బుజ్జి

Just another బ్లాగు weblog

ఆంధ్ర వాళ్ళకు అవసరం లేదా ఆత్మాభిమానం??

Filed under: Uncategorized — bujjikanna at 5:06 pm on Saturday, October 4, 2008

మళ్ళీ ఇంతకు ముందులాగానే ఇంకొకరి బ్లాగులో, తెలంగాణా విషయంలో నా వ్యాఖ్య డిలీట్ చెయ్యబడటంతో ఇంకో టపా రాయాల్సొచ్చింది. ఈ సారి వాదన లేకుండానే సింపుల్ గా నా వ్యాఖ్యలు, వాటితో పాటు అందరి వ్యాఖ్యలు డిలీట్ చెయ్యబడ్డాయి. హెడ్డింగ్ లో చెప్పినట్టు ”ఆంధ్ర వాళ్ళకు అవసరం లేదా ఆత్మాభిమానం” అనేది రాసినవారి ప్రశ్న.

సుళువుగా గుర్తుపట్టడం కోసం ఆయన పెట్టిన హెడ్డింగ్ నే నేనూ పెట్టాను.

అసలు విషయానికొస్తే,అది లగడపాటి రాజగోపాల్ ఆస్తులపై తెరాస నాయకులు దాడి చేసిన సంధర్భంలో రాసింది.అది బ్లాగరు వివిధ సంధర్భాలలో విన్న తెలంగాణా వాళ్ళు ఆంధ్ర వాళ్ళని గురించి చేసిన వ్యాఖ్యలకి రియాక్షన్ లాగా ఉంది. ఆయన ఉదహరించిన మూడు సంధర్భాలు, వాటికి నా సమాధానాలు/ప్రశ్నలే ఈ టపా. (అసలు ఈ విషయంలో టపా రాసే ఉద్దేశం నాకు లేదప్పుడు. కానీ వ్యాఖ్య డిలీట్ చెయ్యబడటంతో రాస్తున్నా.)

క్లుప్తంగా ఆయన టపా సారాంశం:

1.’కోస్తా వాళ్ళంతా తెలంగాణా భూములని చీప్ గా కొట్టేస్తున్నారు ‘ అనేది ఆయన మిత్రుడు ఆంధ్ర వాళ్ళపై చేసిన ఆరోపణ. మరి ‘మీరెందుకు అమ్ముతున్నరు, మీరమ్మితేనే కదా కొంటున్నాం’ అనేది ఆ ఆరోపణకి ఆ బ్లాగరు సమాధానం.
2.ఒక ఇంటర్మీడియెట్టు చదివిన అబ్బాయి, తనకు ఉద్యోగం రాకపొవటానికి కారణం ఆంధ్రవాళ్ళు అని చేసిన మరో ఆరోపణ.
3.ఎవరో తెలంగాణా ఆటో డ్రైవరు, ఎక్కినాయన ఆంధ్ర ఆయన అని తెల్సిన తర్వాత ఆయనతో మాట్లాడ్డం మానేయటం.

ఇన్ని మాటలంటుంటే మాకేం ఆత్మాభిమానం లేదా, వెళ్ళిపొతాం మేము అన్నట్టుగా రాసారు. పైన చెప్పిన సంధర్భాలలో తెలంగాణా వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళు ద్రోహం చేస్తున్నారా అనేది ఆ బ్లాగరు ప్రశ్న. ఇప్పుడు ఆ సంధర్భాలతో పాటు, ఆయనకి తెలియని , తెలిసీ మర్చిపోయిన ఇంకొన్ని సంధర్భాల సంగతులు కూడా మాట్లాడుకుందాం.

మెదక్ జిల్లా గురించి ఎంత మందికి ఎంత తెలుసో నాకు తెలీదు గానీ, మెదక్ జిల్లాలో ఆంధ్ర వాళ్ళు స్థిరపడ్డ గ్రామాలు చాలానే ఉన్నాయి. విచిత్రమేంటంటే అన్ని గ్రామాలు కూడా పెద్దా చిన్నా ఇర్రిగేషన్ కాలువల పక్కనే ఉంటాయి. ఇంకెక్కడా ఉండవు. ఎక్కడో కోస్తా జిల్లాల వాళ్ళు సడ్డెన్ గా మెదక్ జిల్లా పల్లెల్లో భూములు కొనటం మొదలు పెడతారు.’కాస్త మంచి ధరే’ ఇస్తారనుకోండి. అదేంటో వాళ్ళు కొనటం పూర్తి అయ్యీ అవగానే ఆ ప్రాంతంలో కట్టబోయే ప్రాజెక్టుల గురించి వివరాలు, నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. ఆ కాలువలన్నీ వీళ్ళ భూముల పక్క నుండే వెళతాయి అదేంటో మరి. తర్వాత ఆ భూముల ధరలు వాళ్ళు ఇచ్చిన ‘కాస్త మంచి ధరకు’ కొన్ని పదుల రెట్లు మాత్రమే పెరుగుతాయి. అంతే.

తమకు సంబంధించిన వాళ్ళ కొనుగోళ్ళు పూర్తి అయ్యేవరకు,సామన్య జనాలకి ప్రాజెక్టుల సంగతి తెలియకుండా తొక్కిపెట్టే ఆంధ్ర అధికారులే దీనికి కారణం అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదనుకుంటాను. ఇలాంటి భూములల్లో వ్యవసాయం చేసి మేమే తెలంగాణా వాళ్ళకి వ్యవసాయం నేర్పించాము అని డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. బోర్ల కింద చెయ్యమనండి అప్పుడు తెలుస్తుంది తెలంగణాలో వ్యవసాయం అంటే ఏంటి అని. ఇలాగ తెలంగాణా వాళ్ళు స్థిరపడ్డ అలాంటి ఆంధ్ర గ్రామాలు ఏవైనా ఉన్నాయా?

ఇక ఆ ఇంటర్మీడియట్టు అబ్బాయి సంగతి పక్కన పెడితే, 610 జీవో గురించి మనం చూస్తూనే ఉన్నాం,కొన్ని వేల మంది వెనక్కి పంపించాల్సిన అవసరం ఉన్నట్టు. ఆ ఒక్క మాటకే మీరింత బాధ పడితే, స్థానికేతరుల వల్ల ఉద్యోగాలు రాని కొన్ని వేల జీవితాల సంగతి ఏంటి,వాళ్ళెంత బాధ పడాలి మరి?

ఇక ఆటోవాడి సంగతి అంటారా, ఆ బ్లాగరు తనకు నచ్చని నా కామెంటుని డిలీట్ చేసినట్టు అతనూ ఆంధ్ర వాళ్ళతో మాట్లాడ్డం మానేసి ఉంటాడు. కొడితేనో ఇంకేమన్నా అంటేనో పట్టించుకోవాలి గానీ, అతని నిరసనని అతను అలా ప్రకటిస్తే పెద్ద నష్టం ఏముంది. అతనేం నష్టపొయాడో మరి ఆంధ్ర వాళ్ళ వల్ల, మనకు తెలీదు కదా.

ఇక నేను అదే టపాకు సంబంధించిన ఒక కామెంట్ ఏంటంటే ఇదంతా రాజకీయ నాయకులు సృష్టించిన hate propaganda వల్లనే అని అంతకుమించి ఏమి లేదు అని. ఇంతకు ముందు ఇంకో వ్యాఖ్యలో ఈ చదువుకున్న వాళ్ళే తెలంగాణ గురించి ఏదో ఊహించుకొని సపోర్ట్ చేస్తూ ఉంటారు, కానీ రైతులు మాత్రం వాళ్ళ కరెక్ట్ గా ఆలోచించి వోటేస్తారు అని.. ఖచ్చితంగా ఇవే మాటలు కావు కానీ ఉద్దేశం ఇదే. బహుషా తెరాస ఓడిపొయిన ఉపఎన్నికలని దృష్టిలో పెట్టుకుని అని ఉంటారు.

మెదక్ జిల్లాలో ఆంధ్ర వాళ్ళని నమ్మకూడదు అనే కాన్సెప్ట్ తెరాస పుట్టక ముందు నుండే, పైన చెప్పిన కారణాల వల్ల రైతులలో ఉంది. అది తెరాస సృష్టించింది ఎంత మాత్రం కాదు. ఆంధ్ర వాళ్ళకి భూమి కౌలుకి ఇవ్వటం కంటే బీడుగా వదిలెయ్యటమే మేలు అనుకునే చాలా మంది రైతులలో మా నాన్న కూడా ఒకరు. రైతులు తెలంగాణా గురించి పట్టించుకోరు అనేది పెద్ద భ్రమ, హైదరాబాదుని మాత్రమే చూసిన కొందరు ఆంధ్ర వాళ్ళు తయారు సిద్ధాంతం మాత్రమే. ఉద్యోగులతో సమానంగా వాళ్ళూ ప్రత్యేక తెలంగణాని కోరుకుంటున్నారు. .

Next Page »