో ఫోన్ సంభాషణలో ఈ విషయం తెలిసింది. చందమామ సీరియల్స్ గురించి ప్రత్యేక సంచికను రచన పత్రిక తీసుకువచ్చిందని తెలియగానే ఆయన చాలా సంతోషించారు.
కొన్ని పనులు సకాలంలో చేయగలిగితే ఎంత బాగుంటుందో అర్థమవుతూ వస్తోంది. దాసరి సుబ్రహ్మణ్యం గారు బొమ్మరిల్లు పత్రికలో 70లలో రాసిన ‘మృత్యులోయ,’ యువ పత్రికలో వచ్చిన ‘అగ్నిమాల’ జానపద నవలలు, దాసరి గారి కథా సంపుటిని కూడా రచన-వాహిని బుక్ ట్రస్ట్ 2011 జనవరిలో అచ్చేసింది. వీలయినంత త్వరలో ఆ పుస్తకం పంపే ఏర్పాట్లు చేయగలనని ఆయనకు మాట ఇచ్చాను.
రచన శాయి గారూ,
‘రచన’ మాసపత్రిక 2010 మే నెలలో తీసుకువచ్చిన ప్రత్యేక సంచిక, దాసరిగారి ‘మృత్యులోయ,’ ‘అగ్నిమాల’ జానపద నవలలు, దాసరి గారి కథల సంపుటి మొత్తం నాలుగు పుస్తకాలు మీవద్ద అందుబాటులో ఉంటే చందమామ సీనియర్ పాఠకులు, రాజేశ్వరమూర్తి గారికి వీలైనంత త్వరలో కింది చిరునామాకు పంపించగలరు. వాటికి సంబంధించిన నగదు మొత్తంగా మీకు త్వరలోనే పంపించగలను.
వారి చిరునామా.
Sri B.Rajeswara murthy
Co-operative Sub Registrar (Retd)
Srikrishna Nagar,
Chilakalapudi -521002
Bandar-2
Krishna (dist)
Andhrapradesh
Land Phone: 08672-254040
నవంబర్ చందమామలో శ్రీ రాజేశ్వరమూర్తిగారి మధుర జ్ఞాపకాలను కింద చూడండి.
Filed under చందమామ మాన్య పాఠకులు | Comment (1)
అవసరాల రామకృష్ణారావు రచన-జీవితం-వ్యక్తిత్వం
తొలి చందమామ కథకులు -పొట్టిపిచిక కథ 1947- శ్రీ అవసరాల రామకృష్ణారావు గారు గత నెల చివరలో కన్ను మూసిన విషయం తెలిసిందే. గత సంవత్సర కాలంగా చందమామ పనిలో భాగంగా ఆయనతో ఏర్పడిన స్వల్ప పరిచయం, ఆయనతో ఫోన్ సంభాషణలు, చందమామకు ఆయన పంపిన కొత్త కథలు ఆధారంగా ఆయన గురించి నాకు తెలిసిన వివరాలను పంచుకుంటూ మాలిక వెబ్ పత్రికకు కింది వ్యాసం పంపడమైనది. నిన్న -ఆదివారం- హైదరాబాద్ నగరంలో బాల సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఆయన సంతాప, సంస్మరణ సభ వివరాలను సిస్టమ్ అందుబాటులో లేక సకాలంలో ఇక్కడ ప్రచురించలేకపోయాను. సభ వివరాలు తెలియవలసి ఉంది.
అవసరాల గారి రచనా జీవిత వ్యక్తిత్వంపై మాలిక వెబ్సైట్ పత్రికలో ప్రచురించిన కథనం లింక్ కింద చూడగలరు. మాలిక నిర్వాహకులకు కృతజ్ఞతలు
అవసరాల రామకృష్ణారావు రచన-జీవితం-వ్యక్తిత్వం
Filed under First Chandamama writer | Comment (0)విక్రమార్కుడు, బేతాళుడు, శంకర్….
హిందూ పత్రిక మెట్రోప్లస్ విభాగంలో ఈరోజు చందమామ సీనియర్ చిత్రకారులు శంకర్ గారిపై Vikram, Vetala and Sankar పేరిట ఒక పెద్ద ఇంటర్వ్యూ వచ్చింది. చేసినది విశ్వనాధ్ ఘోష్. రెండేళ్ల క్రితం ఈయన టైమ్స్ ఆఫ్ ఇండియా లో పనిచేస్తున్నప్పుడు కూడా శంకర్ గారిపై ఒక ఇంటర్యూ ప్రచురించారు. హిందూ పత్రికలో చందమామ శంకర్ గారి గురించి అరపేజీ పైగా కథనం ప్రచురించడం ఇదే తొలిసారి అనుకుంటాను.
దీన్ని హిందూ ఆన్లైన్లో కూడా ఇవ్వాళే హోమ్ పేజీ దిగువన ప్రచురించారు. దాని లింకుకోసం ఇక్కడ చూడండి.
http://www.thehindu.com/life-and-style/metroplus/article2611627.ece?homepage=true
Filed under చందమామ శంకర్ | Comment (0)
తొలి ‘చందమామ’ కథకులు ఇక మిగిలి లేరు
“తొలి చందమామ కథకులు ఇక ఎవరూ లేరండీ”
గత శుక్రవారం రాత్రి 10 గంటల వేళ రచన పత్రిక సంపాదకులు శ్రీ శాయి గారు ఉన్నట్లుండి ఫోన్ చేసి చెప్పినప్పుడు మ్రాన్పడిపోయాను. ముందయితే ఆయన ఏం చెబుతున్నదీ ఒక్క క్షణం అర్థం కాలేదు. తట్టిన మరుక్షణం ‘అయ్యో, అయ్యో’ అనే ఒక్క మాట మాత్రమే నా నోట్లోంచి వచ్చింది. తొలి చందమామ అపరూప కథకులు శ్రీ అవసరాల రామకృష్ణారావు గారు ఇక లేరన్న మాటను శాయి గారు కాస్త మార్చి పై విధంగా చెప్పారు.
ఆయన్ను హైదరాబాద్లో కలిసి 10 నెలలయిందనుకుంటాను చందమామ జానపద సీరియల్స్ రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన రచనలు మృత్యులోయ, అగ్నిమాల, స్వీయ కథలు ఆవిష్కరణ సభ సందర్భంగా తొలిసారిగా అవసరాల వారిని ఈ జనవరి చివరలో రవీంద్రభవన్లో కలిశాము. విశాఖపట్నంలో ఉన్న ఆయనను అంత దూరం నుంచి రప్పించిన వారు రచన శాయి గారు, దాసరి వెంకటరమణ గారు.
ఈ చిన్న పరిచయంతోటే తర్వాత ఆయన తమ చందమామ జ్ఞాపకాలు, విజయమాల అనే రెండుపేజీల చిన్న కథను పంపారు. ‘రచన’ శాయి గారి సలహాతో వీటిని, 1947 తొలి చందమామ సంచికలో ప్రచురితమైన వారి మొట్టమొదటి కథ పొట్టి పిచుక మూడింటిని కలిపి ఈ సంవత్సరం జూలై సంచికలో చందమామ 64వ వార్షిక సందర్బంగా చందమామ ప్రచురించి తన్ను తాను గౌరవించుకుంది.
తర్వాత కొన్ని నెలల విరామంతో ఆయన మరొక రెండు కథలు పంపారు. వాటిలో తొలి ప్రచురణగా ‘అవిశ్వాసం’ అనే ఉత్కృష్టమైన విలువల కథను ఈ డిసెంబర్ సంచికలో ప్రచురణకు స్వీకరించడమైంది. కథ చూడగానే మనసుకు హత్తుకుపోయింది.
తల్లిదండ్రులు లేని పిల్లాడిని దశాబ్దాలపాటు తన వద్ద ఉంచుకుని తన షాపులో పెట్టుకుని ఆప్తబంధువులా చూసుకున్న ఒక యజమాని చివరకు తన ఇంట్లో విలువైన నగ పోయిందనిపించిన్పప్పుడు తన కింద పనిచేసే వాడే తీసుకుని ఉంటాడని అనుమానించి, ‘ఏదో ఒక బలహీన క్షణంలో నువ్వే తీసుకుని ఉంటావు. ఎవరికీ చెప్పనులే ఆ నగను నువ్వే తీసుకొచ్చి దాని స్థానంలో ఉంచు’ అని అక్కడినుంచి ఇంట్లోకి వెళ్లి చూస్తే యజమాని వాడే దుప్పటి మడతల్లో ఆ నగ ఉంటుంది. పొరపాటు గ్రహించి ఆ యజమాని తప్పునీది కాదు నాది అన్నప్పుడు అప్పటికే గుండె పగిలి ఇల్లు వదిలి పోతూన్న సేవకుడు అంటాడొకమాట.
‘పొరపాటు మీది కాదు. నాది బాబుగారూ.. మీరేమో నన్ను దొంగ అనుకున్నారు. నేనేమో మిమ్మల్ని పెద్ద మనిషి అనుకున్నాను అంతే..
మానవ సంబంధాలన్నీ పరస్పర విశ్వాసం మీదే నడుస్తాయి. అది చెదిరి మనసు విరిగితే మంచివాళ్లు మరక్కడ ఉండలేరు. ‘
చందమామలో పనిచేస్తున్న నా చిన్నిజీవితానికి రెండు మూడు సార్లు మాత్రమే ఫోన్ పలకరింపులతో ప్రేమాభిమానాలను ముద్దగా రంగరించి పరవశింపజేసిన అవసరాల రామకృష్ణారావు గారూ, మీరు మాత్రమే రాయగల గొప్పమాటలవి. మీరు మాత్రమే ముగించగల గొప్ప కథా ముగింపు ఇది.
‘మీరేమో నన్ను దొంగ అనుకున్నారు.నేనేమో మిమ్మల్ని పెద్ద మనిషి అనుకున్నాను…’
ఇంతకు మించి ఎవరినీ మారణాయుధంతో పొడవనసరం లేదు. ఇంతకు మించి మరెవ్వరినీ కత్తులతో కుళ్లబొడవనవసరం లేదు.. మనిషి మాటకున్న మహిమాన్విత శక్తిని ఇంతగా వ్యక్తీకరించిన గొప్ప వాక్యాన్ని ఇటీవల కాలంలో నేనయితే చూడలేదు.
మాస్టారూ! తొలి చందమామ కథ ‘పొట్టిపిచుక’లో మీరు పదిహేనేళ్ల వయసులో ప్రదర్శించిన ఆ విరుపు మిమ్మల్ని జీవితాంతం వదలిపెట్టలేదు. బహుశా మీరు రాసిన చివరి కథల్లో ఒకటై ఉండగల ఈ కథ -అవిశ్వాసం- కూడా విశ్వాసం చెదరడం అనే గొప్ప విలువను మహాకావ్య స్పురణతో చూపించింది.
తెలుగు సాహిత్యం ఎంత గొప్ప కథకుడిని పోగొట్టుకుందో బహుశా ఇప్పటికిప్పుడే ఎవరికీ అర్థం కాకపోవచ్చు. ఎంత గొప్ప విరుపుతో కూడిన రచనా శక్తిని మనం పొగొట్టుకున్నామో ఇప్పుడిప్పుడే మనకు బోధపడకపోవచ్చు. చివరకి ఇటీవలే ఆయన స్వాతి పత్రికలో రాసిన సరస రాహిత్యంతో కూడిన సరసమైన కథ భార్యాభర్తల సంబంధాల మధ్య ఘర్షణను,మారుతున్నసంబంధాలను కూడా కొత్త ధోరణితో ముగించి షాక్ తెప్పించింది.
‘అనుమతివ్వక పోతే అటాక్ చేయడం కూడా చేతకాని వాడు…’ అంటూ భర్తను భార్య కామెంట్ చేయగలగటం ఇంత వినూత్నశైలితో మీకు కాక మరెవ్వరికి సాధ్యమవుతుంది మాష్టారూ -స్వాతిలో వీరు రాసిన కొత్త కథ. కథ పేరు గుర్తు రావడం లేదు-
వయస్సు 80 సంవత్సరాలు దాటి ఉండవచ్చు కాని రాయకపోతే అనారోగ్యం అంటూ చెణుకుతూ అలసిన గుండె బాధను ప్రపంచానికి తెలియకుండా నవ్వించిన ఈ మాన్య వృద్ధ యువకుడిని ఎలా మర్చిపోగలం?
ఆయనతో నా చిన్ని పరిచయం ఎంత విషాదకరంగా ముగిసిందో ఊహించడానికే కష్టంగా ఉంది. గత శుక్రవారం సాయంత్రానికి డిసెంబర్ చందమామ సంచిక ఫైనల్ ప్రూప్ని ముగించి ఇంటికి వచ్చాను. మీ ‘అవిశ్వాసం’ కథ తప్పకుండా డిసెంబర్ నెలలోనే రాబోతుంది మాష్టారూ అంటూ ఆయనకు మంచి వార్త చెప్పి సంతోషపెట్టాలనుకున్నాను.
కాని “తొలి చందమామ కథకులు ఇక ఎవరూ లేరండీ”అంటూ సరిగ్గా గత శుక్రవారం రాత్రే రచన శాయి గారు ఫోన్లో చెప్పడం జీవితానికో దిగ్భ్రమ ఘటన.
నా ప్రపంచం గత 25 రోజుల పైగా ఇంట్లో అంతర్జాలానికి, సిస్టమ్కు దూరమైపోయింది. తెలిసి కూడా ఏమీ రాయలేకపోయాను. ఇప్పుడు కూడా పూర్తిగా రాయడం సాధ్యపడక ఇంతటితో ముగిస్తున్నాను.
గత జూలై చందమామ సంచికలో చందమామ పత్రికతో తన బాంధవ్యం గురించి ఆయన అపురూపంగా పంచుకున్న మధుర జ్ఞాపకాలను పాఠకుల కోసం మళ్లీ ఇక్కడ ప్రచురిస్తున్నాము.
చందమామతో నా జ్ఞాపకాలు
-శ్రీ అవసరాల రామకృష్ణారావు
అప్పుడు నా వయసు పదహారు -1947-. ఇప్పుడు ఎనభై -2011-. అప్పుడంటే ఎప్పుడని? చంద్రోదయమయినప్పుడు.అంటే తెలుగు పిల్లల అందాల మాసపత్రికగా చందమామ మొట్టమొదటి సంచిక వెలువడిన నాటి మాట. అందులో నే వ్రాసిన “పొట్టి పిచిక కథ” అచ్చవడం ఓ విధంగా నా సాహితీ ప్రస్థానానికి తొలి బీజం అవడం కన్న తీపి గుర్తు మరేముంటుంది! నాటి నా బాల్యంలో తొంగి చూసిన ఆ తొలికిరణపు రూపురేఖలే నేటి ఈ వృద్దాప్యంలో కూడా కొనసాగడం మించిన ఆశ్చర్యం, ఆనందం ఇంకేముందని!
అమ్మ చెప్పిన కథే అయినా, అందరికీ తెలిసిన కథే అయినా, మంచి ప్రింటుతో చక్కని బొమ్మలతో వచ్చిన నాటి ఆ చందమామ లోని కథాంశం నా మనసుమీద ఇంప్రింటు చేసేసినట్లుంది! ఓ బడుగు జీవి తను కష్టపడి సాధించుకున్నది అది వేషమే ఔగాక, పోగొట్టుకుంటుంది. ఎంతమందినో కలుసుకుని, ఎవరూ కలిసిరాకపోయినా, పట్టుదల వదలక, చివరికి విజయం సాధిస్తుంది. అదీ ‘పొట్టి పిచిక కథ’ అదే నా విజయసూత్రం అవుతుందని ఆనాడనుకోలేదు!
వెయ్యి పైగా రచనలు చేసి, ఈనాటికీ తల వంచక, కలం దించక తెలుగు కథకుడిగా కొనసాగుతున్న నాకు వేగుచుక్క ఆ కథే కదా! పక్షులతో జంతువులతో మనుషుల్ని కలిపి సామాజికాంశాల్ని సరళంగా చెప్పవచ్చునని నేను నేర్చుకున్నది. చందమామ పత్రిక చలవవల్లనే. ‘గణిత విశారద’ అనే నవల రాసింది చందమామ పఠన స్పూర్థి తోనే. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి 1969లో బహుమతి పొందిన నా ‘అర్థమున్న కథలు’ పబ్లిషర్స్ చందమామ రక్తసంబంధీకులు ‘యువప్రచురణలు’ వారే. అంతేకాదు. నేను చలసాని-చక్రపాణి అవార్డు అందుకోడం కూడా తత్సంబంధమైన సత్సాంప్రదాయమే.
సైజుతో పాటు చురుకుతనంలో కూడా నాటి పొట్టి పిచిక లక్షణాలు ఇప్పటికీ నాలో మిగిలి ఉన్నాయని నా మీద నేను వేసుకునే సోకైన జోకు!
చందమామ కథ ఇచ్చిన ఊపుతో నేన్రాసి పుస్తక రూపంలో వచ్చిన పిల్లల రచనల గురించి ఇక్కడ చెప్పుకోడం అప్రస్తుతం కాదనుకుంటాను. ‘కేటూ డూప్లికేటూ’, ‘మేథమేట్రిక్స్’ మూడు భాగాలూ, ‘ఆంగ్రేజీ మేడీజీ’ ‘ఆంగ్రేజీ యమఈజీ’ ఇలా మరో అరడజనువరకు చిరు సరుకు దొరుకు.
నెలనెలా వెన్నెలలద్దుకుని, చకచకా సొగసులు సరిదిద్దుకుని, పదారుభాషల వారి కితాబులందుకుని భారతీయ పత్రికగానే కాక, అంతర్జాతీయ స్థాయిని చేరుకున్న చందమామ పుట్టింది మన భాషలోనే అని తలుచుకుంటే ఉప్పొంగని తెలుగు గుండె ఉండదు. కాలక్షేపం కథలతోనే సరిపెట్టుకోక శాస్త్రీయ పరిశోధనాత్మక వ్యాసాలూ, మెదడుకి మేతగా పోటీలూ, అన్యభాషలు నేర్పే ఏర్పాట్లూ– ఇవన్నీ కంటికి నదురైన రంగులతో, అచ్చుతో, అనువైన సైజుతో ఇక్కడ కాక మరెక్కడ దొరుకుతుందని! ఈ సంస్థ పుస్తకరూపంలో పిల్లలకందించే విజ్ఞాన వర్గకోశాలు ఎన్నెన్నని! ఇంతెందుకు ఇటీవల వీరు ప్రచురించిన చందమామ Art Book చూశారా! పదిహేనువందల ఖరీదు కాస్త ఎక్కువే అనిపించవచ్చు కాని అది అందించే శతకోటి అందాల మాట?
నా తొలి ప్రేమ చందమామ. వాక్రూప వర్ణార్ణవం…
ఈ నాటికీ కథాసుధల్ని వెదజల్లుతూ హాయిగా జీవించగలిగే నా మనోధృతికి నాటి చందమామే మదురస్మృతి!
Filed under First Chandamama writer | Comments (9)చందమామలు బ్లాగ్ పునర్దర్శనం
గత నెల 20వ తేదీ తర్వాత చందమామలు బ్లాగు మళ్లీ హఠాత్తుగా మాయమయింది. బ్లాగు.కామ్ -blaagu.com అప్డేషన్ జరుగుతున్నందున దీంట్లోని బ్లాగులు కనిపించడం లేదని త్వరలో వీటిని తిరిగి తీసుకువస్తామని నిర్వాహకులు అలర్ట్ చేశారు. నేను గమనించక ముందు కొద్ది రోజులు, గమనించిన తర్వాత చాలా రోజులు సుషుప్తావస్తలో ఉన్న చందమామలు బ్లాగు సరిగ్గా నెలరోజుల తర్వాత నిన్నటి నుంచి మళ్లీ ఉనికిలోకి వచ్చింది.
నా బ్లాగ్ కనిపించడం లేదని బ్లాగు. కామ్ నిర్వాహకులకు మెయిల్ పెట్టిన తర్వాత వారు ఆలస్యంగా చూసుకున్నట్లున్నారు. మెయిల్ చూడలేదని రెండు రోజుల్లోనే ఈ లోపాన్ని సరిచేయగలమని వారు చెప్పినట్లు సరిగ్గా రెండు రోజుల్లోపే ఈ బ్లాగు మళ్లీ యాక్టివేట్ అయింది.
నెలరోజులు బ్లాగ్తో, బ్లాగర్లతో సంబంధాలు కోల్పోయి తిరిగీ మీముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది.
ఇంటిలో సిస్టమ్ ఈ సమయంలోనే మొరాయించి మోడెమ్ పాడవడంతో కొత్తది తీసుకోవడం లేటవుతోంది. గత ఏడేళ్లుగా నిర్విరామంగా, రిపేర్ అన్నదే లేకుండా పనిచేసిన నా సిస్టమ్ కూడా ఈ సమయంలోనే మొరాయించేసింది. వీలైనంత త్వరలో ఈ సమస్యనుంచి బయటపడగలనని అనుకుంటున్నాను. అంతవరకు రెగ్యులర్ బ్లాగ్ అప్డేషన్లు బహుశా సాధ్యం కాకపోవచ్చు.
ఈ సాంకేతిక సమస్యలకు తోడు కొన్ని వ్యక్తిగత సమస్యలు – కుటుంబంలో జ్వరాలు, మొబైల్ పోవడం. పాత నెంబర్ మీదే కొత్త సిమ్ తీసుకుంటే వొడాఫోన్ వారు ఉన్న కాస్తంత ఓపికకు కూడా పరీక్ష పెట్టి విసిగించడం వంటివి- కూడా ఒకేసారి తోడై బాగా ఇబ్బంది పెట్టాయి. నంబర్ పోర్టబిలిటీకోసం ప్రయత్నం జరుగుతోంది. ఇలా సినిమా కష్టాలు లాగా సమస్యలన్నీ ఒకేసారి రావడంతో కాస్త తేరుకునే క్రమంలో ఉన్నాను.
నా పాత మొబైల్ నంబర్ ని నంబర్ పోర్టబిలిటీ కింద మార్చుకుంటున్న ప్రక్రియ కాస్త ఆలస్యమ వుతోంది. పాత నెంబర్ -9884612596- సరిగా పనిచేయడం మొదలయ్యేంత వరకు నా కొత్త నంబర్ -రిలయెన్స్- ని మిత్రుల సౌకర్యం కోసం ఇస్తున్నాను.
7305018409
ఈ రెండు నంబర్లూ నావిగానే ఉంటాయి – (మళ్లీ మొబైల్ పోయేంతవరకు)
రాజు
చెన్నయ్
వరుస సమస్యలతో.. నా మరో బ్లాగు ‘నెలవంక’ కూడా అప్ డేట్ కాలేదు
kanthisena.blogspot.com
మళ్ళీ అంతర్జాలంలోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది.
సినిమా కష్టాలు అని నవ్వుకుంటామే గాని కష్టాలు ఒకేసారి వస్తాయనడం నిజమే.. సినిమా కష్టాలు అని తీసిపారేయకూడదేమో…
Filed under బ్లాగ్ కష్టాలు | Comments (2)ఆదిలక్ష్మిగారు : చందమామ జ్ఞాపకాలు
ఆపీసులో కూర్చుని పనిచేస్తుంటే కూడా ఆదిలక్ష్మి గారి కుటుంబ విషాద పరిణామాలు గుర్తుకొచ్చి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. ప్రస్తావనకు వస్తుంటేనే బాథ తన్నుకొస్తోంది. విషయం మా పైవాళ్లకు క్లుప్తంగా తెలిపి మౌనంగా ఉంటున్నాను. ఈ మౌనం కూడా నన్ను కాలుస్తోంది. భరించక తప్పదు. వృత్తిగత సంబంధంలో ఎంత గొప్ప మేధో సాహచర్యం వారి కుటుంబంతో అబ్బిందో మాటల్లో చెప్పలేను. తల్చుకుంటేనే దుఖం దుఖంగా ఉంటోంది.
విషయం తెలియగానే చందమామ కార్యాలయంలో విషాద వాతావరణం. ఈ సెప్టెంబర్ నెల చందమామలో అచ్చయిన “తీపికి చేదు చెల్లుకు చెల్లు” కథ ఆమె రాసిందే అని చెప్పగానే అందరూ కదిలిపోయారు. చిన్న పిల్ల తెలిసీ తెలియని వయసులో తీసుకున్న అనూహ్య నిర్ణయం ఒక పచ్చటి కుటుంబం పునాదిని ఎంతగా కదిలించివేసిందో తల్చుకుంటూ బాధపడ్డారు. కార్పొరేట్ విద్య పెడుతున్న అపరిమిత ఒత్తిడి మాత్రమే కాకుండా పిల్లలను ఇంత సున్నితంగా మారుస్తూ, వారిని అవాంఛనీయ చర్యలవైపు కొట్టుకుపోయేలా చేసే ప్రథమ శత్రువు టెలివిజన్ అంటూ విమర్శించారు.
కష్టాలొస్తే ఉరి ఒక పరిష్కారం అనేంత భయంకరమైన రీతిలో టీవీలు ప్రదర్శస్తున్న సీరియల్స్, ఉరి తగిలించుకుంటున్న దృశ్యాలు పిల్లల సున్నితత్వంపై దెబ్బతీస్తున్నాయని ఫీలయ్యారు. పిల్లల విషయంలో ఎలా ఉండాలో, వారి మనస్సులో దాగి ఉన్న విషయాలను ఎలా బయట పెట్టాలో కూడా తెలియడం లేదంటూ తమ తమ అనుభవాలు పంచుకున్నారు.
చందమామ ఇటీవల సంపాదించుకున్న ఓ మంచి కథా రచయిత్రి ఆదిలక్ష్మిగారు. ఆన్లైన్ చందమామలో తన చందమామ జ్ఞాపకాలు ద్వారా ఆమెతో ఏర్పడిన పరిచయం తర్వాత కథకురాలిగా, అనువాదకురాలిగా బహు రూపాలలోకి విస్తరించింది. స్కేల్ పెట్టి కొలిచినట్లుగా అక్షరాలను ఎంత అందంగా ఆమె చెక్కుతారో. ఆమె 2010లో రాసి పంపగా ఆన్లైన్లో, ఈ బ్లాగులో ప్రచురించిన ‘చందమామ జ్ఞాపకాలు’ చూస్తే తెలుస్తుంది.
ఆమెకు కలిగిన తీరని కష్టానికి చలించిపోతూనే ఆమెగురించి తెలిసినవారికోసం, చందమామ పాఠకులకోసం ఆమె గతంలో పంపిన చందమామ జ్ఞాపకాలు ప్రచురిస్తున్నాము. తెలుగు అక్షరాలపై ఇంత పట్టు ఉన్న, ఇంత చక్కటి భావుకత, అద్వితీయ ఊహాశక్తి కలిగిన ఈ చందమామ కథకురాలి చందమామ జ్ఞాపకాలను ఇక్కడ ముందస్తు పరిచయంతో పాటు మరోసారి చూడగలరు.
పరిచయం:
‘చందమామ’ జ్ఞాపకాలకు సంబంధించి ‘అమ్మఒడి’ ఆదిలక్ష్మిగారిది ఓ వినూత్న అనుభవం. చిన్నప్పుడు నాన్న చదివి వినిపిస్తే తప్ప చందమామ కథను వినలేని అశక్తత లోంచి ‘నేనే చదువు నేర్చుకుంటే పోలా’ అనే పట్టుదలతో, స్వయంకృషి తోడుగా శరవేగంగా చదువు నేర్చుకున్న అరుదైన బాల్యం తనది. ఈ తీపి జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే ఇక్కడ కొద్దిగా విందాం..
“నాన్నకి చదవటం వచ్చు కాబట్టి కదా చక చకా చదివేసాడు. మొదటి సారి ఇష్టంగా చదివేసేవాడు. మళ్ళీ చదవమంటే కుదరదనే వాడు.
’అదే నాకూ చదవటం వస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంచక్కా చదివేసుకోవచ్చు’ – అన్న భావన, అక్షర క్రమం తెలియకుండానే మనసుకి అందింది. చదవటం రాక చందమామ బొమ్మలు పదేపదే చూసుకునే కొద్దీ పసి మనస్సు లోతుల్లో అక్షరాలు నేర్చుకోవాలనే తపన పెరిగింది.
వీధిబడిలో చేర్చగానే, ఇష్టంగా మారాం చేయకుండా అక్షరాలు నేర్చేసాను. పెద్ద బాలశిక్ష చాలా కొద్దీ రోజుల్లో పూర్తి చేసాను. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పటికే నాకు కథలు చదవటం వచ్చేసింది.
ఆ విధంగా చందమామ నాకు చదవటం నేర్పింది. చదువు కోవాల్సిన అవసరం నేర్పింది. చదువు నేర్పిన గురువుని గౌరవించటమూ నేర్పింది.”
చందమామ ద్వారా చదవటం నేర్చిన, చదువు నేర్పిన గురువును గౌరవించడం నేర్చిన ఆదిలక్ష్మిగారు, ఒకప్పుడు నాన్నతో తను పొందిన అనుభవాన్ని తన పాపాయి నుంచి కూడా ఎదుర్కొన్నారట. చందమామ కథను ఒకసారి చదివి వినిపిస్తే మళ్లీ మళ్లీ వినాలి అనే కుతూహలంతో తప్పుల తడకగా చందమామ కథను చదివి నవ్వించే పాప గీతాప్రియదర్శిని, ఒకట్రెండుసార్లు చదివి ఇక కుదరదంటే “నేను పెద్దయ్యాక నా పాపకి నీలా చదవను ఫో అనను. ఎన్నిసార్లయినా చదివి వినిపిస్తాను తెలుసా?” అంటూ బుంగమూతి పెట్టేదట.
ఇదీ చందమామ ఘనత, చందమామతో బంధం అల్లుకున్న తరతరాల తెలుగు కుటుంబాల ఘనత. ఆదిలక్ష్మిగారు, ఆమె జీవన సహచరుడు, వారి పాపాయి దశాబ్దాలుగా నింగిలోని చందమామతో పాటు నేలమీది ‘చందమామ’తో కూడా చెలిమి కొనసాగిస్తున్నారు. నేలమీది ‘చందమామ’తో ఇటీవలి వరకు ప్రత్యక్ష సంబంధం లేని ఆదిలక్ష్మి గారు ఇటీవలే చందమామతో పరిచయంలోకి వచ్చారు.
నాన్న ద్వారా పరిచయం అయిన చందమామను కన్నకూతురికి కూడా పరిచయం చేయడమే కాదు… తాను పాఠాలు చెబుతున్న స్కూలు పిల్లలకు కూడా కథామృతాన్ని పంచిపెడుతూ, రేపటి తెలుగు తరాన్ని తయారుచేస్తున్న ఆదిలక్ష్మిగారూ… మీ చందమామ కుటుంబాన్ని చూసి చందమామ సిబ్బందిగా మేం గర్వపడుతున్నాం.
చందమామతో మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఆదిలక్ష్మి గారి చందమామ జ్ఞాపకాలు పూర్తి పాఠం ఇక్కడ చూడండి.
————–
అరచేతిలో అందాల చందమామ
ఆదిలక్ష్మి
బాల్యం నుండి ఇప్పటికీ చందమామ మా జీవితంలో ఓ భాగం. అక్షరాలు నేర్చుకోవాలన్న ఆకాంక్షని రేకెత్తించిందే చందమామ.
అమ్మఒడిలో కాళ్ళు చేతులు ఆడిస్తూ, స్వయంక్రీడా వినోదితమైన శైశవ దశలో, ఎవ్వరికైనా పంచభూతాలైన భూమి (మట్టి), ఆకాశం(చందమామ), అగ్ని (వెలిగే దీపం), గాలి, నీళ్ళు పరమ ఆకర్షణలు!
’అనగ అనగా ఓ రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఏడుగురూ వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చారు’ అంటూ కథ చెబితే ’ఊ’ కొట్టటం వచ్చిన నాటి నుండే ఆకాశంలోని చందమామతో పాటు అరిచేతిలోని చందమామా పరమ ఆకర్షణే!
రంగు రంగుల బొమ్మలు; ఒంటికొమ్ము రాక్షసులు, చింతచెట్టు దెయ్యాలు, మాయల మారి మాంత్రికులు, బుద్ది చెప్పే గ్రామాధికారులు, మంచి దారిలోకి మారిపోయే గజ దొంగలు…. ఎన్నో పాత్రలు! ఇతిహాసాలు నేర్పిందీ చందమామే!
విచిత్ర కవలలు జానపద కథలతో వింత లోకాలకి తీసి కెళ్ళిందీ చందమామే!
చిన్నప్పుడు…. అప్పటి కింకా బడిలో చేరలేదు. నాన్న ప్రతి నెలా చందమామ తెచ్చేవాడు. నాన్న చందమామ బిగ్గరగా పైకి చదవాలంటే, ఇద్దరు ఆయన కాళ్ళు పట్టాలి. ఒకరు ఆయన తల దగ్గర కూర్చొని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి మెల్లిగా మర్ధన చెయ్యాలి. అప్పుడు గాని బిగ్గరగా చదివేవాడు కాదు.
తల దగ్గర కూర్చొన్న వాళ్ళు, బొమ్మలు కూడా కనబడుతుండగా కథ వినవచ్చన్న మాట. ఎప్పుడూ నేనే నాన్న తల దగ్గర కూర్చొనే అవకాశం పొందేదాన్ని. నాన్న కథలన్నీ ఒకసారి చదివి పెట్టేవాడు. అంతే! మళ్ళీ మళ్ళీ చదవమంటే “మొన్నే చదివాను కదమ్మా!” అనేవాడు.
నాన్నకి చదవటం వచ్చు కాబట్టి కదా చక చకా చదివేసాడు. మొదటి సారి ఇష్టంగా చదివేసేవాడు. మళ్ళీ చదవమంటే కుదరదనే వాడు.
’అదే నాకూ చదవటం వస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంచక్కా చదివేసుకోవచ్చు’ – అన్న భావన, అక్షర క్రమం తెలియకుండానే మనసుకి అందింది. చదవటం రాక చందమామ బొమ్మలు పదేపదే చూసుకునే కొద్దీ పసి మనస్సు లోతుల్లో అక్షరాలు నేర్చుకోవాలనే తపన పెరిగింది.
వీధిబడిలో చేర్చగానే, ఇష్టంగా మారాం చేయకుండా అక్షరాలు నేర్చేసాను. పెద్ద బాలశిక్ష చాలా కొద్దీ రోజుల్లో పూర్తి చేసాను. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పటికే నాకు కథలు చదవటం వచ్చేసింది.
ఆ విధంగా చందమామ నాకు చదవటం నేర్పింది. చదువు కోవాల్సిన అవసరం నేర్పింది. చదువు నేర్పిన గురువుని గౌరవించటమూ నేర్పింది.
చందమామ బొమ్మలు చూసి ఏకలవ్వుడులా రంగుల్లో బొమ్మలు వేయటం నేర్చాను. నా అనుభవాలన్నీ మా వారితో పంచుకోబోతే తానూ మరికొన్ని అనుభవాలు చెప్పాడు. మా పాపని చూస్తే నా బాల్యం మరో సారి కళ్ళముందు కదలాడింది. (రంగుల్లో బొమ్మలతో సహా)
ఓ సారి చదివేసిన చందమామని, మళ్ళీ మా చేత చదివించుకునేందుకు, మా టక్కరి పాప చందమామ పట్టుకుని పక్కనే పడుకుని ఒక్కో పుట తిప్పుతూ తనకి అర్ధమైన కథని తప్పుల తడకగా చెప్పేది. “అలా కాదు నాన్నా! ఆ కథలో ఇలా ఉంది” అని పొరబాటున అన్నామో! అంతే…. “మళ్ళీ చదవవూ” అంటూ బతిమాలేది.
ఒకట్రెండుసార్లు చదివి ఇక కుదరదంటే “నేను పెద్దయ్యాక నా పాపకి నీలా చదవను ఫో అనను. ఎన్ని సార్లయినా చదువుతాను తెలుసా?” అంటూ బుంగమూతి పెట్టేది. “అయితే ముందు నువ్వే చదవటం నేర్చుకో!” అని అనటంతో అక్షరాలు అలవోకగా నేర్చింది.
అదీ చందమామ! అందాల చందమామ! అరచేతిలో చందమామ! కథలతో జీవితాన్ని అనుసంధానించి, భారతానికి రామాయణానికి భగవంతుడికీ దగ్గర చేసింది చందమామ. గురువుకి చెప్పినంత కృతజ్ఞత చందమామకీ చెప్పాలి!
మా విద్యార్ధుల్లో ఒకరి ఇంట్లో చందమామలు బైండింగ్ చేయించి మరీ గృహ గ్రంధాలయంలో దాచి ఉంచుకుంటే చూచి “అబ్బా! వీళ్ళెంత సంపన్నులో కదా!” అన్పించింది.
(నాన్న ద్వారా పరిచయం అయిన చందమామను కన్నకూతురికి కూడా పరిచయం చేయడమే కాదు… స్కూలు పిల్లలకు కూడా కథామృతాన్ని పంచిపెడుతూ, రేపటి తెలుగు తరాన్ని తయారుచేస్తున్న ఆదిలక్ష్మిగారికి… చందమామతో తమ జ్ఞాపకాలను పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. సం.)
ఇది 2010 ఏప్రిల్ 9న చందమామ వెబ్సైట్లో, బ్లాగులో ప్రచురించబడిన కథనం.
తెలిసి తాను జీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదని, కానీ 18 ఏళ్లుగా కష్టాలమీద కష్టాలను ఎదుర్కొంటున్నానని ఆదిలక్ష్మిగారు మాటలో సందర్బంలో చెప్పేవారు. ఎన్ని దెబ్బలు తగిలినా కోలుకున్నానంటే, నిబ్బరంగా సహిస్తున్నానంటే తాను నమ్మిన భగవద్గీతే కారణమని, అంతులేని కష్టాల్లో కూడా అనంత శక్తిని ఇస్తూ బతికిస్తూ వచ్చింది ఆ గీతాసారమే అని ఆమె పదే పదే అనేవారు.
ఎంత మంచి మనిషికి, ఎంత మంచి కుటుంబానికి ఇంత కష్టం తగిలింది?
Filed under అమ్మఒడి ఆదిలక్ష్మి | Comments (5)లెనిన్ లేరు… ఆదిలక్ష్మి ఉండలేరు…
సుజాతగారు, వలబోజు జ్యోతి గారు చెప్పిన ఒక విషాదవార్తను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గీతాప్రియదర్శిని కన్నతల్లిదండ్రులు, అమ్మఒడి తదితర తెలుగు ఇంగ్లీషు బ్లాగుల నిర్వాహకులు ఆదిలక్ష్మి, లెనిన్బాబు గార్లు.. జీవితం నుంచి సెలవు తీసుకునే ప్రయత్నం చేశారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల వేళ కూడా నాతో మాట్లాడిన లెనిన్ బాబు గారు ఇక లేరు. నిద్రమాత్రలు మింగిన ఆదిలక్ష్మిగారు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితినుంచి కోలుకుంటున్నారని వార్త. (స్వచ్చందంగానే వారిద్దరూ లోకంనుంచి తప్పుకోవడానికి సిద్ధపడే ఇలా చేశారని సుజాత గారి తాజా వార్త -బజ్ ద్వారా- ద్వారా తెలుస్తోంది. )
జూలై 15న గీతాప్రియదర్శిని విద్యాశిక్షణా పరమైన ఒత్తిళ్లకు లోనై జీవితం ముగించుకున్నప్పటినుంచి ఈ కన్న తల్లిదండ్రులకు తమ జీవితమే ఓ ప్రశ్నార్థకమైపోయింది. ‘అమ్మఒడిని లేకుండా చేశారు, అమ్మఒడిని చంపేశారు’ అంటూ ఆరోజు ఆదిలక్ష్మిగారు ఫోన్లో చేసిన ఆక్రందన ఇంకా వెంటాడుతూనే ఉంది.
-20 ఏళ్లక్రితం ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా పారిశ్రామికురాలిగా జీవితం మొదలెట్టిన ఈమె జీవితంలో అనూహ్యమైన ఎత్తుపల్లాలను చవిచూసి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జాతీయంగా అంతర్జాతీయంగా పాలకవ్యవస్థలు సాగిస్తూ వస్తున్న రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలపై కణిక వ్యవస్థ పేరుతో వందలాది కథనాలు అమ్మఒడి తదితర బ్లాగుల్లో రాశారు.-
నిన్న సాయంత్రం -శుక్రవారం- కూడా లెనిన్ బాబుగారితో చందమామ ఆఫీసునుంచి ఫోన్ చేసి మాట్లాడాను. ఆదిలక్ష్మిగారు గతంలో పంపిన కథ “తీపికి చేదు చెల్లుకు చెల్లు”ను ఈ సెప్టెంబర్ నెలలోనే చందమామ ప్రచురించిందని, మీ కొత్త చిరునామా పంపితే చందమామ కాపీ, రెమ్యునరేషన్ పంపుతామని, ఆయనతో మాట్లాడితే శనివారం తప్పుకుండా చిరునామా పంపుతానని చెప్పారు. తీరా శనివారమే ఘోరం జరిగిపోయింది. లెనిన్గారు ఉన్నారు కాబట్టే ఆమె గత నెలన్నర రోజులగా బతికి ఉన్నారు.
వ్యవస్థపై తమదైన పోరాటంలో వాళ్లిద్దరూ తన చిట్టితల్లి గీతాప్రియదర్శినిని తమ జీవిత సర్వస్వంగా ప్రేమించారు. పదిహేనేళ్లకు పైగా వారు పడుతూ వస్తున్న తీవ్ర ఆర్థిక, మానసిక బాధలకు కన్నకూతురిపై ప్రేమ రూపంలో వారికి స్వాంతన దొరికిందనుకుంటాను. భారతీయ సాంప్రదాయిక విశ్వాసాలపై ఎనలేని ప్రేమ గల ఆమెకు తన కన్న కూతురు చితాభస్మాన్ని గంగానదికి తీసుకెళ్లి కలపాలని ఉండేది.
స్థలం మారితే అన్నా కాస్త తెప్పరిల్లుతుందేమో అనిపించి, ఈ విషయం లెనిన్ బాబుగారు వారం రోజుల క్రితం చెబితే తప్పకుండా తీసుకెళ్లమని చెప్పాను. చివరకు ఆ కోరికకూడా తీరనట్లుంది. ఎన్నడూ లేనిది శుక్రవారం మాట్లాడినప్పుడు ఆయన గొంతు చాలా డల్గా వినిపించింది. మీరెలా ఉన్నారు. ఆమె కోలుకున్నారా అని అడిగితే బతకాలి కాబట్టి బతుకుతున్నాం అన్నారు. ఇప్పుడనిపిస్తోంది. ఆయన అప్పుటికే ఇక జీవితం వద్దు అని నిర్ణయానికి వచ్చారేమో.
వారు కన్నకూతురు తమనుంచి దూరమయినందుకు కూడా పెద్దగా బాధపడలేదనుకుంటాను. కాని నరకబాధలు పెట్టిన ఆ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని చివరిసారిగా కలిసి ఒకే కోరిక కోరారట. ఏమంటే ఆ సెంటర్లో పాపను ఒక పనామె చాలా బాగా చూసుకుందట. రోజూ ప్రియదర్సిని ఆ పనామె ఆదరణ గురించి ఇంట్లో చెప్పేదట. బతికి ఉండగా తమ పాపను స్కూల్లో అందబాగా చూసుకున్న ఆ పనావిడకు కృతజ్ఞతలు చెబుతామనే ఉద్దేశంతో ఆమెను చూపించమని నిర్వాహకుడిని అడిగితే ఆమె క్లాసుల వద్దకు పనిమీద వెళ్లిందని, కలపడం కుదరదని చెప్పాడట ఆ రాక్షసుడు.
తమ పాప మరణానికి కారణమంటూ కోచింగ్ సెంటర్ మీద కేసు పెట్టాలని ఎంతో మంది సలహా ఇచ్చినా మనిషే పోయాక ఇక కేసు ఎందుకు అనే నిర్వేదంలో ఆ పనికి పూనుకోలేదు వీళ్లు. అలాంటిది ఆ నిర్వాహక రాక్షసులు ఆ పనామెను చివరిసారిగా కలుసుకునేందుకు కూడా తమకు అవకాశం ఇవ్వకపోవడం చూసిన క్షణంలోనే వారి గుండె బద్దలయిపోయింది. లోకం ఎందుకింత అన్యాయంగా మారిపోయిందనే వేదన… కూతురు ప్రాణాలు పోవడానికి కారకులైనవారిని కూడా క్షమించిన తమ పట్ల ఇంత నిర్దయగా వారు ఎలా వ్యవహరించారన్న ఆక్రోశం.. వారి బాధను మరింత రెట్టింపు చేసి ఉన్నట్లుంది.
జూలై 15న చందమామలు బ్లాగులో ప్రియదర్శిని ఆత్మహత్య గురించి ప్రచురించిన కథనాన్ని వాళ్లు చాలా లేటుగా చూశారట. నా అభ్యర్థనను మన్నించి కొంతమంది అజ్ఞాతంగా పంపిన సహాయానికి లెనిన్ బాబు గారు కృతజ్ఞతలు చెప్పారు. సానుభూతి కంటే, తమను మరింతగా పట్టించుకుని ఉంటే, ఇంటివద్దకు ఎవరైనా వచ్చి కలిసి ఉంటే, ఆమెకు స్వాంతన చెప్పి ఉంటే చాలా బావుండేదని ఆయన బాధ వ్యక్తం చేశారు.
ఒక మాటమాత్రం నిజం. వాళ్లు మహానగరంలో ఉండి కూడా భయంకరమైన ఒంటరితనం బారిన పడే ఈ ఘోరానికి పాల్పడ్డారనిపిస్తోంది. పిల్లలకోసం పెట్టిన స్కూలు కూడా నిలిపేశారు. బంధువుల ఒత్తిడి మేరకు వారికి దగ్గరగా ఉన్న అద్దె ఇంటికి మారారు. రెండు నెలలపాటు ఏ పనీ లేకుండా, పైగా అపరిమిత బాధలో ఉన్న ఈ తల్లిదండ్రులు ఇరవై ఏళ్లుగా తాము చేస్తున్న జీవన పోరాటం ఇక చాలని అలసి పోయారనుకుంటాను.
గత పద్దెనిమిదేళ్లుగా బంధువులకు పూర్తిగా దూరమైపోయిన వీళ్లు ఈ మధ్యనే ఓ ఫంక్షన్ కోసం హైదరాబాదుకు వెళ్లి బంధువులను అందరినీ కలిసి వచ్చారు. నంద్యాలలో ఎందుకు దూరంగా ఉండటం మహానగరానికి వస్తే మా పిల్లలే చాలామంది ఉన్నారు. స్కూలు పెడితే బాగా జరుగుతుంది అని భరోసా ఇస్తే నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్లారు. బతుకు జరగడం మాటేమిటో కానీ మహానగరం నిలువునా ఒక కుటుంబాన్ని కాల్చేసింది.
పాప చనిపోవడానికి నెలరోజుల క్రితం కూడా, ‘ఒక్కసారి చెన్నయ్ రండి, మీ కుటుంబం ఫోటోలు పంపండి’ అని శోభ కోరితే ‘నేరుగా వచ్చి కనబడితే సర్ప్రయిజ్గా ఉంటుంది కదా. వీలైనంత త్వరలో వస్తాము’ అని చెప్పింది. వృత్తిపర సంబంధంలోకి వచ్చిన నాకంటే శోభతో ఆమె చాలా విషయాలు పంచుకుందట. “లక్ష్మిగారు ఎంత ధైర్యంగా ఉండేవాళ్లు ఇలా ఎలా చేయగలిగారు” అని శోభ ఇప్పుడు షాక్ తింటూ వలవలా ఏడ్చేసింది. ఆమె ఫోన్లో నవ్వితే కూడా అంత స్వచ్ఛంగా, ఆనందంగా వినిపించేదని, అన్ని బాధలు, బరువులు, ఒత్తిళ్లు సంవత్సరాలుగా మోస్తూ కూడా ఎలా భరించి ఆమె అంత సహజాతిసహజంగా నవ్వగలిగేదని శోభకు ఆశ్చర్యం. -కారుణ్య.బ్లాగ్స్పాట్.కామ్-
నంద్యాలలో ఉన్నప్పుడు ఆమె అద్దె తక్కువగా ఉంటుందని టౌన్కు ఆనుకుని ఉన్న పల్లెలో ఇల్లు తీసుకున్నారు. ప్రకృతంటే ప్రాణం, పక్షులంటే ప్రాణం, రోడ్డుమీద తిరుగాడే పశువులంటే ప్రాణం, సాయంత్రం వేళల్లో ఇల్లు వదిలి వాళ్లిద్దరూ, అప్పుడప్పుడూ పాప కూడా పల్లె బాటలో పొలాల గుండా నడుస్తున్నప్పుడు మంద్రమంద్రంగా వీచే ఆ చల్లటి గాలి గురించి, పల్లె అందాల గురించి ఎన్నిసార్లు ఆమె మాట్లాడారో.. హైదరాబాద్లో కొత్తగా స్కూలు తెరిచి పిల్లలకు పాఠాలు చెబుతుండగా వారికి మంచినీళ్ల క్యాన్లను కూడా అందనీయకుండా చేసిన, తమను చిరకాలంగా వెంటాడుతూ వస్తున్న ఆ అదృశ్య శక్తుల గురించి నవ్వుతూనే ఎంత ధర్మాగ్రహం ప్రకటించారో.
రంగనాయకమ్మగారు ‘జానకి విముక్తి’ నవలలో సత్యం పాత్ర ద్వారా పలికిస్తారు. కష్టాల పట్ల సానుభూతి ప్రకటించగల హృదయం ఉండీ కూడా లోకంలో చాలామంది సహాయం చేయలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారనే అర్థంలో సత్యం, విశాలాక్షికి ఉత్తరం రాస్తాడు. పాతికేళ్ల క్రితమూ ఇంతే. ఇప్పుడూ ఇంతే.
చెన్నయ్ నుంచి 400 కిలోమీటర్లు దూరంలో ఉన్న హైదరాబాదుకి వెళ్లి వారిని పలకరించలేకపోయాను. ఆమె కోలుకోవడం కష్టమనిపిస్తున్నప్పటికీ కొన్నాళ్లు ఆమెకు తోడు నీడగా ఉండి కాపాడుకోమని లెనిన్ బాబు గారికి చెప్పానే గాని, భరించలేమనుకున్నప్పుడు కొన్నాళ్లు అన్నీ వదిలి చెన్నయ్కి వచ్చి మావద్ద ఉండమని చెప్పలేకపోయాను.
కొన్నాళ్లు వాళ్లిద్దరినీ అలా వదిలేస్తేనే బాగుంటుందని పూర్తిగా కోలుకుంటే తప్పక కలుసుకోవచ్చనుకున్నామే కాని ఒకటన్నర నెల కాకముందే ఇంత ఘోరానికి ఒడిగడతారని అస్సలు ఊహించలేదు. పాప, ఇప్పుడు ఆమె జీవన సహచరుడు కూడా లేకుండా మిగిలిన ఆమె విషం మింగి కూడా బయటపడిందని తెలుస్తోంది. బతికి బయటపడినా ఆమె జీవచ్చవమే. ఆమె జీవిస్తుందనే భరోసా ఈ క్షణంలో నాకయితే కలగడం లేదు. అమ్మ ఒడి నిజంగా ఇప్పుడే ఇవ్వాళే ఖాళీ అయిపోయింది.
తిరుపతిలో ఎలక్ట్రానిక్ షాపులో పనిచేస్తూ చేస్తూ ఉన్నట్లుండి ఇంటికి రాకుండా మాచెల్లెలు కొడుకు మాయమైపోతే గత ఆరునెలలుగా వాడి అనుపానులు కూడా తెలియని స్థితిలో ఉన్నాం మేం. మావాడు కనిపించలేదని పోలీసు స్టేషన్లో కంప్లయింట్ చే్స్తే దానికి అతీ గతీలేదు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మేనకోడలు మహానగరం నడిబొడ్డున స్వంత ఇంట్లో చంపబడితే కూడా దిక్కులేదు ఈ దేశంలో… మాలాంటి, మనలాంటి సామాన్యుల సమస్యలకు ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో అర్థం కాని పరిస్థితి.
చదువుల కోసం, మంచి బతుకుకోసం రాష్ట్రం నుంచి వేలాది కిలోమీటర్ల దూరానికి మనుషులు వెళ్లిపోతున్నారు. దగ్గరే ఉండి కూడా ఇబ్బందుల్లో ఉన్నవారిని, పిడుగుపాటుకు గురయినవారిని కలవలేకుండా ఉన్నాము. రాతలకు చేతలకు మధ్య సంబంధం ఎక్కడో పెటిల్లున తెగిపోయినట్లుంది.
ఆదిలక్ష్మిగారిని తెలిసిన వాళ్లం సకాలంలో స్పందించి ఉంటే, పాప దుర్మరణం తర్వాత మరో ఘోరం ఇలా జరిగి ఉండేది కాదు. ఆమె కుప్పగూలిపోయినా ధైర్యంగా కనిపించిన, ఆత్మస్థైర్యంతో మాట్లాడిన సహచరుడు లెనిన్ గారి అండ ఉందని, కొన్నాళ్ల తర్వాతయినా ఆమె కోలుకుంటుందని నిజంగానే నమ్మాను నేను.
“వస్తామని కలుస్తామని మాటిచ్చిన లెనిన్ గారు తిరిగిరాని తీరాలకు తరలి వెల్లటం. ఆయనను అనుసరించాలని పోరాడుతున్న ఆదిలక్ష్మీ గారిద్దరూ మాటతప్పారు. మరో పాపానికి ఒడిగట్టారు. ఇంతకంటే ఆత్మీయుల్ని తిట్టలేను. దుఃఖం గుండెను పిండేస్తుంది. లెనిన్, ఆదిలక్ష్మిగార్లు మాట తప్పారు” అంటూ దుర్గేశ్వర గారు తమ హరిసేవలో రాసిన మాట అక్షరసత్యం.
పిల్లలను ప్రేమించడమే, సర్వస్వంగా ప్రేమించడమే తప్పయిపోయే కాలం ముంచుకొస్తోందా? పిల్లలు లేని మాకు ఈ అనుభూతి గాఢత గురించి ఎన్నటికీ తెలీకపోవచ్చు.
కన్నవారిని కొడుకులు తన్ని తరిమేస్తుంటే కూతుర్లు కాస్త అన్నం పెడుతున్న కాలం వచ్చేసింది. ఆ నమ్మకాన్నే నీ చుట్టూ అమ్మా, నాన్నా అల్లుకున్నారేమో..!
గీతా ప్రియదర్శినీ, అనంత దరిద్రాన్ని ప్రేమించిన కన్నవారు నువ్వు లేని లోకాన్ని ఇలా శపిస్తున్నారు.. ఎందుకిలా చేశావు తల్లీ?
ఆదిలక్ష్మిగారూ, క్షమించండి.. ఘోరమైన తప్పిదం చేశాను. ఇలా చేస్తారని, ఇలా జరుగుతుందని ఊహించలేదు. మీ గురించి సమాచారం తెలుసుకునే చివరి వనరును కూడా పొగొట్టుకున్నాను. ఎప్పుడు కాల్ చేసినా లెనిన్ గారు అందుకునే మీ ఫోన్ ఈ సాయంత్రం నుంచి స్విచ్ఛాఫ్ అయిపోయింది. కష్టాల్లో ఉన్నవారిని కాపాడుకోవడం తెలీని, చేతకాని జీ్వచ్ఛవాలం. మా పాపాలను మన్నించండి..
చందమామ కుటుంబాలకు విషాదవార్త
http://blaagu.com/chandamamalu/2011/07/15/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE-%E0%B0%95%E0%B1%81%E0%B0%9F%E0%B1%81%E0%B0%82%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B5/
లోకంలోని పిల్లలందరూ ఇక మీ పిల్లలే…
http://blaagu.com/chandamamalu/2011/07/17/%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B1%82-%E0%B0%87%E0%B0%95-%E0%B0%AE/
విషాదవార్త
ఆదిలక్ష్మిగారు ఎందుకిలా చేసారు??
http://jyothivalaboju.blogspot.com/2011/09/blog-post_17.html
లెనిన్ ,ఆదిలక్ష్మిగార్లు మాటతప్పారు
http://durgeswara.blogspot.com/2011/09/blog-post_17.html
ఈ బ్లాగులు ఇక ఎన్నటికీ అప్డేట్ కాకపోవచ్చు.
అమ్మఒడి
http://ammaodi.blogspot.com/
ఆహా! ఓహో!
http://paalameegada.blogspot.com/
కింది తాజా సమాచారం చూడగలరు.
కార్పోరేట్ విష సంస్కృతి..
http://vasantalakshmi.blogspot.com/2011/09/blog-post_18.html
2004 డిసెంబర్ 26న విరుచుకుపడిన సునామీ సమాచారంతో ఉన్న కింది లింకును చూసిన ఆదిలక్ష్మిగారు కింది బ్లాగర్కు జీమెయిల్లో పంపిన కామెంట్ కింది లింకులో చూడగలరు.
జ్ఞాపకాల అలజడిలో…!
తాజా ఆత్మీయ సమాచారం కోసం కింది లింక్ చూడండి
అమ్మఒడి ఆదిలక్ష్మిగారు
http://teluguyogi.blogspot.com/2011/09/blog-post_19.html
Filed under అమ్మఒడి ఆదిలక్ష్మి | Comments (4)
చందమామ చిత్ర బ్రహ్మ వపా విశ్వరూపం
చందమామ సెప్టెంబర్ సంచిక మార్కెట్లోకి ఆగస్ట్ 25వ తేదీనే వచ్చేసింది. పాఠకులందరికీ మహదానందం. వినాయక చతుర్థి పర్వదినానికి ఐదు రోజుల ముందే గజాననుడి ముఖచిత్రంతో కనులవిందుగా, కంటికింపుగా చందమామ. నిజంగా కవర్ పేజీపై ఉన్నది వినాయకుడి విశ్వరూపం కాదు. చందమామ అపర చిత్ర బ్రహ్మ వపాగారి విశ్వరూపం అంటే ఇంకా ఖచ్చితంగా ఉంటుందేమో. బ్రహ్మ మహేశ్వరులను కూడా అవలీలగా అలా పక్కన పెట్టిన చిత్రరాజసం వపాగారికి తప్ప మరెవరికి చెల్లుతుంది మరి! ఈ ముఖ చిత్రం కోసం చందమామ వర్ణన కూడా కింద చదవగలరు.
“అట్టమీది బొమ్మ
విశ్వరూపం
ఈ నెల ముఖచిత్రాన్ని -సెప్టెంబర్ 2011- దివంగతులైన మా సీనియర్ చిత్రకారుడు శ్రీ వడ్డాది పాపయ్య 1980లలో చిత్రించారు. వినాయక చవితి వర్వ దినం సందర్భంగా ఈ చిత్రాన్ని ఈ నెల అట్టమీది బొమ్మగా తిరిగి ప్రచురిస్తున్నాము.
గణపతి తన అయిదు తలలతో భారీ రూపం ధరించిన నేపథ్యంలో ఆ విశ్వరూపాన్ని ఈ చిత్రం ప్రదర్శిస్తోంది. బ్రహ్మదేవుడు గణేశ విగ్రహ విశేషాలను వివరిస్తూ కథ చెబుతాడు.
ఒకసారి స్వర్గాధిపతి దేవేంద్రుడు, ఐరావతం సహోదరుడైన గజేంద్రుడిని అవమానిస్తాడు. ఈ సందర్భంగా ‘దేవేంద్రుడు ఏదో ఒక రోజు తన ముందు తలవంచుతాడ’ని గజేంద్రుడు జోస్యం చెబుతాడు. ఆ సందర్భాన్ని తలపిస్తూ ఏనుగు తలను తనదిగా చేసుకున్న వినాయకుడి విశ్వరూపానికి దేవేంద్రుడు మొక్కుతాడు. గణపతిని తాను గతంలో అవమానించినందుకు పశ్చాత్తాపం తెలుపుతూ ఇంద్రుడు తన చెవుల్ని రెండు చేతులతో పట్టుకుంటాడు.
ఈ దృశ్యాన్ని బ్రహ్మదేవుడు మరింత వివరంగా వర్ణిస్తున్నాడు. విఘ్నేశ్వరుడు పూర్తిగా బ్రహ్మ సృష్టి. అయిదు గణాలు లేదా పంచభూతాలను -నీరు, గాలి, అగ్ని, భూమి, ఆకాశం- తనలో కలిగి ఉన్నందున అతడు మహాగణపతి అయ్యాడు. భౌతిక, మానసిక శక్తులకు ప్రతీకగా గణపతి ఏనుగుతొండం నిలుస్తుంది. ఇతడి విశ్వరూపంలో ఈ అంశమే వ్యక్తీకరించబడింది.
అదే సమయంలో అతడు తన చిన్న వాహనమైన మూషికంపై ప్రయాణిస్తుంటాడు. ఏనుగు తల రెండు చిన్న కళ్లను కలిగి ఉంటుంది. కాని అవి సూక్ష్మాతి సూక్ష్మ వస్తువులను కూడా చూడగలిగేటంత శక్తిమంతంగా ఉంటాయి. అంటే గణపతి చూపునుంచి ఏదీ దాక్కోలేదని ఇది తెలుపుతుంది. అతడి పెద్ద చెవులు విశ్వం లోని ఏమూల నుంచైనా భక్తులు చేసే ప్రార్థనలను వినగలుగుతాయి. అదేవిధంగా పొడవాటి తొండం తను కోరుకున్న ప్రతిదాన్ని అందుకోగలుగుతుంది.
ఆవిధంగా విశ్వ సంపదను మొత్తంగా అతడు పొందగలిగే స్థానంలో ఉన్నాడు. ఏదైనా కార్యాన్ని సాధించాలని కోరుకునే ప్రతి ఒక్కరూ మొదటగా విఘ్నేశ్వరుడినే పూజిస్తారు. విఘ్నేశ్వరుడు భాద్రపద మాసంలోనే అవతరించాడు.
అందుకనే భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థినాడు విఘ్నేశ్వరుడిని పూజించినవారికి కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయని ఒక నమ్మకం. ఆవిధంగా కార్యసాధనలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని ఎదుర్కొనేందుకు కావలసిన శక్తిని, ధైర్యాన్ని వీళ్లు పొందుతారు.
ఈ నెల అట్టమీది బొమ్మను, దానితో పాటు ప్రచురించిన ఉన్న కథను మీరు ఆస్వాదించారని భావిస్తున్నాము. వచ్చే నెలలో కూడా అట్టమీద బొమ్మ రూపంలోని మరొక చందమామ సుందరమైన కళా సృష్టితో మీ ముందుకు వస్తాము.”
ఈనెల చందమామపై పాఠకుల లేఖలు
సెప్టెంబర్ చందమామను ఆగస్ట్ 27నే అందుకున్నాను. వపాగారి వినాయక చవితి ముఖచిత్రం అద్భుతంగా ఉంది. చందమామకు పూర్వ వైభవం వచ్చినట్టుంది. లోపలి కథలు కూడా చాలా బాగున్నాయి. అచ్చులో నా కథ చూసుకుంటే మహదానందమేసింది.
–ఆరుపల్లి గోవిందరాజులు, విశాఖపట్నం
సెప్టెంబర్ చందమామ వినాయకుడి ముఖచిత్రంతో అబ్బురమనిపించింది. వపాగారి మార్కు ముఖచిత్రాల్లో ఇది హైలెట్. అలాగే ఈ నెల బేతాళ కథలో కొట్టొచ్చినట్లు మార్పు ఏమంటే శంకర్ గారు పూర్తి పేజీ బొమ్మ వేయడం. బేతాళ కథకు ఫుల్ పేజీ బొమ్మ వేయడం చందమామ చరిత్రలో ఇదే తొలిసారేమో. రాజు, గుర్రం, పాముని శంకర్ పూర్తి పేజీలో అందంగా చిత్రించారు. కథ కూడా బాగుంది.
సారయ్య, కరీంనగర్, ఎపి.
సెప్టెంబర్ సంచిక సకాలంలో అందటం మహదానందంగా ఉండటమే కాకుండా ఇంతవరకు చందమామ సుదీర్ఘ చరిత్రలో ముఖచిత్ర వివరణ, -వినాయకుడు- చిత్రకారుని ప్రతిభ గురించి ఎప్పుడూ విశ్లేషించలేదు. వడ్డాది పాపయ్య గారు చందమామకు జీవనాడి. అలాగే నేడు కూడా కథోచిత చిత్రాలు అందిస్తున్న సీనియర్ చిత్రకారులు శంకర్ -కె.సి. శివశంకరన్- గారికి పెద్ద పీట వేసి గౌరవించాలి. పాత కొత్తల మేలుకలయికతో చందమామ చల్లని కిరణాలతో పరవశించని పాఠకుడు ఉండడంటే అతిశయోక్తి కానేరదు. ఆబాలగోపాలాన్ని హిమశీకరాలతో షష్ఠిపూర్తి దాటినా అందాల చందమామ అలరించడం ఎంత చిత్రం. వంద ఏళ్ళు చదవాలనే పాఠకుల ఆశ ఎంత విచిత్రం. ఇది దురాశ కాదెంతమాత్రం. ఇది మీకు నా శాశ్వత శుభప్రశంస.
–బి. రాజేశ్వరమూర్తి, చిలకలపూడి, కృష్ణా జిల్లా, ఎపి.
చందమామ కథల మునితో కబుర్లు!
చందమామ కథల రచయిత కోలార్ కృష్ణయ్యర్ గారు డిల్లీ వెళ్తారని తెలిసి ఇవ్వాళ -23-08-2011- సాయంత్రం రెండున్నర గంటలకు మా దంపతులు ఇరువురం ఆయనను బెంగుళూరులోనే కలవడానికి నిర్ణయించుకున్నాము. అంతకు ముందురోజు రాత్రి కావలినుంచి బస్సులో ప్రయాణించి రావడంతో బాగా అలసిపోయాము. కృష్ణయ్యర్ గారు కథల ప్రచురణ కోసం రేపు ఢిల్లీ బయలుదేరి రెండు నెలలు అక్కడే ఉంటానని చెప్పారు కాబట్టి అలసటగా ఉన్నా కలవాలనుకున్నాము. ఇంటివద్దనుంచి బయల్దేరి నాలుగన్నర గంటలకు వారు ఇప్పుడు ఉంటున్న ఇల్లు చేరాము. బెంగుళూరులో ఆయన ఉన్న ప్రాంతం మాకు చాలాదూరం. మాది తూర్పు సరిహద్దు. వారిది పడమర సరిహద్దు. వారి కుమార్తె మధ్య మధ్యలో ఫోన్ చేస్తుంటే దారిచెప్పగా వారి ఇల్లు కనుక్కుని వెళ్ళాము.
పండుముసలి ఐనా పదేళ్ళపిల్లాడిలా -89 ఏళ్లు- ఆయన తమ అనుభవాలను, అనుభూతులను పంచారు. మావారూ చాలా సరదాపడి విషయాలన్నీ విని నన్ను కొన్ని నోట్ చేసుకోమన్నారు. కృష్ణయ్య గారి కధలపై ఎవరో పేరు చెప్పారు గానీ నేను పెన్ పుచ్చుకునేలోగా చెప్పడం ఐపోయింది. వారిని తిరిగి వెనక్కు తీసుకెళ్ళడం ఇష్టం లేక మౌనంగా ఉండి విన్నాను. – ఈ కథనం చివరలో అదనపు సమాచారంలో దీనిని చూడవచ్చు-
నేను “మీరు అన్ని కధల్లోనూ’ శిల్లంగేరి’ అనే పేరు ఎందుకని పెడతారు” అని అడగ్గా , కృష్ణయ్యగారు “మాపూర్వులు ఆనాటి ముస్లింల ధాటికి ఝడిసి సొంత ఊరినుండీ పారిపోయి కర్ణాటక ప్రాంతంలోని అయిదు ఊర్లలో తలదాచుకున్నారుట. వాటిలో ఒకటి శిల్లంగేరి. అది మేము నివసించిన ప్రాంతం’ అని అన్నారు.
“మరి మీ ఇంటిపేరు ‘కోలార్’ అని ఎందుకు వచ్చింది” అనే నా సందేహానికి వారు “మానాయన గారు చదువుకోలేదు. నిరక్షరాస్యులు. నన్ను బడిలో చేర్పించడానికి వెళ్ళినపుడు పంతుళ్ళు ‘మీ అబ్బాయి పేరేమి’ అనగా ‘కృష్ణయ్య’ అని చెప్పారుట. మరి ఇంటి పేరేమి? అని అడగ్గా “మేము ఉండేది కోలార్లో’ అని చెప్పగా పంతుళ్ళు తన ఇంటిపేరు ‘కోలార్’ అని రాశారుట! అలా తమ పేరు కోలార్ కృష్ణయ్య అయిందని చెప్పారు.
వారి విద్యాభ్యాసం ఎక్కువగా అనంతపురంలోనే సాగిందట. ఇంకో తమాషా ఏమంటే వారు తెలుగు కాక కన్నడ మీడియంలో చదివారుట! ఎనిమిదవ వతరగతి వరకూ తెలుగే చదివారు కానీ, ఒకరోజున తెలుగు పంతులుగారు పరీక్ష పేపర్లన్నీ దిద్ది అందరికీ ఇస్తూ కృష్ణయ్య గారి పేపర్ మాత్రం ఇవ్వక, చివరగా పిలిచి, చెవి మెలివేసి “ఏరా మొద్దూ ! ప్రతివాక్యానికీ ముందు ‘సున్న’ పెడుతున్నావ్ ! సున్నతో వాక్యం మొదలెడతారా? తెలివితక్కువ గాడిదా!” అంటూ భుజంపై ఒక్కదెబ్బ వేశారుట.
దాంతో మన కృష్ణయ్య బాబుకు (అపుడు చిన్నవాడుకదా!) కోపం, పౌరుషం వచ్చి, వాళ్ళ నాన్నగారి వద్దకెళ్ళి ‘నేను తెలుగులో చదవను’ అని చెప్పాడట. అప్పటికే కన్నడ మీడియంలో పిల్ల్లలు తక్కువై ఆ సెక్షన్ ఎత్తేస్తారనే భయంతో ఉన్న ఉపాధ్యాయులకు అదొక బాసట! దాంతో కృష్ణయ్యగారి తండ్రివెళ్ళి మావాడు కన్నడంలో చదువుతాడనిచెప్పి “వెళ్ళి ఆ సెక్షన్ లో కూర్చోపో” అని చెప్పారుట.
అప్పటినుండీ కన్నడ మీడియంలోనే చదివారాయన. కానీ పెద్దయ్యాక నాలుగు వందల తెలుగు కధలు రాసి, పండిన పండితుడు మన కోలార్ కృష్ణయ్య. కన్నడ మీడియంలో చదివి తెలుగులో చిన్నపిల్లలకోసం కధలు కాయించిన కర్పూర కల్పవృక్షం కోలార్ కృష్ణయ్యగారు. ఆయన “మరి కన్నడంలో కధలు వ్రాయలేదా?” అన్న నాసందేహానికి ” కన్నడంలో కధలేవీ వ్రాయలేదని” చెప్పారు.
చదువంటేనే తెలీని వారి తండ్రికి ఇలాంటి కధల పండితుడు తన సంతానమంటే ఎంత ఆనందించారో! మరికొన్ని విషయాలు మాట్లాడాలంటే సమయం చాలలేదు. కృష్ణయ్యగారి సంతానం , మనుమలు మనుమరాళ్ళు ,మునిమనుమలు ,మునిమనుమరాళ్ళు అంతా తాతగారి పుస్తకాలు చదువుతారుట! విదేశాల్లో ఉన్న తన సంతతిని అక్కడివారు ‘కోలార్ ‘ అనే పేరుతోనే పిలుస్తారని మురిసిపోతూ చెప్తున్న ఆ 89 ఏళ్ళ నవ్వుల ముని ఆక్షణంలో ఎనిమిదేళ్ళ పిల్లాడిలా అనిపించారు. -ఇతరదేశాల్లో ఇంటిపేరే అసలు పేరుగా పిలుస్తారు కదా-
కళాశాల చదువు పూర్తయి ప్రభుత్వోద్యోగాలూ, ఆపై తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం అయ్యాక ప్రస్తుతం పిల్లలందరి దగ్గరా కొన్నాళ్ళు గడపుతూ, తిరుగుతూ, తిరిగి చందమామకు కధలు రాస్తూ నవ్వుకుంటూన్న నాగరికుడీయన. తాను ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ రాసిన కధలను, కొందరు పబ్లీషర్స్ విజయవాడనుండీ, మద్రాసునుండీ -ఇంకా ఢిల్లీ అని చెప్పిన గుర్తు- ప్రింట్ చేసి వెయ్యిరూపాయలు కొందరిస్తే, అచ్చంగా ఆరే ఆరుకాపీలు కొందరు ఇస్తారుట!
ఇల్లు వెతుక్కుంటూ మధ్య మధ్య ఫోన్ చేస్తున్నమమ్ము తీసుకెళ్ళడానికి వారి పెద్దమ్మాయి అనుకుంటా.. క్రిందికి వచ్చి అప్యాయంగా పలుకరించి దారిచూపారు. అక్కడ ఉన్నకాస్తంత సమయాన్నీ కోలార్ గారితో మాట్లాడి బంగారం తవ్వుకోవాలనే ప్రయత్నంలో ఆమె పేరు సైతం అడగడం మరచాము.
ఇటీవలే మార్చి ఐదున అనుకుంటాను కోలార్ గారి గృహలక్ష్మి వారికి శాశ్వతంగా దూరమైందని తెలిసి బాధేసింది. వారి అమ్మాయి “ఎన్నో ఏళ్ళ అనుబంధం కదా నాన్నగారు తట్టుకోడం కష్టం” అనిచెప్పారు. కోలార్ కృష్ణయ్యగారు అందుకేనేమో తమవద్ద ఉన్న ప్రింటైన తమ రచనలన్ని అందరికీ పంచుతున్నారుట! -ఆగస్టు చివరలో కలిసిన తమకే ఆయన పాతిక పుస్తకాలు ఇచ్చేశారని హైమవతి గారు చెప్పి ఆశ్చర్యపరిచారు-
తిరుపతిలో కుమారునివద్ద కొంతకాలం , మంగుళూర్ కుమారునివద్ద కొంతకాలం, బెంగుళూర్ కుమార్తెవద్ద కొంతకాలం, ఢిల్లీలో కుమారునివద్దకు ఈరోజే ప్రయాణమవుతున్నారుట, అందుకే మేము హడావిడిగావెళ్ళి చూసి, మాట్లాడి వారు ఎంతో అప్యాయతగా మాకోసం తిరుపతి నుండీ తెచ్చిన షుమారుగా పాతిక పుస్తకాలు మాకు అందించారు, మరోమారు తీరుబాటుగా ఒక్కరోజంతా కలసి కబుర్లు చెప్పుకుందాము ” అనిచెప్పారు. సాగనంపటానికి క్రిందివరకూ రాలేమనగా, వారికి నమస్కరించి శలవుతీసుకుని మేడదిగాం.
తిరిగి ట్రాఫిక్ జోరులో డ్రైవర్ కారు నడుపుతుండగా మేమిరువురం కోలార్ గారి కబుర్లు చెప్పుకుంటూ రెండుగంటలతర్వాత ఇల్లు చేరాం–.
అన్నట్లు – కోలార్ కృష్ణయ్యగారు నిర్మొహమాటంగా – “చందమామలో కొన్నికధలు పిల్లలకోసం లాగా ఉండవు. పెద్దవారు చదువుతున్నప్పటికీ ‘ ప్రేమించడం, పెళ్ళిచేసుకోడం, దయ్యలూ పిశాచాలూ లాంటివి పిల్లలకు అర్ధం కాకపోగా భయంకలిగిస్తాయని నా అభిప్రాయం. కొన్నిడైలాగ్స్, మాటలూ కూడా పిల్లలస్థాయిని మించి ఉంటాయి.నాకు తెలుగు కాస్తే వచ్చును, అందువలన నేను ఉపయోగించే భాషకూడా పిల్లలస్థాయికి సరిపోతుంది. (దేవునికధలు చందమామలో వేయరు అనికూడా అన్నారు).” అని వ్యాఖ్యానించారు. తాము ఏఏ పిల్లల పుస్తకాలకు వ్రాశారో కూడా చెప్పారు. (చంపక్, గోకుల్ వంటివి).
ఆయనను కలవడానికి నాలుగు గంటలు పోనూ రానూ కష్టం అనిపించినా ఒక తలపండిన తపస్వినీ, కధల మునినీ చూసి మాట్లాడామన్న తృప్తి సంతోషం మిగిలాయి.
కోలార్ గారితో కొంతసేపు కబుర్లివే-!
అదనపు సమాచారం
కృష్ణయ్యగారి కధలపై రీసెర్చ్ చేసిన వ్యక్తి ” మీకు కధలకు ప్లాట్స్ ఎలాదొరుకుతాయి? ఈకధ రాయాలని ఎలా తోస్తుంది? ” అని అడిగారుట. దానికి కృష్ణయ్యగారు ” ఏదైనా సంఘటన చూసినపుడో, విన్నపుడో వచ్చిన ఆలోచనను తనదైన శైలిలో కధలా మలుస్తానని చెప్పారుట.”ఏ కధకైనా ఒక సందేశం ఉండాలి, లేక పోతే ఆ కధ వలన ప్రయోజనం ఉండదు.ఇటీవల కధలు ఉత్తిగా వ్రాస్తున్నారు తప్ప, ప్రయోజనం కనిపించడంలేదు.” అన్నారు.
వారు తాను చూసే ఒక సీరియల్ లో (ఆ ఒక్కటే మేమూ చూసే సీరియల్ కావడం తమాషాగా అనిపించింది) -మొగలిరేకులు- దాన్లో దేవి (ఒక కారెక్టర్) తమ కుటుంబానికి విరోధి ఐన వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడతానని చెప్తుంది. పెద్దలకు ఇష్టం లేక పోయినా అలాచేయడంవలన తమ రెండు కుటుంబాల చిరకాల విరోధం పోయి స్నేహం తిరిగి విరుస్తుందని ఆమెభావన. ఈ ఆలోచనతో ఒక కధ వ్రాశానని చెప్పారు.
“ఏమైనా డిస్ట్రిబ్యూటర్స్తో చాలాబాధ. ప్రింట్ ఐందాకా నమ్మకంలేదు.” అన్నారు. ఎంతైనా ఓపిగ్గా వ్రాస్తూ డిస్ట్రిబ్యూటర్స్తో తంటాలు పడుతూ ఇంకా పుస్తకాలు ప్రింట్ కోసం తపిస్తున్న ఇప్పటికి 40పైగా పుస్తకాలు ప్రచురించారు. ఇంకా 60 పిల్లల పుస్తకాల కూర్పుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మహా మనీషికి మాతృభాషపట్ల, చిన్నపిల్లలకు మానవతా విలువలు నేర్పాలనే అభిలాష పట్ల ఉన్న మక్కువ ఎక్కువే!
వారు నాకు ఇచ్చిన తమ పుస్తకాలలోని కొన్ని క్యారెక్టర్స్ చారిత్రక, పురాణాలలోనివి ఇంగ్లీషులోకి అనువదించమని సూచించారు చూడాలి నావయస్సూ 65. ఆయనంత ఓపిక భగవంతుడు నాకూ ఇవ్వాలిగా! పైగా ఆయనలా డిస్ట్రిబూటర్స్తో ప్రింట్ కోసం తంటాలు పడటం నావల్ల అయ్యేపనికానే కాదు.
ఆదూరి హైమవతి.
(చందమామ సీనియర్ కథకులు శ్రీ కోలార్ కృష్ణయ్యర్ గారితో హైమవతి గారి కుటుంబానికి రెండు తరాల కథారూప పరిచయం ఉంది. గత 35 ఏళ్లకు పైగా వీరు ఈయన కథలు విడవకుండా చదవడమే కాకుండా తమ పిల్లలకూ కూడా వీరి కథలను పరిచయం చేశారట. ఈ కుటుంబం మొత్తానికి చందమామతో సుదీర్ఘ అనుబంధం ఉంది. కృష్ణయ్యర్ గారితో ప్రత్యేక అనుబంధం కూడానూ. మూడున్నర దశాబ్దాల తర్వాత ఈ చందమామ కథల మునితో పరిచయం కలిగే అవకాశం కోసం గత ఆరునెలలుగా ఈ కుటుంబం ఎదురు చూసింది. ఆయన తిరుపతిలో, బెంగుళూరులో, మంగుళూరులో తమ పిల్లల వద్ద గడుపుతూ రావడంతో సమయం కుదరలేదు. మొత్తంమీద ఆయన బెంగళూరు చిరునామా తీసుకుని అక్కడే కలియనున్నామని చెప్పడంతో కలిసిన తర్వాత వివరాలను రాసి పంపమని కోరాము. మరుసటి రోజే హైమవతి గారు ఆయనతో భేటీ వివరాలు రాసి పంపారు. కాస్త ఆలస్యంగా వీటిని ఇక్కడ ప్రచురించడమైనది. తెలుగు టీచర్ మందలించారనే కోపంతో తెలుగే చదవనని భీష్మించుకుని కన్నడ మాధ్యమంలోకి మారిపోయిన కృష్ణయ్యగారు తర్వాత నాలుగు వందల తెలుగు కథలు రాసి తెలుగు బాలసాహిత్యానికి తమదైన చేర్పునందించడం చూస్తుంటే హృద్యంగా అనిపిస్తోంది. ప్రస్తుతం కథల ప్రచురణ కోసం ఢిల్లీలో ఉన్న ఈయన అక్టోబర్ చివరలో తిరిగొస్తారు. జీవితం చివరి అంచులోనూ కథారచనను వదిలిపెట్టని ఈ రుషితుల్యుడితో మాట్లాడాలంటే దిగువ నంబర్లలో సంప్రదించవచ్చు.)
తిరుపతి : Land line : 0877-2251715
ఢిల్లీ : Mobile no: 09483321031 -ఇప్పుడు ఇక్కడే ఉన్నారు-
బెంగళూరు: Land line: 080 23494065
ఆదూరి హైమవతి దంపతుల చందమామ జ్ఞాపకాలకోసం కింది లింకులు చూడండి.
‘చందమామ’ జ్ఞాపకాలతో వృధ్ధాప్యమూ పసితనమే…!!
Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Comments (10)













